1, నవంబర్ 2013, శుక్రవారం

సంస్కృతసౌరభాలు - 4

శమాలినః కరతలద్వయేన సా సన్నిరుద్ధ్య నయనే హృతాంశుకా |
తస్య పశ్యతి లలాటలోచనే మోఘ యత్న విధురా రహస్యాభూత్ ||

శివపార్వతుల శృంగారదృశ్యాన్ని కాళిదాసు వర్ణిస్తున్నాడు. (కుమారసంభవం ఎనిమిదవ సర్గ, ఏడవ శ్లోకం) రహస్య కేళిలో శివుడు పార్వతి వస్త్రాలను అపహరించాడు. ఆమె సిగ్గుపడి శివుని రెండు కళ్ళను మూసివేసింది. కానీ ఈశ్వరుడు లలాటలోచనంతో ఆమెను చూడసాగినాడు. ఇంక ఆమె ఏమీ చేయలేక వివశురాలై ఉండిపోయింది.

ఈ శ్లోకం ఇక్కడ ఉదహరించడానికి కారణం - గాథాసప్తశతి లోని మరొక ప్రాకృత శ్లోకం.

రఇకేళిహిఅణిఅసణకరకిసలఅరుద్ధణఅణజుఅలస్స |
రుద్దస్స తఇఅణఅణం పబ్బఈ పరిచుంబిఅం జఅఇ ||

సంస్క్తతఛాయ:

రతికేళిహృతనివసనకరకిసలయరుద్ధనయనయుగళస్య|
రుద్రస్య తృతీయనయనం పార్వతీపరిచుంబితం జయతి||

రతికేళిలో అపహరించిన వస్త్రములు గలవాడు, చివురుటాకుల చేతులతో నేత్రద్వయం కప్పబడినవాడు అయిన రుద్రునియొక్క - పార్వతిచే చుంబించబడిన ఫాలనేత్రము సర్వోత్కృష్టముగా ఉన్నది

కాళిదాసు కుమారసంభవశ్లోకానికి ప్రేరణ గాథాసప్తశతిలోని పై శ్లోకం అని స్పష్టంగా తెలుస్తూంది కదా. ఇప్పుడు ఈ రెంటిని కాస్త పరిశీలించి మన ఉబలాటం తీర్చుకుందాం.

- కాళిదాసు ఉజ్జయినీ నగర నివాసి. రాజాశ్రితుడు. భాష, భావం సంస్కరింపబడినవి. అందుచేత నాయిక సిగ్గుపడడంతో ఊరుకుంది. పైగా కుమారసంభవంలో ఆ వర్ణనలో పార్వతి నవోఢ. ముగ్ధ. ఇదీ పరిస్థితి. అంతే కాదండి. కాస్త తరచి చూస్తే కాళిదాసు నాయికలకు సిగ్గెక్కువేమోనని అనిపిస్తుంది. (లేదా - అమ్మాయిల కౌతుకం కన్నా అమ్మాయిల తాలూకు సిగ్గు/అసూయ లాంటి ఫీలింగ్సు కాస్త కాళిదాసును కదిలిస్తాయనుకుంటాను)

ఏవం వాదిని రాజర్షౌ పార్శ్వే పితురధోముఖీ |
లీలాకమలపత్రాణి గణయామాస పార్వతీ ||

హిమవంతుడి దగ్గరకు శివుని సంబంధం తీసుకుని వచ్చారు సప్తర్షులు. ఆ పక్కనే కూతురు పార్వతి నిలబడి ఉంది. సప్తర్షులు మాట్లాడుతుండగా ఈవిడ పక్కన తలవంచుకుని కమలపత్రాలు లెక్కపెడుతూ ఉందట! (పార్వతి మేథమేటిక్స్ లో అందె వేసిన చేయి! :))

ఈ శ్లోకం లక్షణశాస్త్రదృష్ట్యా చాలా ఫేమస్. అర్థశక్త్యుద్భవ వస్తుధ్వనికి ఉదాహరణగా ఈ శ్లోకాన్ని పేర్కొంటారు.

రఘువంశంలో ఆరవసర్గలోనూ ఇందుమతీదేవి సిగ్గును కాళిదాసు రెండు మూడు శ్లోకాలకు గురిచేశాడు. నానారాజకుమారులను స్వయంవరంలో చూసి చివరకు చెలికత్తె సునంద (టెక్నికల్ గా చెలికత్తె కాదు కానీ ప్రస్తుతానికి అనుకుందాం) అజమహారాజు వద్దకు వస్తుంది. అతని గుణగణాలను వర్ణించి చివరికి - అమ్మాయీ నీవొక రత్నం. అబ్బాయి బంగారం. రత్నం బంగారంతో ముడివడనీ (రత్నం సమాగచ్ఛతు కాంచనేన) అంటుంది. అప్పుడు ఇందుమతి కుతూహలంతో కూడిన లజ్జతో ఏర్పడిన ఇష్టంతో అజుణ్ణి వరిస్తుంది. ఆ సమయంలో సునంద "అమ్మాయీ ముందుకెళదామా (మరో రాజు వద్దకు)" అని ఛలోక్తిగా అంటుంది. అలా అన్నప్పుడు ఇందుమతి - సునందను "అసూయాకుటిల"మైన దృక్కులతో చూచిందట.

అసూయ ఘాటైన ప్రేమకు థర్మామీటరు! ఇది కాళిదాసుకు తెలుసు.

*****************

ప్రాకృతకవి నాయికకు (వజ్జదేవుడు?) సిగ్గు లజ్జ లాటి శషభిషలేమీ లేవు. ఆ కవి జానపదనేత్రంలో కవిత్వపు వస్తువు జీవంతమైనది. శృంగారరసం అనే బంగారానికి అద్భుతరసపు తావి అలవోకగా అబ్బింది. మరొక్క విషయం - ప్రాకృతకవి మూడవకంటికి "జయము" చెబుతున్నాడు. (ఈ శ్లోకాన్ని తెనుగు చేసిన కవి నరాలరామారెడ్డి గారు మాత్రం "పార్వతి ప్రజ్ఞకు వందనం" అని అనువదించారు. ఎందుకో తెలియదు.) సాధారణంగా స్తోత్రసాహిత్యంలో భగవంతుని కీర్తించేప్పుడు "జయతు" అన్న "లోట్" లకారం ఉపయోగించడం కవుల రివాజు. "జయతు జయతు దేవో దేవకీ నందనోయం" - ముకుందమాల, "జయత్వదభ్రవిభ్రమ భ్రమద్బుజంగమశ్వసత్" - అన్న రావణాసురుని స్తోత్రం ఒకట్రెండు ఉదాహరణలు. జయతు = జయమగుగాక! అన్న ఆశంస అయితే జయతి అన్న వర్ధమాన (లట్) ధాతురూపం వస్తువు స్వరూపాన్ని చెప్పే క్రియావిశేషం.

ఇలా మూడవకంటికి మంగిడీలు చెప్పి ఆ పేరు లేని రచయిత తన పేరును శాశ్వతం చేసుకున్నాడు. ఆయనకు కూడా జయం.

ఏదేమైనా మన ప్రాకృతకవి కి "భక్తి" కన్నా "సౌందర్య" దృష్టి ఎక్కువ.పై రెండు ఒకే రకమైన శ్లోకాలకు సంబంధించి ప్రాకృతకవికే నా ఓటు! మరి మీరో?

*****************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.