27, ఆగస్టు 2018, సోమవారం

రాజశేఖరుని కర్పూరమంజరి



ఈ వ్యాసాన్ని ఎక్కడ మొదలు పెట్టాలి? తెనుగు కవితో మొదలుపెడతాను.

"అటజని కాంచె భూమిసురుడంబరచుంబి..."
"ఎందేడెందము కందళించు రహిచే.."
"ఓ చతురాస్యవంశ కలశోదధి పూర్ణశశాంక!"
"తరుణి ననన్యకాంత నతిదారుణ.."

...

రాయలవారు అల్లసాని పెద్దనకు కర్పూర తాంబూలం అందించి, "శిరీషకుసుమపేశలసుధామయోక్తుల" తో కావ్యం రచించమన్నారు. శిరీషకుసుమపేశల సుధామయ ఉక్తులు = దిరిసెన పువ్వు (కాగితపు పువ్వు) లా సుకుమారమై ఉండి, అమృతాలు చిందే వచనములు; అల్లసాని పెద్దన కవిత్వం అలా ఉంటుంది!

సంస్కృతప్రాకృతాలలో అల్లసాని పెద్దన కు సమాంతరంగా - మధురమైన సుకుమారమైన వాక్కులను కలిగిన "కావ్యకవి" ఎవరున్నారు?

ఆ ప్రశ్నకు సమాధానం రాజశేఖరకవి. జయదేవుడు, దండీ కూడా పదలాలిత్యంలోనూ, శబ్దసౌకుమార్యంలోనూ తీసిపోరు కానీ వారిద్దరిలో దండి - వచన కావ్యకవి, జయదేవుడు - గీతకారుడు, స్తోత్రకవి.


రాజశేఖరుని శైలి లలితమనోహరమైనది. ఈ కవి సూక్తులు అమృతాలను చిందుతాయని కృష్ణశంకరశర్మ అన్న ఒక కవి నిండుసభలో కీర్తించాడట.

పాతుం శ్రోతరసాయనం రచయితుం వాచః సతాం సమ్మతాః
వ్యుత్పత్తిం పరమామవాప్తుమవధిం లబ్ధుం రసశ్రోతసః |
భోక్తుం స్వాదుఫలం చ జీవితతరోర్యద్యస్తి తే కౌతుకం
తత్ "భ్రాతః శృణు రాజశేఖరకవేః సూక్తీః సుధాస్యన్దినీః" ||


శ్రోతరసాయనమును గ్రోలుటకును, సత్పురుషులు మెచ్చిన వాక్కులు రచించుటకును, గొప్ప వ్యుత్పత్తిని సంపాదించుకొనుటకును, రసప్రవాహపరమావధికిని, జీవితమను తరువు యొక్క మధురఫలమును అనుభవించుటకు ఇచ్ఛ ఉన్నదా? "ఓ సోదరా! విను., రాజశేఖరకవి సూక్తులు అమృతములు చిందునట్టివి."

అల్లసాని వారివి సుధామయోక్తులు అయితే రాజశేఖరునివి సుధాస్యందినీ సూక్తులు. ఈ వ్యాసలక్ష్యం ఈ ఇద్దరు కవులను అనుశీలించటం కాకపోయినా, ఒకట్రెండు ఉదాహరణలు చూద్దాం. ఆపై మన కావ్యానికి వస్తాను.

మనుచరిత్రలో కావ్యనాయిక వరూధిని "అడ్రసు" తెలిపే పద్యం ఇది.

కం.
మృగమదసౌరభవిభవ
ద్విగుణిత ఘనసార సాంద్ర వీటీగంధ
స్థగితేతర పరిమళమై
మగువ పొలుపుఁ దెలుపు నొక్క మారుతమొలసెన్.

ఒక పాలు కస్తూరి, దానికి రెండుపాళ్ళు కర్పూరము దట్టించిన తాంబూలపు పరిమళాన్ని కప్పివేస్తూ - అమ్మాయి "అడ్రసు" ఇదీ అని చెప్పే పరిమళం ఒకటి వీచిందట!

అల్లసాని పెద్దనకు దాదాపు 600 యేళ్లకు మునుపటి కాలానికి చెందిన రాజశేఖరకవి యొక్క "వాసంత సమీరాలను" చూద్దాం. కర్పూరమంజరి లో రాణి విభ్రమలేఖ చెప్పిన శ్లోకం ఇది.

లంకాతోరణ మాలిఆ తరలిణీ కుంభుబ్భవస్సాస్సమే
మందందోలిఅ చందణ ద్దుమలదా కప్పూరసంపక్కిణో |
కంకోలీకులకంపిణీ ఫణిలదా ణిప్పట్టణట్టాబఆ
చండం చుంబిద తంబబణ్ణిసలిలా వాఅంతి చిత్తాణిలా ||

ఛాయ:
లంకాతోరణమాలికాతరళినః కుంభోద్భవస్యాశ్రమే
మందాందోళిత చందన ద్రుమలతా కర్పూరసంపర్కిణః |
కంకోలీ కులకంపినః ఫణిలతానిష్పష్టనర్తకాః
చండం చుంబిత తామ్రపర్ణీ సలిలాః వాన్తి చైత్రానిలాః ||

తామ్రపర్ణి నదిపైనుండి అల్లనల్లన వీస్తున్న చైత్రమాసపు పిల్లగాలులు - లంకానగరసింహద్వారపు తోరణాలను కదిలిస్తున్నాయి. అగస్త్యముని ఆశ్రమాన (దక్షిణ దిశాభాగమున) కర్పూరపు తరువులను తాకుతూ, చందన వృక్షాల గాలులపై మెల్లగా పల్లకీలో ఊరేగింపుగా వస్తున్నాయి. మిరియపు తీవెలను, తమలపాకుల తీవెలను బాగా నర్తింపజేస్తున్నాయి.

పెద్దన గారి వరూధిని మైసుగంధానికి, రాజశేఖరుని చైత్రానిలాలకు ఎక్కడో, ఏదో బాదరాయణసంబంధం ఉందని తోచట్లేదూ? :)

పైని శ్లోకంలో ఈ పాదం చూడండి.
"మంద + ఆందోళిత చందనద్రుమలతా కర్పూరసంపర్కిణః"
మంద = మెల్లగా:
ఆందోళిత = పల్లకీలో ఊరేగింపబడిన;
చందనద్రుమలతా = చందనద్రుమపు తీవెలకు;
కర్పూర = కర్పూరము యొక్క;
సంపర్కిణః = స్పర్శ కలిగినవైన
చైత్రానిలాః = వాసంతసమీరములు
అని అన్వయం.

ఎంత మధురంగా ఉందీ భావం? ఆ శబ్దసంచయం కూడా చూడండి. "మందందోలిఅ చందణ ద్దుమలదా కప్పూరసంపక్కిణో" (మందాందోళిత చందన ద్రుమలతా కర్పూరసంపర్కిణః) - ఒక్క మహాప్రాణాక్షరము, పరుషమైన శబ్దమూ లేకుండా, నిజంగానే ఏదో పల్లకీలో చందనపు గాలి అల్లనల్లన తేలుతూ వస్తున్నట్టుగా, శబ్దసంచయం భావాన్ని పల్లకీలో ఊరేగిస్తున్నట్టుగా అపురూపంగా లేదూ? ఏ కవి శబ్దాలయితే భావాన్ని ఉత్కృష్టంగా ప్రకాశింపజేస్తాయో ఆ కవిని "వశ్యవాక్కు" అని, పండితుడని నిస్సంకోచంగా చెప్పుకోవచ్చు.

ఇంకొక ప్రస్తావన. మంద - సాధారణంగా పూర్ణానుస్వరం తర్వాత వచ్చిన సరళాక్షరాలు ( గ జ డ ద బ) పద్యపు సౌకుమార్యాన్ని పెంపు చేస్తాయి. ఇది కవిత్వనిర్మాణంలో ఓ చిన్ని కిటుకు. దీనికి తెలుగు, సంస్కృత కావ్యాలలో ఎన్నో ప్రముఖమైన ఉదాహరణలు ఉన్నాయి.

అందుండున్ ద్వయసద్మపద్మవదనుండు - రాయలు
ఎందుండి ఎందుఁ బోవుచు ఇందలికేతెంచినారలు - పెద్దన
చిందుల పాటల సిరిపొలయాటల అందపు సిరిగుల ఆడెనదే - అన్నమయ్య
వందారు బృందారక మందార - మురారి కవి
మందారమాలాసలిలస్యందంబులందంబులై దొరగన్ - పోతన


ఈ క్రమంలో "మందాందోలిఅ..." పద్యపాదం వినగానే ఈ వ్యాసకర్తకు "ఎందే డెందము కందళించు రహిచే.." అన్న పెద్దన పద్యం గుర్తొచ్చింది. (బాదరాయణ సంబంధం - ii :) అన్నమాట!)

రాజశేఖరకవి మరొక శ్లోకం.

రణంతమణిణేఉరం ఝణఝణంతహారచ్ఛడం
కలక్వణిద కింకిణీ ముహర మేహలాడంబరమ్ |
విలోలబల అవరీజణిర మంజుశింజారవం
ణ కస్స మణమోహణం ససిముహీఅ హిందోళణమ్ ||

ఛాయ:
రణన్మణినూపుర ఝణఝణాయమాన హారచ్ఛటమ్
కలక్వణిత కింకిణీ ముఖర మేఖలాడంబరమ్ |
విలోలవలయావళీ జనిత మంజుశింజారవం
న కస్య మనోమోహనం శశిముఖ్యా హిందోళనమ్ ||


కర్పూరమంజరి ఉయ్యాల ఊగుతోంది. ఆ వన్నెలాడి కాలియందెలు, ధరించిన హారాలు ఝణఝణ సవ్వడి చేస్తున్నాయి. ఇంకా ఆమె వడ్డాణానికి కట్టిన చిన్ని చిన్ని సువర్ణఘంటికలు, కంకణపు మంజు రవాలు మధురంగా ఉన్నాయి. చంద్రముఖి అయిన ఆ చిన్నదాని ఉయ్యాల ఆట ఎవరి మనస్సును దోచుకోదు?

"గీతిసౌందర్యం, అనుప్రాస సౌందర్యం ఒక్కచోట కలవడం చూడాలంటే - ఈ సట్టకంలోనే చూడవచ్చు" నని పుల్లెల రామచంద్రుడు గారు వ్యాఖ్యానిస్తారు పై శ్లోకాన్ని ఉటంకిస్తూ ఒకచోట. ఈ శ్లోకమూ ఆ దృశ్యాన్ని, పద్యభావాన్ని ఉద్యోతిస్తోంది. "విలోలవలయావళీ జనిత మంజుశింజారవమ్" - ఎంత సుకుమారంగా ఉందో గమనించండి.

చలించి, మధురనాదాలు చేసే నూపురపు శబ్దాలకు హంసలు విభ్రమం చెందుతాయని సంస్కృతంలో ఓ కవిసమయం ఉంది. ఈ కవి ఆ కవిసమయాన్ని ఈ శ్లోకంలో ఉపయోగించలేదు. కారణం - ఇది దృశ్యకావ్యం కాబట్టి. ఓ అమ్మాయి ఉయ్యాల ఊగుతుండగా, ఆమె ప్రియుడు దానిని చూచి వర్ణించడం - చాలా మనోహరమైన, సుకుమారమైన శృంగారం.

సరిగ్గా ఇటువంటిది కాకపోయినా, స్వారోచిషమనుసంభవంలో ఓ చోట ఓ అమ్మణి తన అందెలపై విసుక్కోవటం ఉంది. (అంచెలు కట్టి కాలితొడుసై చననీవు గదమ్మ....) అక్కడ అమ్మణి - ఓ అందగాణ్ణి చూడాలన్న తలపుతో అందెలు అడ్డుపడుతున్నాయని విసుక్కుంటుంది. (అది కొంచెం మాఘకవి టేస్టు. :) )

రాజశేఖరుడు కవి, కవిరాజు, పండితుడు., అంతకన్నా ముందువరసలో గొప్ప రసికుడు. మన పెద్దన ’యూత్’ లో రాజశేఖరకవిలా ఉండేవాడేమో! .

ఈ రాజశేఖరుడు బాలరామాయణం, బాలభారతం, విద్ధసాలభంజిక, కర్పూరమంజరి అనే నాలుగు నాటకాలను, కావ్యమీమాంస అనే విలక్షణమైన లక్షణగ్రంథాన్ని రచించాడు. ఇంకా ఏవో గ్రంథాలను రచించాడంటారు కానీ అవి మనకు దొరకలేదు. ఇందులో కర్పూరమంజరి - పరిమాణంలో చిన్నదైనా విశిష్టమైన రచన. సట్టకం అంటారు దీన్ని.

***‌‍*‌‍‌^^^^**** 



సట్టకం అంటే ఏమిటి?


సట్టకం అంటే పూర్తీగా ప్రాకృతభాషలో రచించిన నాటిక వంటిది. నాట్యశాస్త్రం ప్రకారం - సంస్కృతంలో పది రకాలైన నాటకాలు ఉన్నాయి. అందులో నాటకాన్ని, ప్రకరణాన్ని కలిపి చేర్చిన ప్రక్రియను నాటిక అన్నారు. ఆ నాటిక లక్షణాలేమిటో చూద్దాం.
  • నాయకుడు (హీరో) ధీరలలితుడై ఉండాలి. (నిశ్చింతో ధీరలలితః కళాసక్తః సుఖీ మృదుః
  • కథ ఉత్పాద్యమై ఉండాలి. (అంటే అంతకు మునుపు వ్రాసిన కావ్యాల నుండి స్వీకరింపకుండా కొత్తగా ఉండాలి) 
  • నాయిక అంతఃపురకన్య, లేదా గాయని/నాట్యకత్తె అయి ఉండాలి. 
  • శృంగారరసప్రధానమై ఉండాలి. 
  • నాలుగు అంకాలు ఉండాలి. 
  • స్త్రీపాత్రలు ఎక్కువగా ఉండవలె. 
  • అభినయం లలితంగా ఉండవలె (కైశికీ వృత్తి అంటారు దీనిని). 
  • నృత్త గీత పాఠ్య భరితమై ఉండవలె. 
  • అవమర్శ సంధి ఛాయామాత్రంగా ఉండవలె. (చివరి అంకాన మరీ మితిమీరిన మెలోడ్రామా ఉండరాదు) 
  • చివర్న నాటిక అంతంలో నాయకుడికి రతిపురస్సరమైన రాజ్యప్రాప్తి లభించాలి. 
  • పూర్వనాయికకు దంభము, క్రోధము వంటి లక్షణాలుండాలి. 
  • నాయిక - దూతీజన పరివేష్టితంగా ఉండవలె. 

నాట్యశాస్త్రం 18 వ అధ్యాయంలో పేర్కొని ఉన్న ఈ నాటిక లక్షణాలు ప్రక్షిప్తమని ఒక వాదం ఉంది. నాట్యశాస్త్రపు కాలంలో భరతుడు పదిరకాల నాటకభేదాలనే చెప్పాడు. నాట్యశాస్త్రం జనించిన ఎన్నో వందల యేళ్ళ తర్వాత క్రీ.శ. 11 వ శతాబ్దానికి అభినవగుప్తుడు ఆ శాస్త్రానికి వ్యాఖ్యానాన్ని అభినవభారతి అన్న పేరుతో రచించినాడు. ఈ అభినవభారతిలో నాటిక లక్షణాల వ్యాఖ్యానం ఉండటం చేత, అభినవభారతి కాలానికి కొంతకాలం ముందు నాటిక ఏర్పడింది అని కొందరు పేర్కొన్నారు. ఇది పూర్తీనిజం కాదు. బౌద్ధం ప్రాభవంగా ఉన్న కాలంలోనే నాటిక ఉన్నది.

"కర్పూరమంజరి" రచన లో పైన పేర్కొన్న లక్షణాలన్నీ దాదాపుగా ఉన్నాయి. సాధారణంగా నాటికలో ప్రధానంగా (నాయకుడు, ఇతర ప్రధాన పాత్రలు) సంస్కృతంలో మాట్లాడ్డం, నాయిక, విదూషకుడు వంటి అవాంతరపాత్రలు ప్రాకృతంలో మాట్లాడ్డం ఉంది. రాజశేఖరకవి - ఈ అసమానత్వాన్ని పరిహరించి మొత్తం నాటకాన్ని శూరసేనీ ప్రాకృతంలో రచించాడు. దరిమిలా ఇది "సట్టకం".

ప్రాకృతభాష, సంస్కృతభాషల ప్రయోగం అన్న వ్యత్యాసం మాత్రమే కాక సట్టకం/సాటకం అన్నది - నాటికకంటే కొంత భిన్నం. దీనిని రాజశేఖరుడే ఈ కావ్యారంభంలో సూత్రధారుడు (Stage Manager) ద్వారా చెప్పిస్తాడు.

తత్ సాటకమితి భణ్యతే దూరం యో నాటికా అనుహరతి |
కిం పునరత్ర ప్రవేశక విష్కంభకౌ న కేవలం భవతః ||

నాటికను అనుసరించేది, ప్రవేశకము, విష్కంభకమూ అన్న ప్రక్రియలు లేనిదీ సాటకం/సట్టకం.

భావప్రకాశంలో సాటకం/సట్టకం నిర్వచనం కూడా పైని లక్షణాలకు అనుగుణంగానే ఉంది.

"సైవ ప్రవేశకేనాపి విష్కంభకేణ వినా కృతా | అంకస్థానీయవిన్యస్తచతుర్జవనికాన్తరా | ప్రకృష్టప్రాకృతమయీ సట్టకో భవేత్ |"

(నాటకాలలో భోజనం, స్నానం, యుద్ధం వంటి క్రియలను తెరపై చూపరాదని నియమం ఉంది. అలాగే జరిగిపోయిన కథలను చెప్పే అవసరం వస్తుంది. ఇటువంటి వాటిని చెప్పటానికి అర్థోపక్షేపాలు అన్న సంవిధానాలను ఉపయోగిస్తారు. (ఉదా: వేణీ సంహార నాటకంలో దుశ్శాసనుని వధ ప్రావేశకము . అనర్ఘరాఘవంలో శివధనుర్భంగఘట్టం నిష్కంభకము). ప్రవేశకము, నిష్కంభకమూ అన్నవి అర్థోపక్షేపకాలు. )

ఈ రెండు సట్టకంలో ఉండవు. (ఉండకపోవడం వల్ల సూటిగా, సరళంగా నాటిక కొనసాగుతుంది. సంగీత నృత్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఏర్పడుతుందన్నమాట).

***

ఇది ఇలా ఉండగా, మన్ మోహన్ ఘోష్ అనే పండితుడు సట్టకం గురించిన మరొక వివరాన్ని పేర్కొన్నాడు. ప్రఖ్యాతమైన భర్హుత్ (మధ్యప్రదేశ్ లోని ఓ చారిత్రక ప్రాంతం) బౌద్ధ స్థూపం, అక్కడ దొరికిన తామ్రశాసనాలలో, "సాటికా", "సాడికా" అన్న శబ్దాలతో కూడిన నృత్య/నాట్య ప్రక్రియల గురించి ఉన్నది.



ఈ ప్రాకృతశాసనాలలో సట్టకాన్ని పేర్కొన్న దరిమిలా, మరికొన్ని పరిశోధనలు జరిపి, ఈ ప్రక్రియ - నాటికకంటే కాస్త భిన్నమైనదని, సట్టకంలో నృత్య, సంగీతాల ప్రమేయం ఎక్కువగా ఉంటుందని, ఇది ఒక Dance-Drama అని, ఘోష్ పేర్కొన్నాడు. కర్పూరమంజరి నాటకంలో నాలుగవ అంకంలో చర్చరి అన్న నృత్యప్రస్తావన ఉన్నది. బహుశా ఈ నృత్యప్రస్తావన వచ్చినప్పుడు - ప్రాచీనకాలంలో తెరపై నృత్యం కూడా చేసేవారేమో!

***‌‍*‌‍‌^^^^**** 

కథ.


(మొదటి జవనిక)

మహారాజు చంద్రపాలుడు, రాణి విభ్రమలేఖ, రాజు మిత్రుడూ విదూషకుడూ అయిన కపింజలుడూ, రాణి పరిచారిక విచక్షణా కలిసి వసంతోత్సవాల గురించి ముచ్చటించుకుంటున్నారు. ఆ సందర్భంలో రాజూ రాణీ వసంతకాలపు పవనాలపైన కవితలు చెప్పుకున్నారు. కపింజలుడూ విచక్షణ కూడా తమతమ కవితలు చెప్పారు. కపింజలుని కవితలో అతని భోజనప్రియత్వం దాగున్నది. అందుకే ఆ కవితను విచక్షణ విమర్శించింది. "ఈ కవిత నీ ప్రియురాలిని మాత్రమే రంజింపజేస్తుంది" అన్నది. ఆపై విచక్షణ కవితను రాణి, రాజు ఇద్దరూ మెచ్చారు.

కపింజలునికి సహజంగానే కాస్త కోపం వచ్చింది. అతడు శ్లేషతో విచక్షణను తిట్టడం మొదలెట్టాడు. విచక్షణ కూడా ధీటుగా బదులివ్చింది. ఈ మిషతో అక్కడ నుంచి బయటకెళ్ళిన కపింజలుడు, కాసేపటికి భైరవానందుడనే అతీతశక్తులు గల సిద్ధుణ్ణి సభకు తోడుకొని వచ్చాడు.

మహారాజు ఆదేశం మేరకు భైరవానందుడు ఓ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ఆతని మంత్రశక్తితో సభ మధ్యలో పైనుండి ఓ అపూర్వమైన సుందరి జాలువారుతూ వచ్చింది.ఆవిడ విదర్భదేశపు రాకుమారి కర్పూరమంజరి.



మహారాజు ఆ యువతి సౌందర్యాన్ని చూసి అచ్చెరువందినాడు. ఆమెను చూడగానే మహారాణి విభ్రమలేఖ - తనకు ఆమె చెల్లెలి వరస అవుతుందని గుర్తించింది. కర్పూరమంజరి తల్లిదండ్రులు అయిన వల్లభుడు, శశిప్రభా - మహారాణికి - బాబాయి, పిన్ని వరస. వారి పుత్రిక కాబట్టి కర్పూరమంజరి, రాణికి చెల్లెలు.

మహారాజు చంద్రపాలునికి ఆ సుందరిని చూడగానే మనసు చలించింది. విభ్రమలేఖ కర్పూరమంజరిని కొన్నాళ్ళు అతిథిగా ఉంచుకుంటానని సిద్ధుడికి చెప్పి, అభ్యంతరమందిరానికి తీసికెళ్ళింది.

(రెండవ జవనిక)

తన కంటి ముందు జరిగిన అద్భుతాన్ని, ఆ సుందరిని రాజు మరచిపోలేక, విరహంలో పడ్డాడు మహారాజు చంద్రపాలుడు. కర్పూరమంజరిపై కవితలు చెబుతున్నాడు. ఇటు కర్పూరమంజరి పరిస్థితి అలానే ఉంది. బయటకు చెప్పుకోలేక ఈమె - మొగలిరేకులపై రెండు కవితలను వ్రాసి విచక్షణకు ఇచ్చింది. విచక్షణ ఆ కవితలను మహారాజుకు అందించడంతో ఆయన వాటిని చదువుకున్నాడు.

ఇటు మహారాణి, తన చెల్లెలిని రాబోయే హిందోళికా ఉత్సవం కోసం - ఎంతో అందంగా ముస్తాబు చేసి, ఆభరణాలతో అలంకరింపజేసింది.

కపింజలుని సూచన మేరకు మహారాజు, విదూషకుడూ మరకతకుంజం అనే రహస్య ప్రదేశంలో దాగి, అంతఃపురంలో కర్పూరమంజరి ఉయ్యాల ఊగే సంరంభాన్ని చూచారు. రాజు ఆమె సౌందర్యాన్ని చూచి మరింతగా ప్రేమలో పడ్డాడు.

రాజు, కర్పూరమంజరి - ఒకరిపై ఒకరు మరులు గొన్నారని విచక్షణకూ, కపింజలునికీ స్పష్టపడింది. సాయంత్రం అరటితోటకు కర్పూరమంజరిని తోడుకుని "దోహదక్రియ" కై వస్తోంది రాణి. మహారాజు, కపింజలుడూ పొదలలో దాగి, ఈ సారి కర్పూరమంజరిని మరింత దగ్గరగా చూశారు.

దోహద క్రియ పూర్తయింది. వైతాళికులు - సాయం సమయమైనట్టు నినదించారు. అందరూ నిష్క్రమించారు.

(మూడవ జవనిక)

మహారాజు చంద్రపాలుడు,విదూషకుడు కపింజలుడు మాట్లాడుకుంటున్నారు. క్రితం రాత్రి కలలో కర్పూరమంజరి రాజు నిదురపోతున్న తల్పానికి దగ్గరగా వస్తే, రాజు ఆమె చీరె కొంగును పట్టుకోబోయాడు. ఆమె తన చీరె కొంగును విడిపించుకుని అక్కడినుండి మరలిపోయింది. అంతటితో రాజుకు నిద్రాభంగమయింది.

విదూషకుడూ తన కల చెప్పేడు. తను గంగానదీ ప్రవాహంలో స్నానం చేస్తున్నాడు.శరత్కాలపు మహా మేఘం ఒకటి గంగ నీటిని నీటియావిరి రూపంలో పీల్చుకున్నది. అలా తాను మేఘపు మధ్యభాగానికి వెళ్ళాడు. ఆపై మేఘం దక్షిణ దిశగా ప్రయాణించి తామ్రపర్ణీనది సముద్రంలో కలిసే చోట - స్వాతీ నక్షత్రాన తనను వర్షం రూపంలో సముద్రంపై వదిలింది. అలా కపింజలుడు ఓ ముత్యపు చిప్ప లోపలకు వచ్చి పడ్డమే కాక, (స్వాతి) ముత్యం లోపల చిక్కువడి, ముత్యపు చిప్ప పగలటంతో సముద్రతలాన వచ్చాడు. ఈ ముత్యాన్ని ఓ శ్రేష్టి లక్ష బంగారు వరహాలకు కొని, ఓ హారంలో దాన్ని పొదిగి, కన్యాకుబ్జానికి వెళ్ళి, పాంచాల రాజైన వజ్రాయుధుడికి కోటి వరహాలకు అమ్మినాడు. ఆ రాజు తన భార్య మెడలో ఆ హారాన్ని వేసి, ఆమె గాఢంగా కౌగిలించుకున్నాడు. ఆ వత్తిడికి హారంలో ఉన్న తనకు స్వప్నం చెదరి, నిద్రాభంగమయింది.

రాజు ఈ కథ విని నవ్వాపుకోలేకపోయాడు. " నీ అబద్ధపు కల నా నిజం లాంటి కల లోంచి బయటకు తెప్పించింది కదా" అన్నాడు. రాజు, కపింజలుడూ - ప్రేమ, సౌందర్యం, యౌవనం వంటి విషయాలను చర్చించుకొన్నారు.

రాజు, విదూషకుడూ మాట్లాడుకుంటూ నడుస్తుండగా అటు కర్పూరమంజరీ, ఆమె చెలికత్తె కురంగికా కూడా మాట్లాడుతూ ఎదురు రాసాగినారు. వారి మాటలు చెవిన బడిన రాజుకు ఆమె కూడా విరహంలో వున్నట్టు తెలిసింది. కర్పూరమంజరి రాజుకు ఎదురు రాగా, రాజు ఆమె చేయి పట్టుకున్నాడు. అనుకోకుండా ఆమెను కౌగిలించుకున్నాడు కూడా.

ఇంతలో చంద్రోదయమయినట్టు వైతాళికుల పద్యాలు నగారా లో వినిపించినాయి. కురంగిక - చంద్రోదయంపై కర్పూరమంజరి రచించిన కవితను చదివింది. రాజు ఆ కవితను చాలా అద్భుతంగా ఉందని పొగిడాడు. ఇంతలో కలకలం వినిపించింది. కురంగిక అటు వెళ్ళి విషయం తెలుసుకుంది.

మహారాణి విభ్రమలేఖ అటుగా వస్తోంది. కర్పూరమంజరి - తన రక్షాగృహంలో ఉండక రాజును కలవడానికి వెళ్ళినట్లు ఆమెకు తెలిసింది. కర్పూరమంజరి త్వరత్వరగా సొరంగమార్గాన తన రక్షాగృహానికి చేరటానికై మరలి పోయింది.

(నాలుగవ జవనిక)

రాజు, కపింజలుడు గ్రీష్మకాలాన్ని గురించి ముచ్చటించుకుంటున్నారు. కర్పూరమంజరి ఉంటున్న రక్షాగృహం నుండి బయటకు వెళ్ళగలిగే సొరంగ మార్గాన్ని మహారాణి విభ్రమలేఖ మూసి వేయించడమే కాక అన్ని దిశలా సైనికులను కాపలా పెట్టించింది. కర్పూరమంజరిని ఎవరూ చూడటానికి వీలు లేదు.

వటసావిత్రి మహోత్సవ సందర్భంగా కేళీ విమానప్రాసాదంపై నుండి రాజు, విదూషకుడూ దండరాస, చల్లీ వంటి నృత్యాల ప్రదర్శనను తిలకించారు.

ఇంతలో మహారాణి పరిచారిక సారంగిక రాజు మందిరానికి ఓ సందేశంతో వచ్చింది. ఆ రోజు సాయంత్రమే రాజుకు పునర్వివాహం. దీనికి కారణం ఇది.

మహారాణి భైరవానందుని అధ్వర్యాన గౌరీపూజ జరిపించి, గురుదక్షిణ స్వీకరించమని ఆతణ్ణి కోరింది. తనకు ఇవ్వవలసిన దక్షిణ మహారాజుకు ఇవ్వమని భైరవానందుడు మహారాణితో చెప్పాడు. ఆ దక్షిణ ఏమిటంటే - లాట దేశపు రాజు చండసేనుడు. ఆతని కుమార్తె ఘనసారమంజరి. ఆమెను వివాహం చేసుకున్న వరుడు చక్రవర్తి అవుతాడని జ్యోతిష్కులు చెప్పారు. ఆమెను మహారాకు ఇచ్చి వివాహం చెయ్యమని, తద్వారా రాజు చక్రవర్తి కావటమే కాక, తన గురుదక్షిణా తీరుతుందని భైరవానందుడు చెప్పాడు. ఆ విషయాన్ని సారంగిక ద్వారా మహారాజుకు తెలిపింది మహారాణి.

రాజు హతాశుడయ్యాడు. విదూషకుడు నవ్వుతూ చెప్పాడు, " తలపై పాము, అజ్ఞాతంలో వైద్యుడు, ఇప్పుడిక్కడ వివాహం, లాటదేశంలో యువరాణి!".

అయితే రాజుకు భైరవానందుని శక్తి సామర్థ్యాలు తెలుసు. ఆతడు చాముండాయతనం లో దేవి సమక్షాన వివాహపు ఏర్పాట్లు చూస్తున్నాడు. ఆతని వద్దకు బయలుదేరారు చంద్రపాలుడు, కపింజలుడూ.

ఇక్కడ భైరవానందుడు కర్పూరమంజరిని రక్షా గృహం నుండి పిలిపించాడు. రాణి దేయాలయానికి వస్తే, కల్యాణానికి సంబారాలు తోడుకొని రమ్మని పంపేశాడు. కర్పూరమంజరి ముఖాన పూలమాలలు కప్పి కల్యాణవధువును చేశాడు.

రాజు విదూషకుడూ రానే వచ్చారు. విదూషకుడికి - కర్పూరమంజరియే ఘనసారమంజరి అని తెలిసిపోయింది. ఆ విషయాన్ని రాజుకు నర్మగర్భంగా ఓ శ్లోకం ద్వారా చెప్పాడతను. ఆపై కపింజలుడే పురోహితుడై వివాహం జరిపించాడు. కర్పూరమంజరి, చంద్రపాలుల వివాహం రాణి సమక్షంలోనే ఆమెకు విషయం తెలియకుండా జరిగిపోయింది.

శుభం.
***‌‍*‌‍‌^^^^**** 

ప్రేమ అనగానేమి?


విదూషకుడు: రాజా, దేవి గారిపైన ప్రేమాస్పదుడై యుండి కూడా మీరు కర్పూరమంజరిని అలా కళ్ళు విప్పార్చుకుని, చూపులతో త్రాగేస్తున్నట్టు ఎందుకు చూస్తున్నారు? రాణి తన గుణాన్ని కోలుపోయి మీ ప్రేమను నోచుకోకపోయిందా?

రాజు: అలా అనకోయి;

కీఏ వి సంఘడఈ కస్స వి పేమ్మగంఠీ
ఎమెవ్వ తత్థణ ఉ కారణమత్థి రూఅమ్
చంగత్తణం ఉణ మహిజ్జది జం తర్హి పి
తా దిజ్జ ఏ పిసుణలోఅముహేసు ముద్దా ||


ఛాయ:
కయాచిత్ సంఘటతే కస్యాపి ప్రేమగ్రంథిః
ఏవమేవ తత్ర న ఖలు కారణమస్తి రూపమ్ |
చంగత్వం పునర్మృగ్యతే యత్తత్రాపి
తద్దీయతే పిశునలోకముఖేషు ముద్రా ||


ప్రేమబంధం అన్నది ఏదో అనుకోని కారణాన సంభవిస్తుంది. ఇలా ప్రేమ పుట్టడానికి రూపాతిశయమే కారణం అని చెప్పలేం. సౌందర్యాన్వేషణే ప్రేమకు కారణం కావచ్చును, లోకుల నోళ్ళను మూయించడానికి యువతి సౌందర్యాన్ని ఉద్యోతించక తప్పదు.

వి: మరి దీన్ని పొద్దస్తమానం ప్రేమ, ప్రేమ అంటుంటారు. ఎలాంటిది యిది?

రా:
జస్సిం విఅప్పఘడణాఇ కలంకముక్కో
అంతో మణమ్మి సరళత్తణమేఇ భావో |
ఏక్కక్క అస్స పసరంతరసప్పవాహో
సింగారవడ్ఢి అమణోహవదిణ్ణసారో ||

ఛాయ:
యస్మిన్ వికల్పఘటనాది కలంకముక్తః
ఆత్మనః సరళత్వమేతి భావః |
ఏకైకస్య ప్రసరత్ రసప్రవాహః
శృంగారవర్ధితమనోభవదత్తసారః ||


ఎందులో హృదయం విశ్వాసబద్ధమై చెడుతలపులనే ముళ్ళు లేనిదై ఉంటుందో, ఎందులో చిత్తం సరళత్వాన్ని పొందుతుందో, ఎందులోనయితే ఒకరిపై ఒకరికి ఆకర్షణ యొక్క రసప్రవాహం ఉంటుందో, ఏదైతే శృంగారం ద్వారా పెంపు చేయబడుతుందే అది ప్రేమ.

వి: దీన్నెలా గుర్తించాలి?

రా:

జాణం సహావపసరంతసలోలదిట్టీ
పరేంతలుంఠిఅమాణణ పరప్పరేణ |
వడ్డంతమమ్మహ విఇణ్ణరసప్పసారో
తాణం పహాస ఇ లహుం విఅ చిత్తభావో ||

ఛాయ:
యయోః స్వభావ ప్రసరత్ సలోల దృష్టిః
పర్యంతలుంఠితమనసో పరస్పరేణ |
వర్ధమానమన్మథ వితీర్ణరసప్రసారః
తయోః ప్రకాశతే లఘురివ చిత్తభావః ||


ఎవరి చూపులు ఒకరిపై ఒకరికి అవ్యక్తంగా ప్రసరిస్తూ ఉంటాయో, ఒకరిపై ఒకరికి మనస్సు లగ్నమై లాగబడి ఉంటుందో, మన్మథుని శరాలచేత మోహం పెచ్చరిల్లుతూ ఉంటుందో, వారి మధ్య ప్రకాశించి ఉన్నదే ప్రేమ.

వి: అలాంటి ప్రేమ ఉన్నప్పుడు అలంకారాలు గట్రా ఎందుకు?
...
....

ఈ ప్రేమ చర్చ ఇంకా కాస్త ముందుకు వెళుతుంది కానీ మనం ఇక్కడ ఆపుదాం.

****

తిరిగి అల్లసాని వారి వద్దకు రావాలి మనం. పెద్దనకూ, రాజశేఖరునికి మధ్య శైలిలో మాత్రమే కాక, భావాల్లో కూడా కొంత సారూప్యం కనిపిస్తుంది. పెద్దన - కవిత్వంలో శబ్దానికి తగినంత ప్రాముఖ్యత ఉందనే అంటాడు "పూతమెఱుంగులన్ పసిడి.." అన్న మాలికలో. రాజశేఖరుడూ అలాంటి అభిప్రాయాలను ప్రకటిస్తాడు. ఇద్దరూ మాలికలకు అభిమానులు, మాలికారచనలో సిద్ధహస్తులు. :) (కర్పూరమంజరిలో 20 పాదాల ఒక సుదీర్ఘమైన మాలిక వంటి పది శ్లోకాల సమాహారం ఉన్నది. ) వీరి కవిత్వాల ద్వారా చూస్తే, ఇద్దరూ నెమ్మదైన వ్యక్తుల్లా అగుపిస్తారు. కాకపోతే రాజశేఖరుడు కొంత ఉదారవాది, కాస్తో కూస్తో అప్పటికాలానికి ఆధునిక భావాలను కలిగియున్న కవి. పెద్దన ఆ విషయంలో బయటపడలేదు కానీ, శాసనాల ద్వారా మనకు తెలిసిన పెద్దన - గొప్ప దాత.

అంతే కాదు; ఇద్దరికీ ప్రేమంటే ప్రేమే. :)

కర్పూరమంజరిలో ప్రేమను రాజు, విదూషకుడూ చర్చిస్తే, స్వారోచిషమనుసంభవంలో ప్రేమ చర్చ ....చెప్పడమెందుకు?...మనకు తెలిసిందే. మనుచరిత్రకారుడు వరూధిని ద్వారా చెప్పించిన ప్రేమపాఠాల్లో రాజశేఖరుని ప్రేమను పోలినది ఇది.

శా||
ఎందే డెందము కందళించు రహిచే నేకాగ్రతన్‌ నిర్వృతిన్
జెందుం కుంభగత ప్రదీపకళికాశ్రీ దోప నెందెందుఁ
బో కెందే నింద్రియముల్‌ సుఖంబు గను నా యింపే పరబ్రహ్మ, “మా
నందో బ్రహ్మ” యటన్న ప్రాజదువు నంతర్బుద్ధి నూహింపుమా
.

ఏ విషయంలో మనస్సు వికాసము చెంది తన్మయత్వాన్ని పొందుతుందో; ఇంద్రియాలన్నీ లయించి ఏ విషయాన సుఖానుభూతిని పొందుతాయో; అలాంటి విషయం యొక్క ఆనందమే బ్రహ్మానందము. ఆనందము అన్న వేదవాక్యానికి అర్థాన్ని యోచింపుము.

రాజశేఖరుని ఉక్తులు కొంచెం గడుసువి. ఎందుకంటే ఆయన కర్పూరమంజరి - అన్న అమ్మాయి పేరునే కావ్యానికి పెట్టి, అక్కడక్కడా అమ్మాయిని వర్ణించే నెపంతో కావ్యాన్ని, కవిత్వాన్ని గురించి మాట్లాడతాడు. అల్లసాని పెద్దనకు ఇటువంటి యుక్తులు లేవు,

***‌‍*‌‍‌^^^^**** 

కవిత్వలక్షణాలు


"అహో కర్పూరమంజర్యా అభినవార్థదర్శనమ్, రమణీయః శబ్దః, ఉక్తివిచిత్రతా, రసనిష్పందశ్చ"

"ఆహా! కర్పూరమంజరి యొక్క పలుకుల్లో నవనవోన్మేషమైన అర్థము, రమణీయమైన పలుకులు, పలుకుల్లో విభిన్నత, రసబంధురతా.."

ఈ నాటికలో భాగంగా (అంటే అంతర్గతంగా) రాజు చంద్రపాలుడు - కర్పూరమంజరి చెప్పిన కవితకు పరవశించి అలా అంటాడు. బాహ్యంగా వచ్చి చూస్తే - ఇది కవి రాజశేఖరుడు కర్పూరమంజరి అనే కావ్యాన్ని గురించి ప్రకటించుకున్న అభిమతం కూడాను. ఇది రాజశేఖరుని యొక్క "ఉక్తివిచిత్రత" !
రాజు (రాజశేఖరుడు) అంతలా మెచ్చుకున్న ఆ శ్లోకం ఇది. కొంత కాళిదాసు ఛాయ కనిపించే శ్లోకం యిది.

మండలే ససహరస్స గోరఇ దంతపంజరవిలాసచోరఇ |
భాది లాంఛణమిఓ పురన్తఓ కేలికోఇలతులం ధరన్తఓ ||

ఛాయ:
మండలే శశిధరస్య గౌరే దంతపంజరవిలాసచౌరే |
భాతి లాంఛనమృగః స్ఫురన్ కేలి కోకిలతులం ధారయన్ ||


ఏనుగుదంతంతో చేసిన పంజరపు కాంతులను దొంగిలించిన చంద్రుడు తూరుపున పసిడి వర్ణపు వలయాన్ని ధరిస్తూ ఉద్భవిస్తున్నాడు. ఆ చంద్రునిలో మచ్చ రూపాన ఉన్న జింక - కోకిలబొమ్మ లా ఉంది.

పంజరంలోని కోకిల వలె చంద్రునిలో మచ్చ ఉంది అన్నది ఉక్తివిచిత్రత. వాక్యవక్రోక్తి.
చంద్రుడు - దంతపంజరవిలాసచౌరుడు - ఇది అభినవార్థదర్శనం.
శ్లోకమంతానూ రమణీయమైన శబ్దాలే.
పంజరంలా ఉన్న చంద్రునిలో మచ్చ - కోకిల బొమ్మ లా ఉందనడం విస్మయమైన విషయం. అద్భుతరసం యొక్క స్థాయీభావం విస్మయం.

యథావిధిగా, బాదరాయణసంబంధం - iii ప్రతిపాదన చేయుచున్నాను.

అంతటఁ బ్రాచి నిశాపతి
యంతికగతుఁ డౌట విని ముఖాలంబి తమః
కుంతలములు దీర్పఁగఁ గొను
దంతపుదువ్వెన యనంగ ధవళిమ దోచెన్. (మనుచరిత్ర - 3.20)


ఆపైన తూరుపు అనే స్త్రీ - తన చెంతకు రజనీకరుడు చంద్రుడు వస్తున్నాడని, చీకటులు అనే తన ముంగురులను సవరించుకోవడానికి తీసికొన్న దంతపు దువ్వెనలా - తూరుపు దిక్కున వెలుగురేకలు ప్రసరించినవి.

పెద్దన వెలుగురేఖ దంతపు దువ్వెన అయితే రాజశేఖరునిది దంతపంజరవిలాసము. :)


******

కర్పూరమంజరి కావ్యంలో అక్కడక్కడా కవిత్వ చర్చ జరుగుతూ ఉంటుంది. కవిత్వపు చర్చలు సాధారణంగా మూడు విభిన్న తలములలో జరుగడం కద్దు.

౧. కవిత్వం గురించిన తార్కిక చర్చ.
౨. కవిత్వం గురించిన సైద్ధాంతిక చర్చ. (ధ్వని, రసం, రీతి వగైరా)
౩. కవిత్వం లో శబ్దార్థాల యొక్క స్వారస్యపు చర్చ.

రంగస్థలంపై ప్రదర్శించే నాటిక కనుక ఈ కావ్యంలో కవిత చర్చ ప్రధానంగా శబ్దార్థాలపై ఉంటుంది. (ఇతర చర్చలు సామాన్య ప్రేక్షకునికి విసుగు తెప్పించగలవు కనుక). అటువంటి సందర్భాలు మరికొన్ని పరిశీలిద్దాం.

******

సాధారణంగా ఏ కవికైనా ’కవిత్వ వస్తువు’ పట్ల తనదైన విశిష్టమైన, విలక్షణమైన దృష్టి ఉండనే ఉంటుంది. అయితే తన ప్రాపంచిక ఇష్టాऽయిష్టాలను, అభిరుచులను కవిత్వంలో జొనపడం కవి అన్నవాడు చేయదగని పని. ఈ విషయాన్ని రాజశేఖరకవి అన్యాపదేశంగా సూచిస్తాడు.

మొదటిజవనికాంతరంలో విదూషకుడు, విచక్షణా కవితలు చెప్పారు.

విదూషకుని కవితలో భావం : ఈ సిందువార సుమపు మొగ్గలు అన్నం మెతుకుల్లా తెల్లగా ఉన్నాయి. నాకోసమై వికసించి ఉన్నాయి. ఈ మల్లెమొగ్గలు - గేదెపెరుగులా ధవళకాంతిలో ప్రకాశిస్తున్నాయి.

- ఈ కవితను విన్న విచక్షణ "ఈ కవితలో వస్తువు నీ యొక్క ఇష్టానికి సంబంధించినది. ఇది నీ ప్రియతమురాలైన భార్యకు నచ్చుతుంది. శబ్దసంచయం బావున్నా, భావంలో నూతనత్వం లేని కవిత - లావుగా ఉన్న నడుముకు వడ్డాణం చుట్టినట్టుగా శోభించదు" అంటుంది.

ఆపై విచక్షణ - తన కవిత చెబుతుంది.

జే లంకాగిరిమేహలాసు ఖలిఅ సంభోగఖిణ్ణోరఈ
ఫారుప్ఫుల్లఫణావళీకవలణే పత్తా దరిద్దత్తణమ్ |
తే ఏహ్ణం మల ఆనిలా విరహిణీణీసాసంపక్కిణో
జాదా ఝత్తి సిసుత్తణేవి బహలా తారుణ్ణపుణ్ణ విఅ ||

ఛాయ:
యే లంకాగిరి మేఖలాసు స్ఖలితాః సంభోగఖిన్నోరగీ
స్ఫారోత్ఫుల్లఫణావళీ కవలనే ప్రాప్తా దరిద్రత్వమ్ |
త ఇదానీం మలయానిలా విరహిణీనిఃశ్వాససంపర్కిణో
జాతా ఝటితి శిశుత్వేऽపి బహళాస్తారుణ్యపూర్ణా ఇవ |
|

ఇది వసంతవర్ణన. ఏ గాలులు లంకలోని సువేల పర్వతసానువులలో తత్తరపడినవో; ఏ గాలులు సంభోగంలో అలసిన ఆడుపాముల విశాలమైన పడగలపంక్తులచేత క్షీణింపబడినాయో;ఆ మలయపర్వత చందనసుగంధాలు విరహిణుల నిట్టూర్పులతో - శిశుత్వములోనూ (మెల్లగా మొదలైన సమయంలోనూ) యౌవనంలో లాగా (తీవ్రంగా వీయుచున్నట్లు) అయినవి.


(నిఃశ్వాసాన్ని అందుకున్న వాయువులు యౌవనాన్ని సంతరించుకున్నట్టు చెప్పడం ద్వారా కామినుల కాంక్ష అన్న వస్తువు వ్యంగ్యం అయింది. దీన్ని కవి - కావ్యంలోని పాత్రద్వారా చెప్పించటం మరింత చమత్కారాన్ని కలిగిస్తోంది. కర్పూరమంజరిలో విచక్షణ చెప్పిన ఈ శ్లోకాన్ని - కావ్యంలో రాజు రాణి మెచ్చుకున్నారు. అయితే కావ్యం బయట కూడా ఈ శ్లోకాన్ని మమ్మటుడనే ఆలంకారికుడు "కవినిబద్ధవక్తృప్రౌఢోక్తిసిద్ధమైన వస్తుధ్వని" కి ఉదాహరణగా పేర్కొన్నాడు.)

కర్పూరమంజరి, చంద్రపాలుడు ప్రేమలో పడ్డారు.
"ఇది సత్యమేనా?" అని అడుగుతాడు విదూషకుడు.
"సత్యతరమ్" - అంటుంది విచక్షణ.
"పరిహాసం కాదు కదా?"
"ఆర్య! మైవం భణ; అన్యో కావ్య విచారకాలః, అన్యః కార్యవిచారకాలః" - "ఆర్యా! అలా అనకు, కావ్యవిచారం వేరు, కార్యవిచారం వేరు" అంటుంది విచక్షణ.

దరిమిలా - సాధారణమైన సంభాషణలో వక్రోక్తులు, వ్యంగ్యాలు శోభించవు. సహజోక్తులే శోభిస్తాయి. అయితే కవిత్వంలో మాత్రం సహజోక్తుల కన్నా వక్రోక్తులు, వ్యంగ్యాలే శోభిస్తాయని రాజశేఖరుని మరొక అన్యాపదేశం. మరొకచోట నాటకకర్త - రాజు పాత్రతో ఇలా చెప్పిస్తాడు.

"నిసర్గసుందరస్యాపి మానుషస్య శోభా సమున్మీలతి భూషణైః"

"స్వభావసిద్ధంగా సుందరంగా ఉన్న మనిషికి ఆభరణాలు శోభిస్తాయి."

ఇది కవిత్వానికి వర్తించే విధంగా చెబుతాడు కవి.

ఇటువంటివి అక్కడక్కడా ఈ కావ్యంలో వస్తుంటాయి. రాజశేఖరుడు కవి, గొప్ప పండితుడు, అంతకన్నా గొప్ప హృదయవాది. ఈ కవి తన కావ్యమీమాంసలో ఔత్సాహిక కవులకు గొప్పవి, సూక్ష్మమైనవి అయిన ఎన్నో సూచనలు చెప్పాడు. ఆఖరుకు - కవులకు కవిత్వ రచనకు తగిన వాతావరణం ఏర్పరుచుకోవడాన్ని గురించి కూడా ఈయన సూక్ష్మంగా వివేచించి ఉపదేశిస్తాడు. చాలా అమూల్యమైన విషయాలు యివి. (రాజశేఖరుడు కవులకు చెప్పిన హితవు లను సంకలనం చేసి తిరుమల రామచంద్ర గారు తెలుగులో ఒక వ్యాసం వ్రాశారు.)

రాజశేఖరుడు - అంటే రాజు (చంద్రుని) శిఖరమున వహించిన వాడు.

ఈ కవిరాజశేఖరుడు, కవి-రాజశేఖరుడు, రాజు అయిన చంద్రుని గురించిన శిఖరాయమానమైన వర్ణన యిది. ఈ శ్లోకం "శశివదన" అనే వృత్తంలో ఉందట! దీనిని చెప్పుకోకుండా ఆయన కవిత్వం పూర్తి కాదు.

దిసవహుతంసో ణహసరహంసో |
ణిహుఅణకందో పసరఇ చందో ||

ఛాయ:

దిగ్వధూత్తంసో నభః సరోహంసః |
నిధువనకందః ప్రసరతి చంద్రః ||


దిక్కు అన్న వధువుకు చెవిపోగు, అంతరిక్షమనే సరస్సులో విహరించే హంస, ప్రేమ అన్న తోటకు బంతి అయిన చంద్రుడు వెలుగొందుతున్నాడు.

కర్పూరమంజరికి ఆంగ్ల వ్యాఖ్యా త కోనో - ఎందుచేతనో ఏమో, ఈ ఒక్క శ్లోకాన్ని కవితగా అనువదించాడు..

White swan of heaven's pool;
Of Siva's crest, the jewel;
A bulb of love;
S the moon is above.

***‌‍*‌‍‌^^^^****

భైరవానందుడు


సభకు భైరవానందుడు మద్యం మత్తులో కొద్దిగా తూలుతూ వచ్చాడు. అతడెలాంటి వాడో చెప్పాడు.

మంతో ణ తంతో ణ అ కిం పి జాణం
ఝాణం చ ణో కిం పి గురుప్పసాదా |
మజ్జం పిఆమో మహిలం రమామో
మోక్ఖం చ జామో కులమగ్గలగ్గా ||

ఛాయ:
మంత్రో న తంత్రం న చ కిమపి జానం
ధ్యానం చ నో కిమపి గురుప్రసాదాత్ |
మద్యం పిబామో మహిళాం రమయామో
మోక్షం న యామః కులమార్గలగ్నాః ||


మంత్రతంత్రా లేమాత్రం ఎఱుగము. గురువు అనుగ్రహం వలన ధ్యానము అలవడలేదు. మద్యం సేవిస్తాము, మహిళలను రమిస్తాము. మోక్షాన్ని కోరుకొనము. మేము కౌలం అవలంబించేవాళ్ళము.

అంతేకాదు;

రండా చండా దిక్ఖిదా ధర్మదారా
మజ్జం మంసం పిజ్జ ఏ ఖజ్జ ఏ అ |
భిక్కా భోజ్జం చమ్మఖండం చ సేజ్జా
కోలో ధమ్మో కస్స ణో ఖాది రమ్మో ||

ఛాయ:
రణ్డా చణ్డా దీక్షితా ధర్మదారా
మద్యం మాంసం పీయతే ఖాద్యతే చ |
భిక్షా భోజ్యం చర్మఖండం చ శయ్యా
కౌలో ధర్మః కస్య నో భాతి రమ్యః ||


ఏ కౌలాచారంలో తీక్ష్ణస్వభావం గల వేశ్యకు ధర్మదారగా దీక్ష లభిస్తుందో., ఏ ధర్మం లో మద్య మాంస, భిక్షాణ్ణాలు భుజిస్తారో, ఎందులో చర్మం మీద నిద్రిస్తారో, ఆ కౌలధర్మం ఎవరికి రమ్యంగా అనిపించదు?

....
....

మన కావ్యాల్లో, కొన్ని నాటకాల్లో సిద్ధుల ప్రస్తావన ఉన్నది. మూలదేవుడనే ఒకానొక సిద్ధుడు/ధూర్తుడి ప్రస్తావన అనేక సంస్కృత ప్రాకృత సాహిత్యాలలో ఎడనెడ కనిపిస్తుంది. కర్పూరమంజరిలో కూడా సిద్ధునిపాత్ర ఉంది. ఇతని పేరు, ప్రవర్తనా అది. అయితే, రాణి ఈ సిద్ధుణ్ణి గురువుగా భావించింది. రాజు అతని కౌలాచారాన్ని గురించి పట్టించుకోకుండా, ఆతని ప్రతిభను గుర్తిస్తాడు.

కర్పూరమంజరి నాటకాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ, కొందరు వ్యాఖ్యాతలు - భైరవానందుని మాట తీరు ఎబ్బెట్టుగా ఉన్నా, అతడు గొప్ప సిద్ధుడని, ఆ పాత్ర ఉదాత్తమైనదని ప్త్రతిపాదించారు. అయితే, భైరవానందుని పాత్ర - అదే నామధేయంతో, మరొక ప్రాకృతకావ్యమైన "జసహరచరిఉ" (యశోధరచరిత్ర) లో ఉన్నది. జసహరచరిఉ లో భైరవానందుని లక్షణాలున్నూ కర్పూరమంజరి భైరవానందుని పాత్రను చాలావరకూ పోలుతున్నాయి. దరిమిలా నాటి సమాజంలో కౌలాచారతత్పరులై, మద్యమాంసాశనులైన సిద్ధులు ఉండేవారని, అటువంటి ఆచారాలు ఉండేవని, వారినే కవి తన కావ్యంలో స్వీకరించాడని మరి కొందరు వ్యాఖ్యాతలు చెప్పారు.

(మనుచరిత్రలోనూ సిద్ధుడు ఉన్నాడండోయ్. ఆతని రూపురేఖలను తెనుగుకవి ఓ సీసపద్యంలో వర్ణించాడు. అయితే ఈతను ఔషధసిద్ధుడు. సాఫ్ట్ కేరక్టర్. కర్పూరమంజరిలోలా కౌలాచారసిద్ధుడు కాదితడు. )

****^^^^****

సంగీతనృత్య ప్రస్తావనలు


కర్పూరమంజరిలో నాలుగవ జవనికాంతరంలోని ఘట్టం. వటసావిత్రి మహోత్సవం జరుగుతూంది. విదూషకుడు, మహారాజు చంద్రపాలుడు - కేళీవిమానప్రాసాదం పై నుండీ నగరంలో వేడుకలను తిలకిస్తున్నారు. చర్చరీ గాయనీమణులు/నర్తకీమణులు వచ్చారు. ఈ సందర్భాన విదూషకుడు చెప్పిన తొమ్మిది శ్లోకాలు - కవి కాలం నాటి వివిధ దేశీ నృత్యరీతులను వర్ణిస్తాయి. ఇవి ఈ నాటకంలో చారిత్రకంగా సుప్రసిద్ధమైనవి. ఇందులో మూడు శ్లోకాలు ఇవి. ఇవి ఉపజాతి వృత్తంలో ఉన్నాయి.

పరిబ్భమాన్తీఅ విచిత్తబంధం ఇమాఇ దోసోలహ ణంచణీఓ |
ఖేలంతి తాలాణుగదప్పదాఓ తుహంగణే దీసఇ దండరాసో ||
సమం ససీసా సమబాహు హత్థా రేహా-విసుద్ధ అవరాఉ దేంతి |
పంతీహి దోహి ల అ తాల బంధ పరోప్పర సాహిముహీఉ "చల్లీ" ||

కావి వాఇఅ కరాల హుడుక్కా రమ్మ మద్దల రవేణ మ అచ్ఛీ |
దోల్ల ఆహిం పరివాడి చలాహి చల్లి కమ్మ కరణమ్మి ప అట్టా ||

ఛాయలు:
పరిభ్రమంత్యో విచిత్రబంధం ఇమా ద్విషోడశ నర్తక్యః |
ఖేలంతి తాలానుగుణతపదాస్తవాంగణే దృశ్యతే దండరాసః ||
సమాం సశీర్షాః సమబాహుహస్తాః రేఖావిశుద్ధా అపరాశ్చ దదతి |
పంక్తిభ్యాం ద్వాభ్యాం లయతాళబంధం పరస్పరం సాభిముఖా "చల్లీ" ||

.....
.....


కాపి వాదితకరాలహుడుక్కా రమ్యమర్దలరవేణ మృగాక్షీ |
భ్రూలతాభ్యాం పరిపాటీచలాభ్యాం "చల్లి" కర్మకరణే ప్రవృత్తా |
|

ముంగిలిలో 32 మంది నర్తకీమణులు విచిత్రమైన బంధంతో, చుట్టూ తిరుగుతూ, తాలనికి అనుగుణంగా పాదాలు కదుపుతూ దండరాసం అనే నృత్యం చేస్తున్నారు.

ఇంకా కొందరు నర్తకీమణులు రెండు వరుసలలో సాభిముఖంగా నుంచున్నారు. వారు తమ తలలను ఒకే వరుసలో చేర్చి, సరళరేఖలో భుజాలపై భుజాలను చేర్చుకుని, తాళానికనుగుణంగా లయబద్ధంగా "చల్లీ" అనే నృత్యాన్ని చేస్తున్నారు.

ఆ చల్లీ నృత్యం కోసం మరొకావిడ చేతిలో ఉన్న ఢమరుకాన్ని రమ్యంగా మ్రోగిస్తూ, తన నుదుటి రేఖలను విచిత్రంగా కదిలిస్తూ నృత్యంలో తానూ భాగంగా పాల్గొంటున్నది.

దండలాస్యం, చల్లీ, చర్చరీ. ఈ మూడు నృత్యసంగీత రీతుల గురించి కొంత చర్చించుకుందాం.

1. దండరాసకము / దండలాస్యము:

నాట్యశాస్త్రాన్ననుసరించి - నాట్యం అంటే అవస్థానుకరణం. అంటే మానవుల సంవేదనలకు రూపు కల్పించి జవనికపై ప్రదర్శించటమే నాట్యం. (The theater art). ఇది రసాశ్రితం., సాత్వికాభినయప్రధానమూ.

నృత్తం అంటే గాత్రవిక్షేపం. (నృత్త - గాత్రవిక్షేపే అని ధాతువు) ఇది తాళలయాశ్రితం. తాళలయాదులకు అనుగుణంగా, ప్రదర్శించే ఆంగికాభినయం నృత్తం. ఈ నృత్తాన్ని తాండవమని, లాస్యమని వింగడించారు. తాండవమంటే - ఉద్ధృతమైన నృత్తం. లాస్యం - అంటే లలితమైన నృత్తం.

దండలాస్యం - అంటే నర్తకులు ఓ కర్రను పట్టుకుని, ఆ కర్రను ఇతర నర్తకుల కర్రలతో తాటిస్తూ చేసే సమూహనృత్తం. దేశీ భాషలో ఇది "కోలాటం" అయింది. కోల + ఆటము. కోల అంటే దండము. ఈ దండలాస్యాన్ని, ఆ దండము ఎలా ఉండాలి అన్న విషయాన్ని జాయపసేనాని నృత్తరత్నావళి అన్న కావ్యంలో ఇలా నిర్ధారించేడు.

పాత్రాణ్యష్టౌ సమారభ్య వర్ధంతే దండరాసకే
క్రమాత్ చత్వారి చత్వారి నాయకేచ్ఛానుసరతః |
చతుష్షష్టిర్భవేద్యావత్ యావత్సా ద్విగుణాపరైః
ఆరత్ని సమ్మితౌ దైర్ఘ్యాత్ అంగుష్టపరిణాహి నౌ |

దండౌ కనకబద్ధాంతౌ మదనాది ద్రుమోద్భవౌ

.....

దండరాసకంలో ఎనిమిదితో మొదలుపెట్టి క్రమంగా నలుగురు నలుగురు నర్తకుల పెంపుతో 64 నర్తకుల వరకూ ఉండవచ్చును. వారు రెండుజట్లుగా ఏర్పడవలె. కోలలు మూర+చిటికెనవ్రేలు పరిమాణమున ఉండదగును. కోల బొటన వ్రేలి లావున ఉండదగును. పొగడమ్రానితో చేయబడి సువర్ణపు తొడుగు కలిగి ఉండవచ్చును. రెండు చేతుల యందూ కోలలు ధరింపవలెను.

ఈ కోలాటం చాలా ప్రముఖమైన దేశీ నృత్తం. ఇది దాండియారాస్ పేరిట గుజరాత్ లో ఉంది. ఆంధ్రదేశంలో ఇది చాలా మిక్కుటంగా ఉండేది. ప్రాచీన దేవాలయ శిల్పాల్లో ఈ కోలాటం తాలూకు శిల్పాలు మిక్కుటంగా కనిపిస్తాయి.




లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయపు ద్వారతోరణంలో కోలాటం.

హంపి హజారరామస్వామి దేవాలయ ప్రాకారం.


హంపి మహర్నవమి దిబ్బ


హంపి విరూపాక్షస్వామి దేవాయలపు పైకప్పు 



మరో ప్రాచీన దేవాలయం.

తెలుగువారి సాంప్రదాయ కళల ప్రస్తావన వచ్చిన తర్వాత విడిచిపెట్టదగని అన్నమయ్యను చెప్పుకోకుండా ఎలా ఉండగలం? అన్నమయ్య కీర్తనల్లో ఒకానొక కోలాటం (దండలాస్యం) యిది.

వేడుక వసంతము వేళ నిదే
వాడలవాడలవెంట వనిత లాడేరు

కేలుఁగేలుజుట్టిపట్టి కెందామర మోములెత్తి
కోలఁగోలఁ దాఁకఁజేసి గుంపువాయక
చాలుకొని యిద్దరేసి జంటలై సతులు గూడి
వోలి వేరొకతెకోల నొడ్డుతా నాడేరు ||వేడుక||

పాలిండ్లు గడలఁగ బరువైనతురుముల
చీలుచు సోలుచుఁ గొంతవెనకకును
మేలిమిపిఱుఁదులతో మెరయుచు మురియుచు
కోలలఁబెడమరలి కోలాటమాడేరు ||వేడుక||

కది శొండురుమోములు కన్నులఁదేలించి చూచి
పదతాళగతులకు పడఁతులెల్లా
అదివో శ్రీ వేంకటేశుఁ డల మేలుమంగతోడ
ముదమంది చూడఁగాను ముందట నాడేడు ||వేడుక||


ఇంకా శ్రీనాథుడు, పాల్కురికి సోమనాథుడు ఇత్యాది అనేక తెలుగు కవులు కావ్యాల్లో ఈ కోలాటాన్ని పేర్కొన్నారు. నాచన సోమనాథుడు ఉత్తరహరివంశంలో - శౌరి పాంచజన్యం పూరించినపుడు - "ఉర్రూతలాడెడు నుదయాస్తగిరులతో ఆకాశలక్ష్మి కోలాటమాడె" నని కల్పన చేశాడు (ఉత్తరహరివంశం 4.216)

ఆధునిక కవి పుట్టపర్తి నారాయణాచార్యుడు శ్రీనివాసప్రబంధంలో - హిరణ్యకశిపుని తపస్సు భంగం చేయడానికి అచ్చరలు దేశీనృత్యం చేశారని కల్పించాడు. (అప్సరసలు కోలాటం ఆడుతుంటే పట్టించుకోక, తపస్సులో నిమగ్నమైన గొప్ప అరసికుడు - హిరణ్యకశిపుడు అన్నమాట! :) )

దేశీనృత్యరీతులలో ఒకప్పుడు తెనుగువారి పాత్ర చాలా గణనీయమైనది, గర్వకారణమైనది. అయితే ఈ సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగింపలేక, పోగొట్టుకోవడం నేటి కాలపు తెనుగువారి అసమర్థత అని చెప్పుకోక తప్పదు.

2. చల్లీ:

ఆ ఘట్టంలోని రెండవ శ్లోకంలో "చల్లీ" అనే ఓ దేశీనృత్యాన్ని ప్రస్తావించాడు కవి.

కొందరు నర్తకీమణులు రెండు వరుసలలో సాభిముఖంగా నుంచున్నారు. వారు తమ తలలను ఒకే వరుసలో చేర్చి, సరళరేఖలో భుజాలపై భుజాలను చేర్చుకుని, తాళానికనుగుణంగా లయబద్ధంగా "చల్లీ" అనే నృత్యాన్ని చేస్తున్నారు.

శ్లోకాల్లో వివరణ చూస్తే, మనకు - అరకు లోయలో గ్రామీణులు చేసే "ధింసా" డాన్సు గుర్తుకు వస్తుంది. అయితే ధింసా నృత్యంలో రెండు వరుసలు లేవు. భుజాలపై భుజాలు వేసుకోవడం, తలలన్నీ ఒకే వరుసలో ఉండడం ఉన్నది.

ఈ చల్లీ నృత్యం గురించి అభినవభారతిలో (నాట్యశాస్త్రానికి అభినవగుప్తుని వ్యాఖ్యానం) అభినవగుప్తుడు పేర్కొన్నాడు. డోంబిక అన్నది ఉపరూపకం. ఈ ఉపరూపకంలో భాగంగా "చల్లీ" అనబడే నృత్యాన్ని హుడుక్కా (ఢక్కా) మ్రోగిస్తూ నర్తిస్తారు.

"క్వచిన్ నృత్తప్రాధాన్య యథా డోంబికాప్రయోగానంతరం హుడుక్కావాద్యావసరః అత ఏవ తత్ర లోకభాషయా చల్లి (చిల్లి) మార్గ ఇతి ప్రసిద్ధిః"- అభినవభారతి.

చిల్లి లేదా చల్లి అనేది ఒక నృత్తం. ఇందులో ఒక నర్తకి డక్కా ను రమ్యంగా మ్రోగిస్తూ ఉంటే నర్తకీమణులు నర్తిస్తూ ఉంటారు. సంగీతరత్నాకరంలో, జాయపసేనాని రచించిన నృత్తరత్నావళిలో కూడా "చాలి", లేదా "చలివాదం" అన్న నృత్తాన్ని లాస్యనృత్తంలో భాగంగా ఒకానొక దేశీ - జానపద నృత్తమని పేర్కొన్నారు. లాస్యం అంటే - శృంగారరసప్రధానమైన నృత్తం. చాలి/చాలివాదం అన్నది లాస్యాంగమట. అపభ్రంశసాహిత్యంలోనూ అక్కడక్కడా చల్లి/చలి అన్న దేశీనృత్యం యొక్క ప్రస్తావన ఉంది.

అబ్దుల్ రహమాను అన్న మహమ్మదీయుడు రచించిన 12 వ శతాబ్దపు అపభ్రంశపు సాహిత్యంలో చల్లి ప్రస్తావన ఉంది.

కే ఆయిన్నిహి వంసవీణకాహలమురఉ
కహ పయవణ్ణణిబద్ధఉ సుమ్మఇ గీయరఉ |
ఆయణ్ణహి సుసమత్థ పీణ ఉణ్ణయథణియ
చల్లహి చల్ల కరంతియ కత్థ వి ణట్టణియ ||

ఛాయ:
కేऽపి వంశవీణకాహలమురజ శబ్దానాకర్ణయన్తి
కుత్రాపి ప్రాకృతవర్ణైర్వివద్దో గీతరవాః శ్రూయతే |
కుత్రాప్యాకర్షణే సమర్థాః పీనోన్నతస్థన్యః
చల్లహి చల్ల శబ్దేన భ్రమణం కుర్వన్తః || (సందేసరాసకమ్ - 45
)

కవి సామోరా (సాంబపురం) అనే నగరాన్ని వర్ణిస్తూ అందులో భాగంగా చెపుతున్నాడు. నగరంలో కొందరు వీణ, వేణువు, మద్దెల, ఢక్కా వాయిద్యాలతో సంగీతాన్ని వినిపిస్తున్నారు. కొందరు ప్రాకృతగీతాలాపన చేస్తున్నారు. కొందరు ఉన్నతమైన కుచములు కల్గిన స్త్రీలు "చల్ల హి చల్ల" అన్న శబ్దం తో వలయాలు చుడుతూ నర్తిస్తున్నారు.

క్రీ.శ 11-13 వ శతాబ్దాల మధ్య ఈ చల్లి అనే దేశవాళీ నృత్యం భారతదేశంలో ప్రముఖంగా ఉండేదని పండితుల ఉవాచ.

౩. చర్చరి:

కర్పూరమంజరిలో ఈ చల్లి నృత్యప్రస్తావనకు ముందు చర్చరీగాయనులు వచ్చారు అని చెబుతాడు విదూషకుడు కపింజలుడు. చర్చరీ అంటే గీతి అని, ఓ విధమైన దేశీ నృత్యమని, చప్పట్లు అని, ఒకానొక ఛందస్సు అని అర్థభేదాలు ఉన్నాయి. చర్చరి గురించిన ప్రస్తావనలు కువలయమాల ఇత్యాది ప్రాకృత, అపభ్రంశ సాహిత్యంలో విపులంగానే ఉన్నాయి. కాళిదాసు విక్రమోర్వశీయంలో చర్చరి గురించి వేలాంకర్ అనే పండితుడు విపులంగా వ్రాశాడు.

నృత్తరత్నావళి ప్రకారం చర్చరి అంటే -

చర్చరీ మేతదేవాహుః వర్ణతాలాంచితేన చేత్
వాద్యేన ప్రవిశేయుః తాః గాయంత్యః చర్చరీం కలమ్,
ద్విపదీం వాథ శృంగార వీరాభ్యాం ఋతువర్ణనైః
నాయకస్య గుణఖ్యాతి ప్రఖ్యాపన పదోత్తరైః
మండలేన ప్రనృత్యంతి కాంతా వాసంతికోత్సవే
.

రాసకమనే నృత్యమునందే, నాయికలు వర్ణతాళములతో కూడిన వాద్యముతో, మధురముగా చర్చరిని కాని, ద్విపదిని కానీ పాడుచూ రంగమున ప్రవేశించి, శృంగారవీరరసములతో, నాయకుని గుణములను కీర్తిని వెలువరచు పదములు కలిగిన ఋతువర్ణనములతో మండలాకారమున వసంతోత్సవమునందు నర్తించుట చర్చరి అనబడును.

చర్చరి - తెలుగున జాజర అయింది. జాజర - కాకతీయులకాలంనుండి తెలుగునాట ఉంది. రైతులు పాడుకునే పాటల్లో జాజిరి పాట ఉందని "ఆంధ్రుల సాంఘిక చరిత్ర" లో పేర్కొన్నారు. బ్రతుకమ్మ పాటకు కూడా మూలం జాజర అని అంటారాయన.

వీణాగానము వెన్నెలతేట
రాణ మీఱగా రమణుల పాట
ప్రాణమైన పిన బ్రాహ్మణ వీట
జాణలు మెత్తురు జాజఱపాట
.

ఇది ఒక చాటువు. నాచనసోమన రచనలోనిదని తదజ్ఞులు ఉదాహరించారు. అన్నమయ్య ప్రముఖ కీర్తన - "జగడపు చనవుల జాజర, సగినల మంచపు జాజర..." మనకు తెలుసు.

శ్రీనాథుని భీమేశ్వర పురాణంలో జాజర/జాదర అని అచ్చరలు చర్చరీగీతాలు పాడారని అంటాడు.

జాదర, జాద రంచు మృదుచర్చరిగీతులు వారుణీ రసా
స్వాద మదాతిరేకమునఁ జంద్రిక కాయఁగ దక్షవాటికన్
వేదుల మీదటం గనక వీణలు మీఁటుచుఁ బాడి రప్సరల్
మోద మెలర్పఁగా భువనమోహనవిగ్రహు భీమనాథునిన్. - 5.103



****^^^^****

రాజశేఖరుని వ్యక్తిత్వం


రాజశేఖరునిది క్రీ.శ. 9 వ శతాబ్దపు కాలం. ఈతడిది "యాయవార" అనే వంశం. ఈతని దండ్రి దుర్దుకుడు. పితామహుడు - అకాలజలదుడనే కవి. బ్రాహ్మణుడైన రాజశేఖరుడు - చౌహాన క్షత్రియ యువరాణి అయిన అవంతిసుందరిని పరిణయమాడాడు. అది అనులోమ వివాహం. నాటికాలానికి అది ఒక గొప్పచర్య. అవంతిసుందరి కూడా గొప్ప కవయిత్రి. 

ప్రాచీనకవులలో రాజశేఖరునిలో కొట్టొచ్చినట్టు కనబడేది కవిత్వం ద్వారా కనబడే ఆయన వ్యక్తిత్వం. ఇదే ఆయన వ్యక్తిగతజీవితానికి అన్వయిస్తుంది. ప్రాచీనకాలంలో ప్రాకృత/అపభ్రంశ వాఞ్మయాలను సాహిత్యాలుగా, మొదట భాషలుగా గుర్తించడమే గగనంగా ఉన్నప్పుడు వాటిని గుర్తించినది దండి కవి. రాజశేఖరుడు ప్రాకృతాన్ని గుర్తించడమే కాక, అందులో సట్టకాన్నే రచించాడు. సట్టకం అన్నది - కొంత బౌద్ధంచేత ప్రభావితమైనదని పైన చూచి ఉన్నాం. అటువంటి సట్టకాన్ని రాజశేఖరుడు స్వీకరించి ఆ ప్రక్రియలో రచన చేయడం - ఆయన కాలానికి గొప్ప విషయం. ప్రాకృతంలో ఎందుకు రచించాలి? అంటే అందుకు రాజశేఖరుడు కర్పూరమంజరి నాటకారంభంలో చెబుతాడు.

పరుసా సంక్కిఅబన్ధా పాఉదబంధో వి హోఇ సుఉమారో |
పురుస మహిలాణాం జేత్తిఅ మిహంతరం తేత్తిఅ మిమాణం ||

ఛాయ:
పురుషాః సంస్కృతగుంఫాః ప్రాకృతగుంఫోऽపి భవతి సుకుమారః |
పురుషమహిళానాం యావదిహంతరం తేషు తావత్ |
|

పురుష సౌందర్యం కర్కశమైనది. స్త్రీసౌందర్యం సుకుమారమైనది. సంస్కృతప్రాకృతాల మధ్య వ్యత్యాసమూ ఇటువంటిదే. ప్రాకృతం స్త్రీసౌందర్యంలో సుకుమారమనోహరమైనది. అంతే కాదు; "ఉక్తివిశేషః కావ్యం భాషా యా భవతి సా భవతు|" (కావ్యమంటే ఉక్తివిశేషం భాష ఏది అన్న మీమాంస వద్దు) అంటాడు.

సాధారణంగా పండితకవులకు కొంత అహంకారం ఉంటుంది. కొందరు కవులకు వినయమే భూషణంగా ఉంటుంది. రాజశేఖరుడు ఈ విషయంలోనూ విలక్షణమైన వ్యక్తి. ఈయన మనస్తత్వం ఆ రెండు రకాల మనస్తత్వాలకు మధ్యన ఉంటుంది.

ఈయన తనను తాను వాల్మీకి అవతారంగా చెప్పుకున్నాడు.

బభూవ వల్మీకభవః కవిః పురా తతః ప్రపేదే భువి భర్తృమేణ్ఠతామ్ |
స్థితః పునర్యో భవభూతి రేఖయా స వర్తతే సంప్రతి రాజశేఖరః ||


ఆదికవి వాల్మీకి తదనంతరం భర్తృమేంఠుడుగానూ, ఆపై భవభూతిగానూ జన్మించినాడు. ఆపై ఇప్పుడు రాజశేఖరుడైనాడు.

పైకి ఇది కొంచెం స్వోత్కర్షలా కనిపిస్తుంది. మరో కోణంలో ఇది కవి - తనపై తాను చెప్పిన హాస్యస్ఫోరకమైన ఉక్తిగా కూడా అనిపిస్తుంది. లేదా ఆత్మవిశ్వాసప్రకటన కూడా కావచ్చును. రాజశేఖరుడు సరళ హృదయుడుగానే ఆయన కవిత్వం ద్వారా కపిస్తాడు. ఆయన తన అహంకారంతో ఇతర కవులను దూషించినట్లు, ఆక్షేపించినట్లు కనబడదు. (కావ్యమీమాంసలో అటువంటివి కనిపింపవు).

రాజశేఖరకవిలో కనబడే మరొక గొప్ప విశేషం - స్త్రీలను, అబ్రాహ్మణులను కవులుగా గుర్తించిన లాక్షణికులలో ఈయన ప్రముఖుడు. కవిత్వం - భాష, లింగం, జాతి విషయాలపై ఆధారపడి ఉండదని చెప్పిన ప్రముఖుడీ కవి. ఇది ఆయన కాలానికి గొప్ప సాహసమే.

సరస్వతీ పవిత్రాణాం జాతిస్తత్ర న దేహినాం |
వ్యాసస్పర్థీ కులాలోభూత్ యద్ద్రోణో భారతే కవిః |
|

సరస్వతిచే పవిత్రమైన కవులకు జాతి అనునది లేదు. కుమ్మరి అయిన ద్రోణకవి భారతరచన విషయమున వ్యాసునితో పోటీపడెను.

రాజశేఖరకవిని ఆయన తదనంతర కాలపు కవులు ఎన్నో సందర్భాలలో గుర్తుచేసుకున్నారు. ఆలంకారికులు అనేకసందర్భాలలో ఈయన కవిత్వాన్ని ఉటంకించారు. ఈయన తనను తాను ’కవిరాజు’ గా అభివర్ణించుకున్నాడు. కావ్యమీమాంసలో ’కవిరాజు’ - రకరకాల కవులలో ఒకానొక విధమైన కవి.

ఈ కవి గురించి సమగ్రంగా చెప్పటం ఇక్కడ వీలుపడదు. కొంతమేరకు ఇలా. కర్పూరమంజరి కావ్యాన్ని ఈయన తన భార్య - అవంతిసుందరి ప్రోద్బలంపై రచించానని చెప్పుకున్నాడు.



****^^^^****



ముగింపు


కర్పూరమంజరి - ఇది ఒక నాటిక. అంటే లఘునాటకం.ఈ నాటిక కథ, నాటక సంవిధానాల పరంగానూ, పరిమాణంలోనూ మృచ్ఛకటికమ్, ముద్రారాక్షసం వంటి నాటకాలలాగా విస్తృతమైనది కాకపోవచ్చు కానీ, సంగీతనృత్యప్రధానమైనది. మనం నేడు సంస్కృతనాటకాల గురించి చదువుకుని తెలుసుకుంటున్నాం.ఒకప్పుడు ఇవి రంగస్థలంపై ప్రయోగింపబడేవి. సట్టకంలో సంగీతము, నృత్యము - ప్రధానమైనవి కాబట్టి - సట్టకాన్ని తెరపై చూచినప్పుడు కలిగే అనుభూతి, చదివినప్పుడు కలుగదు. ఆ కారణం చేత మనకు ఈ నాటిక యొక్క సమగ్రమైన విలువ తెలియదు. అయితే దాదాపు 1200 యేళ్ళ క్రితం మన పూర్వీకుల యొక్క ఆలోచనలు, ఆనందాలు, కళలు ఇతరత్రా అనేకమైన విషయాలను ఈ నాటిక ద్వారా కొంత వరకూ తెలుసుకోవచ్చు. 


ఈ నాటికలో గుణాలే కాదు దోషాలను కొంత ప్రస్తావించుకోవాలి.

కావ్యప్రకాశంలో మమ్మటభట్టారకుడు కర్పూరమంజరిలోని ఈ క్రింది శ్లోకాన్ని గురించి వ్యాఖ్యానించాడు.

చిత్తే చిహుట్ఠఇ ణ ఖుట్ఠఇ సా గుణేసుం
సేజ్జాసు లోట్ఠఇ విసప్పఇ దిమ్ముహేసుం |
బోలమ్మి బట్టఇ పవట్టఇ కవ్వబంధే
జాణేణ తుట్ఠది చిరం తరుణీ చలాక్ఖీ ||

ఛాయ:
చిత్తే తిష్ఠతి న క్షీయతే సా గుణేషు
శయ్యాయాం లుఠతి విసర్పతి దిగ్ ముఖేషు |
వచనే వర్తతే ప్రవర్తతే కావ్యబంధే
ధ్యానేన త్ర్యుట్యతి చిరం తరుణీ చలాక్షీ |
|

బాగా చలాకీగా ఉన్న ఆ అమ్మాయి (కర్పూరమంజరి) పదేపదే గుర్తుకొస్తున్నది. గుణవంతురాలైన ఆ యువతి నన్ను నిదురపోనివ్వటం లేదు. అన్ని దిక్కులలో ఆమెయే కనిపిస్తున్నది. నా మాటల్లోను, కవిత్వంలోనూ కూడా ఆ స్త్రీయే చోటు చేసుకుంటున్నది. విరహబాధ పెడుతున్నది.

ఈ శ్లోకంలో విరహశృంగారం చక్కగా పోషించినా ట్ట కారం పలుమార్లు ప్రయోగించినందున రసవిరోధి అయింది అని, శబ్దం, శబ్ద స్వారస్యం విప్రలంభ శృంగారానికి అనుకూలంగా లేదని అంటాడు మమ్మటుడు.

అది అలంకారపరంగా, కవిత్వవిమర్శ. ఈ నాటికలో ప్రేక్షకుని పరంగా కూడా ఒకటి రెండు దోషాలు కనిపిస్తాయి. ఉదాహరణకు: భైరవానందుడు విదర్భయువరాణి కర్పూరమంజరిని సభలోకి ఆకాశం నుండి జాలువారేలా చేస్తాడు.ఆ సమయంలో - కవి ఆమెను ఏకవస్త్రగా, స్నానం చేస్తున్న సందర్భాన ఉన్న పళాన ఆమె అంతఃపురం నుంచి అదృశ్యం చేసి తీసుకువచ్చినట్టు కల్పించాడు. ఇది కొంచెం ఎబ్బెట్టుగా ఉంది. ఇందులో శృంగారం సున్నితంగా లేదనిపిస్తుంది.

భైరవానందుని పాత్ర కూడా కథలో లీనమైనట్టు కనబడదు.ఆతను కొన్ని ఘట్టాలలో వచ్చి, తన పాత్ర పరిధిమేరకు కార్యాలు చేసి పోతున్నట్టు అనిపిస్తుంది. 

ఏది ఏమైనా, ఈ సట్టకం 1200 యేళ్ళ క్రిందటిదని మనం గుర్తుపెట్టుకోవాలి. వేల యేళ్ళ క్రితం మన పూర్వీకుల అనుభూతులకు, ఆనందాలకు, ఆలోచనలకు, కళాభివ్యక్తికి - ఈ నాటిక ఓ చిన్న నిదర్శనం.ఆనాటి తరం సంస్కారాన్ని నేడు మనం చదువుకోవడంలో ఆనందం ప్రత్యేకమైనది కాదూ?

****^^^^****

References:


కర్పూరమంజరి - మకరంద వ్యాఖ్య - రామకుమార్ ఆచార్య - చౌఖాంబాప్రకాశన్

కర్పూరమంజరి - కావ్యమాలా సిరీస్ - Commentary by Vasudeva

కర్పూరమంజరి - Sten Konow

కర్పూరమంజరి - Dr. Manmohan Ghosh (Foreword)

కావ్యప్రకాశం - బాలానందినీ వ్యాఖ్య - పుల్లెల రామచంద్రుడు

కావ్యమీమాంసా - బాలానందినీ వ్యాఖ్య - పుల్లెల రామచంద్రుడు

ప్రాకృతభాషావాఙ్మయచరిత్ర - పుల్లెల రామచంద్రుడు

పుల్లెల వారి వ్యాసమంజరి - పుల్లెల రామచంద్రుడు

Indological studies : HC Bhayani

నాట్యశాస్త్రం - పోణంగి రామ అప్పారావు

అభినవభారతి - మానవల్లి రామకృష్ణకవి

ఆంధ్రదశరూపకం - మల్లాది సూర్యనారాయణశాస్త్రి

దశరూపకం - చౌఖాంబా ప్రకాశన్

ఆంధ్రుల సాంఘిక చరిత్ర - సురవరం ప్రతాపరెడ్డి.

sandesa Rasaka - sindhi Jain Series. (Abdul Rahman )

జాయపసేనాని నృత్తరత్నావళి - రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ

Sanskrit Drama its Aesthetics and Production - Raghavan V.

Bhoja SrngaraPrakaSa - Foreword by Raghavan V.

Kalidasa - Raghavan V

స్వారోచిషమనుసంభవమ్ - అల్లసానిపెద్దన - వావిళ్ళవారి ప్రతి. శేషాద్రి రమణకవుల వ్యాఖ్యానం.

ఉత్తర హరివంశం నాచనసోమనాథుడు - వావిళ్ళ వారి ప్రతి.

శివతాండవము - పుట్టపర్తి నారాయణాచార్యులు.

శ్రీనివాసప్రబంధం - పుట్టపర్తి నారాయణాచార్యులు.

బృహదారణ్యకమ్ వ్యాసావళి - తిరుమల రామచంద్ర

విక్రమోర్వశీయమ్ - HD వేలంకర్.

****^^^^****



శుభమ్.




14, ఆగస్టు 2018, మంగళవారం

సేతుబంధం

సేతుబంధం - ఇది ఒక మహారాష్ట్రీ ప్రాకృత కావ్యం.  సంస్కృతేతర భాషల్లో వాల్మీకి రామాయణం మీద ఆధారితమైన మొట్టమొదటి రచన. ఈ కావ్యాన్ని రచించిన కవి వాకాటక రాజైన రెండవ ప్రవరసేనుడు. దీనికే దశముఖవధమ్ (దహముహవధో) అని పేరు. రామాయణంలో యుద్ధకాండలో రాముడు వానరసేనతో సముద్రతీరానికి చేరి, వారధి నిర్మించడం మొదలు, రావణుని నిర్జించటం వరకూ సాగిన కావ్యం యిది. పదిహేను సర్గల కావ్యం. వాల్మీకి రామాయణం మీద ఆధారపడినప్పటికీ, అద్భుతమైన ప్రాకృతిక వర్ణనలకు, నాయకత్వపు లక్షణాల వివరణకూ, భయాందోళనలు నెలకొన్నప్పుడు జీవుల స్వభావం గురించిన వివరణకూ, అద్భుత పాత్రచిత్రణలకూ, ఇంకా అనేకానేక విషయాలకూ ఈ కావ్యం ప్రసిద్ధి. ఈ కావ్యం గురించిన సమగ్ర అనుశీలనమే ఈ వ్యాసం.  

ఉపోద్ఘాతం:

పొద్దు పొడుస్తోంది. మనోహరమైన నీలాకాశం. దిక్చక్రము వెలుగులతో ప్రకాశిస్తోంది. భావుకుడైన ఒక ప్రాకృతకవి ఉదయాన శుభకరుడూ, సర్వభూతక్షేమంకరుడునూ అయిన శివుని దర్శించి ప్రార్థిస్తూన్నాడు.  

1)
ణమహ అ జస్స ఫుడరవం కణ్ఠచ్ఛాఆ ఘడన్త ణఅణగ్గిసిహమ్ |
ఫురఇ ఫురిఅట్టహాసం ఉద్ధపడిత్తతిమిరం విఅ దిసాఅక్కమ్ ||
సంస్కృతఛాయ:
నమత చ యస్య స్ఫుటరవం కణ్ఠచ్ఛాయాఘటమాన నయనాగ్నిశిఖమ్ |
స్ఫురతి స్ఫురితాట్టహాసమూర్ధప్రదీప్త తిమిరమివ దిక్చక్రమ్ ||

ఎవని నయనాగ్ని శిఖలు, కంఠపు నీలి కాంతి కలిసి ప్రకాశిస్తున్నవో,
ఎవని అట్టహాసముచేత శిరమున దగ్ధమైన చీకటి కలదో,
ఆ అట్టహాసముతో రగిలిన నిప్పు రవ్వలు కలవో,
ఎవని అట్టహాసము దిక్చక్రమును స్ఫురింపజేస్తోందో అట్టి శివునకు జోత.

వినూత్నమైన భావన యిది. ఎదుట కనిపిస్తోన్న ఆకాశాన్ని, దిక్చక్రాన్ని ఒక దేవతామూర్తియొక్క విలాసములతో ఉత్ప్రేక్షిస్తున్నాడు. కానీ, ఆ మూర్తి విలాసాలతో ప్రతీయమానమయ్యే వస్తువు  అనంతంగా, అత్యంత సుందరంగా ఉంది. శివుని కంఠచ్ఛాయ నీలిరంగు. ఆ నీలము దిగంతాలలో (ఆకాశ రూపంలో) వ్యాపించింది. అంటే శివుడు నటరాజమూర్తిగా ఆనందతాండవము చేస్తున్నాడని, (మండల) నృత్యములో వేగముగ భ్రమిస్తున్న కారణాన ఆ మహేశ్వరుని కంఠవర్ణమైన నీలము సర్వదిశావ్యాప్తమై నీలాంబరమైనదనీ స్ఫురింపజేస్తున్నాడు కవి. ఈశ్వరుని తలపై తిమిరము దగ్ధమై - మహేశ్వరుడు భాస్కరుడై భాసించడం మరొక చమత్కారం. 

’శివేతర క్షతము’ - అంటే అమంగళ వినాశము. అందు కొఱకై శివుని ప్రార్థించిన ప్రాకృతకావ్యశ్లోకమిది. (ఎవరైనా ఓ కావ్యాన్ని ఎందుకోసం వ్రాస్తారు? అంటే యశస్సు కోసం, డబ్బు కోసం, శివేతర క్షతం కోసమూ అని మమ్మటభట్టు అనే లక్షణకారుడంటాడు.)        

అనంతమై, అపరిమితమైన వస్తువును మూర్తిమంతమై పరిమితమైన వస్తువుతో ఉత్ప్రేక్షించడం, నిశ్చలమైన, నిర్జీవమైన వస్తువునకు జీవంతమైన వస్తువుతో సమన్వయించడం, ఒక్క శ్లోకంలో ఒక గాథను యిముడ్చడం, సౌందర్యనిధిని పోలిన వస్తువునకు సామాన్యవస్తువుతో నుపమించి ఒప్పించడం, సూక్ష్మమైన వస్తుశకలమును దిగంతరముల వ్యాపించిన  మహోన్నతవస్తువుతో కల్పించడం, గంభీరమైన, నిగూఢమైన భావములు (Abstract ideas), నిశితదృష్టి,  ఆధునికత, స్వతంత్రమైన భావనాబలం, దానికి తగినట్టి పరికల్పన, ఊహను కట్టెదుట నిలుపగల కవనచాతుర్యము, అడుగడుగుననూ రసపరిపోషణ, అనాయాసమైన భాష, సునాయాసమైన  ఛందస్సు - ఇవన్నీ ప్రాకృతకవిత్వలక్షణాలు.

పొద్దు పొడుపు చూశాం కదా; పొద్దు మునగటం ఇలా ఉంది.

2) 
దీసఇ విద్దుమఅంబం సిందూరారుణగడందకుంభచ్ఛాఅం |
మందరధాఉకలంకిఅ వాసుఇమండలణివకలం రవిబింబమ్ ||
ఛాయ:
దృశ్యతే విద్రుమతామ్రం సిన్దూరారుణగజేన్ద్రకుమ్భచ్ఛాయం |
మన్దరధాతుకలఙ్కితవాసుకిమణ్డలవర్తులం రవిబిమ్బమ్ ||

పడమర దిక్కున ఆకాశాన అస్తమిస్తోన్న రవిబింబం పగడము వలె ఎఱ్ఱగా ప్రకాశిస్తోంది. సిందూరము దాల్చిన గజేంద్రుని గండస్థలం లా కనిపిస్తోంది. మందరపర్వతమును రాపాడి, ఆ పర్వతపు ధాతువులవలన ఎర్రబారిన వాసుకి,  వలయముగా చుట్టి ఉందా యన్నట్టు ఆ సూర్యబింబం కనిపిస్తోంది.

రవిబింబము పగడమువలె కనిపించడం - సాధారణంగా సంస్కృతకవుల వర్ణనాసామాగ్రి లోనిదే. పెద్ద విశేషము కాకపోవచ్చు. ఏనుఁగు కుంభమునలంకరించిన నాగసంభవ ద్రవ్యవిశేషమైన సిన్దూరము కూడా విడ్డూరము కాదు. ఉదా: సంస్కృతకవి భారవి కిరాతార్జునీయంలో దేవగజములను "సిన్దూరైః కృతరుచయః..." (కి. 7-8) అని వర్ణించినాడు. అయితే అసలైన విశేషము ఆ తర్వాతి సమాసము ’మన్దరధాఉకలఙ్కిఅవాసుఇమన్డలనిఅక్కలం’ (మన్దరధాతుకలఙ్కితవాసుకిమండలనిశ్చక్రలం) లో ఉంది. 

మన్దరధాతుకలఙ్కితవాసుకిమండలనిశ్చక్రలం - 
మన్దర = మందరపర్వతము యొక్క
ధాతు = మూలికల చేత
కలంకిత = మలినమైన
వాసుకి మండల = వాసుకి అను దేవనాగముచేత వలయముగా
నిశ్చక్రిలం = చుట్టుకొనబడినది.

సర్పరాజు వాసుకిని కవ్వముగా, మందరపర్వతాన్ని ఊతముగా పెట్టి పాలకడలిని చిలికిన పురాణకథ నిచ్చట అన్వయించుకోవాలి. ’నిఅక్కలం’ అన్న ప్రయోగంలో యున్నది ఆసక్తికరమైన, బలీయమైన భావనాబలం మొత్తమున్నూ. పగడము లా ఉన్న రవిబింబాన్ని ఎర్రటిచర్మము గల వాసుకి సర్పం వలయముగా చుట్టుకొందట! వాసుకి చర్మమెందుకు ఎఱ్ఱబారిందీ? - మందరపర్వతానికి కవ్వముగా ’డ్యూటీ’ చేసింది కనుక. ఆ పనిలో భాగంగా గైరికాది ధాతువులను రాచుకుని వాసుకి చర్మము ఎఱ్ఱ బారింది. 

ఏనుగు తిలకపు ఉపమతో రవిబింబాన్ని తీర్చిన కవి, మరొక ఘట్టంలో ఏనుగు పదచిహ్నములో విలీనమైన శశిబింబమును ఎలా ఉత్ప్రేక్షించినాడో గమనిద్దామా?

3)
తావ అ అత్థణిఅమ్వం ణవసలిలాఉణ్ణగఅపఅచ్ఛవికలుసో|
పత్తో అరుణుణ్ణామిఅపాసల్లన్తగఅణోసరన్తో వ్వ ససీ ||
ఛాయ:
తావచ్చాస్తనితమ్బం నవసలిలాపూర్ణగజపదచ్ఛవికలుషః |
ప్రాప్తో అరుణోన్నమిత పార్శ్వాయమానగగనాపసరన్నివ శశీ ||

చంద్రుడు పశ్చిమాద్రిని క్రుంగిపోతున్నాడు. ఒక చిన్న కొత్తనీటి కుంటపై యేనుగు కాలు మోపితే ఏర్పడిన గుండ్రని ముద్రలాగా ఉన్నాడు చంద్రుడు. తూర్పున ఉద్గమించే రవి కిరణపు అరుణరేఖలు చంద్రుణ్ణి దూరంగా పశ్చిమము వైపుకు తళ్ళివేసినై.

అడుసులో ఏర్పడిన ఏనుగుకాలిముద్ర లా చంద్రుడు! ఇది Typical ప్రాకృతకవిత్వ ముద్ర. ఇది విలక్షణము, విచిత్రము, అసాధారణము కూడా. ఈ ముద్ర స్వతంత్రము, ఎక్కడో మూల ఆదికవి వాల్మీకి ప్రేరణ ఉన్నట్టు తోస్తుంది. 

సంధ్యారాగోత్థితైస్తామ్రై రన్తేష్వధికపాణ్డరైః |
స్నిగ్ధైరభ్రపటచ్ఛేదైః బద్ధవ్రణమివాంబరమ్ || (వాల్మీకిరామాయణము, కిష్కింధాకాండ. 28.5)

వర్షము వెలసిన పిదప కొద్దిపాటి జలములతో తెల్లగా ఉన్న మేఘములతో కూడిన యంబరము సంధ్యారాగాంచితమై - శరీరభాగంపై ఏర్పడిన పుండుకు, తెల్లని వస్త్రంతో కట్టిన కట్టులాగా నడుమన నెఱ్ఱగా. చివరల లేతరంగులోనూ ఉన్నది. మేఘము ’పుండు’ లా ఉంది అనడం - ఇక్కడ కనిపించే అసాధారణత్వము, విలక్షణత్వమున్నూ.  

సంస్కృతప్రబంధసాహిత్యంలో యిలాంటివి అరుదు.  తెలుగులో ఆముక్తమాల్యదకారుడి ధోరణి ఇల్లానే ఉంటుంది. నంది తిమ్మనకవి ఓ చోట అస్తమిస్తున్న రజనీధవుని "బాగా యెండకు కాలిన కామధేనువు పేడముక్క" గా ఊహించి, ఆ భావాన్ని సంస్కృతీకరించి "చరమాద్రి దావాగ్ని సంప్లుష్ట సురసౌరభేయీ కరీషైకపిండ" మని పారిజాతాపహరణంలో అందంగా తిట్టాడు.     

సేతుబంధంలో ఇంకొన్ని వర్ణనలు

పై వర్ణనలతో బాటు - అంబరాన్ని ఆర్ణవంగా, అంబరాన చుక్కలను సముద్రగర్బంలో పగిలి పైకి తేలిన ముత్యముల రాశితోనూ కవి ఉత్ప్రేక్షిస్తాడు. ఒక్క ముత్యము ఏర్పడాలంటేనే అపురూపమైన స్వాతిచినుకొక్కటి అవసరమౌతుంది. చుక్కలన్నీ ముత్యాలు కావాలంటే? ఆకాశమనే సముద్రగర్భంలో ఏదో ఒక్క విపరీతఘటన జరిగి, ముత్యపు చిప్పలు విచ్ఛిన్నమయినాయని ఊహించడం అసాధారణమైన,  అసంబద్ధమైన ఊహ. An Absurd/Weird & Wild thought.  

మిన్ను - ఓ పెద్ద తామరపువ్వులా వలె ఉందని మరొక శ్లోకంలో ఊహిస్తాడు కవి. ఇంకో శ్లోకంలో - దినమణి అయిన సూర్యుని కిరణాలతో వెలిగిపోతూ, శరత్కాలంలో యేర్పడిన ఇంద్రధనువు -  ఘనలక్ష్మి నడుము నుంచి జారిపడిన వడ్డాణంలా ఉందంటాడు! ఆకాశమనే  మందారపువ్వు తాలూకు పుప్పొడి లా ఇంద్రచాపం ఉందంటాడు! 

వర్షాకాలం దాటిపోయింది. రాచకార్యాల వాళ్ళు, రాజుల దండయాత్రలలో పాల్గొనే జనసామాన్యము శీతకాలం ఆరంభంలో ప్రయాణం మొదలువెట్టటం ఆనవాయితీ. యుద్ధాలకు బయలుదేరే సైనికుల భార్యలకు విరహం. ఈ సందర్భంలో ఇంద్రచాపాన్ని శృంగారచిహ్నంగా మార్చి, ’దిశాకన్య పయోధరాలపైన యంతరిక్షము చిత్రించిన గోటినొక్కు లా హరివిల్లు’ న్నదని కవి వర్ణిస్తాడు. 

అదే శరత్కాలంలోనే - 
4)
ధుఅమేహమహుఅరాఓ ఘణసమఆఅడ్డిఓ ణ అవిముక్కాఓ |
ణ హపాఅవసాహాఓ ణి అఅట్టాణాం వ పడితాఆఓ దిసాఓ ||
ఛాయ:
ధుతమేఘమధుకరాః ఘనసమయాకృష్టావనతముక్తాః |
నభః పాదపశాఖాః నిజకస్థానమివ ప్రతిగతా దిశః ||

ఆకాశమొక చెట్టు. ఆ చెట్టు కొమ్మలు - దిశలు. వర్షాకాలము అన్న కాలపురుషుడు ఆ కొమ్మలను వంచినాడు. అప్పుడు తుమ్మెదలు అనే మేఘాలు ఒక్కచోటున చేరినై. (చేరి భూమ్మీద వర్షం కురిపించినై. ఆపై వర్షాకాలం తీరి శీతాకాలం రాగానే) కాలపురుషుడి పట్టు వీడింది. మేఘాలు ఎగిరిపోయి, తిరిగి యథాస్థానములను పొందినై. 

ఈ శ్లోకంలో కవి చెప్పింది కొంత. ఊహించుకోవలసింది బోల్డంత. ధవళమేఘతతి తుమ్మెదలబారు. వర్షాకాలమునకు ముందు తుమ్మెదలు దిశలు అనే కొమ్మలపైన అనేకమైన తేనెపట్టులను పెట్టినై. ఆ తేనెపట్టులే నల్లనిమేఘాలు. ఆ తేనెపట్టులను కాలపురుషుడు భూమికి సమాంతరంగా క్రిందకు వంచి, విదల్చి ప్రాణికోటి కోసం (మకరంద) వర్షమును కురిపించినాడు. ఆపై ఆతడు శరత్కాలంలో కొమ్మను వదిలివేయగానే తుమ్మెదలు తమ నిజస్థానములకు చేరినాయి. ఇదంతా పాఠకుడు తనకు తాను ఊహించువాల్సి ఉంది. ఇక్కడ పాఠకుణ్ణి కూడా కవిగా మార్చాడు కవి!

మనం ఎలా ఉన్నామంటే, ఆఫీసులలో ఊడిగం చేసుకుంటూ, ఆకాశంలో చుక్కలనూ, చంద్రుణ్ణీ, ఇంద్రధనుస్సునూ చూసే అవసరం లేకుండా, వాటికోసం కూడా ఏ "ఆండ్రాయిడు ఆప్స్" లాంటివో పెట్టుకుని కూర్చుని ఉన్నాము. ఆకాశంలో చుక్కలు కాదు కదా,  కాలుష్యంతోటి చంద్రుడే కనబడ్డం పెద్ద సంగతిగా మారింది.ఇట్లాంటి కాలంలో అమోఘమైన కవిత్వంలో భావనాశక్తిని చదివి, భావించి, ఊహించి, అన్వయించుకుని, అందుకుని, ఆస్వాదించి అనుభూతించడానికి  పరిశ్రమించే స్థితికి వచ్చి ఉన్నాము. 

పైని శ్లోకంలో మరో విశిష్టత ఉంది.ఓ వర్ణన లానే కాక ఈ శ్లోకము ఒక ప్రత్యేకమైన ’కథ’ను చెబుతోంది. ప్రాకృత కవనలక్షణమిది. దీనికి గాథాసప్తశతి అంతా ఉదాహరణే. ఈ లక్షణము వలననే ఆలంకారికులు ప్రాకృతగాథలను చాలా సందర్భాలలో ఆలంకారిక గ్రంథాల్లో ఉదాహరణంగా స్వీకరించినారు. కాళిదాసాది సంస్కృతకవులు ఈ గాథలను అనుసరించటం ఉంది.

వివరమైన గాథకే కాక, నిశితమైన పరిశీలనా ప్రాకృతంలో కద్దు. శరచ్చంద్రోద్భవ వర్ణనను వివరంగా చూద్దామా?

5)
పజ్జత్తసలిలదోఏ దూరాలోక్కన్తణిమ్మలే గఅణఅలే |
అచ్చాసణ్ణం వ ఠిఅం విముక్కపరభాఅపాఅడం ససిబిమ్బమ్ ||
ఛాయ:
పర్యాప్తసలిలధోతే దూరాలోక్యమాననిర్మలే గగనతలే |
అత్యాసన్నమివ స్థితం విముక్తపరభాగప్రకటం శశిబింబమ్ ||

వర్షాకాలము నింగిని పూర్తిగా కడిగివేసి, నిర్మలంగా మార్చింది. ఆపైని సుదూరపర్యంతము గగనాన, విస్పష్టముగ గోచరమయ్యే శరచ్చంద్రబింబము - గగనతలము నుండి ముందుకు వచ్చి, కనులకు దగ్గరగా కన్పట్టుచున్నది. (Projection effect)

ముదురునీలపు రంగు ’శీతలవర్ణ’జాలానికి చెందిన రంగు. (Cool Color). లోతైన ఆలోచనలకూ, భావజాలానికి ముదురునీలపు రంగు ప్రతీక. ముదురు నీలి/నీలి/నలుపు వర్ణపు తలముపై తెలుపు రంగుతో కూర్చిన అక్షరజాలాన్ని/బొమ్మను జాగ్రత్తగా గమనిస్తే, ఆ అక్షరములు/బొమ్మ కలిగిన ధవళతలము ముందుకు వచ్చినట్టు, అంటే వెనుకటి నీలి తలంపై నుండి "ప్రొజెక్ట్" చేసినట్టు అనిపిస్తుంది. ఈ రంగులసమన్వయము (Combination)  కంటికి అనాయాసాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. ఈ నిశితపరిశీలనల అధ్యయనఫలితములను నేడు ’వర్చ్యువల్ రియాలిటీ సిమ్యులేటర్’ లలోనూ, ’వెండింగ్ మిషన్’, ఇతర ’టచ్ స్క్రీన్ ఇంటర్ఫేసెస్’ ల తెరల రూపకల్పనలోనూ ఉపయోగిస్తున్నారు. 

ప్రత్యక్ష ఉదాహరణలు:

సిటీ బేంక్, HDFC, తదితర బేంకుల ATM తెరలు.
గూగుల్ సెర్చ్ తెరపై పైని ఎడమవైపు మూలన Signin చిహ్నము,
Facebook తెరపై అనేక బొత్తాములు,
Microsoft తెరపట్టులు వగైరా.  

ఏ శాస్త్రమైనా ఏదో ఒక సునిశితమైన పరిశీలన మూలకంగా ఆరంభవుతుంది. ఈ నేపథ్యంలో వేలయేళ్ళక్రితం నాటి ఆ సునిశితకల్పన ’లోతు’ను సహృదయులు గుర్తించగలరు.    

దృష్టిని దిగంతాలకు సారించే అనూహ్యమైన కల్పనలనే కాక ప్రాకృతకవి సూక్ష్మమైన పరిశీలనలను కూడా చూపుతాడు.

6)
మఅరన్దగరుఅవఖ్కం పాసోఅల్లంత వణలఆవిచ్ఛూఢమ్ |
ణ ముఅఇ కుసుమగ్గోచ్ఛం ఆసాఇఅమహురసం పి మహుఅరమిహుణమ్ ||
ఛాయ:
మకరన్దగురుకపక్షం పార్శ్వాయమానవనలతావిక్షిప్తమ్ |
న ముఙ్చతి కుసుమగుచ్ఛమాస్వాదిత మధురసమపి మధుకరమిథునమ్ ||

కపిసేన సేతువు నిర్మాణము కొఱకు పర్వతములను పెళ్ళగిస్తున్నారు. కొండరాళ్ళు, చెట్లూ అల్లల్లాడిపోతున్నై. ఆ కొండల మధ్యన ఒక పూలగుచ్ఛం ఉందట. ఆ పూలపైని మకరందం కోసం ఓ తుమ్మెదజంట వచ్చి వ్రాలింది. ఆ జంట తనివితీరా మధువును గ్రోలినది. ఆ సమయంలో సరిగ్గా కొండ పెకలింపబడింది. దానితోబాటు పూలగుబురూ కూడా. దానితోబాటు ఆ పైని అడవి తీవె. అంత కోలాహలము జరుగుతున్నా, భ్రమరమిథునం పూలపై జారిన దట్టమైన మకరందానికి రెక్కలు అంటుకున్న కారణమున అచ్చోటి నుండి కదలలేక పోయింది!

ఉత్కంఠగా కథను నిర్వహిస్తూ, కాస్త యెడంగా వచ్చి చేసిన కల్పన ఇది. కథాక్రమాన్ని చెరుపకుండా, కథలో అంతర్భాగంగా కథకు చెందని విషయాన్ని చెప్పడం అన్న మాట. మకరందానికి రెక్కలు అంటుకుని ఎగురలేకపోయిన మధుకరమిథునము కళ్ళల్లో మెదలటమే కాక, కొండరాళ్ళు పెకలిస్తున్న నేపథ్యంలో భ్రమరముల జంట పాఠకుని మదిలో ఒక చిత్రమైన, సున్నితమైన ’అనుకంప’ను రేకెత్తిస్తోంది. 

కావ్యపరిచయము

ప్రవరసేనుడు కాళిదాసుకాలమునకు దగ్గరివాడని కొందరు చారిత్రకుల ఊహ. కొందరు కాళిదేసే ప్రవరసేనుడంటారు. అది విపరీతమైన ఊహ. ఈ కవులిద్దరి శైలిలో భేదమే ఇందుకు ఋజువు. ప్రవరసేనుడు రచించిన గాథలు కొన్ని గాథాసప్తశతిలో ఉన్నై. 

కావ్యమంటే కేవలము వర్ణనలేనా? కాదు. కావ్యము అంటే ఇతివృత్తనిర్వహణము, ఔచిత్యవంతమైన పాత్రలకూర్పు. రసప్రవిష్టమైన సన్నివేశముల తీర్పు. ఈ విషయపోషకములైన గుణములను, ఇతర అలంకారములను, శైలిని, శయ్యను, నిర్వహించడం. వీటన్నిటి సమాహారం కావ్యం. ఇంతమాత్రమే కాదు. ఈ నిర్వహణ కావ్యము మొత్తమంతటా కనిపించాలి. ఇది ఎంతటి కవికైననూ దుష్కరం. ఈ విషయమునే సేతుబంధకవి కావ్యారంభమున సవినయముగ మనవి చేసి కావ్యము నారంభించినాడు.

బంధము - అనగా కూర్పు. సేతుబంధమనగా, సేతువు నిర్మాణము, లేదా సేతువు కూర్పు. మరియొక విధమున ’సేతువు’ అనే కావ్యపు కూర్పు. కావ్యపరిభాషలో ’బంధము’ అంటే  మరో అర్థమున్నది. కుంతకుడను ఆలంకారికుని నిర్వచనమిట్లా ఉంది.

వాచ్యవాచక సౌభాగ్య లావణ్య పరిపోషకః |
వ్యాపారశాలీ వాక్యస్య విన్యాసో బన్ధ ఉచ్యతే ||(వక్రోక్తి జీవితము - 1.22)

శబ్దార్థముల సౌభాగ్య, లావణ్యములను పుష్టినొందించు వాక్యము యొక్క విన్యాసము "బంధ"మని చెప్పబడుచున్నది. 

శబ్దము, అర్థము - ఈ రెంటిని అలంకారములతో, రమణీయముగ నిర్వహించి వాక్యమును కూర్చటాన్ని బంధము అంటారు. ఈ ’బంధ’ నిర్వహణమును నవనవోన్మేషముగా నిర్వహించటాన్ని ’బంధచ్ఛాయ’ అంటారు. అది యెంత దుష్కరమో కవి చెబుతాడు. 

7)
ఇచ్ఛాఇ వ ధణరిద్ధీ జోవ్వణలద్ధ వ్వ ఆహిఆఈఅ సిరీ |
దుక్ఖం సంభావిజ్జఇ బంధచ్చాఆఇ అఇణవా అత్థగఈ ||
ఛాయ:
ఇచ్ఛయేవ ధనవృద్ధిః యౌవనలబ్ధేవాభిజాత్యా శ్రీః |
దుఃఖం సంభావ్యతే అభినవార్థచ్ఛాయార్థగతిః ||

ఇచ్ఛచేత ఏర్పడిన ధనము వలే, యౌవనమున ఒకనికి తలయొగ్గక, అభిజాత్యము చెడక సంపాదించిన ధనము లాగా, "బంధచ్ఛాయ" యందు అభినవమైన అర్థమును సాధించుట దుష్కరము.

విచిత్రమేమంటే, ఇంత అద్భుతముగా, ఇంత ఆర్ద్రముగా, ఇంత ఆధునికముగా, ఇంత నవనవోన్మేషముగా, "బంధచ్ఛాయ" దుష్కరత్వమును అభినవముగా నిర్వచించిన కవి మనకు కానరాడు. అంతే కాకుండా, ఇంత దుష్కర కార్యమైన అభినవార్థసహితబంధచ్ఛాయను సేతుబంధకవి ఈ శ్లోకము లోనే గాక దాదాపు కావ్యమంతటా సుకరముగానే నిర్వహించినాడు. కావ్యారంభమున వినయమును, స్వాతిశయమును, సమర్థతను, ప్రకటించిన కవులు గలరు.  ప్రవరసేనకవి పైని శ్లోకముచేత వినయమును, విస్మయమును, విచికిత్సను ఏకకాలమున ప్రకటించినాడు. ఈ భావము దక్షిణసముద్రపు కొసన నిల్చి సముద్రతరణమునకై యేమి చేయవలెనని మథనపడు కపిసేన మానసిక యవస్థను ఛాయామాత్రముగ చూపుట ఒక చమత్కారము. 

సేతుబంధము కావ్యభాష మహారాష్ట్రి ప్రాకృతము అని దండి ఆచార్యుడు పేర్కొన్నాడు.

మహారాష్ట్రాశ్రయం భాషాం ప్రకృష్టం ప్రాకృతం విదుః |
సాగరః సూక్తిరత్నానాం సేతుబన్ధాది యన్మయమ్ || (కావ్యాదర్శము - 1.34)

ఏ ప్రాకృత భాషలో రచించిన సూక్తిరత్నములకు సాగరములైన సేతుబన్ధాది కావ్యములు కలవో, అట్టి ప్రాకృతమును ఉత్తమమైన మహారాష్ట్ర ప్రాకృతమని చెప్పుదురు.
  
ఆచార్యుడు చెప్పినట్టు - సేతుబంధము సూక్తిరత్నములకు సాగరము. ఈ కావ్యమున సూక్తులు పనిగట్టుకుని చెప్పిన సూక్తులుగా కాక, సందర్భవశమున చెప్పినట్టు, కథాంతర్భాగములుగా తెలియటం విశేషము. 

కావ్యఘట్టములు

కపిసైన్యము దక్షిణసముద్రమును చేరింది. అచ్చట బడబానలమును గర్భమున ధరించి, కల్లోలతరంగిత క్షుభితమై, మహావిశాలమైన సముద్రమును జూచి కపిసేన తల్లడిల్లిపోయింది. ఇది వాల్మీకి రామాయణము యుద్ధకాండలో లేదు, కానీ వాల్మీకి కిష్కింధాకాండమందు ఈ ఘట్టపు ఛాయలు ఉన్నాయి. ఆ సారాన్ని గ్రహించి సేతుబంధకావ్యమున సుగ్రీవుని పాత్ర ఉదాత్తతను, ఔచిత్యమును చిత్రించిన తీరు యిది. సుగ్రీవుడు వానరసేనలను కార్యోన్ముఖులను చేయటానికి వారినుద్దేశించి ప్రసంగిస్తాడు. 

8)
తే విరలా సప్పురిసా జే అభణన్తా ఘడేన్తి కజ్జాలావే |
తోఅ జిఅ తేవి దుమా జే అముణిఅకుసుమణిగ్గమా దేన్తి ఫలమ్ ||
ఛాయ:
తే విరలాః సత్పురుషాః యేऽభణ్యమానా ఘటయన్తి కార్యాలాపన్ |
స్తోకా ఏవ తేऽపి ద్రుమాః యేऽజ్ఞాతకుసుమనిర్గమా దదతి ఫలమ్ ||

విరిసీ విరియని కుసుమోద్గమముతో ఫలములనిచ్చు వృక్షము అరుదు. అదే విధమున యజమాని చెప్పకయే, మౌనముగా కార్యములను పూరించు సత్పురుషులు ఘనులు. 

ఈ కావ్యమెప్పటిది?వేల యేళ్ళ నాటిది. మౌనంగా, సందడి చేయకండా కార్యములను పూర్తి చేయుట యొక్క విలువ నేటి తరమునకు కొత్తగా వివరించే అవసరము లేదు. ఈ శ్లోకమున సుగ్రీవుడు అన్యాపదేశముగ తడవింది కపిశ్రేష్టుడైన హనుమంతుని గుణగణాలనే. ఈ శ్లోకమున సత్పురుషుడు హనుమంతుడే. ఈ విషయమును ప్రత్యక్షంగా హనుమంతుని చూపి, సీతాన్వేషణ ఘట్టమును దృష్టాంతీకరించి జెప్పవచ్చును కదా? అట్లా చెప్పటానికి వీల్లేదు. ఎందుకంటే, మహాసత్వుడైన హనుమంతుడు మెరమెచ్చులను సహింపని అవికత్థనుడు. అంతే కాక ఇతరులు ఊహించి తెలుసుకొనదగిన విషయముల ప్రస్తావించునప్పుడు గాంభీర్యము చక్కని పద్ధతి. పరాక్రమాతిశయమును ’గురించి’ వర్ణించినప్పుడు గాంభీర్యము, పరాక్రమాతిశయమును ’చిత్రించు’నప్పుడు ఉపమా/ఉత్ప్రేక్షలు ఉత్తమ కవిత్వలక్షణాలుగా సాధారణంగా కనిపిస్తవి. 
శివధనుర్భంగము ఘట్టంలో - ఆదికవి వాల్మీకి రామచంద్రుని పరాక్రమాతిశయమును గురించి కొన్ని శ్లోకములలో చెప్పి పక్కకు తళ్ళివేసినాడు. అదే కవి వాల్మీకి యుద్ధకాండంలో రామచంద్రుడు దక్షిణసముద్రమును చేరి, అనశనవ్రతమును పూని, మూడు దినములు సాగరుని ప్రార్థించి, ఆపై సంద్రముపై బ్రహ్మాస్త్రమును యెక్కుపెట్టు ఘట్టమున అనేక ఉత్ప్రేక్షలు గుప్పించి వర్ణిస్తాడు.
  
తస్మిన్వికృష్టే సహసా రాఘవేణ శరాసనే |
రోదసీ సమ్పఫాలేవ పర్వతాశ్చ చకమ్పిరే ||
తమశ్చలోకమావవ్రే దిశశ్చ న చకాశిరే |
పరిచుక్షుభిరే చాశు సరాంసి సరితస్తథా ||
...
...
(వాల్మీకి రామాయణము యుద్ధకాండము - 22.6 ~ 22.15)
అట్లు రాఘవుడు శరమును సంధింపగానే, పుడమి, యంబరము పగిలినట్లుగా అయింది. పర్వతములు చలించినై. లోకంలో చీకట్లు పొడమినై. దిక్కులు కాంతిహీనంబులయినై. సరస్సులు, నదులు కదిలిపోయినై. 

ప్రవరసేనుని లోనూ ఈ శైలి కానవస్తుంది.సుగ్రీవుడు ప్రసంగించే ఈ ఘట్టంలో మరొక విషయము గమనించాలి. కపిసైన్యమున అంగద, సుషేణ,నల, నీల, జాంబవంత, గవయ,గవాక్ష, మైన్ద, ద్వివిదాది వానరయూధముఖ్యులు మహాసత్వులే. వారి శౌర్యమునకు వచ్చిన లోటేమీ లేదు. అనంతసాగరమును చూసి కొంచెం కళవళపడిన వారిని కార్యోన్ముఖులను జేయటం మాత్రమే నాయకుని వంతు. ఆపై కాగల కార్యము సేనయే చేయవలసినది. ఆ ’మేనేజిమెంటు’ పాఠమునే సుగ్రీవుడు అర్థాంతరన్యాసమున చెబుతాడు.

9)
తుమ్హ చ్చిఅ ఎస భరో అణామేత్తప్పలో పహుత్తణసదో |
అరుణో ఛాఆవహణో విసహం విఅసంతి అప్పణా కమలసరా||
ఛాయ:
యుష్మాకమేవైష భర ఆజ్ఞామాత్రఫల ప్రభుత్వశబ్దః|
అరుణశ్చాయావహనో విశదం వికసన్త్యాత్మనా కమలసరాంసి||

"ప్రయత్నమంతయునూ మీది. ఆజ్ఞాపించుటయే ప్రభువునకు మిగిలిన కార్యము. ఉదయించుట మాత్రమే భానుని వృత్తి. ఆపైన కమలములు తమంతట తామే వికసించును". 

సుగ్రీవుని ప్రసంగము ముగిసిన పిదప జాంబవంతుడు కార్యాకార్యవిచక్షణ గురించి ప్రస్తావిస్తాడు. కాగల కార్యమును గురించి చక్కగా వివేచించి, సంభాషణా రూపమున కార్యాకార్యవిచక్షణ చేసే పద్ధతిని ప్రవరసేన తదనంతర కవులైన భారవి, మాఘుడు తమతమ కావ్యములలో అనుసరించటం స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యముగా భారవి ఈ విభాగమును చక్కగా మనసునకు పట్టించుకొన్నాడు. ధర్మరాజు చేత కిరాతార్జునీయమున "సహసా విదధీత నక్రియామ్.." అన్న ప్రముఖ శ్లోకమును చెప్పించి, కావ్యంలో అడుగడుగునా ఆ శ్లోక వ్యాఖ్యానమునకు తగినట్టు ముఖ్యపాత్ర (ధర్మరాజు) స్వభావమును ఆ కవి తీర్చిదిద్దినాడు. 

వాల్మీకి మహర్షి. సేతుబంధకారుడు కవి. ప్రాకృతకవి ఆదికవిని యంతరంగమున నిలుపుకొని, స్వీయ ప్రతిభను రంగరించి, అద్భుతకావ్యమునకు ప్రాణము పోసినాడు. సేతుబంధమునకు మూలము వాల్మీకి రామాయణ యుద్ధకాండమంటిమి. కావ్యమున ముఖ్యరసము వీరము. వీరరసమునకు స్థాయీభావముత్సాహము. అద్భుతము పోషకరసము. ఒక్క ఘట్టమున రావణరాజ్యమందలి దనుజులకూ, వారల స్త్రీలోకమునకు మధ్య యించుక శృంగారమును, మిగిలిన తావుల భయానకమును, భీభత్సమును, రౌద్రమును కవి నిలిపినాడు. అద్భుతమును కవి చాలాచోట్ల అసమానముగ పోషించెను. 

సేతుబంధకవి ప్రధానముగ ’నుత్ప్రేక్ష’కు పెద్ద పీట వేసినాడు. వర్ణనలకు విలక్షణమైన, విభిన్నమైన వస్తువుల నెంచుకొనుట ఈతని యలవాటు. దీనికి ఇదివరకే దృష్టాంతములను చూచినాము (ఉదా 2,3 ). వాల్మీకి ’రామాయణ’మున సేతునిర్మాణము సులభముగా ఆరంభమవుతుంది. అది ’రామాయణము’ కనుక. ’సేతుబంధ’ మున కవి కావ్యావసరమున ఈ ఘట్టమును పెంచటమే కాక, ఔచిత్యవంతంగా, రసపరిపుష్టంగా తీర్చినాడు. వాల్మీకములో రాముడు సముద్రునిపై బ్రహ్మాస్త్రమును కేవల మెక్కుపెట్టుతాడు. సేతుబంధమున రాముడు సముద్రునిపై శరములను సంధిస్తాడు. ఫలితముగా అల్లకల్లోలమైన సముద్రమును మనోహరముగా, అద్భుతముగా ప్రాకృతకవి వర్ణించినాడు.

సుగ్రీవుని ప్రసంగము, ఆపై జాంబవంతుని పర్యాలోచనమూ అయిన పిమ్మట రాముని శరసంధానము, ఆపై గంగతో కూడిన సముద్రుడు రామచంద్రుని శరణు వేడుట, సేతునిర్మాణ సూచన చేయుట విపులముగా కవి వర్ణించినాడు. సేతునిర్మాణమునకు తీర్మానమయినది. ఎట్టకేలకు సేతునిర్మాణం చేయటానికి కపిసైన్యము పూనుకొన్నది. కానీ ఒక క్రమపద్ధతిని కార్యము సాగుట లేదు. కపులు పెకలించుకుని వచ్చు పర్వతములను, శిలలను సముద్రజంతుజాలము మ్రింగివేస్తున్నై.

10)
స అలమహివేఢ విఅడో సిహరసహస్స పడిరుద్ధరఇరహమగ్గో |
ఇఅ తుఙ్గో వి మహిహరోతిమిఙ్గలస్స వఅణో తణం వ పణట్టో||
ఛాయ:
సకలమహీవేష్టవికటః శిఖరసహస్రప్రతిరుద్ధరవిరథమార్గః |
ఇతి తుఙ్గోऽపి మహీధరతిమిఙ్గిలస్య వదనే తృణమివ ప్రనష్టః ||

’పుడమియంత విశాలమై, వేలశిఖరాలతో కూడి, గగనతలంలో భాస్కరుని మార్గమునడ్డగించు ఉన్నతములైన పర్వతములు కూడా, సముద్రములో పడవైచినప్పుడు తిమిఙ్గలములనోట బడిన గడ్డిపరకల వలే నశించుచున్నవి.’

ఈ కల్పన వాల్మీకి రామాయణములో లేదు. వాల్మీకి రామాయణమున రాముడు విశ్వకర్మ ఔరసపుత్రుడైన నలునకు సేతువు నిర్మించుటకాదేశమివ్వడమూ, ఆపై సేతువు నిర్మాణమునూ క్లుప్తముగానే ఉన్నది. సేతుబంధకారుడు ఈ ఘట్టమును పెంచి, సేతుబంధసమయమున సాగరమున జరుగు కల్లోలమును విధవిధములుగా వర్ణిస్తాడు. ఆపై సేతునిర్మాణము క్రమపద్ధతిని జరుగకపోతే సుగ్రీవుడు నలుని నేత నియమిస్తాడు. యజమాని అయిన సుగ్రీవుడు స్వయముగా నలుని కాదేశమివ్వడం ఔచిత్యవంతం. సముద్రపు తీరును వర్ణించుట రసపోషకము. 

కావ్యవిస్తృతి

ఇండోనేసియాలోని జావాద్వీపంలో ’యోగ్యకార్త’ అనేచోట తొమ్మిదవ శతాబ్దమునకు పూర్వము నిర్మించిన ’పరంబనన్’ యను హిందూదేవాలయమున్నది. అచ్చటి విష్ణుమందిరముననున్న ఈ శిల్పాన్ని చూడండి.




కోతులు శిలలను మ్రోసి తేవడం, సముద్రమందు పడవేయడం, ఆ శిలలను జలచరములు మ్రింగటం, ఈ శిల్పంలో చెక్కారు. జావా, కంబోడియా ఇత్యాది దేశాలలో ప్రాకిన రామాయణ సంస్కృతి భారతసంస్కృతి అయినా, అది వాల్మీకేతరము, సంస్కృత, ప్రాకృత ప్రబంధకావ్యసంబంధమైన సంస్కృతి అది. ఆ శిల్పమునకు మూలము సేతుబంధమునందలి కల్పన అయ్యే అవకాశం ఉంది లేదా సేతుబంధమును అనుసరించిన యితర కవుల రచన యేదో ఈ శిల్పరచనకు మూలము కావచ్చు. తెలుగున మహాకవయిత్రి మొల్ల రామాయణమందు "సముద్రమునఁ బర్వతములను మ్రింగివేయు మహా మత్స్యముల" గురించిన ప్రస్తావన యున్నది.  

మలయా రామాయణమైన 'హికాయత్ సెరి రామ’ యందును, ఆ రామాయణమును అనుసరించుచు సాగిన శిల్ప, చిత్ర, నృత్యాదులందును సేతుబంధఘట్టమున మహామత్స్యములు చేకూర్చిన విఘ్నము గురించి ప్రస్తావన ఉంది. థాయి దేశమందున్న Emerald Buddha (Wat Phra Kaeo Temple) దేవాలయమందున్న పద్దెనిమిదవ శతాబ్దమున ఉద్దరించిన చిత్రములివి.




శిలను మింగుచున్న జలచరములను హనుమ సంహరించుట.


క్రీ.శ. తొమ్మిదవ శతాబ్దమున కాంభోజదేశ (Cambodia) ప్రభువైన యశోవర్మ, అక్కడ ప్రముఖ (Angkor Wat) దేవాలయమునకు పూర్వదిశలో ఒక సుదీర్ఘమైన కృత్రిమ తటాకము ను దీర్ఘచతురస్రాకారమున నిర్మించి ఆ తటాక మధ్యమున సుమేరు పర్వతపు దేవాలయమును (East Mebon) ప్రతిష్టించినాడు. క్రీ.శ. ఇరువదవ శతాబ్దమున శిథిలమైన ఆ తటాకపు నలుమూలల యందు రాతిఫలకలయందు సంస్కృత శాసనములు దొరికినాయి. ఆ శాసనములలో నొక శ్లోకంలో సేతుబంధకావ్య ప్రస్తావన ఉన్నది.

(Eastern Baray stele inscription of Yasho-Varman - 34)

యేన ప్రవరసేనేన ధర్మసేతుం వివృణ్వతా |
పరః ప్రవరసేనోపి జితః ప్రాకృతసేతుకృత్ ||

మొదటి ప్రవరసేనుడు (కాశ్మీరప్రభువు) ధర్మసేతువును నిర్మింపగా, అన్య ప్రవరసేనుడు సామాన్య సేతువు (లేదా సేతువను ప్రాకృత కావ్యమును) నిర్మించెను.  

ప్రవరసేనుని కీర్తి, సేతుబంధకావ్యము విస్తృతముగా దేశవిదేశాలలో ప్రచారమైనట్టు ఆ శాసనం వల్ల తెలుస్తోంది.

ప్రధానఘట్టము

దక్షిణ సముద్రానికి ఇటువైపునున్న మలయపర్వతానికి, లంకయందున్న సువేలపర్వతానికి మధ్య గిరిసేతుబంధము నలుని అధ్వర్యంలో పూర్తి అయింది.వాల్మీకి రామాయణ సేతువులో వృక్షములు, శిలలు, పర్వతములు ఉపయోగిస్తే, ప్రాకృతకావ్యమున సేతునిర్మాణము శిలలతో జరిగింది. ఆ సేతువును ప్రాకృతకవి హృదయంగముగను, ఒక్కొక్కపరి భీతావహముగనూ వర్ణించినాడు.

11)
మలఅసువేలాలగ్గో పడిట్ఠిఓ ణహణిహమ్మి సాగరసలిలే |
ఉఅ అత్థమణణిరాఓ రవిరహమగ్గో వ్వ పాఅడో సేఉవహో ||
ఛాయ:
మలయసువేలాలగ్నః పరిస్థితో నభోనిభే సాగరసలిలే |
ఉదయాస్తమననిరాయతః రవిరథమార్గః ఇవ సేతుపథః ||

మలయ, సువేల పర్వతములను కలుపుచూ అంతరిక్షము వలే శోభిల్లు సాగరము మధ్య చక్కగ నిలబడిన సేతువు, ఉదయాస్తమముల మధ్య తిరుగు ఆదిత్యుని రథమార్గము వలే ప్రకాశిస్తోంది.     

12)
అహ థోరతుఙ్గవిఅడో ణేఉం ణిఅణం సవన్ధవం దహవఅణమ్|
దోహాఇ అసలిలణిహీ కఅన్తహత్థో వ్వ పసరిఓ సోఉవహో ||
ఛాయ:
అథ స్థూలతుఙ్గవికటో నేతుం నిధనం సబాన్ధవం దశవదనమ్ |
ద్విధాయితసలిలనిధిః కృతాన్తహస్త ఇవ ప్రసృతః సేతుపథః||

లంకకు కట్టిన సేతువు, సాగరమును రెండుగా విడగొట్టుచూ, యముని హస్తమువలె పొడవుగనూ, భయంకరముగను, రావణుని, అతని బంధువర్గమును మరణమునకు కొనిపోయేటట్టు ఉన్నది. 

నిర్మాణమునకు సారథి సూర్యుని అంశ అయిన సుగ్రీవుడు. కార్యము రవికులజుడైన రామునిది. వారి అధ్వర్యమున నిర్మితమైన సేతువు రవిపుత్రుడైన యముని హస్తం లాగా సముద్రమధ్యమందున్నది. ఇచ్చట నున్నది కేవలమొక ఉత్ప్రేక్ష కాదు, ఒక నిర్జీవమైన సేతువు అన్న వస్తువునకు, జీవంతమైన యముని చేయి అనే పోలిక. ఇది యెంత భీతావహంగా ఉందో సహృదయులూహింపగలరు. 

కపి సేన వారధిని గట్టి లంకలోని సువేలపర్వతమును చేరినది. కవి సువేలమును వర్ణించుచున్నాడు. సువేలపర్వతవర్ణన విషయమున ప్రాకృతకవి నిజముగా "ప్రాకృత" కవి అనిపిస్తాడు.ఈ ఘట్టంలో మాఘ ప్రవరసేనులను పరిశీలించాలి.

మాఘుడు vs ప్రవరసేనుడు

ప్రవరసేనకవి తర్వాత మహాకావ్యకర్తలలో భారవి ప్రథముడు. భారవి కిరాతార్జునీయాన్ని అనుసరించినా, ఆ అనుసరణలో స్వాతంత్ర్యమును నిలుపుకోవటమే కాక, సంస్కృతకావ్యాన్ని మరొక స్థాయికి చేర్చిన కవి మాఘుడు. ఈ కవిని గురించి మల్లినాథసూరి అంతటి పండితుడు "మాఘే మేఘే గతం వయః" అని ఉటంకించాడు. మాఘుని అనుశీలించడంలో మల్లినాథసూరికి అర్ధజీవితము చెల్లిపోయినదట. 

మాఘుడు మహాకవి, మహాపండితుడు, అనేక శాస్త్రములలో దిట్ట . సరస్వతి ఆయన జిహ్వాగ్రనర్తకి. ఆయన భాష హస్తామలకము. చిత్రకవిత్వాదులలో మహాధీమణి. ఒక మహాపర్వతమును జూచి నిశ్చేష్టితుడై విస్మయపడు వ్యక్తి ఒకడైతే, ఆ పర్వతము యొక్క అంతు చూడాలని, శిఖరాగ్రమునకెక్కి చేతులు సాచి ఆనందపడవలెనని కోరెడు వాడు మరొకడు. మాఘుడు ఈ రెండవ కోవకు చెందుతాడు. "నియతికృత నియమ రహిత" మైన కవిత్వమది. అయిననూ ఆయన కవిత్వమందు భావుకత్వపు పాలు కంటే పాండిత్యపు రుచి ఎక్కువ.  భావుకత్వము లేకపోలేదు కానీ, ఆయన ఆ భావుకత్వమున మునుగుట లేదు, దానిని యధిగమించి ముందుకు సాగటం ఆ కవికి ప్రియమైన విషయం.  

శిశుపాలవధమ్ నాలుగవ సర్గలో రైవతక పర్వతవర్ణన యున్నది. ఈ వర్ణన కావ్యములో ముఖ్యమైన ఘట్టము. ఈ సర్గ అంతటా, కవి ఏకఛందస్సును కాక పలు ఛందస్సులనుపయోగించినాడు. పర్వతమును విభిన్న రీతులలో వర్ణించుటకు ఇది కవి ఏర్పరచుకొన్న శిల్పము. వర్ణన మొదలు పెట్టిన నాలుగవ శ్లోకముననే కవి పర్వతమును హిరణ్యగర్భునితో పోల్చి ఉత్ప్రేక్షించినాడు.

సహస్రసంఖ్యైర్గగనం శిరోభిః పాదైర్భువం వ్యాప్య వితిష్టమానమ్ |
విలోచనస్థానగతోష్ణరశ్మిర్నిశాకరం సాధు హిరణ్యగర్భమ్ ||
(శిశుపాలవధమ్ -4.4)

వేల శిఖరములతో ఆకసమును, వేల పాదములతో భూమిని వ్యాపించి, తన కన్నులుగా సూర్యచంద్రులను నిలుపుకొన్న ఈ పర్వతము హిరణ్యగర్భుని (బ్రహ్మను) స్ఫురింపచేస్తోందొ. దానిని శ్రీకృష్ణుడు చూచెను.     

పాండిత్యము, ఘనమైన ఉత్ప్రేక్ష, శ్లేష, అక్షరవిన్యాసము అన్నియును ఒక్కచోట అమరిన శ్లోకమిది. కవియే భగవంతుడైన శ్రీకృష్ణుని కన్నులతో పర్వతాన్ని చూస్తున్నట్లుంది.  

ఈ సర్గయందు స్థూలంగా ఇదే రీతి కానవస్తుంది. ఒక్కొక్కపరి లలితమైన శబ్దముల కూర్పు (రాజీవరాజీవశలోలభృంగం...4.9) కద్దు. సూర్యచంద్రులను పర్వతమునకు రెండువైపుల వ్రేలాడు ఘంటలుగ నుత్ప్రేక్షించి ’ఘంటామాఘుడు’ గా కీర్తి గడించిన శ్లోకమీ ఘట్టములోనే సిద్ధము. పాండిత్యాన్ని రంగరించిన మాఘుని విస్మయము ఈ క్రింది పద్యంలో చూడండి.

దృష్టోऽపి శైలః స ముహుర్మురారేరపూర్వవత్ విస్మయమాతతాన |
క్షణే క్షణే యన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయాః ||
(శిశుపాలవధమ్ -4.17)

చూచుటకు పర్వతము. కానీ శ్రీకృష్టునకు తిరిగి చూడగా అపూర్వమైన విస్మయము పొడమినది. క్షణక్షణమునకు నవ్యత్వమును పొందుటయే గదా రామణీయత!

ఇక్కడ ’విస్మయము’ అన్నదాన్ని వాచ్యంగా చెప్పినా అద్భుతమైన పద్యపాదాన్ని దృష్టాంతంగా చెప్పి, శ్లోకాన్ని మరువలేని విధముగా తీర్చినాడు. రమణీయమైన యే పదార్థాన్ని చూసినా ఈ శ్లోకము తట్టే అవకాశం ఉంది. ఇది ఒక RC. (Reference Context). 

మాఘుని వర్ణనలను ఇంకా వర్ణింపడానికి ఇక్కడ చోటు చాలదు. ఆయన రీతిని స్థూలముగా చెప్పుకోవటానికి ఇంతటి ప్రయాస. 

మాఘకవితో పోల్చి చూస్తే, మన ప్రాకృతకవి ముఖ్యంగా భావుకుడు. సువిశాలమైన ప్రకృతి ఈయనకు కవిత్వరంగస్థలము. అంబరమును గానీ, ఆర్ణవమును కానీ,ఒక గొప్ప పర్వతమును లేదా మనసు పడినట్టి యే వస్తువందైనా, ఈయనకు మైమరపు హెచ్చు. కవిత్వము/కవిత్వశిల్పము/కవిత్వనిర్మాణవైచిత్రి ద్వారా వస్తువును అధిగమించి, ఆక్రమించాలనే ఆశ కన్నా, ఒడలు మరచి విస్మయపడుట ఈయన వంతు. ఈయన వర్ణన చదివిన పాఠకునకు కవి చూపిన భావమే నిలుస్తుంది కానీ, కవి చెప్పిన శ్లోకము గుర్తు రాదు. దృశ్యకావ్యములలో భాసునిది ఈ పద్ధతి.  కవిత్వమందు భావుకత్వమే ప్రధానము. ఛందస్సు, పదలాలిత్యము, శిల్పము వంటివి పక్క వాయిద్యములే తప్ప ప్రధానములు గావు. 

ప్రవరసేనుని సువేలపర్వతము ఇలా ఉంది.

13)
పాఆలభరిఅమూలం వజ్జముహాఓడణట్ఠవిఅణికమ్పమ్ |
ఆలాణక్ఖంభం మివ సురహత్థిక్ఖంధణిహసమసిణిఅపాసమ్ ||
ఛాయ:
పాతాళభృతమూలం వజ్రముఖాకోలనస్థాపితనిష్కంపమ్ |
ఆలానస్తంభమివ సురహస్తిస్కంధనిఘర్షమసృణితపార్శ్వమ్ ||

సువేలపర్వతమూలములు పాతాళలోకమునకు వ్యాపించినై. పిడుగుతో భూమిలోనికి దిట్టముగా సీల దిగగొట్టబడినట్టు ఈ పర్వతము నిశ్చలంగా ఉంది. దిగ్గజాలను గొలుసులతో కట్టటానికి ఏర్పరిచిన గుంజెలాగా ఉంది. ఆ దిగ్గజముల ఒంటి రాపిడిచేత నునుపు తేలియున్నది.

మాఘునకు పర్వతాగ్రము మీద గురి ఐతే, సేతుబంధకారుడు ఆ పర్వతమునొక్క గుంజెవలె గాంచి విస్మయపడినాడు. పర్వత వర్ణన కొంత అయిన తర్వాత ఆ పర్వతపు సానువులందు జీవించు అరణ్యమృగాలపైనా, వాటి సహజ జీవనముపైనా కవి దృష్టి సారించినాడు. మాఘుని దృష్టి పర్వతముపైని విద్యాధరులపైనా, రత్నరాశులు ఇత్యాది వస్తువులపైన అమరినది.  

మాఘుని ’ఘంట’ ను, అందులో ఏనుగును చూశాం. ప్రవరసేనుని ఏనుగు వెన్నెల రాత్రుల్లో వర్ణన ఇది.

వెన్నెల రాత్రిలో సువేలపర్వతము ఐరావతము లా ఉంది. ఆ ఐరావతము బురదలో క్రీడించి, ఒంటిపై బురదను చల్లుకున్నట్టు అక్కడక్కడా, పర్వత సానువులను ఆనుకుని, మేఘపు శకలాలు కనిపిస్తున్నై. నాళము తెగిన తామరపువ్వుని యెత్తిపట్టుకున్న విధంగా ఆ పర్వతం పైన చంద్రబింబము కనిపిస్తోంది. 

ఇచ్చట బురదలో క్రీడించు యేనుగు ప్రవృత్తిని, చంద్రుని పంకజముతో పోలికను, స్థిరత్వాన్ని అన్నిటిని ఒక్కపట్టున జూపి చకితుని చేస్తున్నాడు కవి. వెన్నెలలో ఓ యేనుగు - తామరపువ్వునెత్తి పట్టి నిలబడటం - అనుభవైకవేద్యమైన చిత్రము ఆ  కొండ అలా ఉందట!  

ప్రవరసేనుని కవిత్వము హ్లాదైకమయమైననూ, నియతి యున్నది. ముఖ్యంగా పానగోష్టి, శృంగారాది వర్ణనల్లో, సుగ్రీవుని మాటల్లో అది కానవస్తుంది. భావుకత్వమును దాటిన పాండిత్యము కానరాదు. మేధోవర్తిత్వముకన్నా హృదయవర్తిత్వము హెచ్చు. అనేకపట్టులలో  సేతుబంధమున కావ్యనాయకుడైన రాముడు మానవుఁడు కాడు. హరి అవతారము కూడా కాడు. సాక్షాత్తూ హరియే.

ఒక్క మాటలో చెప్పాలంటే - ప్రవరసేనుడు ఆంధ్రభోజుడు శ్రీకృష్ణరాయలకు పెట్టు. విచిత్రమేమంటే, రాచకవులైన రాయలు, ప్రవరసేనులకు ప్రాకృతికదృష్టి ఎక్కువ, కవివతంసులైన మాఘకవి బోంట్లకు పాండిత్యముపైనా, వస్తువుకన్న కవిత్వనిర్మాణముపైనా రుచి. ఇది గొప్ప వింత. 

విచిత్రచమత్కృతులతో, శబ్దార్థవైభవముతో మెరిసే మాఘుని కవిత్వం సరస్వతిమాత గళాభరణము. మాఘునితో పోలిస్తే, ప్రవరుని కవిత చక్కగా పాదుతీర్చిన పూలతీవె. మాఘుని కవిత్వము రత్నఖచితసువర్ణమయసోపానపంక్తి. ప్రవరసేనుని కవిత్వము సాగరముపై నిర్మించిన విస్మయావిష్ట జనకమైన సేతుబంధము.     

సువేలపర్వతమును వర్ణించిన పిదప ప్రవరసేనుడు అక్కడి అరణ్యజీవనాన్ని రోచకంగా వివరిస్తాడు. విస్తరభీతిచేత ఒక్క శ్లోకం చూద్దాం. ఆ పర్వతసానువులందలి యరణ్యంలో కరి-కేసరి పోరాటమీ విధంగా ఉన్నది.

14)
కుమ్భోవగ్గణణివడి అకరిహత్థుక్ఖుడిఅసీహకేసరభారమ్|
సహఅరివిరుఆఅణ్ణణవలన్తభమరపరివత్తిఅలఆకుసుమమ్ ||
ఛాయ:
కుమ్భావక్రమణ నిపతిత కరిహస్తఖండిత కేసరభారమ్|
సహచరీ విరుతాకర్ణన వలద్భ్రమర పరివర్తిత లతాకుసుమమ్||

సింహం యేనుగు కుంభముపైకి లంఘించి, దానిని పడగొట్టింది. అంతలోనే హస్తి తన తొండంతో సింహమునందుకుని, దాని కేసరములను పట్టి చీల్చి, విదిలించి పారేసింది. అలా పారేయగా క్రిందపడిన సింహపు పసుపుపచ్చని జూలు - సహచరి పిలుపు విన్న ఒక తుమ్మెదను -  తన చుట్టూ తిప్పుకుంటున్న లతాకుసుమములా ఉన్నదట.  

రెండు సుదీర్ఘసమాసాలతో, సందర్భమును బట్టి కూర్చిన ఓజోగుణభరితమైన వర్ణన ఇది. ఈ భావము యెంత స్వతంత్రంగా ఉందో గమనించండి! సహచరిని తనచుట్టు తిప్పుకొను లతాకుసుమమట! ఏనుగుతో పోట్లాటఫలితమున కేసరములను యనగా అందమును కోల్పోయిన కేసరి సౌందర్యహీనతను గురించిన ధ్వని ఎంత నవ్యంగా ఉందో చూడండి!

రావణుని మానసిక అవస్థ

సేతుబంధము పదకొండవ ఆశ్వాసంలో, సీతకు రావణుడు రామచంద్రుని మాయాశిరమును చూపటాన్ని, ఆ శిరాన్ని చూసి సీత భయోద్వేగంతో మూర్ఛపోయి, అటుపై అనేకవిధాలుగా విలపించటాన్ని, త్రిజట యను రక్కసి సీతను ఊరడించి, ధైర్యము చెప్పటాన్ని చిత్రించాడు కవి. సీతవిలాపం - సంస్కృత, ప్రాకృతకావ్యాలలో శిఖరాయమానమైనది. ఈ ఆశ్వాసంలో మొదటి ముప్పై అయిదు శ్లోకములలో రావణుని తీవ్ర ఉన్మత్తావస్థను కవి మహానైపుణ్యముతో చిత్రించినాడు. రాముడు కపిసేనతో కూడి యుద్ధమునకై లంకకు ఏతెంచిన వార్త విని రాక్షసరాజుకు నిద్రపట్టటం లేదు. సీతమీది మోహము వేధిస్తోంది.
  
15)
తం పులఇఅమ్మి పేచ్ఛఇ ఉల్లవన్తో అ తీఅ గేహ్ణఇ గోత్తమ్ |
ఠాఇ అ తస్స సమఅణే అణ్ణమ్మి వి చిన్తిఅమ్మి స చ్చిఅ హిఅఎ ||
ఛాయ:
తాం ప్రలోకితే పశ్యత్యుల్లపంశ్చ తస్యా గృహ్ణాతి గోత్రమ్ |
తిష్టతి చ తస్య సమదనేऽన్యస్మిన్నపి చిన్తితే సైవ హృదయే ||

చూచిన ప్రతిచోటనూ సీతముఖమే కనిపించుచున్నది. మాటాడిన ప్రతి మాటయందునూ ఆమె పేరే దొర్లుతున్నది. ఆమెను మరచుటకు ప్రయత్నము చేసే కొద్దీ, ఆమెయే హృదయమందు నిలుచుచున్నది. 

ఈ ఘట్టములో దశకంఠుని అవస్థ - మయసభలో పరాభవమందిన కురురాజు దుర్యోధనుని మనఃస్థితిలా ఉంటుంది. ఆ అవస్థను నివారించుటకు దశవదనుని పత్నులు విఫలప్రయత్నము చేస్తారు. ఈ దురవస్థను అతను సైపలేక చివరకు ఈ విధముగా చింతించినాడు. "జనులు తమ ఆశలు శిథిలమయినప్పుడు, తమకు రక్షణ కరవైనపుడు, మిత్రులు దొరకనపుడు భయము చేత లజ్జను విడనాడి తమ నియమముల నతిక్రమింతురు." 

ఈ విధముగా క్రూరముగా చింతించి, రాక్షసరాజు భటులకు రాముని యొక్క ఖండిత మాయాశిరమును తయారు చేయమని ఆదేశిస్తాడు. ఆ తలను చూపి భీతావహురాలైన సీతను స్వాధీనము చేసుకోవచ్చు అన్న కర్కశమైన కాంక్ష అతనిది. దశవదనములతో దనుజరాజు భటులకు యాజ్ఞనిచ్చునప్పుడు రావణుని (అవస్థ) వర్ణన ఇది. ఉన్మత్తతకు పరాకాష్ట!

16)
అణ్ణేణ సమారద్ధం వఅణం
అణ్ణేణ హరిసగహి అప్ఫిడిఅమ్ |
అణ్ణేణ అద్ధభణిఅం ముహేణ
అణ్ణేణ సే కఇ వి ణిమ్మవిఅమ్ || 
ఛాయ:
అన్యేన సమారబ్ధం వచనం
అన్యేన హర్షగృహీతస్ఫేటితమ్ |
అన్యేనార్ధభణితం ముఖేన
అన్యేనాస్య కథమపి నిర్మాపితమ్ ||

మొదటి ముఖము మాటలు మొదలు పెట్టింది. ఇంకొక ముఖము రాక్షసానందముతో ఆ మాటలనందుకొన్నది. ఆపై మాటలు రాక మరొక ముఖము మాటలాడెను. చివరన యెటులో మరొక ముఖముతో ఆజ్ఞను ముగించెను.

రావణాసురుని మనమునందున్న తీవ్రమైన అరిషడ్వర్గవిన్యాసము ముప్పది ఐదు శ్లోకములలో చిత్రింపబడి, పై శ్లోకమందు శిఖరాగ్రము నందుకొన్నాది.

సేతుబంధకారుని సీతాదేవి అసహాయ. అయినప్పటికీ ధీర. పరమ ముగ్ధ కాదు. ఆమె మాటలలో రాచకన్య యొక్క ధీరత్వము, ప్రతీకారేచ్ఛ కానవస్తుంది. సీతయందు ప్రవరసేనుడు నిలిపిన ధీరత్వపు ఛాయ ’కుందమాల’ అనే నాటకంలో కానవస్తుంది. జానకిని ఊరడించుట త్రిజట వంతైనది. సేతుబంధకవి రాముడు సాక్షాత్తు నారాయణుడు. ఈ విషయమును త్రిజట ముఖమున కవి చెప్పించినాడు. చివరకు వానరుల యుద్ధసంరంభమును, భేరీ నినాదములను విని సీత ఊరడిల్లుతుంది.

ఈ ఆశ్వాసములో సేతుబంధకారుడు సీతయొక్క పాత్రచిత్రణనూ, రావణుని ఉన్మత్త మానసిక అవస్థను అపూర్వముగా చిత్రించినాడు. పూర్వఘట్టములందు సుగ్రీవుని పాత్రచిత్రణమును, నాయకత్వప్రతిభను గురించిన ప్రస్తావన ఇదివరకు ఉటంకింపబడినది.

యుద్ధము మొదలైనది. వానరయోధుని బలమును, పరాక్రమమును కవి చిత్రించుచున్నాడు. 

17)
కఇవచ్ఛత్థలపరిణఅణిఅఅముహత్థమిఅదన్తిదన్తప్ఫలిహమ్ |
ణిహఅ భడ మహిఅ ణివడిఅ సురవహుచల వలఅ ముహలపవ అవఇవగమ్ ||
ఛాయ:
కపివక్షఃస్థలపరిణత నిజముఖాస్తమిత దన్తిదన్తపరిఘమ్ | 
నిహత భట మహిత నిపతిత సురవధూచల వలయ ముఖరప్లవగ గతిపథమ్ ||

అసురసైన్యం తాలూకు యుద్ధగజమొక్కటి ఒకానొక వానరయోధుని పాషాణసదృశమైన వక్షఃస్థలమును తన కొమ్ములతో కుమ్మింది. ఆ అదటుకు వానరశ్రేష్టునికి యేమీ నొప్పి కలుగలేదు కానీ, గజము యొక్క దంతము మాత్రము వెనుకకు వంగి దానిముఖమునందే చొచ్చినది. ఇచ్చట వానరయూధుల దేహదారుఢ్యము వ్యంగ్యము. 

రౌద్రభీభత్సములు - కవిహృదయము - అనుశీలనము

యుద్ధరంగాన్ని గురించి వర్ణించటం, వివరించటం సంస్కృత సాహిత్యాలలో మహాభారతకాలం నుంచీ ఉంది. దృశ్యకావ్యాల్లో యుద్ధాలు, వధ ప్రత్యక్షముగా చూచించరాదని నాట్యశాస్త్రనియమమున్నది కానీ శ్రవ్యకావ్యములలో అట్లాంటి నిబంధన ఏదీ లేదు. అందు చేత యుద్ధమును భీభత్స, వీర, రౌద్ర రస పరిపోషకంగా కవులు తీర్చియున్నారు. రణరంగంలో లూనశీర్షము - అనగా ’తెగిన తల’ గల మొండెమును వర్ణించుట ఒక ఆనవాయితీగా సంస్కృత, ప్రాకృతకావ్యములలో నిలచింది. కదనరంగమున సహస్రపూరణము అన్నది ప్రసిద్ధమైన విషయము. అనగా, యుద్ధమున వేయి తలలు త్రెగితే, మరణించిన కళేబరాలనుండి ఒక్క తలలేని మొండెము (కబంధము) లేచి నర్తనమాడుతుందట. తలలేని మొండెమునకు కబంధమని పేరు. ఇది ఒక కవిసమయం. వివిధ కవులు తమ కావ్యములలో ఈ కవిసమయాన్ని ఉపయోగించినారు. అలాంటి వర్ణనలను పరిశీలించి చూద్దాం. 

కాళిదాసు: 
కశ్చిద్ద్విషత్ఖడ్గ హృతోత్తమాఙ్గః సద్యః విమానప్రభుతాముపేత్య |
వామాఙ్గసంసక్తసురాఙ్గనః స్వం నృత్యత్కబంధం సమరే దదర్శ ||
(రఘు. 7.51)

సమరాంగణములో ఒక యోధుడు శత్రువుతో పోరాడగా, శత్రువాతని శిరమును ఖండించినాడు. వెంటనే యోధుడు అసువులు బాసి, స్వర్గమునుండి తనకై వచ్చిన విమానమధిరోహించి, ఆ విమానమున పక్కనున్న అప్సరను కౌగిలించి, (సహస్రపూరణమగుట చేత) నృత్యము చేస్తున్న తన మొండెమును చూచినాడు.

ఇచ్చట కశ్చిద్ద్విషత్ఖడ్గ హృతోత్తమాఙ్గః = ఒకానొక శత్రువు చేత ఖండింపబడిన బడిన శిరముగల వీరుడు - అన్నచోట భీభత్సప్రతీతి. వామాఙ్గసంసక్తసురాఙ్గనః = ఎడమవైపు కౌగిలించిన అప్సర (గలవాడు) - ఇది శృంగార అభివ్యక్తి. ఈ రెండు సమాసములకు మూలమైన రణోత్సాహము వీరరసము. అంటే, భీభత్స వీర శృంగారములు ఒక్కచోట కలిసినై. భీభత్స శృంగారములు వైరిరసాలు.  వీటినొక్కచోట కలుపుట రసవిరోధహేతువవుతుంది కాబట్టి, ఒక్కపట్టున ఉపయోగించడం కూడదని ఆలంకారికులంటారు. అయితే, కాళిదాసు శ్లోకంలో - రసవిరోధం లేదు, రసవిరోధాన్ని పరిహరించటానికి రెండు రసముల మధ్య యెడముగా వీరరసమున్నది. కనుక ఇది అనౌచిత్యము కాదు. అదేవిధంగా భీభత్సమునకు కబంధము, శృంగారమునకు వీరుని దివ్యశరీరము ఆలంబనమగుట వలన రసవిరోధము లేదు. ధ్వన్యాలోకమున, కావ్యప్రకాశమున రసవిరోధప్రకరణమున ఇదే విధమైన ఉదాహరణము చెప్పారు. (భూరేణుదిగ్ధాన్నల - ధ్వన్యాలోకము 3.102,103,104, కావ్యప్రకాశము - 7.334,335)

కుమారదాసు:
వధాయ ధావన్నభిశత్రువిద్విషః శరేణ కృత్త్యచ్యుతమస్తకోऽపరః |
హృతాయురప్యాదికృతేన కానిచిత్పదాని వేగేన జగామ రాక్షసః || (జానకీహరణము -5.40)

ఒక రాక్షసయోధుడు తన శత్రువైన రాముని వధించవలెనని అభిముఖంగా వేగముగా పరిగెత్తుతూ రాగా, అతని శిరస్సును రాముని శరము ఖండించింది. ఆయువు కోల్పోయినప్పటికీ వేగమును నిలుపుకోలేక రాక్షసుని కబంధము కొన్ని అడుగులపాటు ముందుకు నడిచినది (కళ్ళకు కట్టించే దృశ్యం యిది).

ప్రవరసేనుడు:
18)
బన్ధువహబద్ధవేరం సహస్సపూరణకబన్ధజణి ఆమోఅమ్ |
వడ్ఢఇ భడదిణ్ణరసం భుజపవ్వలపహుఅవీరపడణం జుజ్ఝమ్ ||
సంస్కృతఛాయ:
బంధువధబద్ధవైరం సహస్రపూరణకబంధజనితామోదమ్ |
వర్ధతే భటదత్తరసం భుజప్రబలప్రభూతపరిపతనం యుద్ధమ్ ||
(సేతుబంధము - 13.64)

బంధువధ కారణంగా పెరుగుచున్న వైరంతో, వేయిశూరులపతనముతో కలిగిన సంతోషంతో (కబంధ నృత్యమునకు హేతువై), భటుల సమరోత్సాహముతో, యోధుల భుజబలము పెచ్చరిల్లగా సంభవించిన శత్రువుల పతనముతో యుద్ధముత్కర్షముగ సాగుతోంది. ఇక్కడ రౌద్రరసప్రతీతి. స్థాయీభావం క్రోధము. శత్రువులు ఆలంబన విభావము. బంధువుల మధ్య వైరము, భుజబలము ఉద్దీపనము. భటుల మోదము అనుభావము. శత్రువుల తలలు తెంచుట యను ఉగ్రత్వము వ్యభిచరీభావము. 

వ్యాసుడు:
కబంధాని సముత్థస్థుః సుబహూని సమన్తతః |
తస్మిన్ విమర్దే యోధానాం సంఖ్యావృత్తికరాణి చ||
హరివంశము (2.36.9)

ఆ ఘోరయుద్ధమున వెంట వెంటనే యనేక శిరములేని మొండెములు లేచి ఆడుతున్నాయి. అది పోరాడి నశించిన యోధుల సంఖ్య ఆవృత్తి అవుతున్నట్లున్నది.

వేయి కళేబరములకొక్క తలలేని మొండెం లేచి నృత్యమాడుతుంది, ఈ శ్లోకంలో అలాంటి కబంధనృత్యము వెంటవెంటనే అనేకమార్లు జరుగుతోంది. అంటే వేల సంఖ్యలో యోధులు నిముషం పాటులో నశిస్తున్నారు. ఇది భయంకత్రమైన రణాన్ని, యుద్ధతీవ్రతనూ  వ్యంజింపజేస్తోంది.  

మాఘుడు: 
సహస్రపూరణః కశ్చిల్లూనమూర్ధాऽసినా ద్విషః |
తథోర్ధ్వ ఏవ కబన్ధీమభజన్నర్తనక్రియామ్ ||
శిశుపాలవధమ్ (19.51) 
యుద్ధరంగమున సహస్రవీరులను మూర్కొనగల శక్తి గల ఒక భటుడు శత్రువుచేత ఖండించబడిన శిరముతో వేయి సంఖ్య పూర్తి అయిన మొండెము వలే నిలబడి నర్తించుచున్నాడు.

భట్టి
సంబభూవుః కబంధాని ప్రోహుః శోణితతోయగాః |
తేరుర్భటాస్యపద్మాని ధ్వజైః ఫేనైరివాబభే ||
(రావణవధ -14.27)

కబంధములు పుడుతున్నై. (వేల మంది యోధులు హతమగుచున్నారు). రక్తపుటేరులు ప్రవహిస్తున్నై. రథములు, భటుల ముఖపద్మములు, ధ్వజములతో కూడి నురగలగుచున్నవి. 

కబంధనృత్యము గురించి ఇంకా పెక్కు కావ్యాలలో ఉటంకింపులు ఉన్నాయి. హర్షచరితములో, బౌద్ధగ్రంథము, పాళీ ప్రాకృతరచన అయిన మిళిందపన్హలో  ’సహస్రపూరణము’ గాక కొంత లెక్క మార్పుతో కబంధ నృత్యప్రస్తావన ఉంది.

వివిధ కవుల సమాంతర యుద్ధవర్ణనలను చూస్తే, కొన్ని విషయము లగుపడుతున్నాయి. సాధారణముగా కాళిదాసు కవి రీతి వైదర్భి. శబ్దప్రయోగములు పరమలలితములు. ఇవి శృఙ్గారరసమునకు ప్రధానముగా సహకరించేవి. ఓజోగుణప్రవిష్టమైన రౌద్ర, భీభత్సములు కాళిదాసు కవిత్వమున అంతగా కనబడవు. అంతే కాక కాళిదాసు శైలి సాధారణంగా సుకుమారమైనది. ఎక్కడో తప్ప, పరుషమైన అక్షరాలను, సంయుక్తాక్షరాలను, దీర్ఘసమాసాలను కావ్యములలో ఆయన కూర్చటానికి విముఖుడు. జానకీహరణకావ్య కర్త అయిన కుమారదాసుడు కాళిదాసునకు పరమ అభిమాని, భక్తుడు. ఈతని శబ్దసౌష్టవము కాళిదాసు కవిత వంటిదే. పై ఉదాహరణంలో పదచిత్రము చక్కగా ఉన్నది. కానీ ప్రత్యేకముగా చెప్పుకొనుటకు ఏమీ లేదు.    ప్రవరసేనుడు ప్రాకృతకవి. ప్రాకృత భాష అనాయాసమైననూ, ఈతని రచనలలో దీర్ఘపదబంధములు, సంయుక్తాక్షరములూ ఎడనెడ కనిపిస్తాయి. సేతుబంధమున శ్లోకము మొత్తమును కేవలము రెండు సుదీర్ఘపదబంధములతో ముగించుట అనేకమార్లు (కావ్యమంతటనూ కలిపి అరువదిమార్లకు పైగా) గమనించవచ్చు. ఈ కావ్యంలోనే కాదు,  గాథాసప్తశతి యందునూ, సుదీర్ఘసమాసము లనేకములు కలవు. భాష ప్రాకృతము కాబట్టి, అట్టి దీర్ఘసమాసములు సంస్కృతములో వలే ఆయాసము కలిగింపవు. సేతుబంధకావ్యము వీరరసప్రధానము కాబట్టి, శైలిలో సరళతకన్నా, బిగువెక్కువ. ఇది కావ్యఘట్టమును బట్టి మారుతుంటుంది. కాళిదాసు వలె, సుకుమారత, మృదుత్వముల వంటి పట్టింపులు ప్రవరసేనకవిలో కనిపించవు. ఈ కవి ప్రధానముగా విభిన్నమైన విలక్షణ భావములను కూర్చుటకు ముచ్చటపడు కవి. యుద్ధవాతావరణమున యుద్ధమును మిక్కిలి నుద్యోతించుచూ, తత్సంబంధిత విషయ విలక్షణతకు ప్రాధాన్యత చూపుతూ, అందుకు తగిన శైలిని ఎంచుకొనునట్టు కనపడును. 

ఇక వ్యాసమహర్షిని గురించి చర్చించటం అవివేకము. మాఘకవి గురించి చెప్పుటకేముంది? "మాఘే సన్తి త్రయో గుణాః". భట్టి కావ్యము యొక్క ఉద్దేశ్యము వ్యాకరణపాఠము చెప్పటం కనుక, ఆ కవిత్వానుశీలనము అనవసరము.

ప్రవరసేనకవి కవిత్వము గురించిన సాధారణ లక్షణాలు ఇలా వింగడించవచ్చు.
  • ఈ కవి భావనాబలమందు, భావనాస్వాతంత్ర్యమునందు, సునిశితమైన పరిశీలనలందు, విలక్షణమైన కల్పనలయందు అసమానుడు. 
  • ఈ కవి కవిత్వము ద్వారా పాఠకుల ఊహకు పరిశ్రమనిస్తాడు. పాఠకుడు కొంత కష్టపడాలి. అరుదైన విశిష్టత యిది. స్వతంత్రమైన భావాలు, కల్పనలు ఈ కవి సొమ్ములు, నిగూఢంగా చెప్పటం ఉన్నది కానీ కృతకత్వము లేదు. వస్తువులు ప్రాకృతికములే. కవిత్వమున వస్తువులు విలక్షణములే కానీ అపలక్షణములు, వికృతములూ కావు.  
  • శైలి భావమునకు తగినట్టుండును. వైదర్భీ, గౌడీ, పాంచాలి యన్న పట్టింపు లేదు. భాష మహరాష్ట్రీ ప్రాకృతము గాన ఏ రీతియైననూ పాఠకునకు బాధకము కాదు, సాధకమే.
  • రసపోషణాన్ని చక్కగా నిర్వహిస్తాడు.
  • శబ్దాలంకారములైన అనుప్రాస యమకాదులకు ఈ కవి క్వాచిత్కముగా తక్క గొప్ప ప్రాధాన్యతనిచ్చుట లేదు.సేతుబంధమున ఒకే ఒక్క చోట శృంఖలాబద్ధం అనబడే శబ్దచిత్రం ఉన్నది. దీన్నే ముక్తపదగ్రస్తమని అంటారు. అద్భుతభావనాపరిపుష్టమైన ఈ కవిరచనకు శబ్దాలంకారముల అవశ్యకతయునూ కన్పించదు. 
  • అర్థాలంకారములు సేతుబంధమున మిక్కుటములు. ఆలంకారికుడైన భోజుడు తన ’సరస్వతీకంఠాభరణము’ న అనేకసందర్భాలలో అర్థాంతరన్యాస, పరికర, ఉత్ప్రేక్షాది అలంకారములకై సేతుబంధకారుని శ్లోకములను ఉదహరించి యున్నాడు.
  • ఉత్ప్రేక్షాలంకారమున కవి సిద్ధహస్తుడు.
  • యుద్ధఘట్టమున, గంభీరమైన విషయవర్ణనమున సుదీర్ఘసమాసములను, సంయుక్తాక్షరములను కవి ఉపయోగించుట స్పష్టము. ఈ గుణమును అంతకంతకు పెంచి తదనంతరకాలంలో భారవి, కుమారదాస, మాఘకవులు తమ కావ్యములందు యుద్ధవర్ణనములలో చిత్ర, బంధ కవిత్వములను ఉపయోగించుట ఆచారముగా మార్చినారేమో  అనిపిస్తుంది.

యుద్ధము

యుద్ధము తీవ్రమయింది. మేఘనాదుడు యుద్ధానికొచ్చినాడు. ఆతడు రామలక్ష్మణులపై నాగాస్త్రాన్ని సంధించాడు.

19)
ణిద్ధోఆఅసణీలా ణిన్తి విసాణలఫులింగపజ్జలిఅముహా |
ధణుసంధాణవిముక్కా అఉవ్వణారాఅవివ్భమా భుఅఇన్దా ||
సంస్కృతఛాయ:
నిర్ధౌతాయాసనీలా నిర్యాన్తి విషానలస్ఫులింగప్రజ్జ్వలితముఖాః |
ధనుఃసంధానవిముక్తా అపూర్వనారాచవిభ్రమా భుజగేంద్రాః ||

ఇంద్రజిత్తు ధనుస్సును ఎక్కుపెట్టి శరములను సంధింపగా ఆ శరముఖముల నుండి సర్పములు వెడలినై. కొలిమిలో బాగుగా వేడిచేసిన ఇనుమును నీటిలో ముంచి తేల్చినయట్టు (To Temper) ఆ సర్పములు నీలిరంగులో ఉన్నాయట. వాటి ముఖాలనుండి నిప్పుకణాలలాగా విషం చిమ్ముతోంది. 

ప్రాచీన కావ్యాలలో ఏదో ఒక చోట తెలిసో/తెలియకనో కవి కాలమునకు సంబంధించిన చరిత్ర/ఇతర శాస్త్రముల విషయములు కనిపించడం కద్దు. కాళిదాసు రఘువంశము ఆరవసర్గలో "అయస్కాంతేన లోహవత్" - అన్న పద్యపాదములో అయస్కాంతాన్ని ప్రస్తావించినాడు. (అయస్కాంతం ఆ కాలానికి ఉందన్నమాట!) తెలుగున రాయలవారు ఇంద్రనీలమణి తృణగ్రాహకత్వమును ఒకచోట చెప్పినాడు. సేతుబంధకవి శ్లోకము ద్వారా ఉక్కును కొలిమిలో బాగుగా కాల్చి, నీటిలో పెళుసుగా చేసి వాటి ముఖములను వాడిగా చేసి, పక్షి రెక్కలను గట్టుటతో బాణము తయారయ్యే పద్ధతిని పరోక్షంగా చెప్పాడు.

ఇంద్రజిత్తు ప్రయోగించిన నాగాస్త్రము రామలక్ష్మణులను బంధించింది. వారిద్దరునూ నిర్వీర్యులయినారు. అంతట సుగ్రీవుడు కుపితుడైనాడు. రామలక్ష్మణులను కిష్కింధకు కొనిపొమ్మని, తానొక్కడనే రావణునితో యుద్ధము కొనసాగించి ఆతనిని హతమారుస్తానని ఆవేశపడతాడు. రామలక్ష్మణులను బంధించినది నాగాస్త్రమని విభీషణుడు తెలిపిన తర్వాత రాముడు గరుత్మంతుని తలచినాడు. గరుత్మంతుడు నాకము నుండి వచ్చి రామలక్ష్మణుల నాగాస్త్రబంధనమునుండి విముక్తులఁ జేసినాడు.   

భట్టికావ్యకర్త తన "రావణవధ" కావ్యమందు ఈ ఘట్టమును యథాతథముగా సేతుబంధమునుండి స్వీకరించినాడు. భట్టి కావ్యము - కొన్ని తెనుగు రామాయణాధారిత కావ్యములకు, కకావిన్ (జావా ద్వీపపు) రామాయణమునకు మూలముగా కనిపించుచున్నది. 

రావణకుంభకర్ణులు

యుద్ధము తిరిగి యథాతథముగా సాగినది.ధూమ్రాక్షుడు, ప్రహస్తుడు మున్నగు యోధులు యుద్ధమందు నశించినారు. చివరకు రాక్షసరాజు కుంభకర్ణుని యుద్ధమునకు రావించినాడు. ఆ కుంభకర్ణుడిట్లున్నాడు.

20)
ఓచ్ఛణ్ణరఇరహవహో జాఓ దేహస్య సే కణఅపాఆరో |
ఓరుపఏసాలగ్గో దరఖలిఓ వ్వ తవణిజ్జరాఅపరిఅరో ||
ఛాయ:
ఆక్రాంత రవిరథపథో జాతో దేహస్యాస్య కనకప్రాకారః |
ఊరుప్రదేశాలగ్నో దరస్ఖలిత ఇవ తపనీయరాగపరికరః ||

లంకాపట్టణపు సువర్ణప్రాకారము రవిమార్గమును అడ్డుకొనేంత ఎత్తైనది. అంతటి ప్రాకారమే కుంభకర్ణుని ఊరువులను తాకుతోంది. వలయాకృతిలో ఉన్న లంక సువర్ణప్రాకారము, ఆతని కటి ఆభరణము జారినదా అన్నట్లున్నది. రమణీయమైన ఉత్ప్రేక్ష ఇది. కటిబంధము జారుట - అప్పుడే నిద్రనుంచి లేచి వచ్చినాడు అనడానికి వ్యంగ్యము. 

కుంభకర్ణుడూ యుద్ధమున హతుడైనాడు. యుద్ధమున తెగి, సముద్రమున పడిన ఆతని హస్తము రెండవ సేతువులా ఉందని కవి ఉత్ప్రేక్ష. కుంభకర్ణుని అనంతరము మేఘనాదుడు యుద్ధమునకు తిరిగి ఏతెంచినాడు.ఈ సారి అతనిని లక్ష్మణుడు మట్టుపెట్టినాడు.

చివరికి రావణుడే రణరంగానికి వచ్చాడు. వాల్మీకి రాముని బ్రహ్మాస్త్రము దురాత్ముడైన రావణుని హృదయము చీలిస్తే, సేతుబంధకారుని అస్త్రము దశముఖుని దశశిరములను ఒక్క వ్రేటున ఖండించింది.

21)  
ణవరి అ సో రహువఇణా వారం వారేణ చన్దహాసచ్ఛిణ్ణో |
ఎక్కేణ సరేణ లుఓ ఎక్కముహో దహముహస్స ముహసంఘాఓ ||
ఛాయ:
అనన్తరం చ రఘుపతినా వారం వారం చన్ద్రహాసచ్ఛిన్నః |
ఏకేన శరేణ లూన ఏకముఖో దశముఖస్య ముఖసంఘాతః ||

అటుపై చంద్రహాసఖడ్గముతో పూర్వము రావణుడు పరమేశ్వరుని ప్రీత్యర్థము మరల మరల స్వయముగా ఖండించుకున్న శిరములు, రాముని యొక్క శరము వ్రేటునకు అన్ని కలిపి ఒక్కటిగా తెగిపడినై. 

పరమేశ్వరుని మెప్పించుటకు రావణాసురుడు తన శిరములను ఒక్కొక్కటిగా తన చంద్రహాసఖడ్గముతో ఖండించుకొన్నాడని పురాణకథ. రామశరము చంద్రహాసఖడ్గమునకు పదింతలు పదునైనదని ’ధ్వని’.




(చంద్రహాస ఖడ్గధారి రావణుడు - హళేబీడు శిల్పము) 


రావణుని శిరములను రామబాణం ఖండించటం - ఇది వాల్మీకి రామాయణంలో లేదు కానీ, కాళిదాసు రఘువంశంలో ఉంది.

తేన మంత్రప్రయుక్తేన నిమేషార్ధాతపాతయత్ |
స రావణశిరః పంక్తిమజ్ఞాతవ్రణవేదనామ్ ||
బాలార్కప్రతిమేవాప్సు వీచిభిన్నా పతిష్యతః |
రరాజ రక్షః కాయస్య కంఠచ్ఛేదపరంపరా ||
(రఘు. 12.99, 12.100)

అటుపై అర్ధనిముషపర్యంతముననే రాముడు మంత్రప్రయుక్తమైన బ్రహాస్త్రముతో రావణుని తలల వరుసలను, నొప్పి తెలియకయే పడగొట్టెను.తరుణ సూర్యబింబము సెలయేటి అలలలో అనేక బింబములుగా కన్పడినట్టు, రాక్షసరాజు రావణుని శిరముల పంక్తి ప్రకాశించెను.

ఒక్కవ్రేటున దశశిరములు ఖండింపబడటాన్ని - మురారి కవి కూడా అనర్ఘరాఘవములో అపూర్వముగా ఉత్ప్రేక్షించినాడు. 

దివ్యాస్త్రైర్భూర్భువ స్త్రితయడమరణోడ్డామరైరోధయిత్వా
లూనోత్క్షిప్తైః శిరోభిర్దశభిరభినభో దర్శితైకాదశార్కః |
కాకుత్స్థేనావకీర్ణో నిజవిశిఖశిఖాయోగ పీఠోపహూత
బ్రహ్మాస్త్రేణాధిశేతే రజనిచరపతేర్వీరశయ్యాం కబన్ధః ||
(అనర్ఘ - 6.77)
ముల్లోకములను కల్లోలపర్చగల దివ్యాస్త్రములను నిరోధించి, చివరకు రాముడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రముచేత దశశిరములు ఖండింపబడి అంతరిక్షమున పదకొండు సూర్యబింబములవలె ప్రకాశిస్తున్నాయి. ఆతని కళేబరము రణరంగమును అలంకరించింది. 

ఆ సమయమున విభీషణుడు హృదయము ద్రవించునట్లు విలపించినాడు.
22)
జో చ్చిఅ జేఊణా జమం దిట్ఠో ఇచ్ఛాసుహం తుమే జమలోఓ |
దీసిహిసి కహ ణు పత్థివ ఇణిహ తం చేఅ సేసజణసామణ్ణమ్ ||
ఛాయ:
య ఏవ జిత్వా యమం దృష్టః ఇచ్ఛాసుఖం త్వయా యమలోకః|
ద్రక్ష్యసి కథం ను పార్థివ ఇదానీం తమేవ శేషజనసామాన్యమ్ ||

ఏ యముని జయించి ఆతని యింటిని స్వేచ్ఛగా చూచినావో, ఓ నృప! ఆ లోకమునిప్పుడు జనసామాన్యముతో కలసి ఏ విధంగా చూడగలవు? 

పురుషుడైన విభీషణుని విలాపము వాల్మీకి రామాయణమున మండోదరి విలాపమునకు  సామ్యముగా ఉన్నా, ఔచిత్యవంతంగా ఉందో ఊహింపగలరు.

ఇంద్రియాణి పురా జిత్వా జితం త్రిభువనం త్వయా |
స్మరద్భిరివ తద్వైరమింద్రియైరేవ నిర్జితః ||
(వాల్మీకి రామాయణము - యుద్ధకాండ - 111.18)

పూర్వము ఇంద్రియములను, త్రిభువనములనూ జయించి, స్మరునిచే వైరము పొడమి,  ఇంద్రియములచేత నిర్జింపబడితివి.

ఉపసంహారము

ప్రవరసేనకవి ’అనురాగ’ పదలాంఛనుడు. ప్రతి ఆశ్వాసములో, ఆశ్వాసాంతశ్లోకాన "అనురాగ"మను శబ్దమును ఈ కవి ప్రయోగించినాడు. ’అనురాగము’ అన్న శబ్దమును భక్తి, ఇష్టము, ప్రేమ, స్నేహము, ఎఱుపురంగు ఇత్యాది భిన్నార్థములలో ఈ కవి ప్రయోగించాడు. ప్రాకృతకావ్యమున సర్గకు ఆశ్వాసమని పేరు. పదునైదవ  ఆశ్వాసపు కొసన, మరియు కావ్యాంతమున శ్లోకమిది.

23)
ఎత్థ సమప్పఇ ఏఅం సీఆలమ్భేణ జణిఅరామవ్భుఅఅమ్ |
రావణవహ త్తి కవ్వం అణురాఅఙ్కం సమత్థజణణివ్వేసమ్ ||
ఛాయ:
అత్ర సమాప్యతే ఏతత్సీతాలమ్భేన జనితరామాభ్యుదయమ్ |
రావణవధ ఇతి కావ్యమనురాగాఙ్కం సమస్తజననిర్ద్వేషమ్ ||

ఈ విధముగా సీత విరహము వలన జనించిన రామాభ్యుదయమునూ, ’అనురాగము’ యను పదము (ఆశ్వాసాంతమున) చిహ్నముగా కలిగినదియునూ (లేక రామునికి సీతపై గల ప్రేమకు చిహ్నముగా నిర్మించిన సేతుబంధమను చిహ్నము గలదియునూ), సమస్త జనములకు ద్వేషహరణమైనట్టిదియునూ అయిన "రావణవధ" యను కావ్యము ఇచ్చట సమాప్తమగుచున్నది. 

ఆశ్వాసాంతమున ప్రీతికరమైన శబ్దమును శ్లోకమున నిముడ్చు పద్ధతి పాటించిన ప్రాచీనకవులలో ప్రవరసేనుడొకడు. ఆతనికంటే ముందు సర్వసేనుడను ప్రాకృతకవి "హరివిజయ"మను కావ్యంలో, ఆశ్వాసాంతములలో "ఉత్సాహ"మను శబ్దముపయోగించినాడు. ప్రాకృతకవుల పద్ధతిని పాటించి మహాకవి భారవి "లక్ష్మీ" పదలాంచనుడైతే, మాఘుడు "శ్రీ" పదలాంఛనుడయ్యాడు. అటుపై కొందరు తెలుగు కవులు ఆ సాంప్రదాయము ననుసరించారు.  కృష్ణకవి దుష్యంతుని పుత్రుడైన భరతుని చరిత్రమును సంస్కృతములో కావ్యముగా రచించినాడు. ఆ కవి సేతుబంధము యొక్క లక్షణములను ఈ విధముగా తెలిపినాడు.   

జడా(లా)శయస్యాంత రగాధమార్గ మలబ్ధరన్ధ్రం గిరి చౌర్యవృత్త్యా |
లోకేష్వలఙ్కాన్త మపూర్వసేతుం బబంధ కీర్త్యా సహ కుంతలేశః. ||

(భరత చరితము - 1.4)

కుంతలరాజ్యప్రభువు (ప్రవరసేనుడు) జలాశయముపై నిర్మింపనిది, గిరుల నుపయోగింపనిది అయిన అపూర్వ సేతువు (అను కావ్యము)ను నిర్మించి కీర్తి గడించినాడు. ఈ శ్లోకమందు మరొక శ్లేషయున్నది. ’లడయోరభేదః’ కావున - కుంతలరాజ్యప్రభువు (ప్రవరసేనుడు) మందబుద్ధులకు అర్థము కాక గాఢమైనది, ఇతరుల కావ్యముల నుండి సంగ్రహింపనిదియును అయిన అపూర్వ సేతుబంధము అను కావ్యమును నిర్మించి కీర్తి గడించినాడు. ఇచ్చట మందబుద్ధులనగా అపండితులని కాదు, రసహీనులని లక్ష్యార్థం.

సేతుబంధమును గూర్చి వివరముగా చెప్పాలంటే ఆ కావ్యం మొత్తాన్ని అనుశీలించటం తక్క మరొక గతి లేదు. అది ఇప్పటికి అసాధ్యం. ఈ చిన్ని పరిశీలన కొండను అద్ద మందు చూపటానికి చేసిన ప్రయత్నం.

ఫలశ్రుతి

24)
పరివడ్డఇ విణ్ణాణం సంభావిజ్జఇ జసో విడప్పన్తి గుణా |
సువ్వఇ సుఉరిసుచరిఅం కిం తం జేణ ణ హరన్తి కవ్వాలావా||
ఛాయ:
పరివర్ధతే విజ్ఞానం సంభావ్యతే యశః ఊర్జ్యన్తే గుణాః |
శ్రూయతే సుపురుషచరితం కిం తత్ యేన హరన్తి కావ్యాలాపః ||

విశిష్టమైన జ్ఞానము వర్ధిల్లును, కీర్తి దక్కును, గుణములు హెచ్చగును. సుపురుష చరితములైన కావ్యాలాపములు వినుట వలన జరుగనిదేమి? 

Bibliography

సేతుబంధము - రామదాసవ్యాఖ్యానము - కావ్యమాలా సిరీస్ 47
ప్రాకృతవ్యాసమంజరి - సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్య
గాథాసప్తశతి - కావ్యమాల21
వాల్మీకిరామాయణము - కిష్కింధకాండ, యుద్ధకాండ - వావిళ్ళ వారి ప్రతులు
పద్యకవితాపరిచయం - బేతవోలురామబ్రహ్మం గారు
వక్రోక్తి జీవితము -బాలనందిని వ్యాఖ్య - పుల్లెల రామచంద్రుడు 
ధ్వన్యాలోకము - లోచన సహితము - బాలనందిని వ్యాఖ్య - పుల్లెల రామచంద్రుడు
కావ్యప్రకాశము - బాలనందిని వ్యాఖ్య - పుల్లెల రామచంద్రుడు
కావ్యాదర్శము - బాలనందిని వ్యాఖ్య - పుల్లెల రామచంద్రుడు
http://www.valmikiramayan.net/
http://www.sanskritdocuments.org/sites/giirvaani/
http://www.andhrabharati.com/ (మొల్ల రామాయణము)
సరస్వతీకంఠాభరణము - కావ్యమాల94
కిరాతార్జునీయము - మల్లినాథసూరి ఘంటాపథవ్యాఖ్యానసహితము - KpParab
కిరాతార్జునీయము - తెనుగు టీక, తాత్పర్యము - ఎమెస్కో
శిశుపాలవధమ్ - మల్లినాథ సూరి సర్వంకష వ్యాఖ్యానము - చౌఖాంబా ప్రకాశన్
Kakawin Ramayana - 3 Volumes
Carite carite dalam Ramayana.
Inscriptions-of-kambuja-R C Majumdar
History of SouthEast Asia - DGE Hall.
http://www.learnnc.org/lp/multimedia/2557 (prambanan sculptures)
http://web.archive.org/web/20080617213034/http://orias.berkeley.edu/SEARama/imagelibrary.htm (Images of Wat Phra Kaeo temple)
మనుచరిత్రము - శేషాద్రి రమణకవుల వ్యాఖ్యానము - వావిళ్ళ వారి ప్రతి
కుందమాల - నీలమణి దహెల్
Bhattikavya - Jibananda Sagar
Janaki Haranam - I-V - Narayan Vasudev Nagudkar
Janaki Haranam of Kumaradasa - CR Swaminathan
Questions of King Milinda - Rhys Davids
Literary and Historical studies in Indology - VV Mirashi
అనర్ఘరాఘవము - బేతవోలురామబ్రహ్మం గారు
Bharata Charitam - Krishakavi - Trivendrum Sanskrit Series
ప్రతాపరుద్రీయము - విద్యానాథుడు
daSaroopaka - Chowkhamba
ఆంధ్ర దశరూపకము - మల్లాది సూర్యనారాయణశాస్త్రి గారు
Few more websites like national geographics, Google maps etc.