20, ఏప్రిల్ 2022, బుధవారం

మాఘంలో ధ్వనిప్రసంగము


 
శ్రీకృష్ణుడి రథసారథి అయిన దారుకుడు రైవతక పర్వత ప్రాంతాన్ని చూస్తూ, శ్రీకృష్ణునితో చెబుతున్నాడు.

ఆచ్ఛాదితాయత దిగంబరముచ్చకైర్గామ్
ఆక్రమ్య సంస్థితముదగ్ర విశాలశృంగమ్ ।
మూర్ధ్నిం స్ఖలత్తుహినదీధితికోటిమేనమ్
ఉద్వీక్ష్య కో భువి న విస్మయతే నగేశమ్ ॥


ఆచ్ఛాదితాయతదిగంబరం; ఆచ్ఛాదిత = విస్తరించిన; ఆయత = పొడవైన; దిక్ + అంబరం = దిశలును మరియునాకాశమును గలది అయిన; (ఆచ్ఛాదిత = చుట్టుకొనిన; ఆయత = పొడవైన; దిగంబరం = దిక్కులను వస్త్రములు గలవానిని);ఉచ్చకైః = ఉన్నతమై; గాం = భువిని; ఆక్రమ్య = ఆవరించి; సంస్థితం = స్థిరముగా వెలసిన దానిని; ఉదగ్ర = పొడవైన; విశాల = విశాలమైన; శృంగమ్ = శిఖరములు గలదానిని;(ఉదగ్ర = భీకరమైన; విశాల = నిడుపాటి; శృంగమ్ = కొమ్ములు గల; ఉచ్చకైః =  పెద్దదైన; గాం = వృషభమును; ఆక్రమ్య = అధిరోహించి; సంస్థితం = కొలువైన వానిని) మూర్ధ్నిం = శిఖరముపై;  స్ఖలత్ = కరుగు; తుహిన = మంచు యొక్క; దీధితి = ప్రకాశముల; కోటిం = పరంపరను కలిగిన; ఏనమ్ = ఆ యొక్క; నగేశం = పర్వతమును; (మూర్ధ్నిం = తలపై;  స్ఖలత్ = క్షయించు; తుహినదీధితికోటిం = నెలవంకను ; వహించిన; ఏనమ్ = ఆ యొక్క; నగేశం = కైలాసపర్వతవిభుని;) ఉద్వీక్ష్య = బాగుగా అవలోకించి; భువి = భువిపై; కః = ఎవడు; న విస్మయతే? = అబ్బురపాటు నొందడు?

ఓ కేశవా!

ఎల్లెడలా విస్తరించి, పొడవైన దశలను ఆకాశపర్యంతమూ కలిగి.  ఉన్నతములైన, విశాలమైన శిఖరములు గలదియు; ఆ శిఖరములపై కరుగుచున్న మంచు ప్రవాహముల ప్రకాశము గలదియు అయిన ఈ రైవతకపర్వతమును చూచి ఈ భూమిపై యెవడికి ఆశ్చర్యం కలుగదు?

ఈ శ్లోకానికి ఇంకో అర్థం ఉంది.

దిక్కులే వస్త్రములుగా గలిగినవాడును; భీకరమైన కొమ్ములు గలిగిన నందిపై కూర్చున్నవాడు, తన తలపై - అనేక కళలుగల నెలవంకను దాల్చిన ఆ కైలాసేశ్వరుని గాంచి భువిని ఎవడు ఆశ్చర్య చకితుడు కాడు? (అనుగ్రహింపబడితిని గదా యనుకొనడు?)

ఇది మాఘం (శిశుపాలవధమ్) లో ఒక వర్ణన. ఇది చదవగానే సమాసోక్తి అనిపిస్తుంది. ప్రస్తుతమైన ఒక విషయాన్ని వర్ణించి ఆ వర్ణన ద్వారా అప్రస్తుతమైన ఇంకొక విషయాన్ని స్ఫురింపజేయడాన్ని సమాసోక్తి అలంకారం అంటారు.  కొందరికి తుల్యయోగిత అలంకారమనిపిస్తుంది. తుల్యయోగిత అంటే ఒకే విధమైన గుణాలు గల రెండు విషయాలను ఉద్యోతించటం. ఇలాంటిదే మరొకటుంది. శ్లేష అని. శ్లేష అంటే ఒకే కొమ్మకు రెండుపూలు పూచినట్లు ఒకే విధమైన శబ్దముల ద్వారా రెండు భావాలను చెప్పటం. మొదటి భావం వెంటనే, ఇంకొకభావం అంతర్లీనంగా స్ఫురించటం శ్లేష,

ఈ శ్లోకాన్ని వ్యాఖ్యానిస్తూ మల్లినాథసూరి ఇలా పేర్కొంటాడు.

*************

మల్లినాథ సూరి వ్యాఖ్యానం.

ఇది
- తుల్యయోగిత అలంకారము కాదు; ఏలనన ప్రకృత అప్రకృత విషయములలో సామ్యత లేదు;
- సమాసోక్తియును కాదు. ఏలనన విశేషణములలో సామ్యముల వలన;
- శ్లేషయును కాదు. ఉభయశ్లేషయోగము వలన (శబ్దార్థములు రెంటికి నానార్థములు గలవు గాన)
- ప్రాకరణికార్థపర్యవసితమైన అభిధావ్యాపారమైనప్పటికినీ ఇది శబ్దము చేత అర్థాంతరము స్ఫురించు ధ్వనిగా గ్రహించవలెను. కావ్యప్రకాశము ఇట్లు పేర్కొనెను.

'అనేకార్థస్య శబ్దస్య వాచకత్వే నియంత్రితే ।
సంయోగాద్యైః అవాచ్యార్థ ధీకృత్యాపృతి రంజనమ్ ॥' - కావ్యప్రకాశము


శబ్దాల యొక్క వివిధార్థములను వాచ్యముగా ఉపయోగించినను; ఆ అర్థముల కలయిక వలన అవాచ్యము అయిన కొత్త భావము ద్యోతకమగుట ఉండవచ్చును.

*************

విషయమేమంటే - ఈ శ్లోకాన్ని మహిమభట్టు అనే ఆలంకారికుడు పేర్కొన్నాడు. ఈ మహిమభట్టు అనే ఆయన భాక్తవాది. భాక్తవాది అంటే ధ్వనివాదానికి ఆక్షేపించిన వాడు.

ధ్వనివాదం అంటే ఏంటి?
ధ్వని అంటే - ఏదైనా విషయాన్ని ప్రత్యక్షంగా, వాచ్యంగా కాకుండా పరోక్షంగా ఇంకో అర్థం స్ఫురించేట్టు చెప్పడం (అర్థాంతరప్రతీతి) అన్నమాట. ఈ విషయంపైన చాలా లావు పుస్తకం ధ్వన్యాలోకం అనేది ఒకటుంటుంది. అందులో దీనిగురించి తల వాచేట్టుగా వివరణ ఉంటుంది. చదువుకోవచ్చు.

ఈ ధ్వనిసిద్ధాంతం అనేది చాలా పాపులర్. ఈ సిద్ధాంతం మొదలైన తర్వాత కావ్యాత్మ అంటే ధ్వని అని, ధ్వనిపూర్వకంగా వ్రాసిన శ్లోకం కానీ ప్రకరణం కానీ ప్రబంధం కానీ చాలాగొప్పదని కవిత్వానికి ఒక తక్కెడ వేసి తూచే పద్ధతికి ప్రమాణం ఒకటి ఏర్పడిపోయింది.

దీన్ని ఖండించిన వాడు మహిమభట్టు. ఆయన చెప్పే దాని ప్రకారం - వ్యంగ్యం అనేది లేనే లేదు. ఒక వేళ ఉన్నా, అది శబ్దానికి కల శక్తి కాదు. శబ్దాలకు అట్లా పవర్ అనేది ఉండదు. ఏ భాషలోనైనా శబ్దానికి అర్థం అనేది సూటిగా అది సూచించే విషయాన్ని బట్టి మటుకే ఉంటుంది కానీ ఇంకేదో ఉండదు.

ఈ వాదన అంతా కవిత్వం, కావ్యాత్మ అనే కాంటెస్ట్ లో జరుగుతా ఉందని గ్రహించాలి. శబ్దాలకు శక్తి లేదా,మంత్రాలకు ప్రత్యేకమైన శక్తి లేదా? - ఈ ప్రశ్నలిక్కడ అవుటాఫ్ కాంటెస్ట్.

సరే.

ఈ మహిమభట్టు శిశుపాలవధమ్ అనే కావ్యంలోని సరిగ్గా ఇదే శ్లోకాన్ని ఎత్తి చూపి ఈ శ్లోకంలో కనిపించేది ధ్వని అన్న విషయాన్ని ఖండించినాడు.

శబ్దానికి తంత్రము, ప్రసంగము అని రెండు వ్యాపారములు ఉన్నాయి.
తుల్యప్రాధాన్యత గల రెండు అర్థాలను ఒక శబ్దం చెప్పగలిగితే ఆ శబ్దవ్యాపారాన్ని శబ్దతంత్రం అంటాం. అట్లా కాకుండా ఒక విషయమే ప్రధానంగా ఒకశబ్దం (లేదా ఒక పదం/వాక్యం) ఉంటే ఆ శబ్దం తాలూకు వ్యాపారాన్ని ప్రసంగం అంటాం.  

ఈ శ్లోకంలో "నగేశమ్" అన్న శబ్దం ఉంది. (నగేశం అంటే ఈశ్వరుణ్ణి అని ఒక అర్థం. రైవతక పర్వతాన్ని అని ఇంకొక అర్థం). ఇది అర్థాంతరాన్ని తనంతట తానుగా చెప్పడం అనేది ఉండదు.

ఓ దీపం ఉంది. అది ఒక దిమ్మెపై వెలుగుతూంది. దాని వెలుగు అటుపక్కా, ఇటుపక్కా కూడా కనిపిస్తుంది. వెలుగుకున్న స్వతఃసిద్ధమైన గుణం ఇది.

అయితే ఓ శబ్దం ఉంది. దానికి అలా స్వతఃసిద్ధమైన ప్రకాశం అనేది లేదు. ఆ శబ్దతంత్రం ఖచ్చితంగా పాఠకపరామర్శను ఆపేక్షిస్తుంది. అంటే ఇవతల పాఠకుడికి "ఫలానా శివుడు అనే వాడొకడున్నాడు. వాడు కైలాసపర్వతం మీద కూర్చుని ఉంటాడు" అని ఒక జ్ఞానం ఉంటేనే నగేశం అంటే శివుడి గురించి చెప్పిందన్న స్పృహ కలుగుతుంది.

పరామర్శ అనే దానికి ఒక నిమిత్తం అనేది ఉండాలి. (అవును కదా! :D మనం కూడా ఎవరో దారిని పోయే వాణ్ణి కస్టమర్ కేర్ టైపులో పరామర్శించము. ఏదో నిమిత్తం అంటే - అవసరం ఉంటేనే కుశలమా అని అడుగుతాం. ఈ బ్రాకెట్లో ఉన్నది నా వ్యాఖ్యానం. )

అలా నిమిత్తం లేకుండా పరామర్శ అనేది ఉంటే అది అతిప్రసంగం అవుతుందని అంటాడు మహిమభట్టు. మహిమభట్టు నగేశానికి మాత్రమే వాదం చెప్పినా, ఆ వాదం మిగిలిన చోట్లా మనం చెప్పుకోవచ్చు.

*************

ఇంకొంచెం ప్రసంగం.
శ్వేతో ధావతి

అంటే 

శ్వేతః - తెల్లని గుర్రము (పంచకల్యాణి)
ధావతి - పరిగెత్తుతూంది. 

అని ఒకడికి అర్థం స్ఫురించింది.

శ్వేతో ధావతి

అంటే 

శ్వా ఇతః - కుక్క ఇక్కణ్ణుంచి
ధావతి - పరిగెత్తుతూంది.

అని ఇంకొకడనుకున్నాడు.

శబ్దాలకు అర్థాలు అన్నవి మనుజపరామర్శాపేక్షితాలు. అంటే మనుష్యుల భావనలకు తగినట్లు విరుద్ధార్థాలు ఉంటాయి. 

శబ్దానికి అర్థం అనేది అభిధ, లక్షణ, వ్యంగ్య రూపాల్లో ఉంటుందని చాలా తీవ్రంగా కొట్టుకున్న తర్వాత పండితులు ఒక ఏకాభిప్రాయానికి వచ్చినారు.

అభిద అనేది
జాతి (గోవు)
క్రియ (వంట)
గుణము (తెలుపు)
సంకేత (రాముడు)
స్వరూపాత్మకంగా ఉంటుంది.

లక్షణ - విసపుమేతరి అంటే శివుడని అర్థం. విసపు మేతరి అంటే విషాన్ని మేసేవాడని వ్యుత్పత్తి. విషాన్ని ఎవడూ మింగడు కనుక, ఆ పని చేసింది శివుడు కనుక ఆ పేరు అతనికి.

ఇది లక్షణ.

రాజు అంటే చంద్రుడని, ప్రభువని అర్థాలు.

ఓ బాటసారి వెళ్తూ వెళ్తూ ఓ ఊళ్ళూ ఓ గణిక ఇంటి ముందు ఆగినాడు. ఆ ఇంట్లో ఓ యువతి.

" ఓ స్త్రీ, రాజభయంతో ఉన్నాను. ఈ రాత్రికి మీ ఇంట్లో......."

అని అడిగాడు. ఆ కాలంలో కొందరు స్త్రీలు ఇలాంటి విద్యల్లో ఆరితేరినవారు. ఆమెకు అర్థమయింది.

శబ్దానికి అభిద, లక్షణ, వ్యంగ్య అనే 3 రకాల అర్థాలు ఉన్నాయని, అది శబ్దశక్తిలో భాగమని పండితుల ఉవాచ.

కాదని ఒకతను. ఇతను అనేదేమంటే శబ్దానికి ప్రత్యేకంగా ఏ శక్తీ లేదు. అది కేవలం అభిదను మాత్రమే చెప్తుంది. లక్షణ, వ్యంగ్యాలను చెప్పదు.

మరి కొత్త అర్థం ఎలా తెలుస్తుంది? రాజు అంటే ప్రభువు కాదని, చంద్రుని వల్ల వచ్చిన శృంగారకాంక్ష అని ఇవతల మనిషికి ఎలా తెలుస్తుంది? 

అనుమానం వల్ల. అనుమానం అనేది మనిషి స్వాభావిక గుణం కనుక, ఓ ప్రకరణంలో ఓ అర్థం సరిపోకపోతే, ఇంకేదో అర్థం ఉంటుందని ఇవతల వ్యక్తి ఊహించి ఆ శబ్దానికి భిన్న వ్యుత్పత్తిని ఊహించి ఇంకొక అర్థాన్ని కల్పించుకుంటాడు. 

అంతే తప్ప శబ్దం అనేదానికి వ్యంగ్యమనే శక్తి లేదు.

ఇది మహిమభట్టు వాదం.

*************

ఇప్పుడో ఆసక్తికరమైన విషయానికి.

మహిమభట్టు మల్లినాథసూరి కంటే 300 ఏండ్ల పైచిలుకు ముందుకాలపు వాడు. ఆయనకు మల్లినాథసూరి వ్యాఖ్యానంలోని విషయం ఎలా తెలిసింది? ఇది పెద్ద ప్రశ్న. నాకూ సమాధానం తెలియదు.
మాఘకావ్యానికి మల్లినాథసూరి వ్యాఖ్యానం కాకుండా అదనంగా 7 మంది వ్యాఖ్యానాలు ఉన్నాయట. బహుశా ఆ వ్యాఖ్యానాల్లో యెక్కడో ఈ చర్చ జరిగి ఉండాలి. లేదా, లేదా ధ్వని సిధ్ధాంతాన్ని సమర్థించే ఆలంకారికులు ఎవరన్నా మాఘంలో ఇదే శ్లోకాన్ని పేర్కొని దాని గురించి చర్చించి ఉండాలి. ధ్వనివాద సమర్థకాలైన ధ్వన్యాలోకంలోనూ, కావ్యప్రకాశంలోనూ ఈ శ్లోకం ఉదాహృతమై లేదు. ఇంకెక్కడ ఉందో తెలీదు!  

కొన్ని శ్లోకాలపై ప్రత్యేకంగా చాలా రచ్చ జరుగుతూంటుంది. బహుశా మాఘంలో ఇది అలాంటిది.