19, అక్టోబర్ 2013, శనివారం

సంస్కృతసౌరభాలు - ౩


కలశే నిజహేతుదండజః కిము చక్రభ్రమకారితాగుణః |
స తదుచ్ఛకుచౌ భవన్ ప్రభాఝరచక్రభ్రమ మాతనోతి యత్ ||

నిజహేతుదండజః
నిజ = తనదైన
హేతు = నిమిత్తకారణమైన
దండజ = కట్టెవలన బుట్టిన
చక్రభ్రమకారితా= కుమ్మరి చక్రము త్రిప్పుటను చేసెడి
గుణః = ధర్మము
కలశే = కుండయందు
కిము సంక్రాంతః = సంక్రమించినదా ఏమి?
యత్ = ఏలనన
సః = ఆ కుండ
తదుచ్చకుచౌ = ఆ దమయంతి యొక్క ఉన్నతమైన పయోధరములుగా
భవన్ = అగుచు
ప్రభాఝరచక్రభ్రమమ్ = కాంతిప్రవాహమందు చక్ర(వాక పక్షులా అను) భ్రమను
ఆతనోతి = కలిగించుచున్నది.

******************************************

శ్లోకం తాత్పర్యం వ్రాసినా సాధారణంగా అర్థం కా(లే)దు. ఖంగారు పడకండి. ఇదొక నారికేళపాకం. ఈ నారికేళానికి పీచు కూడా పీకాలి. నిదానంగా చూద్దాం.

******************************************


సంస్కృతాధ్యయనంలో పంచమహాకావ్యాల వరుస ఇది. కాళిదాసు రఘువంశం, కుమారసంభవం, భారవి కిరాతార్జునీయం, మాఘుని శిశుపాలవధమ్, శ్రీహర్షుని నైషధీయచరితమ్.

కాళిదాసు కమనీయకవిత్వానికి కేరాఫ్ అడ్రస్ అన్న సంగతి తెలిసిందే. శబ్దమూ, అర్థమూ మహా స్వారస్యంతో కూడి జిలుగులు చిమ్మే కవిత్వం అది. భారవి కవిత్వం కాస్త ప్రౌఢం. భారవేరర్థగౌరవమ్ అని ఒక ఉక్తి. కాళిదాసు కవితలోలాగా ఏ పాదంలో అన్వయం ఆ పాదంలోనే కనబడదు. నాలుగు పాదాలను గాలించి అన్వయాన్ని సాధించవలసి ఉంటుంది. తక్కువ మాటలలో ఎక్కువ అర్థం పొదగడం, పైకి సాధారణంగా చెబుతున్నట్టుగా ఉంటూ, ఆలోచిస్తే లోతైన భావాలు స్ఫురించటం, ఏ మాత్రం ఊహించని విధంగా శ్లోకాలు వాటికి అర్థాలు పొదగగలగటం వగైరాలు ఈయన కవిత్వ విశేషాలు.

న నోననున్నో నున్నోనో నానా నానాననా నను |
నున్నో నున్నో అననున్నేనో నానేనా నున్ననున్ననుత్ ||

కోడ్ లాంగ్వేజీ లాగా ఉన్న ఈ శ్లోకం కిరాతార్జునీయంలోనిది. (౧౫ వ సర్గ ౧౪ వ శ్లోకం). అర్థం మీరే వెతుక్కోగలరు.

మాఘుని కవిత్వంలో కాళిదాసు తాలూకు ఉపమ, భారవి అర్థగౌరవం, దండి తాలూకు పదలాలిత్యం మూడు పెనవేసుకున్నాయని ఒక అభాణకం.

వీరందరిని మించిన కవి...కాదు కాదు పండిత మాన్యుడు శ్రీహర్షుడు. నైషధం విద్వదౌషధం అని ఒక సూక్తి. కవిత్వం వ్రాయడానికి కావలసిన దినుసులు ఏవి అంటే ప్రతిభ, వ్యుత్పత్తి, కావ్యజ్ఞుల దగ్గర శిక్షణ, అభ్యాసం అని మన అలంకారికులు చెప్పారు. రసగంగాధరకర్త మాత్రం ప్రతిభ ఒక్కటే చాలునంటాడు. కానీ సూక్ష్మంగా గమనిస్తే ప్రాచీన సంస్కృతకవులే కాక, తెలుగు ప్రబంధరచయితలతో సహా ఏదో ఒక శాస్త్రంలో వ్యుత్పత్తి సాధించకుండా రచనలు చేసినట్టు కనబడదు. కొంతమందిలో ఈ వ్యుత్పత్తి మరీ ఎక్కువగా కనబడుతుంది. శ్రీహర్షుడు అలాంటాయనే.

ప్రస్తుతానికి వస్తే ఈ శ్లోకానికి అన్వయం కష్టపడి కుదుర్చుకున్నా అర్థం తెలియ(రాలే)దు. శ్రీ రాజన్నశాస్త్రి గారి "మంజూష" అన్న పుస్తకంలో ఈ శ్లోకార్థం వివరించారు. తర్కశాస్త్రాన్ని, కవిసమయాన్ని అందంగా ఉపయోగించుకున్న శ్లోకం ఇది.

కలశాల అందాన్ని అందిపుచ్చుకున్న దమయంతి స్థనసౌందర్యం చక్రభ్రమను అంటే చక్రవాకపక్షులా అన్న భావనను కలిగిస్తూ ఉన్నవని స్థూలంగా అర్థం. (స్తీ పయోధరాలను చక్రవాక పక్షులతో పోల్చటం ప్రాచీన కవిసమయాలలో ఒకటి).

******************************************

సూక్ష్మమైన అర్థం తెలియాలంటే తర్కశాస్త్రంలోకెళ్ళాలి.

కుమ్మరి కుండ చేయటానికి రెండు బంకమట్టిముద్దలను చక్రం మధ్యలో పెడతాడు. ఆ చక్రాన్ని తిప్పుతాడు. అలా తిప్పడానికి ఆ చక్రంపై బిగించిన కర్ర ఊతంగా కావాలి. అలా తిప్పడం వల్ల కుండ ఏర్పడుతుంది. అంటే కుండ (అనే కార్యం) తయారు కావడానికి

- రెండు మట్టి ముద్దలు తప్పనిసరి, ఇవి ప్రత్యక్ష కారణం (సమవాయి కారణం అంటారు) . మట్టి ముద్దలు యే రంగులో ఉంటే కుండ ఆ రంగులోనూ, మట్టి ఎంత నున్నగా ఉంటే కుండ అంత చక్కగాను వస్తుంది కాబట్టి మట్టి ముద్ద ప్రత్యక్షకారణం.

- దండం - అంటే చక్రం త్రిప్పడానికి ఉపయోగించే కర్ర - నిమిత్తకారణం. నిమిత్తకారణం అంటే - నామ్ కే వాస్తే పరోక్షకారణం - అంటే కుండ తయారీకి కర్ర కావాలి కానీ కర్ర తాలూకు లక్షణాలు చివరన కుండలో చేరవు.

సంస్కృత తర్కశాస్త్రంలో దీన్ని చెప్పడానికి సూత్రం ఉంది. "సమవాయికారణగుణాః కార్యే సంక్రామంతి న నిమిత్తకారణగుణాః" - ఏవైతే ప్రత్యక్షకారణాలో వాటి లక్షణాలే ఫలితంలోనూ వస్తాయి.

(ఈ సూత్రం కవిత్వలక్షణాలకు అన్వయిస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలి! :))

******************************************

పైన వివరణ చదివారు కదా. ఇప్పుడు శ్లోకానికి వస్తే - తర్కశాస్త్రం మాట ఎలా ఉన్నా దమయంతి కుచములు అనే కలశాలలో మాత్రం (ఆ కలశం తిప్పడానికి ఉపయోగించిన) కర్ర లక్షణాలు ఉన్నాయి(ష). ఆ లక్షణమేది? చక్రభ్రమ (చక్రాన్ని త్రిప్పుట) అనే లక్షణం. చక్రభ్రమ - "అంటే చక్రవాకపక్షులా అనే ఒక భ్రమ" అని దమయంతి విషయంలో శ్లేష!

******************************************

ఇంకా అర్థం కాకపోతే ఏమీ చేయడానికి లేదు. ఈ నైషధీయచరితాన్ని శ్రీహర్షుడు మొదట రాసిన వర్షన్ కు అర్థం తెలియకపోతే తేలికగా మళ్ళీ, మళ్ళీ అర్థం కాకపోతే తిరిగి తేలికగా మళ్ళీ, ఇలా మళ్ళీ మళ్ళీ ఆరుసార్లు తిరగవ్రాశాడుట. ఇన్ని సార్లు తేలికపర్చినా ఇలా ఉందిది!

అడుగు అడుగునా అమృతాంజనము రాచుకొను భావములకు హర్షుఢు భోషాణము - అని పుట్టపర్తి నారాయణాచార్యులు చమత్కరించారు కొంత నిజం, చాలా అబద్ధం. చక్కని అందమైన కవిత్వానికీ శ్రీహర్షుడు పెట్టింది పేరు. అలాంటి ఒక శ్లోకం ఇదే ఘట్టం నుండి. (పైన తల్నెప్పికి పరిహారం :))

ధృతలాంచనగోమయాంచనం విధుమాలేపనపాండురం విధిః |
భ్రమయత్యుచితం విదర్భజాऽనననీరాజన వర్ధమానకమ్ ||

బ్రహ్మ చంద్రుడనే తట్టను చంద్రునిలోని మచ్చ అనే గోమయంతో శుద్ది చేసి, కాంతిపుంజమనే దీపకళికను (కర్పూరం ముక్కను) పెట్టి ఆ అమ్మాయి మోముకు నీరాజనం పడుతున్నాడట. గోమయంతో శుద్ధి చేసి నీరాజనం పట్టటం మనకు ఒకప్పటి దేశాచారం.

ఎంత బావుందో కదా!

దమయంతి తాలూకు ఈ రెండు వర్ణనలూ హంస నలునితో ఆమెను వర్ణిస్తూ చెప్పినవి. ఇలాంటి హంస ఒకటి నా దగ్గర ఉంటే ఎంత బావుండు?

12, అక్టోబర్ 2013, శనివారం

సంస్కృతసౌరభాలు - 2


సిలం కిమనలం భవేదనలమౌదరం బాధితుమ్
పయః ప్రసృతి పూరకం కిము న ధారకం సారసమ్ |
అయత్నమలమల్లకం పథి పటచ్చరం కచ్చరమ్
భజన్తి విబుధాః ముధాన్ హ్యహహ కుక్షితః కుక్షితః ||


ఔదరం అనలం = కడుపు లోని నిప్పును,బాధితుమ్ = చల్లార్చడానికి,సిలం = ఏరుకుని వచ్చిన ధాన్యం,కిమ్ అన్ అలం భవేత్? = చాలవా?; ప్రసృతిపూరకం = రెండు చేతులలో నిండుగా నిండిన,పయః = నీరు,సారసం = ద్రప్పిని కిము న ధారకం = తట్టుకోవడానికి సరిపడవా?; అయత్నం = అప్రయత్నంగా,పథి = దారిని (ఉన్న),పటచ్చరం = ప్రాతగుడ్డ,అల్లకం కచ్చరం = ఏర్పడిన గోచిగా,అలం? = చాలును కదా; విబుధాః = పండితులు,ముధాన్ = ముష్కరులను,కుక్షితః కుక్షితః = కేవలం కడుపు కోసం; భజన్తి హి అహహ = భజిస్తున్నారే..హహ!

*********************************************

అది పదుమూడవశతాబ్దం. విద్యారణ్యస్వాములవారి నేతృత్వంలో బుక్కరాయలు విజయనగరసామ్రాజ్యాన్ని నెలకొల్పిన రోజులు. ఆ రోజుల్లో దక్షిణాన శ్రీరంగంపై మాలిక్ కాఫర్ దండెత్తాడు. ఆ సమయంలో ఒకానొక మహానుభావుడు - ఆలయ మూలవిరాట్టు శ్రీరంగనాథుని విగ్రహాన్ని, మరణించిన తన మిత్రుడైన సుదర్శనభట్టు "శ్రుతిప్రకాశిక" వ్యాఖ్యానాన్ని, వారి ఇద్దరు కుమారులను వీపున కట్టుకుని, శవాల క్రింద దాక్కుని, అతిక్లిష్టపరిస్థితుల్లో రాజ్యం దాటారు.

బుక్కరాయలకు విషయం తెలిసింది. తమ దండనాథులు, చంద్రగిరి ప్రభువులు అయిన సాళ్వ గోపన్నను దాడిని తిప్పికొట్టమని పురమాయించాడు. సాళ్వగోపన్న శ్రీరంగానికి వెళ్ళి చాలా యేళ్ళు కాపు కాసి తుదకు మాలిక్ కాఫర్ ను తరిమి శాంతిని నెలకొల్పాడు. ఆ తర్వాత ఆ స్వామి తిరిగి శ్రీరంగానికి వచ్చి ఆగమ శాస్త్ర విధులకనుగుణంగా రంగవిభుణ్ణి పునఃప్రతిష్టించాడు.

ఆ స్వామి పేరు వేదాన్తదేశికులు. శ్రీ విద్యారణ్య మునికి చిన్నప్పుడు కంచిలో సహాధ్యాయి. విశిష్టాద్వైత పరంపరలో ఒక గొప్ప గురువు. శతాధిక గ్రంథకర్త.

*********************************************

శ్రీ మదాదిశంకరుల వారు స్తోత్ర వాఙ్మయం కాకుండా కావ్యవాఙ్మయంవైపు దృష్టి సారించి ఉంటే కాళిదాసు వెలవెలబోయి ఉండే వాడని పండితులు చెబుతారు. అలాంటి ఆదిశంకరుల వారితో తర్కజ్ఞానంలో పోటీపడగలిగిన చారిత్రక వ్యక్తి ఆచార్య నాగార్జునుడైతే, ఆయన పాండిత్యంతో, తర్కజ్ఞానంతో రెంటితో నిలువగలిగిన గొప్పవ్యక్తి వేదాన్తదేశికులవారు. శ్రీ వేదాన్తదేశికుల వారు జీవితాంతం భిక్షుక వృత్తితో జీవించారు.

ఓ మారు విద్యారణ్యుల వారికీ (అద్వితం), అక్షోభ్య తీర్థుల వారికి (ద్వైతమతాచార్యులు) మధ్య "తత్త్వమసి" అన్న ఉపనిషద్వాక్యంపైన సంవాదం వచ్చిందట. ఆ సందర్భంలో వారిద్దరి వాదాలను పరిశీలించి తీర్పు చెప్పడానికి మధ్యవర్తిగా శ్రీ వేదాన్తదేశికుల వారిని పిలిపించారు.

ఇద్దరి వాదాలను విన్న దేశికుల వారు అక్షోభ్యతీర్థుల వాదం సరైనదని తీర్పు చెప్పారు. అందుకనే ద్వైతులు అక్షోభ్యతీర్థుని గురించి - "అసినా తత్త్వమసినా పరజీవప్రభేదినా విద్యారణ్యమహారణ్యమక్షోభ్యమునిరచ్ఛిరత్" (జీవ పరమాత్మలకు భేదాన్ని నిరూపించే తత్వమసి అనే ఖడ్గం ద్వారా, విద్యారణ్యులనబడే ఒక గొప్ప అడవిని ఛేదించారు) అని చెప్పుకుంటారని ఒక గాథ.

దేశికులవారి పాండిత్యాన్ని పరిశీలించడానికి మరొక వైష్ణవాచార్యుల వారికి, ఈయనకు మధ్య పోటీ పెట్టారు. అప్పుడు దేశికులవారు ఒక్క రాత్రిలో "పాదుకాసహస్రం" అన్న స్తోత్రకావ్యాన్ని రచించారు. కానీ తీరా స్పర్ధ మొదలైనప్పుడు ఒక్క మాట అన్నారుట.

సూతే సూకరయువతీ శతసుతమత్యన్తదుర్భగం ఝటితి |
కరిణీ చిరాయ సూతే సకలమహీపాల లాలితం కలభమ్ ||

పంది దుర్భరంగా ఉన్న వందమంది పిల్లలను ఒక్క కాన్పులో పెట్టవచ్చు. కానీ ఆడు యేనుగు ఎప్పుడో అయినా రాజులందరి చేత లాలించబడే ఒకే ఒక యేనుగును కంటుంది.మేము వేగంగా వేయి శ్లోకాలు రచించి ఉండవచ్చు గాక, అది అల్పమైనది. మీ కావ్యం మాత్రం మహా పాండిత్యంతో ప్రకాశిస్తుంది. మీ ముందు నేను, నా పాండిత్యం నిలువదు కదా - ఇది శ్రీ దేశికుల వారి వినయం. విశిష్టాద్వైతంలోని "ఆకించన్యం" - అంటే నేను ఒక శూన్యుణ్ణి అనే ఒక భావనకు ఈయన ప్రత్యక్షరూపం. దీన్నే శ్రీవైష్ణవులు "భృత్యస్య భృత్య పరిచారికా భృత్యస్య భృత్యభృత్యః" అన్న సూత్రంతో చెప్పుకుంటారు.

మరో కథ. శ్రీ దేశికుల వారు వస్తుంటే ఆయనను పరాభవించాలని ఒక తమిళ భక్తుడు వారు వెళ్ళే దారిని చెప్పులు వేలాడగట్టారట. దేశికుల వారు ఆ చెప్పులను తలపై దాల్చి వినయంగా అన్నారుట -

కేచిత్ కర్మావలంబినః కేచిత్ జ్ఞానావలంబినః |
వయం తు హరిదాసానాం పాదరక్షావలంబినః ||

"కొందరిది కర్మమార్గం, కొందరిది జ్ఞానమార్గం. మా వంటి హరిదాసులది భక్తుల పాదుకలను కూడా శిరముపై దాల్చే (భక్తి) మార్గం."

పాదుకాసహస్రం ఒక మహత్తరమైన పారాయణగ్రంథం. వీరు ఇంకా యాదవాభ్యుదయం, శతదూషణి, గరుడపంచశతి, ఇత్యాది అనేక తమిళ, సంస్కృత గ్రంథాలు వెలయించారు. ఈయనను వేంకటరమణుని ఘంటావతారంగా భక్తులు భావిస్తారు.

ఈయనకు "సర్వతంత్ర స్వతంత్రు"లని బిరుదు. ఈ బిరుదాన్ని ఎద్దేవా చేస్తే ఈయన ఎలా ఎదుర్కొన్నారని కొన్ని కథలు ఉన్నాయి.ఈ మహానుభావుణ్ణి శ్రీ విద్యారణ్యుల వారు తమ రాజ్యానికి వేంచేసి ఆస్థాన విద్వాంసునిగా పదవినలంకరించవలసిందని మనవి చేస్తే ఆయన ప్రత్యుత్తరంగా ఐదు శ్లోకాలను విద్యారణ్యస్వామికి పంపారుట. ఆ ఐదుశ్లోకాలకు వైరాగ్య పంచకమని పేరు. అందులో రెండవశ్లోకం పైన పేర్కొన్నది. విద్యారణ్యుల వారు చేసేది లేక బుక్కరాయలను తమ సమక్షంలో తీసుకొని వస్తాను ఆశీర్వదించమని అడిగారుట. దానికీ శ్రీ వేదాన్తదేశికులు ఒప్పలేదు.

********************************************

ఆ వైరాగ్యపంచకములో మిగిలిన నాలుగు శ్లోకాలివి.

క్షోణీకోణశతాంశపాలనకళాదుర్వారగర్వానల
క్షుభ్యత్ క్షుద్రనరేంద్రచాటురచనాధన్యాన్నమన్యామహే
దేవం సేవితుమేవ నిశ్చినుమహే యోऽసౌ దయాళుః పురా
ధానాముష్టిముచే కుచేలుమునయే దత్తేऽస్మ విత్తేశతమ్

(భూమి తాలూకు ఒక ముక్కను పాలిస్తూ గర్వంతో మిడిసిపడే క్షుద్రరాజన్యులను కీర్తిస్తూ మురిసే తత్వం కాదు మాది. ఒక పిడికిలి మాత్రం అటుకులను తీసుకుని సర్వసంపదలూ అనుగ్రహించిన అనంతుడైన దేవదేవుని సేవించడమే మా నిశ్చయమైన ప్రవృత్తి)

జ్వలతు జలధిక్రోడ క్రీడత్ కృపీడ భావప్రభా
ప్రతిభాత పటుజ్వాలామాలాకులో జఠరానలః
తృణమపి వయమ్ సాయం సంఫుల్ల మల్లిమతల్లికా
మరిమళముచా వచా యాచామహే న మహీశ్వరాన్

(సముద్రం లోపల అగ్ని ప్రజ్వరిల్లినట్టు మా ఉదరంలో ఆకలి తీవ్రంగా బాధపెట్టినప్పటికీ ఒక్క గడ్డిపోచను కూడా మహారాజులవద్ద యాచించము. వికసితమైన మల్లికా పరిమళాదులసదృశంగా మా జీవితం ఉండగలదు)

దురీశ్వర ద్వార బహిర్వితర్దికా
దురాసికాయై రచితోయమంజలి: |
యదంజనాభం నిరపాయమస్తి మే
ధనంజయ స్యందన భూషణం ధనం ||

అహంకారులైన రాజుల ద్వారాం దగ్గర కాచుకుని ఉండే ఆలోచనకు నమస్కారం. కాటుకవంటివాని, అర్జునుని రథానికి అలంకారభూషితుడైన వాని రంగువలే నల్లని శాశ్వతమైన ధనం మా వద్ద లేదా?

శరీరపతనావధి ప్రభునిషేవణాపాదనాత్
అబింధనధనంజయప్రశమదం ధనం దంధనం |
ధనంజయవివర్ధనం ధనముదూఢ గోవర్ధనం
సుసాధనమబాధనం సుమనసాం సమారాధనం ||

ఈ దేహం శిథిలమయే వరకూ క్షుధానలం నశించేవరకూ తమనాశ్రయించమని రాజులు హింసించనీ. మాకొద్దు. మా ధనమంతా - అర్జునుని తీర్చిదిద్దినట్టిది, గోవర్ధనగిరిని ఎత్తినట్టిది, ఎన్నడూ చెడుకార్యాన్ని చేయించనిది, దేవతలందరి అవసరాలను తీర్చునది. అదే మాకు నిధనం.

సంస్కృతసౌరభాలు - 1


మధుద్విరేఫః కుసుమైకపాత్రే
పపౌ ప్రియాం స్వామనువర్తమానః |
శృంగేణ సంస్పర్శ నిమీలితాక్షీం
మృగీమకండూయత కృష్ణసారః ||

ద్విరేఫః = తుమ్మెద, కుసుమైకపాత్రే = పువ్వు అనే ఒక గిన్నెలోని, మధు = తేనెను, స్వాం ప్రియాం = తన ప్రియురాలిని, అనువర్తమానః= అనుసరించి, పపౌ = త్రాగినది.

కృష్ణసారః = దుప్పి,సంస్పర్శనిమీలితాక్షీం = తనస్పర్శతో మోహం పొంది కళ్ళు కాస్త మూసుకున్న,మృగీం = ఆడుజింకను, శృంగేణ = కొమ్ముతో, అకండూయత = గోకింది.

శివుడు తీక్ష్ణంగా తపస్సు చేస్తున్నాడు. ఆయన తపస్సు చేస్తుండగా వసంతం వచ్చింది. అప్పుడు అడవిలో జంతువులను, ప్రకృతిని వర్ణిస్తున్నాడు కవి.

ఒక తుమ్మెద, పువ్వు అనే గిన్నెలో తన ప్రియురాలితో కలిసి తేనెను పంచుకుని త్రాగుతూందట. ప్రియురాలిని అనుసరించి - అంటే ప్రియురాలు త్రావిన తేనెను మగతుమ్మెద తాగుతూంది అని - చమత్కారం. అలాగే ఓ దుప్పి, ఇంకో ఆడజింకను గోకుతుందట. ఆ ఆడుజింక కళ్ళు సగం మూసుకుంది. అంటే ఇంకాస్త గోకనీ అని ఆ గోకుడు తాలూకు అనుభవాన్ని ఆస్వాదిస్తూంది. ఇంకా - ఒక ఆడుయేనుగు పుప్పొడితో సువాసన అలముకున్న కొలనులో నీళ్ళను మగయేనుగుకు తొండంలో పట్టి ఇస్తూందట. ఓ హంసేమో సగం కొరికిన తామరతూడును జంట హంసకిస్తూంది. ఒక తీవె చెట్టుకు అల్లుకుంది. ఎలాగ? తన చివురుటాకుల పెదవులను, తనలోని మాగినపళ్ళగుత్తుల పయోధరాలను ప్రియుడైన చెట్టుకు అందిస్తో.

ఇలాంటి వాతావరణంలో ఆయన తపస్సు చేస్తున్నాడు!

*******************************************

కావ్యం సుకుమారము, విచిత్రము, ఉభయము అని కుంతకుడు అనే ఒక అలంకారికుడు చెబుతాడు. వీటిని రీతులు అంటారు. ఈ రీతులకు ఇతర అలంకారికులు వైదర్భి, గౌడి, పాంచాలి అని వేరే పేర్లు పెట్టుకున్నారు. ఈయన పేర్లు మాత్రం ఇవి. ఇందులో సుకుమారము అనే రీతి (method) లో కావ్యం ఉండాలంటే వాటికి కొన్ని లక్షణాలు చెప్పాడతను. ఆ లక్షణాలలో ఒక లక్షణం ఏవంటే - చెప్పే భావంలో స్వభావప్రధానమై ఉండాలి. ఎక్కడెక్కడివో పోలికలు తీసుకొచ్చి ముడి పెట్టకూడదు. కవి తన వ్యుత్పత్తితోటి కల్పితమైన కౌశలం చూపిస్తే అది సుకుమారం కాజాలదు.

ఈ రీతికి ఉదాహరణగా కుంతకుడు ఇచ్చిన ఉదాహరణ పై శ్లోకం. ఎంత స్వభావసుందరంగా ఉందో కదా!

********************************************

పై శ్లోకాన్ని పుట్టపర్తి నారాయణాచార్యుల వారు 
ఓ సందర్భాన ప్రస్తావించారు. ఇలాంటిది రామాయణంలో వాల్మీకి కవి శ్లోకమొకటుంది. దాన్నే కాళిదాసు పైన శ్లోకంలో అనుసరించాడని అన్నారు.

ఇదం మృష్ట మిదం స్వాదు ప్రఫుల్లమిదమిత్యపి |
రాగమత్తో మధుకరః కుసుమేష్వేవ లీయతే ||

"ఇదుగో ఈ పువ్వులో తేనె నిండుగా ఉంది, ఇందులో తేనె రుచికరంగా ఉంటుంది, అర్రె ఈ పువ్వు బాగా వికసించిందే!" అనుకుంటూ రాగమత్త మైన ఒక తుమ్మెద పువ్వు పువ్వు మీదా వాలుతూ పోతూంది.

ఇక్కడా సహజసుందరమైన వర్ణనే. ఈ వర్ణనకు తోడు వాల్మీకి చేసిన గమ్మత్తు - "రాగమత్తః" అన్న శబ్దం. రాగ అంటే అనురాగము అని ఒక అర్థం, ఎరుపు అని మరొక అర్థం, సుందరమైన నాదమని మరొక అర్థం.

రాగమత్త అయిన తుమ్మెద అంటే - అనురాగ పరవశ అయిన తుమ్మెద. తుమ్మెద అనురాగవశ ఎందుకు అయింది (అయి ఉంటుంది?) - అంటే - పక్కన మరో జంటతుమ్మెద ఉండాలి కాబట్టి అని సమాధానం రావాలి.

అలాగే రాగమత్త - ఎరుపురంగుకు పరవశం ఎందుకంటే పుప్పొడి తాలూకు ఎరుపు, పసుపు వర్ణాల కలయికకు అలవాటు పడింది కనుక. రాగమత్త - నాదానికి పరవశ - ఏ నాదానికి? తన తోటి తుమ్మెద చేసే ఝుంకార నాదానికి. ఇక్కడా తుమ్మెదకు తోడు ఉందని ప్రతీయమానార్థం.

వాల్మీకి రచన సహజసుందరమూ, ధ్వని భరితమూ అయితే కాళిదాసు రచన శృంగారరసోపవిష్టమూ, సహజమూ.దేని త్రోవ దానిదే. ఆచార్యులు మాత్రం కాళిదాసు కవిత వాల్మీకి కవితను అనుసరించబోతే భాష బరువు అడ్డుపడిందన్నారు. ఏమో, కావచ్చు! మన బోంట్లకు ఆ విషయం నిర్ణయించే అధికారం, అణేబారం లేదు.

********************************************