24, ఫిబ్రవరి 2014, సోమవారం

సీత సమాధానం

కం||
ఉవిద! హృది సదా కరుణము
కవిస్మరణభాజి గాథ కమలాశ్రితమే,
అవికలసచ్ఛీలి యశము.
భువిద్విష! దురిత కరహిత ప్రోక్తులు చాలున్.

చ్యుతాక్షరి ఒక ప్రహేళిక. అంటే అక్షరాలతో ఆట.

రావణాసురుడు సీతతో అంటున్నాడు. (మొదటి మూడుపాదాలు)

అమ్మాయీ! నా హృది సదా కరుణతో ఉన్నది.
నా గాథ కవిస్మరణభాజి - కవులచే స్మరించదగినది, నా గాథ కమలాశ్రితము అంటే లక్ష్మీస్వరూపమైనది.
నా కీర్తి - అవికల - దోషాలు లేని, సచ్ఛీలి = మంచి శీలము గలది.

దీనికి సీత సమాధానం
భువిద్విష = భూమికి శత్రువుగా అయిన వాడా!
దురితకర హిత = పాపం చేసే వారికి హితమైన
ప్రోక్తులు = ప్రసిద్దమైన పలుకులు
చాలున్ = చాలును.

దురితకరహిత - ఇక్కడ మరొక విధమైన శ్లేష కూడా ఉంది.

దురిత = పాపీ
"క" రహిత = నీవు పైన చెప్పిన మాటలలో "క" తీసివేస్తే వచ్చే
ప్రోక్తులు = పలుకులు
చాలున్ = చాలునులే.

క తీసివేస్తే ఏమి వస్తుందో చూద్దాం.
ఉవిద! హృది సదారుణము = అమ్మాయీ, నా హృదయము దారుణమైనది
విస్మరణభాజి గాథ మలాశ్రితమే
నా గాథ - విస్మరణభాజి = గుర్తుంచుకోదగ్గది కాదు.
నా గాథ మలాశ్రితము = నా కథ మలానికి ఆలవాలమైనది.
ఇక యశము
అవిలసచ్ఛీలి యశము.
అవిలసత్ శీలి = ప్రకాశించని శీలము కలది. అంటే నల్లనిది, చెడ్డది.

ఇలా రావణుని మాటలకు ఒక అక్షరం తీసివేసి సీత జవాబు చెప్పినదన్నమాట.

నా పద్యానికి స్ఫూర్తి ఒకానొక సంస్కృతశ్లోకం.

(పొరబాట్లు క్షంతవ్యాలు)

20, ఫిబ్రవరి 2014, గురువారం

సంస్కృతసౌరభాలు - 18



క్షీర సాగర తరంగ శీకరాసార తారకిత చారుమూర్తయే!
భోగిభోగ శయనీయశాయినే మాధవాయ మధువిద్విషే నమ:!!

క్షీరసాగర తరంగ = పాలకడలి అలల యొక్క
శీకరాసార = బిందువులచేత నింపబడిన
తారకిత చారుమూర్తయే = చుక్కలు కలిగిన అందమైన వానికి
భోగి భోగ శయనీయ శాయినే = ఆదిశేషుని పై పవళించిన వానికి
మాధవాయ = మాధవునకు
మధువిద్విషే = మధు అను రాక్షసునకు శత్రువైన వానికి
నమః = జోత.

శ్రీ మహావిష్ణువు పాలకడలిలో ఆదిశేషునిపై పవళించి ఉన్నాడు. ఆ పాలకడలి తరంగాల తుంపరలు ఆయన నల్లని తనువుపైన అక్కడక్కడా చింది ఆకాశంలో చుక్కల్లా మెరుస్తున్నాయి. అలాంటి మహావిష్ణువుకు నమస్కారం.

***********************************************

తెలుగు భాష నేర్చుకునేప్పుడు మొట్టమొదటగా వేమన పద్యాలు, చిన్న చిన్న పొడుపు కథలూ, సుమతీశతక పద్యాలు, పోతన భాగవతపద్యాలు - ఇలా ఆరంభిస్తాం. సంస్కృతాధ్యయనం లోనూ ఒక వరుస ఉంది. మొదట బాలరామాయణం, అమరకోశం, శబ్దమంజరీ, ముకుంద మాల,

ధాతువులూ, భర్తృహరి, ఆపైన రఘువంశం, కుమారసంభవం....

పై వరుసలో ముకున్దమాల ఉండటమే ఆ మహనీయమైన స్తోత్ర కావ్యం గొప్పతనాన్ని చెప్పక చెబుతుంది. విశిష్టాద్వైత మతం - అందుకు సంబంధించిన భక్తి సాహిత్యం అనర్ఘ, అమూల్య రత్నాలను ఎన్నిటినో సృష్టించింది. అందులో గొప్ప హృదయంగమమైన స్తోత్రం ముకున్దమాల.

ముకున్దమాల - ఎంత అందమైన పేరు? ఇది ముకుందునికి కుందములతో కట్టిన ఓ మూరెడు దండ. ఈ మూరలో నలభై గుండు మల్లెలు.

ఈ స్తోత్ర కావ్యం - చదువుకోవటానికి, చక్కగా ముకుందుని తలుచుకోవడానికి పనికి వస్తుంది, కానీ ఇందులో కావ్యగౌరవం కలిగించే అంశాలేవీ? - ఈ ఆలోచన వస్తే దాని వెనుక కొన్ని పొరబాటు ఆలోచనల నేపథ్యం ఉందని గ్రహించాలి. అర్థం తప్ప శబ్దానికి ప్రాముఖ్యత లేదు. గొప్ప గంభీరమైన భావాలు, పాఠకుని మేధోశక్తికి సవాలుగా నిలిచే కవిత్వం గొప్పది అన్న అహంకారపూరిత భావన పొరబాటుకు కారణం. నిజానికి - సులభంగా వ్రాయడం కష్టం. కష్టంగా వ్రాయడం సులభం.

సమాసం అంటే రెండు లేక అంతకన్నా ఎక్కువ పదముల యొక్క అర్థవంతమైన, క్రమబద్ధమైన కూర్పు. ఆ సమాసం తాలూకు అర్థాన్ని వివరించే ప్రక్రియ విగ్రహవాక్యం. ఆ కూర్పు తాలూకు పద్ధతిని చెప్పేది సమాసనామం - తత్పురుషం, కర్మధారయం, ద్వంద్వము, ద్విగు, బహువ్రీహి..ఇలా. ఇదంతా ఒక తంతు. అయితే అందమైన సమాసానికి ఒక ప్రాచీన లక్షణకారుడు కొన్ని లక్షణాలు చెబుతాడు. చక్కటి సమాసం లో ఒక్కొక్క శబ్దానికి మధ్య అవధి ఉండాలి. సమాసంలో శబ్దానికి మధ్య చక్కటి అనుప్రాస కావాలి. మొదటి శబ్దం, అవధి, తర్వాతి శబ్దం ఆరంభించేప్పుడు దీర్ఘం, లేక చక్కని అనుస్వారయుతమైన అక్షరంతో ఆరంభించడం శోభస్కరం. ఈ సమాసం కఠిన శబ్దాలతో ఉండవచ్చు, అయితే కఠినశబ్దాలు వరుసగా రావటం మంచిది కాదు. సుకుమారత్వం మరింత శోభస్కరం. ఇక ఈ క్రింది సమాసం చూడండి.

క్షీర-సాగర-తరంగ-శీకరాసార-తారకిత-చారుమూర్తి -

శబ్దాల కూర్పు "ర" అనే సరళమైన అక్షరంతో కూడిన అనుప్రాసతో ఎంత అందంగా అమరిందో చూస్తూనే గ్రహించవచ్చు. చక్కటి సమాసాన్ని రసహృదయులు దాని నాదంతోనే గుర్తించగలరట. పై సమాసం అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అంతే కాదండోయ్. సమాసం కూర్పు ఎంత అందంగా, సునాయాసంగా ఉంటే ఆ పద్యం/శ్లోకం/వచనం/దండకం/మరేదైనా అంత తొందరగా వల్లె వేయడానికి అనువుగా ఉంటుందిట. ఈ అందమైన సమాసానికి భావం కూడా అంత హృద్యంగా ఉంటే ఆ కవి మహాకవి. ముకుందమాల రచించిన కులశేఖరుడు/కులశేఖరాళ్వారు మహాకవి. మహాభక్తుడు కూడా.

సుధా-సముద్రాంత-రుద్యన్మణిద్వీప-సంరూఢ-బిల్వాటవీమధ్య-కల్పద్రుమాకల్ప-కాదంబ-కాంతార-వాసప్రియ - కాళిదాసు శ్యామలాదండకం


ఘనదర్ప-కందర్ప- సౌందర్య- సోదర్య-హృద్య-నిరవద్య-రూపో-భూపః - ఇది దండి దశకుమారచరిత్ర ఆరంభంలో వచ్చే రాజవాహనుడనే రాజుకు విశేషణాలు కూర్చిన సమాసం.

సమాసం ఎలా ఉండాలో వీటిని చూస్తూనే లేదా ఒక మారు మనసులో తలుచుకుంటేనే తెలియడం లేదూ?

ఈ మధ్య చూచిన ఒక తెలుగు పద్యం ఇది. సుదర్శనచక్రవర్ణన అనుకుంటాను.

జ్వాలాజాలజటాల మాసురవధూభాస్వత్కపోలస్థలీ
హేలాకుంకుమపత్రరచనా హేవాక వాల్లభ్యహృత్
క్ష్వేలాభీలము ......

జ్వాలా-జాల-జటాలము
ఆసురవధూ-భాస్వత్కపోల
..
..

గొప్ప సమాసానికి నాదం మాత్రమే కాదు ధారాశుద్ధి కూడా అలవోకగా అమరుతుంది.

ముకుందమాలలో ఈ క్రింది మనోహరమైన పద్యం గమనించండి.

కరచరణ సరోజే కాంతిమన్నేత్రమీనే
శ్రమముషి భుజవీచివ్యాకులే ऽ గాధమార్గే !
హరిసరసి విగాహ్యా పీయ తేజోజలౌఘం
భవమరుపరిఖిన్న: ఖేదమద్య త్యజామి!!

(హరి ఒక తటాకం. ఆయన కరచరణాలు ఆ తటాకపు సరోజాలు. ఆయన కాంతివంతమైన కనులు ఆ తటాకంలో విహరించే మీనాలు. ఆయన భుజాలు తటాకపు అలలు. అగాధమైన ఆ సరస్సులో మునిగి, తేజోబలసంపన్నమైన ఆ తటాకపు ఈటిని గ్రోలి, సంసారజనితమైన దుఃఖాన్ని ఇప్పుడు వదిలించుకున్నాను.)

కర-చరణ-సరోజే
కాంతిమత్-నేత్రమీనే
...
...

******************************************************

ముకుందమాల ఒక భక్తిరసప్రవాహం. ఒక స్తోత్రంగా చదువుకున్నా కూడా మహా ఉదాత్తమైన భావం మనసులో మెదిలి చిత్తం కరుణరసార్ద్రమై, భగవంతునిపై ధ్యానమగ్నం చేసే అపూర్వమైన కృతి. ఒక్కసారి నేర్చుకున్న వాళ్ళు దీనిని మర్చిపోవడమంటూ దాదాపుగా జరుగదు.  

శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి
భక్తప్రియేతి భవలుణ్ఠన కోవిదేతి!
నాథేతి నాగాశయనేతి జగన్నివాసే
త్యాలాపనం ప్రతిపదం కురు మే ముకున్ద!!

(శ్రీ వల్లభా, వరదా, దయాపరా, భక్తప్రియా, భవాన్ని తరింపజేయు కోవిదుడా, నాథా, నాగశయనా, జగన్నివాసా - ఇలా నీ నామాలాపనం ఎప్పుడూ కలిగేట్లు చేయి ముకుందా!)

చిన్తయామి హరిమేవ సన్తతం
మందమంద హసితాననామ్బుజమ్!
నందగోప తనయం పరాత్పరం
నారదాది మునిబృంద వందితమ్!!

(తామరపువ్వు వంటి ముఖంలో చిరునవ్వులు చిందిస్తూ, నందగోపతనయుడైన పరాత్పరుని, నరదాది మునివందితుణ్ణి అయిన హరినే ఎప్పుడూ తలుస్తాను.)

జిహ్వే! కీర్తయ కేశవం మురరిపుం చేతో! భజ, శ్రీధరం
పాణిద్వన్ద్వ! సమర్చయా ऽ చ్యుత కధా: శ్రోత్రద్వయ! త్వం శృణు!
కృష్ణం లోకయ లోచనద్వయ! హరేర్గచ్చాంఘ్రియుగ్మాలయం
జిఘ్ర ఘ్రాణ! ముకుందపాదతులసీం, మూర్ధన్! నమాధోక్షజమ్!!

ఓ నాలుకా! కేశవుని కీర్తించు.
మనసా! మురరిపుని భజించు
పాణిద్వయమా! అచ్యుతుని కథలను సమర్చించు.
చెవులారా! మీరు వినండి.
లోచనద్వయమా! కృష్ణుని చూడండి.
పాదాల్లారా! హరికోసమై కదలండి.
ఓ నాసికా! ముకుందపాదతులసిని మూర్కొను.
శిరసా! అధోక్షజుని నమస్కరించు.

ముకుందమాల లో భక్తిరసప్రవాహాన్ని, ఆర్తిని గురించి వ్యాఖ్యానించటం సూర్యుని ముందు దీపపు వెలుగు చూపించటం వంటిది. కులశేఖరమహారాజు హృదయకుసుమం తాలూకు ఈ మకరందం విష్ణుపదచిత్త ధ్యాన తత్పరులకందరినీ సమంగా ఆకర్షిస్తుంది.

భారతీయసంస్కృతి మీద గౌరవం ఉన్న తల్లితండ్రులు ఈ కావ్యం తాలూకు పద్యాలను వారి వారి పిల్లలచేత చదివిస్తారు, వారికి నేర్పిస్తారు కూడా. అందువల్ల ఉత్తమ లౌకికసంస్కారమే కాదు, చక్కని కావ్యసంస్కారం కూడా తప్పకుండా కలుగుతుందనడంలో ఇసుమంతైనా సందేహం అనవసరం.

******************************************************

13, ఫిబ్రవరి 2014, గురువారం

సంస్కృతసౌరభాలు - 17


స్మృతాऽపి తరుణాతపం కరుణయా హరన్తీ నృణాం
అభంగురతనుత్విషాం వలయితా శతైర్విద్యుతాం |
కళిందగిరినందినీ తటసురద్రుమాలంబినీ
మదీయ మతి చుంబినీ భవతు కాపి కాదంబినీ ||

నృణాం = మానవుల
తరుణాతపం = సంసార బాధను
స్మృతాऽపి = తలిచినంతమాత్రమున
కరుణయా = కరుణతో
హరన్తీ = పోగొట్టునది
అభంగుర తనుత్విషాం = నాశము లేని శరీరకాంతిని కలిగిన
విద్యుతాం = మెరుపుల
శతైః = శతములను
వలయితా = చుట్టుకున్నది
కళిందగిరినందినీ = యమునానది యొక్క
తట = ఒడ్డున ఉన్న
సురద్రుమ = కల్పవృక్షమును (వేపచెట్టును)
ఆలంబినీ = ఆశ్రయించినది (ఆ చెట్టు చిటారుకొమ్మల నుండునది)
కాపి = ఒకానొక
కాదంబినీ = కారు మేఘము
మదీయ = నాయొక్క
మతి చుంబినీ = మతిని చుంబించునది
భవతు = అగుగాక.

అదేదో తెలుగు సినిమాపాటలా

యమునానది గట్టుంది.
గట్టుపైనా చెట్టుంది.
చెట్టు చివరనా మేఘముంది
మేఘమే నా మది మెదిలింది.

అన్నట్లుగా యమునానది నాశ్రయించిన కృష్ణుడు అన్న మేఘాన్ని కవి మంగళాచరణలో ప్రార్థిస్తున్నాడు. ఆ కాదంబిని (మేఘం) యమునాతటిని ఉన్న ఒక విశాలవృక్షాన్ని ఆశ్రయించింది. మెరుపుతీగలశతములు (అనబడే గోపస్త్రీలతో) చుట్టుకుని ఉన్నది. స్త్రీ లింగమైన కాదంబిని ద్వారా పురుషోత్తముడైన శ్రీకృష్ణుని ధ్వనింపజేయడం ఈ శ్లోకం లో చమత్కారం. ఇలాంటి చమత్కారాన్ని ఇంత మధురంగా,సుకుమారంగా, అర్థవ్యక్తితో చెప్పగలిగిన కవి జగన్నాథుడు కాదు కాదు జగన్నాథపండితరాయలు. ఆయన వ్రాసిన రసగంగాధరం అన్న అలంకారికగ్రంథానికి మంగళాచరణం ఈ శ్లోకం.

**************************************

ప్రాచీనాలంకారికులు శబ్దం యొక్క గుణాలను పదిరకాలుగా వింగడించారు.

శ్లేషః ప్రసాదః సమతా మాధుర్యం సుకుమారతా |
అర్థవ్యక్తిరుదారత్వం ఓజః కాంతి సమాధయః ||

అని వాటికి పేర్లు.

వీటిలో
మాధుర్యం అంటే - దీర్ఘసమాసాలు లేక అలతి అలతి పదాలతో ద్విత్తాక్షరాలు లేకుండా కూర్చడం.
సుకుమారత్వం అంటే - అపరుషమైన వర్ణాలు (ఖ,ఛ,ఠ, థ, ఫ, ఘ,ఝ,ఢ,ధ, భ - వీటిని మహాప్రాణాలు అంటారు) లేని కూర్పు
అర్థవ్యక్తి = చదవిన వెంటనే అర్థం స్ఫురించటం
కాంతి = ఛాందసశబ్దాలతో కాక నవ్యమైన శబ్దచాతుర్యంతో శోభాయమానంగా కూర్చటం

- దాదాపుగా ఈ నాలుగు లక్షణాలు పండితరాజు కవిత్వంలో అలవోకగా కుదిరిపోవడం పాఠకులకు విస్మయకరమైన అనుభవం కలిగిస్తుంది. పైన శ్లోకమే గమనిస్తే మూడు నాలుగు పాదాలలో మాధుర్యం,దాదాపు శ్లోకం మొత్తం అంతా సుకుమారతా, అర్థవ్యక్తి,, సురద్రుమ, కాదంబినీ, ఆలంబినీ, మతిచుంబినీ వంటి శోభాయమానమైన ప్రయోగాలతో కూడిన కాంతి అనే గుణమూ స్పష్టంగా కనిపిస్తాయి. అంతే కాక, మేఘాన్ని శ్రీకృష్ణునిలా ధ్వనిమార్గంలో ఉద్యోతించటం చక్కని విశేషం.

సరిగ్గా ఇదేవిధమైన శబ్దగుణాలతో శ్లోకాలు కూర్చినదెవరా అని తరచి చూస్తే స్ఫురించే కవి జయదేవుడు.

చందనచర్చిత నీలకళేబర పీతవసన వనమాలీ |
కేళిచలన్మణికుండలమండిత గండయుగస్మితశాలి ||

జాగ్రత్తగా గమనించండి - ఒక్క మహాప్రాణాక్షరం లేక ఎంత సుకుమారంగా ఉందో?

ప్రియే చారుశీలే! ముంచ మయి మానమనిదానం |
సపది మదనానలో దహతి మమ మానసం దేహి ముఖకమల మధుపానమ్ ||

ఇక్కడ మాధుర్యమూ, అర్థవ్యక్తి, సుకుమారతా...అన్ని గుణాలు ఎంత అలవోకగా కుదిరినవో చూడండి. జయదేవుని తర్వాత ఇలా మహాప్రాణాక్షరాలపట్ల పిసినారితనం చూపించి శబ్దమాధుర్యంతో కవిత చెప్పగలిగినది పండితరాజు కావచ్చును.

అలాంటిది జగన్నాథపండితరాయల పద్యం ఒకటి.

నితరాం పరుషా సరోజమాలా
న మృణాలాని విచారపేశలాని |
యది కోమలతా తవాంగనానాం
అథ కా నామ కథాపి పల్లవానామ్ ||

-అమ్మాయీ! నీ కోమలమైన శరీరాంగముల ప్రసక్తి వచ్చినప్పుడు తామపువ్వులదండ కూడా పరుషమైనది. లేతతామరతూళ్ళు కూడా చెప్పుకోదగ్గవి కావు. ఇక చివురుటాకుల సంగతి చెప్పేదేముంది?

రసగంగాధరం కావ్యంలో ఈయన తను వ్రాసిన భామినీవిలాసం అన్న కావ్యంలోని ఉదాహరణలనే స్వీకరించాడు. జగన్నాథుని భావనలోని ఆ భామిని పేరు లవంగి. ఈ లవంగి షాహజహాను కూతురని, అక్బరు కూతురని, షాహజహాను కొలువులో పనిచేసే రాజపుత్రయువతి అని ఏవేవో కథలు ఉన్నాయి. ఓ నాడు పండితరాయలు, షాహజహాను చదరంగం ఆడుతుంటే ఆ లవంగి మదిరాపానం అందించడానికి వచ్చిందట. పండితరాయలు ఆమెను తేరిపారచూడగానే ఆమె చేతులు కంపించాయి. పండితరాయలకు మనసు చలించింది. చదరంగంలో గెలిచిన జగన్నాథునికి - ఏం కావాలో కోరుకొమ్మని షాహజహాను అడగ్గా ఆయన అన్నాడూ -

న యాచే గజాళీం న వా వాజిరాజిం
న విత్తేషు చిత్తం మదీయం కదాపి
ఇయం సుస్తనీ మస్తకన్యస్తహస్తా
లవంగీ కురంగీ మదంగీకరోతు

ఏనుగులు యాచించను, గుర్రాలొద్దు, నామనసు డబ్బుపై లేదు. ఈ అందమైన జింకపిల్లలాంటి లవంగిని నాకివ్వు.

ఆమెపై వ్రాసిన చాటుపద్యసమాహారమే భామినీవిలాసం అన్న కావ్యం అట. ఇందులో తమ సుతుడు మరణించినప్పుడు పండితరాయలు అనుభవించిన నిర్వేదం వంటివి కూడా కూర్చబడ్డాయి. అక్కడక్కడా గాథాసప్తశతి ధోరణి కూడా కనబడుతుంది.

గురుమధ్యగతా మయా నతాంగీ
నిహతా నీరజకోరకేణ మందం
దరకుండలతాండవం నతభ్రూ
లతికం మామవలోక్య ఘూర్ణితాసీత్

"అత్తమామల మధ్య నుంచున్న సఖి పయ్యెత్తులపైన అలవోకగా తగిలేట్టు ఒక తామరమొగ్గతో సఖుడనైన నేను కొడితే, నా సఖి చెవిపోగులు కదిలించి, కాస్త నుదురు చిట్లించి నాకేసి గుర్రుగా చూసింది."

ఇది అసలుసిసలైన స్వభావోక్తి అలంకారం.

కొంతమంది కవులకు దర్పం, దుందుడుకు మాటతీరు అలవోకగా అమరుతాయి. తెలుగులో శ్రీనాథుడు అలాంటి మహాకవి అయితే సంస్కృతంలో బహుశా ఆయన counterpart జగన్నాథపండితరాయలు. ఇద్దరూ ఇద్దరే. ఈయన కవిసార్వభౌముడు, ఆయన పండితరాజు. ఇద్దరూ మహాభోగులు. మహాద్భుతమైన కవిత్వం చెప్పగలరు. ఇద్దరూ తెలుగు వాళ్ళు.

ఈ శ్లోకం, ఇందులో చివరిపాదం ఎంత వినూత్నంగా, చమత్కారంగా ఉందో చూడండి.

మధురసాన్మధురం హి తవాధరం,
తరుణి మద్వదనే వినివేశయ |
మమ గృహాణ కరేణ కరాంబుజం
ప ప పతామి హహా భ భ భ భూతలే ||

"నీ పెదవి మధురతరమైనది. నా ముఖానికి తాకించు. నీ చేత్తో నా చేతిని పట్టుకో. హహా....భ భ భూతలంలో...ప ప పడిపోతున్నా..."

శ్రీనాథుని "ణిసి ధాత్వర్థంబనుష్టించడం" అన్న కథనానికి జగన్నాథుడు స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కూర్చి నటించి కూడా చూపిస్తే ఉన్నట్టుగా లేదూ?

****************************************

6, ఫిబ్రవరి 2014, గురువారం

సంస్కృతసౌరభాలు - 16

రాముడు శివధనుస్సును ఎక్కుపెట్టాడు. అప్పుడు -

రుంధన్నష్టవిధేః శ్రుతీర్ముఖరయన్నష్టౌ దిశః క్రోడయ
న్మూర్తీరష్ట మహేశ్వరస్య దిశయన్నష్టౌ కులక్ష్మాభృతః
తాన్యక్ష్ణా బధిరాణి పన్నగకులాన్యష్టౌ చ సంపాదయ
న్నున్మీలత్యయమార్యదోర్బలదళత్కోదండకోలాహలః ||

విధేః అష్ట శ్రుతీః రుంధన్ = బ్రహ్మ యొక్క ఎనిమిది చెవులను గింగురులెత్తిస్తూ
అష్టౌ దిశః ముఖరయన్ = ఎనిమిది దిక్కులు మారుమ్రోగిస్తూ
మహేశ్వరస్య అష్టమూర్తీః క్రోడయన్ = ఈశ్వరుని అష్టమూర్తులను ఆవహిస్తూ
అష్టౌ కులక్ష్మాభృతః దళయన్ = ఎనిమిది కులపర్వతాలను పగులగొడుతూ
తాని పన్నగకులాని అష్టౌ = ప్రసిద్ది పొందిన ఎనిమిది విధాలైన నాగములను
అక్ష్ణా బధిరాణి సంపాదయన్ = చూపులతో చెవిటివిగా చేయుచూ
ఆర్య = పూజ్యుడైన రాముని
దోర్బల = భుజబలముచే
దళత్ = విరుగుచున్న
కోదండ కోలాహలః = శివధనుస్సు యొక్క తీవ్రమైన ధ్వని
అయమ్ = ఇదే
ఉన్మీలతి = పెద్దదవుతున్నది.

అనర్ఘరాఘవం అనే ఏడంకాల నాటకంలో మూడవ అంకంలో రాముడు శివధనుర్భంగం చేసే ఘట్టంలోనిది ఈ పద్యం. ఈ నాటకకర్త మురారి పండితుడు.

మహేశ్వరునికి ఎనిమిది రూపాలున్నవి.  ఇవి - శర్వ, భవ, పశుపతి, ఈశాన, భీమ, రుద్ర, మహాదేవ, ఉగ్ర
 

కులపర్వతాలు - మహేంద్ర, మలయ, సహ్యాద్రి, పారిజాత, శుక్తిమత, వింధ్య, ఋక్షవంతము - ఇవి ఏడు. అయితే కవి ఎనిమిది పర్వతాలను ఉటంకించాడు. బహుశా మరొక పర్వతం ప్రస్తావన ఎక్కడైనా ఉండాలి.
 

ఎనిమిది నాగ కులాలు ఇవి - శేష, వాసుకి, కాళీయ,మానస, అనంతశయన, పద్మనాభ,అష్టిక, కులిక
అలాగే చూపులతో చెవిటివిగా చేయటం ఏమిటి? పాముకు చక్షుశ్శ్రవం అని పేరు. వాటివి చెవులు ఉండవు. కళ్ళే చెవులుగా పనిచేస్తాయన్నమాట. అందుకనే ఆ ప్రయోగం.

ఏతావతా -

రాముడు శివధనుస్సును ఎక్కుపెట్టగానే అది విరిగింది. ఆ భీకరధ్వనికి
బ్రహ్మ ఎనిమిది చెవులు గింగురున్నాయి.
ఎనిమిది దిక్కుల్లో ఆ శబ్దం ప్రతిధ్వనించింది.
మహేశ్వరుని ఎనిమిది మూర్తులను ఆ శబ్దం కమ్ముకుంది.
ఎనిమిది సర్పకులాల (ఇందులో అనంతశేషుడు భూమిని చుట్టుకుని ఉంటాడు) చెవులు, కళ్ళూ దెబ్బతిన్నాయి.

***************************************************************

ప్రతి తరంలోనూ కొంతమంది ప్రత్యేకమైన సాహిత్యకారులు పుడుతూ ఉంటారు. వీరి రచనలను అభిమానించేవారెంత మందో, వారి రచనలతో విభేదించి, విమర్శించే వాళ్ళూ అంతే మంది ఉంటారు. దీనికి బహుశా కారణాలు - పాండిత్యం, సిద్ధాంతం అవవచ్చును.  సంస్కృత నాటకకవులలో మురారి అలాంటి కవి. వాల్మీకి రామాయణం ఎంత సరళంగా ఉంటుందో, అనర్ఘరాఘవం అంత నారికేళపాకసదృశంగా ఉంటుంది. శ్రవ్యకావ్యాలలో మాఘం ఎంత జటిలమో, దృశ్యకావ్యాలలో అనర్ఘరాఘవం అంతే జటిలం.

మురారిపదచిన్తాచేత్ తదా మాఘే మతిం కురు |
మురారిపదచిన్తాచేత్తదా మాఘే మతిం కురు ||

అని ఒక అభాణకం.
 

మురారిపదచిన్తాచేత్ తదా= మురారి ఉపయోగించిన శబ్దాలగురించి తెలియాలంటే
మాఘే మతిం కురు = మాఘ కావ్యం (శిశుపాలవధమ్) మీద బుద్ధి పెట్టు.

మురారిపదచిన్తాచేత్ తదా = భగవంతుడైన శ్రీహరిపదములపై ధ్యాస కలుగాలంటే
అఘే మతిం మా కురు = పాపపు తలపులను మదిలో రానివ్వకు.


అఘము అంటే పాపము. 


మాఘమే ఎందుకు? అంటే - "నవశబ్దగతే మాఘే నవశబ్దో న విద్యతే" అని ఒక మాట. శిశుపాలవధమ్ లో తొమ్మిది సర్గలు చదివితే ఆ పైన సంస్కృతంలో కొత్త శబ్దాలు ఏవీ మిగలవు అని. అలా సంస్కృతం మొత్తం నేర్చుకుని అనర్ఘరాఘవం చదువమని సూచన.

(పై శ్లోకం యుగ్మకం అనే యమకాలంకారభేదానికి ఉదాహరణ)

యే శబ్దశాస్త్ర నిష్ణాతాః యే శీలిత నిఘంటవః |
తేషామేవ అదికారోऽస్తి మురారికృతనాటకే ||

ఎవరైతే శబ్దశాస్త్రంలో నిష్ణాతులో, ఎవరైతే నిఘంటువులను క్షుణ్ణంగా తెలుసుకుని ఉన్నారో వారికే మురారినాటకం మీద అధికారం ఉండగలదని అభాణకం.

బానే ఉంది, కానీ భరతముని నిర్దేశించిన నాట్యకళ ఉద్దేశ్యం ఈ demandsలో పొసుగుతుందా అని సందేహం.

దుఃఖార్తానాం శ్రమార్తానాం, తాపార్తానాం, తపస్వినామ్ |
విశ్రాన్తిజననం లోకే నాట్యమేతద్భవిష్యతి ||

దుఃఖార్తులకు, శ్రమార్తులకు, తాపార్తులకూ, తాపసికులకు, సకలసామాజిక వర్గాలకూ విశ్రాన్తి కారణంగా నాట్యం (Drama) పుడుతుంది. (ఈ సాహిత్యప్రక్రియ పండితులకు మాత్రమే అని చెప్పబడలేదు)

ఏదేమైనా మురారి పండితుని అనర్ఘరాఘవం ఒక గొప్ప పాండిత్యప్రకర్షకు కొలమానంగా నిలబడిన నాటకం. రామాయణాన్ని సమగ్రంగా చిత్రించిన నాటకాలలో మొదటిది భవభూతి మహావీరచరితమ్ అయితే రెండవది అనర్ఘరాఘవమ్. ఆధునిక కాలంలో ఈ నాటకం మీద వచ్చినన్నివిమర్శలూ, విశ్లేషణలూ దాదాపుగా మరే గ్రంథానికీ వచ్చి ఉండవు.  పాండిత్య ప్రకర్ష మీద ఆసక్తి స్వభావసిద్ధంగానే ఉన్న తెలుగు వారికి ఈ నాటకం అభిమానపాత్రమయ్యింది. ఈ నాటకానికి అనుసరణలూ, ప్రత్యక్ష, పరోక్ష అనుకరణలూ ఇత్యాదులు కూడా చాలా ఎక్కువ.

ఈ నాటకం తాలూకు కొన్ని ముచ్చట్లు .

***************************************************************

వాల్మీకి శివధనుర్భంగం గురించి ఒక వ్యాసం లో వివరిస్తూ పుట్టపర్తి నారాయణాచార్యులు ఒక చక్కని విషయం చెప్పారు. ఆ ఘట్టం ఆయన వ్రాతలోనే చూద్దాం.


జనకుడు శివధనుస్సును గూర్చి పెద్దగా చెబుతాడు. విశ్వామిత్రుడు అదంతా విని అతిసామాన్యవిషయంగా "వత్స రామ! ధనుః పశ్య" అంటాడు. రాముడు చేతితో తాకుతానన్నాడు. జనకుడు విశ్వామిత్రుడు కానిమ్మంటారు. రాముడు ధనుస్సునెక్కుపెట్టడానికి ప్రయత్నిస్తే అది మధ్యలో విరుగుతుంది. ఈ సందర్భంలో వాల్మీకి రెండే శ్లోకాలు వ్రాస్తాడు. వాటిలో కూడా ఏమీ సంరంభం లేదు. అతి సామాన్య విషయంగా చెబుతాడు.

తస్య శబ్దో మహానాసీత్ నిర్ఘాతసమనిస్వనః
భూమికంపశ్చ సుమహాన్, పర్వతస్యేవ దీర్యతః

(ఆ శబ్దం పిడుగుపాటుకు సమంగా చాలా ఘనంగా ఉంది. భూమి, పర్వాతాలు ఒక్క పట్టున కంపించినట్టుగా అయినది)

నిపేతుశ్చ నరాస్సర్వే తేన శబ్దేన మోహితాః
వర్జయిత్వా మునివరం, రాజానం తౌ చ రాఘవౌ

(ఆ శబ్దం చేత విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు, జనకుడు తక్క అక్కడున్న ప్రజలంతా నిశ్చేష్టులైనారు )

ఇతరకవులిచ్చట భయంకరమైన "శాబ్దికకోలాహలం" చేసినారు. వాల్మీకికి రాముని జీవితంలో శివధనుర్భంగం సామాన్యవిషయంగానే తోచింది.


ఆచార్యుల వారు పేర్కొన్న శాబ్దిక కోలాహలం - "దోర్బలదళత్కోదండకోలాహలః" అన్న మురారి గురించే అయి ఉండవచ్చు. అనర్ఘ రాఘవం ఒక దృశ్యకావ్యం. అంటే స్టేజి మీద ప్రదర్శించబడే నాటకం. స్టేజ్ మీద ప్రదర్శింపబడేప్పుడు ధనుర్భంగం తాలూకు భీకర ధ్వని ప్రభావాన్ని - సామాజికులకు సమర్థంగా ఎలా చెప్పాలి? 


నాటకంలో జరిగిన, జరుగబోయే ఘటనలను పాత్రల ద్వారా ప్రత్యక్షంగా కాక పరోక్షంగా చెప్పే ప్రక్రియకు విష్కంభకం అని పేరు. అవి పలువిధాలు. చూళిక, ఆకాశభాషణం, ప్రవేశికము, జనాంతికము,అంకాశ్యము, అంకావతారము ...ఇలా. స్టేజ్ పైన చెప్పలేని, చెప్పకూడని విషయాలను సూచించడానికి, అనవసరకథన నివారణకూ ఈ ప్రక్రియలనుపయోగిస్తారు. శివధనుర్భంగఘట్టం అందుకు అనువైనది. అయితే ఈ విష్కంభకం అంకం ఆరంభంలో రావాలి. పైగా ఈ ఘట్టం ఉన్న తృతీయాంకంలో ఒక విష్కంభకాన్ని కవి మరొక సన్నివేశం కోసం ఉపయోగించాడు. ఈ కారణాల వల్ల ఇక్కడ విష్కంభకం కుదిరి ఉండకపోవచ్చు. బహుశా అందుచేత ఈ కవి పై పద్యాన్ని లక్ష్మణుని నోట పలికిస్తాడు. ధనువు విరిగే శబ్దాన్ని ప్రేక్షకులకు ప్రతీయమానం చేయడానికి "ష్ట" అనుప్రాసను ఉపయోగిస్తూ, శార్దూల వృత్తంలో ప్రౌఢంగా కూర్చాడు.

ఈ శాబ్దిక కోలాహలానికి మరో కారణం కూడా కనిపిస్తున్నది. వాల్మీకి మార్గం ధ్వని మార్గం. అంటే చెప్పదలుచుకున్న దానిని అందంగా, అలవోకగా, వ్యంగ్యంగా చెబుతాడు. ఆ మహాకవి రాముని భగవత్స్వరూపుడని ధ్వని పూర్వకంగా సూచిస్తాడు. ప్రత్యక్షంగా వాచ్యం చేయడానికి ప్రయత్నించడు. అనర్ఘ రాఘవం - అనర్ఘం అంటే అమూల్యము, పూజ్యము అని అర్థం అనర్ఘః రాఘవః యస్మిన్ తత్ - అనర్ఘరాఘవం అంటే - పూజుడైన రాముని చరితమే అనర్ఘరాఘవం. ఈ పేరు ద్వారానే కవి స్థాపించదలుచుకున్న విషయం స్పష్టం. రాముని విష్ణ్వంశప్రతిపాదనే ఈకావ్యలక్ష్యం. అందుకే మురారి రాఘవుడు దైవాంశ సంభూతుడిగా ఉంటూ, అటువంటి కార్యాలనే చేస్తాడు. ఆ కార్యాల ప్రభావమూ అలానే ఉండటం సహజం. అందులో భాగంగా ఈ పద్యాన్ని అన్వయించుకోవలసి ఉంటుందేమో.

***************************************************************

అలా శివధనుర్భంగం జరిగింది.

అప్పుడు శతానందుడిలా అన్నాడు.

వైదేహీకరబంధమంగళయజుస్సూక్తం ద్విజానాం ముఖే
నారీణాం చ కపోలకందళతలే శ్రేయాన్ ఉలూలు ధ్వనిః |
పేష్టుం చ ద్విషతాముపశ్రుతిశతం మధ్యేనభో జృంభతే
రామక్షుణ్ణమహోక్షలాంఛనధనుర్ధంభోళి జన్మా రవః ||

రామక్షుణ్ణ = రామునిచే విరుగగొట్టబడిన
మహోక్షలాంఛనధనుర్ధంభోళి జన్మా రవః = చిచ్చరకంటి వాని ధనుస్సు అనబడే వజ్రాయుధం నుండి పుట్టిన ధ్వని
ద్విజానాం ముఖే = బ్రాహ్మణ ముఖమునందు
వైదేహీకరబంధమంగళయజుస్సూక్తం = సీత పాణిగ్రహణసమయంలో మంగళ వేదనాదమై
నారీణాం చ కపోలకందళతలే = సామాజికులైన స్త్రీల చెక్కిళ్ళలో
శ్రేయాన్ ఉలూలు ధ్వనిః = మంగళమైన "ఉలూలు" అనే ధ్వని గా
ద్విషతాం = శత్రువులకు
ఉపశ్రుతిశతం = అశుభసూచక శకున వాక్యముల శతమై
పేష్టుం చ = (ఆ శత్రువుల) పిండీకరణమునకు
నభః మధ్యే = ఆకాశమధ్యమున
జృంభతే = కొనసాగింది.

ఇక్కడ "ఉలూలు" ధ్వని అన్నది గమనించదగినది. ఈ ధ్వని ఏ ప్రాంతపు స్త్రీలు చేస్తారో ఏమో? Chinna Thambi movie Aracha santhanam Tamil video songs

అనర్ఘరాఘవం నిండా ఇటువంటి చమత్కృతులు కోకొల్లలు. అలాగే ఒక్కో పద్యమూ ఆలోచిస్తే, అనుశీలిస్తే ఎన్నో విషయాలు చెబుతుంది. అనర్ఘరాఘవం కావ్యం గురించి పండితులు మాత్రమే మథించి చెప్పాలి. అలా చెప్పగలిగితే అది చాలా గొప్ప విలువైనది అవుతుంది.

***************************************************************

చివరగా నాకు నచ్చిన అందమైన వృత్త్యనుప్రాస పద్యం

వందారుబృందారకబృందబందీమందారమాలామకరందబిందూన్ |
మండోదరీయం చరణారవిందరేణూత్కరైః కర్కశతామనైషీత్ ||

వందారు = నమస్కరించుచున్న
బృందారక = దేవతాస్త్రీ
బృంద = సమూహముల
బందీ = బంధినుల
(రావణుడు బంధించి తెచ్చిన దేవతాస్త్రీల)
మందారమాలా = (కొప్పుల్లో తురుముకున్న) పారిజాత మాలలనుండి
మకరంద బిందూన్ = తేనెచుక్కల
ఇయమ్ మండోదరీ = ఈ మండోదరీ
చరణ అరవింద రేణు ఉత్కరైః = తామరల వంటి పాదముల నుండి ఎగసిన ధూళి
కర్కశతాం అనైషీత్ = కర్కశత్వముని పొందింది.

రావణుడు బంధించి తెచ్చిన దేవతాస్త్రీలు మండోదరికి నమస్కారాలు చేస్తుంటే వాళ్ళ తలల్లో తురుముకున్న పారిజాతసుమాల మకరందం తొణికి ఈమె పాదాల దగ్గర పడింది. ఆ మకరందం ఈమె పాదధూళితో కలిసి గట్టిగా మారింది. (అలాంటి మండోదరికి నేడు ఎంత దయనీయమైన స్థితి వచ్చిపడింది!)

మురారేః తృతీయా పంథా అని ఒక సామెత ఒకటి ఉన్నది.

దృశ్యకావ్యం (నాటకం), శ్రవ్యకావ్యం అని రెండు సంవిధానాలు సాహిత్యంలో ఉంటే మురారి దృశ్యకావ్యంలో శ్రవ్యకావ్యలక్షణాలను మేళవించాడని ఈ మాట వచ్చిందంటారు. అందుకు ఈ కావ్యంలో ముఖ్యంగా రెండవ అంకాన్ని, అందులో ప్రబంధస్థాయి వర్ణనలను ఉదహరిస్తూ చెప్పినప్పటికీ, దాదాపు కావ్యమంతానూ అందుకు ఉదాహరణగానే చెప్పవచ్చు.

ఈ మాట అనర్ఘరాఘవ కర్తకు కాదని, వ్యాకరణపండితుడైన మరొక మురారిని గురించి చెప్పినదని కొందరు.

***************************************************************