17, మార్చి 2019, ఆదివారం

మయూఖము - 3

దేవరాతుడు, భూరివసుడు చిన్ననాటి స్నేహితులు. "మనం పెద్దవాళ్ళైన తర్వాత మనకు అమ్మాయి అబ్బాయి కలిగితే వియ్యంకులు అవుదా"మని, కామందకి అనే ఓ బౌద్ధసన్యాసిని యెదుట బాసలు చేసుకున్నారు.

అనుకున్నట్లు గానే దేవరాతుడికి మాధవుడు, భూరివసునికి మాలతి కలిగారు. చూస్తుండగానే పెరిగి యుక్తవయస్కులయ్యేరు. పెళ్ళికిబ్బంది లేదు కానీ ఇద్దరూ ప్రేమించుకుంటే బావుంటుందని దేవరాతుడు తన కొడుకు మాధవుణ్ణి భూరివసుడుండే పద్మావతీ నగరానికి 'అన్వీక్షకి ' విద్య నేర్వమని పంపేడు.

అనుకున్నట్లుగానే మాధవుడు మాలతిని చూచాడు. అతనికి ఆమెపై ప్రేమ మొదలయింది. ఈ కథ ఇలా సాగుతుంది. పూర్తి కథను చందమామ కన్నా అందంగా ఇంకెవరు చెప్పగలరు ?

భవభూతి రచించిన 'మాలతీమాధవమ్  ' అన్న నాటక కథ యిది.



!******!


పొగడపూలదండ.

సంస్కృత నాటకాల్లో పూలదండల ప్రస్తావన రాంగానే 'కుందమాల ' నాటకం గుర్తొస్తుంది. సీతాదేవి ఓ మాల కట్టి నదిలో జారవిడువటం, అది రాముణ్ణి చేరటం, దాన్ని చూచి రాముడు, ఇది సీత కూర్పేనని గుర్తుపట్టటం అలా కథ కొనసాగుతుంది. ఆ నాటకంలో ఆ మాల అంతగా ప్రసిద్ధమై, మాల పేరే నాటకం పేరయ్యింది. తెలుగు వాళ్ళకూ విడలేని  ఓ పూలదండ గల కావ్యం ఒకటున్నది - ఆముక్తమాల్యద. 

అంత పేరు రాకున్నా, ఓ చిన్ని ఘట్టంలో భాగమైన ఓ పూలదండ - భవభూతి మాలతీమాధవం లో వస్తుంది. ఈ మాల కట్టింది మగవాడు. పైగా నాటకపు హీరో. ఇది పొగడపూలదండ.

ఇది కూడా రమణీయమైనదేను. 


!******!

నగరంలో వసంతోత్సవం (హోలి) జరుగుతోంది. మాలతి తలపులే మది అంతా నిండిన మాధవుడు మదన ఉద్యానవనం చేరాడు. అక్కడ అంతటా రాలిపడిన పొగడపూలు. వాటిని ఏరి అతడు ఓ శిలావేదిక వద్ద కూర్చుని మాలగా గుచ్చసాగినాడు. సమీప దేవాలయంలో పూజాదికాలు ముగించుకుని అంతలో అక్కడికి మాలతి వచ్చింది. 

ఆమెను చూసిన తత్తరపాటులో ఆతడు దండను త్వరత్వరగా, ఎగుడు దిగుడుగా చేసేశాడు. తనకై రాజాస్థానం నుండి వచ్చిన ఆడుయేనుగునెక్కి మాలతి వెళ్ళిపోయింది. 

ఆపై ఆ తోటకు మాలతి చెలికత్తె లవంగిక వచ్చింది. లవంగికకు మాలతి మాధవుల మనసులో అంకురమైన ప్రేమ గురించి తెలుసు. ఆమె మాధవుణ్ణి పలుకరించింది. తన యజమాని - మాలతీదేవికి పూలదండలంటే ఇష్టమని, మాధవుడు కూర్చిన పూలదండ మాలతికై ఇవ్వమని అడిగింది.

అలా అడుగుతూనే మాలతి మనసునూ మాధవునికి తెలిపింది. ఇది చాలా అందమైన సంభాషణ.

ఆ డయలాగు వివరణే  ఈ వ్యాసం. 

!******!

లవంగిక మాధవునితో ఇలా అన్నది.

"మహాభాగ! సుశ్లిష్టగుణతయా రమణీయ ఏష వః సుమనసాం సంనివేశః | కుతూహలినీ చ నో భర్తృదారికా అస్మిన్ వర్తతే| తస్యాం అభినవో విచిత్రః కుసుమేషు వ్యాపారః| తద్భవతు కృతార్థతా వైదగ్ధ్యస్య | ఫలతు నిర్మాణరమణీయతా విధాతుః | సమాసాదయతు సరస ఏష భర్తృదారికాయాః కణ్ఠావలంబన మహార్ఘతామ్

మహాభాగ = శ్రేష్టుడా;
వః = మీ యొక్క;
ఏషః = ఇవ్విధమైన;
సుమనసాం/సుమ నసాం = పూల అల్లిక/అందమైన మనసుల యొక్క
సంనివేశః = రచనామోదము/ సంయోగము;
సుశ్లిష్టగుణతయా = అందముగా నిబంధించబడిన దారముతోడి చిక్కగా అల్లుకున్న గుణముల వలన;(గుణము అంటే 'దారము ' అన్న అర్థం ఉంది)
రమణీయః = అందమైనది సుమా!

నః భర్తృదారికా చ = మా యజమానుని పుత్రిక కూడా;
అస్మిన్ = అక్కడ;
కుతూహలినీ = (పూలదండలపై) ఆసక్తురాలిగా;
వర్తతే = ఉన్నది;

తస్యాం = ఆమెకు;
కుసుమేషు వ్యాపారః = (మీరు అల్లిన) పూల వ్యవహారము ( మన్మథుని బాణాలైన పువ్వుల దాడి) 
అభినవో విచిత్రః = వినూత్నమైనది/ఇదివరకు ఎఱుగనిది, విచిత్రమైనదియును (కాగలదు);

వైదగ్ధ్యస్య = పూలదండ అనే నిర్మాణచాతురి/ సకలకళాభినివేశము;
కృతార్థతా = ఫలసిద్ధి;
తద్భవతు = అట్లు అగుగాక!

విధాతుః = బ్రహ్మయొక్క/ పూలదండ అల్లిన వాని;
నిర్మాణరమణీయతా = సృష్టిలో అందము;
ఫలతు = ఫలించనీ!

ఏష సరసః = ఈ అందమైన పుష్పముల కూర్పు/ఈ ప్రేమ;
భర్తృదారికాయాః = యజమానుని పుత్రిక యొక్క;
కంఠావలంబన = కంఠమునందు వ్రేలాడుట యను;
మహా అర్ఘతాం = గొప్ప పూజను;
సమాసాదయతు = పొందుగాక!

"ఓ శ్రేష్టుడా ! మీరు కూర్చిన పూమాల, అందులో కూర్చిన దారము చాలా అందమైనవి. మా అమ్మాయికి కూడా పూలదండలంటే ఇష్టం. ఆమెకు మీ పూలదండ కొత్తగా, విచిత్రంగా అనిపిస్తుంది. మీ దండకూ మంచి ఫలమే దొరుకుతుంది.  ఇది అమ్మాయి మెడలో చేరి పూజించబడనివ్వండి. నాకు దండనివ్వండి."

"ఓ శ్రేష్టుడా! మీ ఇద్దరి అందమైన మనసుల కలయిక, మీ గుణాల అమరిక అందమైనది. అమ్మాయి కూడా (మీ పట్ల) ఆసక్తిగా ఉంది. ఆమెకు ఈ మదనుని కుసుమాల దాడి కొత్తది. ఇదివరకు తెలియనిది. మీ సకలకళాభినివేశము (ఆమెయెడ) ఫలించనీ. మీ ఈ ప్రేమ ఆమె కంఠములో (మాంగల్యముగా) పూజను పొందుటగా సిద్ధింపనీ."

పైని సంభాషణ అలా జరిగినట్టు మాధవుడు తన స్నేహితుడైన మకరందునితో చెప్పడం విశేషం. మాధవుడు ఆమెకు తనదండను ఇచ్చేశాడు.

!******!

ఎంత అందంగా చెప్పింది కదూ! ఈ విధంగా అర్థాలను శ్లిష్టంగా చెప్పడంలో బాణభట్టు ఉద్ధండుడు. ఈ వచనమూ ఆయనను పోలి ఉంది.  బాణుడికి భవభూతికి స్పర్ధ అని కొంతమంది విమర్శకుల అభిప్రాయం.

అది అలా ఉంటే, ఒక మగవాడిని పువ్వులు కుట్టేంత సున్నితంగానూ, సుకుమారంగానూ మరే నాటకంలోనూ చూడం. (చూస్తే  చెప్పండి). నిజానికి ఈ నాటకం విమర్శకు గురైనది కూడా ఈ కారణం చేతనే. ఈ నాటకంలో మాధవుడు సుకుమారంగా ఉంటాడని, వీడికన్నా సెకండ్ హీరో మకరందుడు కాస్త ఉదాత్తంగా ఉంటాడని విమర్శకులు. ఓ ఘట్టంలో ఓ యువతి పైకి సింహం వస్తే మకరందుడు దాన్ని యెదుర్కుని చంపేస్తాడు. ఆపై మూర్ఛపోతాడు. ఆ తర్వాత మాధవుడూ అక్కడకు వచ్చి స్నేహితుణ్ణి చూసి మూర్ఛ పోతాడు. నాటకంలో ఇలా అడుక్కొకమారు మూర్ఛపోయేవాడు ఏం మగవాడు అని కొందరు సంస్కృతవ్యాఖ్యాతలు (కర్మకార్ ఫ్రభృతులు) అన్నారు. అయితే మాధవుడు మాలతిని సింహం నుంచి కాదు, ఏకంగా అఘోరకంఠుడనే ఓ మాంత్రికుని నుండే రక్షిస్తాడు. ఒక్కోసారి అనిపిస్తుంది భవభూతి చాలా అన్యాయమైన విమర్శలు ఎలా ఎదుర్కున్నాడని. 

అవన్నీ ఎడతెరిపిలేని చర్చలు.

పురుషుడు సున్నితంగానూ, సుకుమారంగానూ ఉంటూ పౌరుషవంతుడు కాకూడదని రూలేం లేదు. నిజానికి ఇతడే శ్రేష్టుడు. (మహాభాగుడు).

భవభూతి నాటకంలోని ఓ చిన్న అంశం ఇది.

!******!