10, జనవరి 2019, గురువారం

మయూఖము - 1


సంస్కృత సాహిత్యంలో ’నాటకం’ అన్న ప్రక్రియను తన ఎడమచేత్తో ఆడించిన కవి భాసకవి. నాటకకళలో ఆయనకు సాటి రాగల ప్రతిభావంతులు నిస్సందేహంగా మరెవ్వరూ లేరని నా భావన. ఆయన తర్వాత శూద్రక కవి. ఈ శూద్రకుడు కూడా తన మృచ్ఛకటిక నాటకానికి మూలంగా భాసుని చారుదత్తాన్ని ఎంచుకోవడం గమనార్హం.

దశరూపకాలలో పలు ప్రక్రియల్లో ఈ భాసకవి తన రచనలను చేశాడు. ఇతివృత్తాన్ని ఎంచుకోవడంలోనూ, దాన్ని "దృశ్య" బద్ధంగా మలచటంలోనూ, పతాకాస్థానకాలను (Dramatic Ironies) అక్కడక్కడా అందంగా పొదగటంలోనూ, ధ్వని మార్గంలో విషయాలను చెప్పటంలోనూ, ఔచిత్యం లోనూ, అన్నిటికన్నా ముఖ్యంగా - అతి సామాన్యులకోసం నాటకప్రక్రియను నిర్వహించటంలోనూ ఈయనది అసమానమైన ప్రతిభ.

మహాభారతంలోని విరాటపర్వం ఆధారంగా భాసుడు రచించిన ఓ రూపకం పంచరాత్రమ్.

పన్నెండేళ్ళ అరణ్యవాసం, ఓ యేడు అజ్ఞాతవాసం పూర్తవుతున్న తరుణం. పాండవులు విరాటరాజు కొలువులో మారువేషాల్లో ఉన్నారు. ఇటు దుర్యోధనుడు ఓ యజ్ఞం తలపెట్టి అందులో భాగంగా బ్రాహ్మలకు దానాలు చేస్తుంటాడు. ఆ బ్రాహ్మలలో ఒకడై ద్రోణుడు రారాజును పాండవులకు వారి అర్ధరాజ్యం ఇచ్చివెయ్యవలసిందని వరం యాచిస్తాడు.  రారాజు శకునితో యోజించి, ఓ షరతు పెడతాడు. ఐదు రాత్రులలో పాండవుల ఉనికి కనుగొంటే, పాండవుల అర్ధ రాజ్యం వారి పరమౌతుంది.

ఇది విని ద్రోణుడు హతాశుడవుతాడు. దాదాపు పదమూడేళ్ళు తెలియని పాండవుల ఉనికి ఇప్పుడెలా తెలుస్తుంది?

అంతలో అక్కడకు మత్స్యదేశం నుండి దూత వచ్చి ఓ వింత చెబుతాడు. ఆ దేశంలో కీచకుణ్ణి, ఆతని నూరు సోదరులను ఎవరో ఆయుధం లేకుండానే వధించారట. అది తప్పక భీముడేనని భీష్ముడంటాడు. ఆ దేశంలో దాగిన పాండవులను బయటకు తెప్పించడానికి విరాటనగరంపై ముట్టడి చేసి ఉత్తరగోగ్రహణం చేస్తారు. యుద్ధానికి వెళ్ళిన ఈ కౌరవ సైన్యంలో అభిమన్యుడు కూడా ఓ యోధుడు.

వీరిని ఉత్తరకుమారుడు, బృహన్నల ఎదుర్కొని, ఆలమందలను మళ్ళిస్తారు. యుద్ధం ముగిసి, కౌరవులు వెనక్కి మరలుతారు. కానీ ఒక్క అభిమన్యుడు మాత్రం వీరోచితంగా పోరాడుతుంటాడు. ఆతణ్ణి వదిలి కౌరవులు వెనక్కి మళ్ళారు.

ఆ తర్వాత - అభిమన్యుణ్ణి "ఎవరో" బందీగా పట్టుకుంటారు. ఆ యోధుణ్ణి బందీగా పట్టుకొన్నది ఎవరు? ఎవరతను?

అభిమన్యుని రథం పరిగెడుతుండగా, ఆ రథం కన్నా వేగంగా ముందుకు పరిగెత్తి, గుర్రాలను నిలువరించి ఆపి, ఆపైన రథంలో అభిమన్యుని పట్టుకొన్న ధీరుడెవ్వడు?

అలా పట్టుకోగలిగింది భీముడేనని - భీష్ముడు చెబుతాడు. ఎందుకంటే అదివరకు ద్రౌపదిని ఎక్కించుకుని జయద్రథుడు రథంలో పారిపోతుంటే, భీముడే నిలువరించినాడు!

భీముని ఈ సమర్థతను ద్రోణుడు కూడా ఒప్పుకుంటాడు. దానికి దృష్టాంతంగా ఓ ఉదంతం చెప్పాడు.

ఆ భీముడు బాలకుడుగా ఉన్నప్పుడు - ఓ ఉదంతం జరిగింది. ద్రోణుడు వాడికి బాణాలెయ్యటం నేర్పుతున్నాడు. ఓ బాణాన్ని చెవివరకూ లాగి, భీముడు వదలబోతున్నాడు. అలా వదిలేప్పుడు భీముని తల కాస్త కదిలింది. అలా కదలరాదని ద్రోణుడు - చెప్పి ముగించేంతలో - ఓ చిత్రం జరిగింది.

కర్ణాయతే తేన శరే విముక్తే వికంపితం తస్య శిరో మయోక్తమ్ |
గత్వా తదా తేన చ బాణతుల్యమప్రాపలక్ష్యః స శరో గృహీతః ||

ద్రోణుడు చెప్పేంతలో భీముడు ముందుకు పరిగెత్తాడు. తీవ్రమైన వేగంతో పరిగెత్తి ఆ శరం తన లక్ష్యాన్ని చేరుకోకముందే దానిని పట్టేసుకున్నాడు!

**********

ఇక్కడ ఆగి కాస్త చర్చించుకుందాం. "ఓ బాణాన్ని ఆకర్ణాంతం లాగి వేగంగా వదిలి, ఆ శరం తన లక్ష్యాన్ని చేరుకోక ముందే ఈ వదిలిన వాడే దానిని పట్టుకొన్నాడు". - ఇటువంటి ఉత్ప్రేక్షలు కావ్యాలలో అక్కడక్కడా కనిపించడం లో వింతేమీ లేదు. కావ్యజ్ఞులకు ఈ శ్లోకంలో చక్కని విశేషాలు కనిపిస్తాయి.

- భీముడు వాయుపుత్రుడని ఆ శ్లోకం ద్వారా ధ్వని. అందుకని వాయువేగంతో వెళ్ళగలడు.

- భీముడు బాణప్రయోగం చేసేప్పుడు ఒకింత పొరబాటు చేశాడు. దరిమిలా ఈతడికి అస్త్రవిద్యలో "రుచి" లేదని ఓ తాత్పర్యం.

- ఇక ఈ శ్లోకం - ఓ శబ్ద చిత్రం అని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.

*

సరే, ఇవన్నీ కావ్యజ్ఞులకు తెలుస్తాయి. కానీ నాటకం అంటే ఏంటి? అది "దుఃఖార్తులకు, శ్రమార్తులకు, తాపార్తులకు" కదా ఉద్దేశించబడింది? అంటే నేలటికెట్ ప్రేక్షకుడికి కదా నాటకం చెందవలసింది? వాడికి (ఇంకా ఈ వ్యాసకర్త వంటి దుర్మార్గులకు) ఈ శ్లోకంలో అసంబద్ధత కనిపించదూ?

సరిగ్గా అక్కడే భాసుడు ఓ రెండాకులు ఎక్కువ చదివాడు.

**********

ద్రోణుడలా అనగానే దానికి శకుని ఇలా బదులిచ్చాడు.

శకునిః : అహో, హాస్యమభిధానమ్ |

నాస్త్యన్యో బలవల్లోకే సర్వమిష్టేషు కథ్యతే |
జగత్ వ్యాప్తాన్ భవన్తః కిం సర్వే పశ్యంతి పాండవాన్ ||

"ద్రోణుడుగారు; అబ్బో, బానే జోకులేస్తున్నారే!

ఈ లోకంలో ఇక అంతకంటే బలవంతుల్లేరన్నట్టు! మీకు ఇష్టమైన వాళ్ళు కాబట్టి వారికి మీరు గొప్పతనాలు ఆపాదిస్తున్నారు. పాండవులే జగత్తునంతా వ్యాపించినట్టు మీరు చూస్తున్నారా ఏమిటి?"

**********

పైన, శకుని ఆక్షేపణ - అన్న ఒక్క దెబ్బతో భాసకవి సాధారణ ప్రేక్షకుల స్థాయికి దృశ్యకావ్యాన్ని తీసుకు వస్తాడు. ఓ సామాజికుడు - ఓ కావ్యంలో ఎదురైన ఉత్ప్రేక్ష/అతిశయోక్తిని ఎలా గుర్తిస్తాడు? గుర్తించిన అతడికి ఏ ప్రశ్న తడుతుందో - దానిని (దృశ్య) కావ్యకర్తయే వేసుకుని (శకుని) పాత్ర చేత ఆక్షేపణ పూర్వకంగా చెప్పించాడన్న మాట!

సామాజికుడికి వచ్చే సందేహాన్ని కావ్యకర్తే ఊహించి, ఆ సందేహానికి తన కావ్యంలో పాత్ర ద్వారానే సమాధానం చెప్పించటం - ఈ పని మరే కవి అయినా చేశాడా? (శూద్రకుడిని విచారించాలి ఓ మారు)

అలాంటిది చెయ్యాలంటే కవి, తనకంటే కూడా పాఠకుడికి ప్రాధాన్యత ఇవ్వాలి. చూడాలే కానీ కావ్యం యొక్క పరమావధి కనిపిస్తుంది ఈ దృక్పథంలో. అందుకే భాసుడు భాసమానుడు.

*

శకుని చేసిన ఈ వాదం - ఇదివరకటి భీముని పరాక్రమాన్ని "డైల్యూట్" చేస్తూంది. కానీ దీనిని అలానే ఉంచనివ్వకుండా శకుని కి భీష్ముని ద్వారా సమాధానం చెప్పిస్తాడు కవి. అలా ఆ వాగ్వాదం కొనసాగుతుంది. సామాజికుడు తిరిగి తన రసాస్వాదనలో తాను మునిగిపోతాడు.

**********

ఓ చిన్న ఘట్టంలో కేవలం రెండు శ్లోకాల వ్యవధిలో భాసుడు చూపెట్టిన భాసమానమైన  నేర్పు ఇది.  

1 కామెంట్‌:

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.