28, నవంబర్ 2013, గురువారం

సంస్కృతసౌరభాలు - 9

సీతారాములు sweet nothings చెప్పుకుంటున్నారు.

కిమపి కిమపి మందం మందమాసక్తియోగాత్
అవిరళిత కపోలం జల్పతోరక్రమేణ |
అశిథిలపరిరంభవాపృతేకైకదోష్ణో
రవిదిత గతయామా రాత్రిరేవ(వం) వ్యరంసీత్ ||


ఆసక్తియోగాత్ = సాన్నిహిత్యంగా మెలగుటవలన
అవిరళితకపోలమ్ = ఒకరి చెక్కిలి మరొకరితో కలిపి
అక్రమేణ = అసంబద్ధముగా
మందం మందం కిమపి కిమపి = మెల్లమెల్లగా ఏదేదో
జల్పతోః = గుసగుసలు పోవుచూ
అశిథిలపరిరంభ = వీడని కౌగిలిలో
వ్యాపృత = కుదిరిన
ఏకైక దోష్ణోః = ఒకే చేయికలిగినవారలమైన మనకు
అవిదితగతయామా = జాములు తెలియకుండగనే
రాత్రి: ఏవం = రాత్రి ఆ విధముగా
(రాత్రిః ఏవ = రాత్రి కూడా)
వ్యరంసీత్ = గడిచెను.

భావం:
సీతా! మనమిద్దరం చెక్కిలితో చెక్కిలి చేర్చి, మెలమెల్లగా ఏవేవో మాట్లాడుకుంటూ, క్రమంగా పారవశ్యంతో గుసగుసలు వోతూ, కౌగిలిలో మన ఇద్దరి చేతులు ఒకటై జాములు కూడా తెలియకుండా ఆ రాత్రిని కూడా అలానే గడిపాము. గుర్తున్నదా?

అప్పటికి రాముని పట్టాభిషేకం గడిచి ఒక యేడాది అయింది. ఆప్తులు, బాంధవులు వారి వారి ఊళ్ళకు తరలి వెళ్ళారు. తల్లులు జనక మహారాజు నిర్వహించే యజ్ఞకార్యానికై వెళ్ళారు. సీత నిండు గర్భిణి. రాముడు ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు.

ఈ సందర్భంలో అర్జునుడు అనే చిత్రకారుడు (బహుశా త్రేతాయుగపు బాపు) రాముని జీవితఘట్టాలను చిత్రించాడు. ఆ చిత్రాలను రాముడు, లక్ష్మణుడు,సీత కలిసి తిలకిస్తున్నారు. రాముడు వనవాసంలో సీతతో గోదావరి వద్ద ప్రస్రవణగిరి పై గడిపిన రోజులను తలుచుకుని పులకిస్తున్నాడు.

అందమైన నేపథ్యానికి సున్నితమైన శృంగారం జోడించి మధురమైన ఘట్టంగా తీర్చిన మహాభావుకుడైన పండితకవి భవభూతి దృశ్యకావ్యం - ఉత్+తర రామచరితమ్ లోని పద్యం ఇది. ఈ సున్నితమైన శృంగారాన్ని కరుణరసం వైపుగా కదిలించి కరిగింపజేస్తాడు కవి.

ఈ పద్యానికి సంబంధించిన కల్పితకథ ఒకటి ఉన్నది.

 తన సఖి ఇంటి వద్ద ఏకాంతంలో ఉన్న కాళిదాసుకు - ఇంటి బయట గుమ్మం దగ్గరే కూర్చుని భవభూతి శిష్యుడు ఈ కావ్యాన్ని వినిపిస్తూ, పై పద్యం పఠించాడు. చివరిపాదం వద్ద "రాత్రిరేవం" అనగానే కాళిదాసు తన సఖికి ఆకులో సున్నం ఎక్కువయ్యిందని "సున్నం (చూర్ణం)" అన్నాడుట. అంటే - సున్నం ఎక్కువయ్యిందని సఖికి సందేశం మాత్రమే కాదు, రాత్రిరేవం అన్నచోట "ఏవం" లో అనుస్వారం ఎక్కువయ్యిందని శిష్యునికి ఉపదేశం కూడా. భవభూతి శిష్యుడు పద్యాన్ని సవరించాడు.

రాత్రిరేవం వ్యరంసీత్ = రాత్రి ఆ విధముగా గడిచినది.
రాత్రిరేవ వ్యరంసీత్ = రాత్రి కూడా అలా గడిచినది. (అంటే పగలంతా మధురమైన తలపులతో గడిచి, రాత్రి కూడా అలాగే గడిచిందని ధ్వని).

***************************************

సంస్కృతనాటకపరిణామక్రమంలో భాసశూద్రకాది కవులది ఒకబాట. కాళిదాసభవభూత్యాదులది మరొకబాట.

భాసకవి నాటకాలు సన్నివేశప్రధానాలు. నాటకీయత లక్ష్యంగా కనబడుతుంది. పద్యాలను మనోజ్ఞంగా తీర్చినప్పటికీ, అవి దృశ్యాన్ని రక్తి కట్టించడానికి ప్రధానంగా ఉపకరించబడినట్టు తెలుస్తుంది. కొన్ని చోట్ల మౌనాన్ని, మరికొన్ని చోట్ల పూర్తిగా వచనాన్ని ఉపయోగించాడు భాసకవి. స్వప్నవాసవదత్తంలో రెండు అంకాలలో పూర్తిగా ప్రాకృతవచనాన్ని ఉపయోగించి స్త్రీపాత్రలతో తీర్చాడు కవి. అలా అని వర్ణనలు లేక కాదు. ప్రాధాన్యత తక్కువని మాత్రమే దీని అర్థం.

అస్తాద్రిమస్తకగతః ప్రతిసంహృతాంశుఃసంధ్యానురఞ్జివపుః ప్రతిభాతి సూర్యః |
రక్తోజ్జ్వలాంశుకవృతే ద్విరదస్యకుంభే జాంబూనదేన రచితః పులకోయథైవ ||


అస్తాద్రిపైన కిరణాలను వెనక్కు తీసుకుని సంధ్యారాగంచేత రంజింపబడిన సూర్యబింబం - ఏనుగుకుంభస్థలంపై ఎర్రటి వస్త్రాన్ని అలంకరించి, దానిపై పెట్టిన బంగారుపాత్రలాగా ఉన్నది.

అభిషేకం అనే నాటకంలోని అసమానమైన ఈ వర్ణన - వర్ణన మాత్రమే కాదు, యుద్ధభూమి తాలూకు వాతావరణాన్ని ఏనుగు ద్వారా ప్రేక్షకుని మనసులో స్థాపించడానికి కవి చూపించిన నేర్పు. భాసకవిలాగానే శూద్రకుడు అద్భుతమైన వర్ణనలు చేశాడు. అయితే ఈయన విషయంలోనూ సన్నివేశానికి ప్రాధాన్యత ఎక్కువ.

కాళిదాసభవభూత్యాదులది గొప్ప కావ్యగౌరవం.అద్భుతమైన పద్యరచనాప్రక్రియ వీరిసొంతం. అయితే పద్యం పూర్తిగా సన్నివేశనిష్టం కానవసరం లేదు. బహుశా అందుకనేమో భాసకవి రచనలు చదివిన వారికి సన్నివేశాలు మనసులో మెదిలితే కాళిదాసభవభూత్యాదుల కావ్యాలు అనుశీలించిన వారికి పద్యాలు లేదా పద్యపాదాలు గుర్తుండడం కద్దు అనిపిస్తుంది. ఈ క్రింది పద్యపాదాలు గమనించండి.

"పురాణమిత్యేవ న సాధుసర్వమ్, న చాపి కావ్యం నవమిత్యవద్యమ్"
"మూర్ఖః పరప్రత్యయనేయబుద్ధిః"
"ఏకో రసః కరుణ ఏవ"
"వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి
లోకోత్తరాణాం చేతాంసి కోహి విజ్ఞాతు మర్హతి?"
"ఉత్పస్యసే మమతు కోపి సమానధర్మాః
కాలోహ్యయం నిరవధిః విపులా చ పృథ్వీ"


పై పద్యపాదాలన్నీ కాళిదాసభవభూతుల కావ్యాలలోనివి. ఇవి సంస్కృతం నేర్చుకున్న వారి నోట సామాన్యంగా మెదులుతాయి.

భవభూతి రచించిన మూడు నాటకాలలో ఉత్కృష్టమైనది ఉత్తరరామచరితమ్. అద్భుతమైన పద్యాలు, అందమైన భావుకత, స్నిగ్ధమైన వర్ణనలతో కలిపిన కరుణరసమంజూషిక ఈ కావ్యం. ఈ కావ్యంలో వర్ణనలను ఉటంకించాలంటే దాదాపుగా అన్ని పద్యాలను లేదా కనీసం ౮౦ శాతం పద్యాలను చెప్పవలసి ఉంటుంది. అది అసాధ్యం కాబట్టి ఒకట్రెండు.

ఏతస్మిన్ మదకలమల్లికాక్షపక్షవ్యాధూతస్ఫురదురుదణ్డపుణ్డరీకాః |
భాష్పాంభః పరిపతనోద్గమంతరాళే సందృష్టాః కువలయినో భువో విభాగాః ||

సీతా! ఈ (పంపా) సరోవరంలో మల్లికాక్షములు అనే జాతి కలహంసలు కూజితాలు చేస్తూ విహరిస్తూ ఉండేవి. అవి రెక్కలను కదపడం వల్ల తెల్లటి తామరపూలు వాటి తూళ్ళతో సహా నీటిపైభాగానికి వచ్చి తేలేవి. అయితే నిన్ను పోగొట్టుకుని అశ్రుపూరితమై మసకబారిన కనులతో ఉన్న నాకు ఇవి నీలితామరల్లా కనిపించేవి.

భ్రమిషుకృత పుటాంతర్మండలావృత్తి చక్షుః
ప్రచలిత చటుల భ్రూతాండవైర్మండయంత్యా |
కరకిసలయతాళై ర్ముగ్ధయా నర్త్యమానం
నుతమివ మనసా త్వాం వత్సలేన స్మరామి ||


ఓ మయూరీ! నీకు సీతాదేవి కదూ నాట్యం నేర్పినది? ఆమె తన నల్లటి కనుపాపలు తిప్పుతుంటే చూచి నీవు వర్తులాకారంలో భ్రమించడం నేర్చావు.ఆమె తన చివురుటాకుల చేతులతో తాళం వేస్తుంటే నీవు నాట్యం చేశావు. నా మనసు వాత్సల్యంతో నిన్ను కన్నకొడుకుగా తలుస్తూంది.

జనకుడు సీతను తలుస్తూ:
అనియతరుదితస్మితం విరాజత్
కతిపయ కోమలదంతకుడ్మలాగ్రమ్ |
వదన కమలకం శిశోః స్మరామి
స్ఖలదసమంజస మంజు జల్పితం తే ||


అకారణమైన ఏడుపూ, నవ్వూ,. అప్పుడే పుట్టిన ఒకట్రెండు చిన్ని చిన్ని దంతాలూ. ముద్దుముద్దుగా తొట్రుపడేమాటలూ ఉన్న పాపాయీ! నీ ముఖకమలాన్ని ఇప్పటికీ మరువలేకున్నాను.

***************************************

సాధారణంగా పాండిత్యానికి, భావుకత్వానికి కాస్త చుక్కెదురు. అయితే ఈ రెండూ పరస్పరదోహదకారకాలుగా అమరిన కవులు అరుదు. భవభూతి అటువంటి పండితకవి.

చివరగా - ఒక కవి రచన తాలూకు ఇతివృత్తం నచ్చకపోయినా(సీతాపరిత్యాగం,శంబూకవధ ఇత్యాదులు) ఆ కవి రచనను ఆస్వాదించడం సాధ్యమా? అంటే అసాధ్యం కాదు కానీ దుస్సాధ్యం అని నా అవగాహన. ఆ అవగాహన నుండి వెలుపలికి రావడానికి నేను వేసిన తప్పటడుగు ఈ కావ్యాన్ని చదవడానికి చేసిన ప్రయత్నం. అలాంటి ప్రయత్నానికి భవభూతి వంటి కవి తప్పక సహకరించగలడు.

***************************************

22, నవంబర్ 2013, శుక్రవారం

సంస్కృతసౌరభాలు - 8


శూన్యం వాసగృహం విలోక్య శయనాదుత్థాయ కించిచ్ఛనైః
నిద్రావ్యాజముపాగతస్య సుచిరం నిర్వర్ణ్య పత్యుర్ముఖమ్ |
విస్రబ్ధం పరిచుంబ్య జాతపులకామాలోక్య గండస్థలీం
లజ్జా నమ్రముఖీ ప్రియేణ హసతా బాలా చిరం చుంబితాః ||

బాలా = ఆ జవ్వని
శూన్యం వాసగృహం విలోక్య = శయనగృహం నిర్మానుష్యముగా ఉండటం చూచి,
కించిత్ శనైః = మెల్లగా
శయనాదుత్థాయ = నిద్రనుండి లేచి,
నిద్రావ్యాజముపాగతస్య = దొంగనిద్దురపోవుచున్న
పత్యుర్ముఖమ్ = పతి ముఖాన్ని
సుచిరం నిర్వర్ణ్య = చాలా సేపు చూసి
విస్రబ్ధం పరిచుంబ్య = జంకు లేకుండా ముద్దుపెట్టుకుని
గణ్డస్థలీం = అతని చెక్కిలియందు
జాతపులకామాలోక్య = అంకురించిన పులకింతలను కనుగొని
లజ్జా నమ్రముఖీ = సిగ్గుతో తలదించుకున్నదై
ప్రియేణ హసతా = ప్రియునిచేత పరిహాసము చేయబడినదై
చిరం చుంబితా = చాలా సేపు ముద్దుపెట్టుకొనబడినది (అయినది)

***************************************

నిదురిస్తున్న ప్రియురాలి పెదవిపైని అందమైన ముద్దును గాలిబ్ దొంగిలిస్తే, అమరుకుడనే సంస్కృతకవి ప్రియుని చెక్కిలిపై ముద్దు ద్వారా ఏకంగా అందమైన దోపిడీకి దిగాడు.

అమరుకుడని ఒక కవి. ఆయన వ్రాసిన పుస్తకం పేరు అమరుశతకం. ఈయనపై ఒక విచిత్రమైన కథ ఉంది.

ఆదిశంకరాచార్యునికి మండనమిశ్రునికి వాదం వచ్చింది. వారు వాదనకు దిగినప్పుడు మండనమిశ్రుని భార్య శృంగారపరమైన ప్రశ్నలు సంధించిందట. అప్పుడు శంకరులు ఆమెతో కొంతకాలం వ్యవధి కోరి, ఆ వ్యవధిలో అమరుకుడనే మహారాజు మరణించి ఉండడం కనుగొని అతని దేహంలోనికి పరకాయప్రవేశ విద్య ద్వారా ప్రవేశించాడు. శంకరుని నిజశరీరాన్ని ఆయన శిష్యులు ఒక గుహలో ఉంచి కాపు కాస్తున్నారు.

ఈలోగా అమరుకుని భార్యకు అనుమానం కలిగింది. తన పతి శరీరంలో ఉన్న ప్రాణం పతిది కాదు, మరెవరో మహాత్ముడిదని ఆమె గ్రహించింది. ఆ యోగిని శాశ్వతంగా అధీనం చేసుకోవాలని ఆమె సంకల్పించింది. రాజ్యంలో ఉన్న మృతకళేబరాలన్నిటిని దహించమని భటులను పురికొల్పగా వాళ్ళు ఆ పని చేస్తూ శంకరుల శరీరం ఉన్న గుహను చూచారు. శంకరుని శిష్యులు ఆ భటులను బతిమాలుకుని, రాజు అమరుకుని ఆస్థానానికి వచ్చి "తత్త్వమసి, తత్త్వమసి" అని సంకేతభాషలో విన్నవించుకున్నారు. అమరుకుని వేషంలోని శంకరులు విషయం గ్రహించి, తన మిథ్యాదేహం చాలించి తిరిగి తన నిజదేహానికి పరకాయప్రవేశం ద్వారా పునఃప్రవేశించడంతో కథ ముగిసింది.

అలా శంకరులు అమరుకుని దేహంలో ఉన్నసమయంలో వ్రాసిన కావ్యం అమరుశతకం అని కథ. తగినట్టుగానే ఈ శతకం శృంగారభరితమైనది. ఆ కావ్యంలో భాగంగా అమరుకుడు పై పద్యాన్ని వ్రాశాడు.

అదే అతడు చేసిన తప్పు.

***************************************

అమరుకుని శతకంలోని పద్యాలను అలంకారికులు ఉదాహరణలుగా స్వీకరించారు. పై పద్యాన్ని కూడా. అందులో భాగంగా ఒక వివాదం ఏర్పడింది. ఆ ఉదంతం ఇది.

కావ్యం అంటే ఏమిటి? అని తర్కిస్తూ అలంకారికులు రకరకాల నిర్వచనాలను చెప్పారు.
శబ్దార్థౌ సహితౌ కావ్యమ్ - భామహుడు (శబ్దార్థసహితమైనది కావ్యము)
శబ్దార్థౌ కావ్యం - రుద్రటుడు
అదోషౌ, సగుణౌ, సాలంకారౌ చ శబ్దార్థౌ కావ్యమ్ - హేమచంద్రుడు

వగైరా వగైరా.. స్థూలంగా కావ్యం అంటే దోషాలు లేనిది, అలంకారాలు కలిగినది, గుణయుతమైనది అని ఒక అవగాహన. ఈ నేపథ్యంలో పై పద్యాన్ని పరిశీలిస్తే -

ఆ పద్యంలో శబ్ద, అర్థ అలంకారాలేవీ కనబడడం లేదు. మధుర్య, ప్రసాద, ఓజాది గుణాలు ఉత్కృష్టంగా కనబడడం లేదు. కొద్దో గొప్పో దోషాలు కూడా ఉన్నాయి. కానీ భావం మాత్రం రసాత్మకంగా ఉన్నది. ఇలా వితర్కించుకుని విశ్వనాథకవిరాజు అన్న అలంకారికుడు తన సాహిత్యదర్పణం అన్న గ్రంథంలో ఒక కొత్త కావ్యనిర్వచనప్రతిపాదన చేశాడు. అది చాలా ప్రముఖమైనది.

- వాక్యం రసాత్మకం కావ్యం.

ఆ నిర్వచనానికి ఉదాహరణగా ఆ అలంకారికుడు ఇదే పద్యాన్ని ఉటంకించాడు.

పైని పద్యాన్ని చూస్తే ఆ పద్యం దాదాపు ఒక వాక్యంలాగానే ఉంది. అక్కడ నాయకుడు ఆలంబన విభావం. శూన్యవాసగృహం, పతి నిద్ర ఉద్దీపన విభావాలు. ముఖాన్ని తదేకంగా చూడ్డం, ముద్దాడటం అనుభావాలు. లజ్జ వ్యభిచరీభావం. సంభోగశృంగారం రసం. ఇలా వివరించి ఆయన దీనిని ఉత్తమకావ్యానికి నిర్వచనంగా ప్రతిపాదించాడు. మమ్మటుడు (కావ్యప్రకాశ కర్త) దీనిని సమర్థించినాడు.

వీరితో విభేదించినది రసగంగాధరకర్త జగన్నాథపండితరాయలు. ఈయన objections ఇవి.

సున్నితమైన శృంగారానికి నెలవైన ఈ పద్యంలో
- ఉత్ థాయ అన్నచోట చాలాకటువుగా వినిపిస్తున్నది.
- శనైర్నిద్రే, పత్యుర్ముఖ - ఇక్కడ రేఫఘటిత సంయోగం ఉన్నది.


(శషౌ రేఫఘటిత సంయోగౌ, ఢకారశ్చ భూయసా
విరోధినః స్యుః శృంగారే తేన వర్ణాః రసచ్యుతాః |

అని ధ్వన్యాలోకం. అంటే శృంగారానికి చెందిన పద్యాలలో శషలు, రేఫ సంయోగాలూ, ఢ కారమూ ఉండరాదు. ఇది రసవిరోధకాలు. "ట" కారం కూడా శృంగార రసవిరోధమని ఒక వాదం)


- విస్రబ్ధ ఇక్కడ "బ్ధ" మహాప్రాణం.
- లజ్జే - సవర్ణ ద్వయఘటితం


ఇలా అడుగడుగునా కటువైన, అశ్రవ్యమైన శబ్దాలతో ఈ పద్యం (కావ్యం) కవి తాలూకు నిర్మాణసామగ్రిదారిద్ర్యాన్ని నిరూపిస్తున్నాయని ఘాటుగా విమర్శించాడు.

ఇలా అలంకారికుల తర్కపాటవానికి పై పద్యం గురయ్యి మౌనవేదన పడింది.

***************************************

అమరుక కవి చేసిన మరొక తప్పు ఇది.

నిశ్శేషచ్యుతచన్దనం స్థనతటం నిర్మృష్టరాగోऽధరో
నేత్రే దూరమనఞ్జనే పులకితా తన్వీ తవేయం తనుః |
మిథ్యావాదిని దూతి బాన్ధవజనస్యాజ్ఞాత పీడాగమే
వాపీం స్నాతుమితో గతాసి న పునస్తస్యాధమస్యాన్తికమ్ ||

ఒకానొక నాయకురాలు తన ప్రియుణ్ణి పిలుచుకు రమ్మని తన దూతిని అతని కడకు పంపింది. ఆ దూతి తిరిగి రాగా, ఆమె వంటిపై చిహ్నాలను చూసి నాయకు రాలు వ్యంగ్యంగా అంటున్న మాటలివి.


నీ స్థనపైభాగంమీద ఇదివరకు అలదుకున్న చన్దనం పూర్తిగా లేదు. పెదవిపై లత్తుక ఎరుపు తుడిచిపెట్టుకుపోయింది. కళ్ళపైన కాటుక చెదిరింది. నీ స్నేహపాత్రురాలైన నన్ను బాధపెట్టిన ఓ అబద్ధాల కోరుదానా! నీవు బావిలో స్నానం చేయడానికి వెళ్ళావు. ఆ అధముని దగ్గరకు వెళ్ళనే లేదులే.

- అమరుక కవి తాంబూలాలివ్వడంతో మరో జగడం మొదలయ్యింది. పై పద్యంలో నిశ్శేష, నిర్మృష్ట,దూర, తవేయం - ఈ శబ్దాలు విశేషంగా రతికేళి జరగడాన్ని సూచిస్తూ, వ్యంగ్యాన్ని ఉద్దీపిస్తున్నాయి. అందుచేత ఇది ధ్వని కావ్యమని అప్పయ్యదీక్షితుల వారు. అలా కాదనిన్నీ, అప్పయ్య దీక్షితుల వారికి అలంకారిక సాంప్రదాయం తెలియదనిన్నీ జగన్నాథ పండితరాయల వారు. ఈ పద్యానికి సంబంధించి పండితరాయల వారి తర్కం మరీ శ్రుతి మించి పాకాన బడుతుంది. అర్థం కాదు కూడా. (అప్పయ్యదీక్షితులంటే పండితరాయల వారికి సరిపడదు.) వారిద్దరి మధ్యనా ఈ పద్యం తాలూకు చన్దనసౌరభం నిశ్శేషంగా చ్యుతం అయే ప్రమాదం ఏర్పడింది.

వస్తువును కాకుండా వ్యాఖ్యాతను దృష్టిలో పెట్టుకుని కత్తులు నూరేవాళ్ళు ఆ కాలం నాడూ ఉన్నారల్లే ఉంది.

సరే. అవన్నీ తర్క విషయాలు. వాటిని వదిలి ఒక స్నిగ్ధమైన శృంగారభరితమైన పద్యం - చాలా మత్తుగొలిపే పద్యం ఒకటి చివర్న.

గాఢాలిఙ్గనవామనీకృతకుచప్రోద్భిన్న రోమోద్గమా
సాన్ద్రస్నేహరసాతిరేకవిగళత్కాఞ్చీప్రదేశామ్బరా
మా మా మానద! మాతి మామలమితి క్షామాక్షరోల్లాపినీ
సుప్తా కిన్నుమృతా ను కిం మనసి మే లీనా విలీనా ను కిమ్?

బిగికౌగిలింతలతో గాఢంగా పీడింపబడి కురచములైన కుచములతో, అనురాగం మిక్కుటమై తనంతటగా వీడిన పోకముడి కలదై, వద్దు, వద్దు, నా మానం తీయకు, చాలు చాలు మని ఆనందపారవశ్యంచేత గుసగుసలు వోయిన సఖి కడకు నిద్రించినదో, మూర్ఛవోయినదో, మనసున దాగినదో, మనసున ఐక్యమైనదో అన్నట్లుగా నిశ్చేష్టితమైనది.

***************************************
 
అమరుకుని ఒక్కొక్క పద్యం ఒక్కొక్క కావ్యంతో సమానమని ఒక అభాణకం.

కవిరమరః కవిరమరుః కవిర్హి చోరో మయూరశ్చ |
అన్యే కవయః కపయః చాపలమాత్రం పరం దధతే ||

కవి అంటే అమరసింహుడు, అమరుకుడు, చోరకవి, మయూరుడూనూ. మిగతా కవులంతా కపులు. ఏదో పోనీ అని భరించదగినవారు.

నిజమా? ఏమో! :)

***************************************

17, నవంబర్ 2013, ఆదివారం

సంస్కృతసౌరభాలు - 7


శరత్కాలం. నిర్మలమైన ఆకాశంలో కొంగలబారు వెళుతూంది. ఆ దృశ్యాన్ని విదూషకుడు (నాయకుని సహాయకుడు), రాజు (నాయకుడు), చేటి (నాయిక యొక్క పరిచారిక) చూసి వర్ణిస్తున్నారు.

**********************************

విదూషకః : శరత్కాల నిర్మలాంతరిక్షే ప్రసారిత బలదేవ బాహుదర్శనీయాం సారసపఙ్త్కిం యావత్సమాహితం గచ్ఛన్తీం పశ్యతు తావద్భవాన్ .

రాజా: వయస్య, పశ్యామ్యేనామ్

ఋజ్వాయతాంచ విరలాంచ నతోన్నతాంచ
సప్తర్షివంశకుటిలాంచ నివర్తనేషు |
నిర్ముచ్యమాన భుజగోదర నిర్మలస్య
సీమామివామ్బర తలస్య విభజ్యమానామ్ ||

చేటీ: పశ్యతు పశ్యతు భర్తృదారికా. ఏతాం కోకనదమాలాపాండురరమణీయాం సారసపంక్తిం యావత్సమాహితం గచ్ఛన్తీమ్.

**********************************

విదూషకుడు:శరత్కాలంలో స్వచ్ఛమైన ఆకాశంలో చాపినబలరాముని బాహువుల లాగా దర్శనీయంగా ఉన్న కొంగలబారును వెళ్ళేంతలో చూడు రాజా.

రాజు: మిత్రమా, సరళంగా ఉన్నవి, విడివిడిగా ఉన్నవీ, ఎత్తుపల్లెములు కలిగినవి, మలుపులు తిరిగేప్పుడు సప్తర్షి మండలంలా వంకరగా అయినవి, కుబుసం విడిచిన పాములా స్వచ్ఛంగా ఉన్న గగనతలానికి సరిహద్దురేఖ గీచినట్లుగా ఉన్నవీ అయిన ఆ సారసపంక్తిని చూశాను.

చేటి: మహారాణీ, ఎర్రకలువలమాలవలే రమణీయంగా ఉన్నవీ, దగ్గరదగ్గరగా కూర్చబడినవీ అయిన ఈ కొంగలబారును చూద్దువుగానీ.

**********************************

సంస్కృత మహాకవులలో అత్యంతసంయమనశీలిత్వాన్ని, కవిత్వంలో అత్యంత పొదుపునూ, సన్నివేశకల్పనలో అనాయాసమైన నాటకీయతనూ, ఔచిత్యంలో గొప్పపరిణతినీ సాధించిన కవి భాసమహాకవి. ఈయన రచించినవన్నీ దృశ్యకావ్యాలే (నాటకాలే). భాసకవిలో మహోన్నతమైన లక్షణం ఏమిటంటే చివరివరుసన కూర్చున్న ఒక అత్యంత సామాన్యుడైన సామాజికుని దృష్టిలో పెట్టుకుని ఈయన సన్నివేశాలను కల్పిస్తాడు. అందుకు తగినట్లు కవిత్వాన్ని సృజిస్తాడు. పైని సన్నివేశం స్వప్నవాసవదత్తం అన్న నాటకం లోనిది.

చాలా సామాన్యమైన దృశ్యం. వత్సరాజు ఉదయనుడి భార్య వాసవదత్త. మంత్రి యౌగంధరాయణుడు - కొన్ని రాజకీయకారణాల వల్ల తనూ, వాసవదత్తా చనిపోయినట్లుగా కల్పిస్తాడు. ఆపై మారువేషంలో వాసవదత్తను మగధరాకుమారి పద్మావతికి పద్దకు చేర్చి ఆమెకు సఖిగా అమరుస్తాడు. ఆ పద్మావతిని ఉదయనుడు ద్వితీయవివాహం రాజకీయకారణాలవల్ల చేసుకొన్నాడు. కానీ రాజు హృదయంలో అంతా వాసవదత్తయే నిండి ఉంది. ఈ నేపథ్యంలో రాజు ఉద్యానవనానికి వస్తాడు. అక్కడ ఒక చిన్న దృశ్యం - ఆకాశంలో కొంగలబారు. పైకి చూస్తే ఏమీ లేదు, కానీ మూడు భిన్నమైన జతల కళ్ళతో కవి చూచిన దృశ్యాన్ని కాస్త జాగ్రత్తగా గమనించాలి.

విదూషకుడు రాజుకు సహాయకుడు. హాస్యకారీ విదూషకః అని ఉక్తి. ఈ పాత్రను నాటకాలలో సామాన్యంగా బ్రాహ్మణపాత్రధారి పోషించడం కద్దు (శ్రీకృష్ణతులాభారం సినిమాలో పద్మనాభం). ఆ పాత్రధారికి పౌరాణిక పాత్రలపట్ల అపేక్షా, భోజనప్రీతీ, స్వారస్యం లేని వర్ణనలపై ప్రీతి - లక్షణాలు. కొంగలబారు బలరాముని భుజాల్లా ఉంటాయన్న వర్ణన అతని మనస్తత్వాన్ని సూచిస్తున్నది.

అపైన మహారాజు వర్ణన. ఆకసం కుబుసం విడిచిన సర్పంలా ఉన్నది అనటంలో శరత్కాలంలో స్వచ్ఛతను, కొంగలబారు సరిహద్దులా ఉంది అనటంలో రాచమనస్తత్వానికి చెందిన స్వాభావికతనూ, ఆ పంక్తిని పలువిధాలుగా ఉద్యోతించడంలో రాజు మనసులో ఉన్న భావశబలత (రాజ్యాన్ని పోగొట్టుకున్న బాధ, వాసవదత్తను పోగొట్టుకున్న విరహం, పద్మావతిని పొందిన ఊరట) నూ చిత్రించాడు భాసుడు. ఈ శ్లోకం ఛందస్సు - "వసంతతిలకం".

ఇంతలో చేటి (పద్మావతి చెలికత్తె) కూడా ఆ దృశ్యాన్ని చూసింది. తన యజమానికి పూలమాలలు కట్టటం, చందనాది లేపనాలు సిద్ధం చేయటం చేటి పనులు. ఆమె స్వభావానికి తగినట్టు చేటికి కొంగలబారు ఒక ఎర్రకలువలదండలా అగుపడింది.

చేటి పైన ఆకసంలో ఆ దృశ్యాన్ని చూసి కళ్ళు దింపగానే ఆమెకు ఉద్యానవనంలో అడుగుపెడుతున్న మహారాజు కనిపించాడు. పద్మావతితో "ఓ! మహారాజు గారు వచ్చారు" అంది.

అదే ఉద్యానవనానికి అప్పటికే పద్మావతి, ఆమె సఖిగా ఉన్న వాసవదత్త (మారు పేరు అవంతిక), చేటి వచ్చి ఉన్నారు. వాసవదత్త పరపురుషులను చూడనని నియమం పెట్టుకుంది. ఆమె నియమాన్ని మన్నిస్తూపద్మావతి అక్కడి నుండి వైదొలగింది. ఇది ఆ ఘట్టం.

పైకి చాలా చిన్నదిగా కనబడిన ఆ వర్ణన వెనుక అనాయాసంగా నాటకాన్ని తీర్చిదిద్దగల అసమానమైన నైపుణ్యత కనిపిస్తుంది.

**********************************

పైని వర్ణనలో సూచనాత్మకంగా భాసమహాకవిలోని క్లుప్తత కనిపిస్తుంది. ఆయన కొన్ని సందర్భాలలో మౌనాన్ని కూడా సమర్థవంతంగా ఉపయోగించుకుంటాడు. మరికొన్ని చోట్ల అద్భుతమైన ఒక చిత్తరువు లాంటి దృశ్యంతో మాటల్లో చెప్పలేని భావాన్ని చెప్పగలుగుతాడు. స్వప్నవాసవదత్తంలో ఒకచోట పద్మావతి ఉదయనుణ్ణి వీణావాదన నేర్పమని అడుగుతుంది. అప్పుడా రాజు ఒక నిట్టూర్పుతో మౌనంగా ఉండిపోతాడు.

విషయమేమంటే ఉదయనుని ప్రథమకళత్రం వాసవదత్త ఉదయనునికి ప్రియురాలే కాదు, వీణావాదనలో శిష్యురాలు కూడా. ఆమె స్థానాన్ని పద్మావతి ఆపేక్షిస్తే మహారాజు ఏమని చెబుతాడు? అదే ఆ నిట్టూర్పులోని భావం.ఆ మౌనభావాన్ని సామాజికులలో ప్రతిక్షేపించిన నాటకకర్త మరొక దృశ్యంలో వాసవదత్తను గుర్తు చేసుకుంటాడు.

బహుశః అప్యుపదేశేషు యయా మామీక్షమాణయా |
హస్తేన స్రస్తకోణేన కృతమాకాశవాదితమ్ ||

మాం = నన్ను, ఈక్షమాణయా = చూస్తున్నట్టి, యయా = ఏ వాసవదత్తచేత, ఉపదేశేషు = వీణావాదన శిక్షణయందు, బహుశః = పెక్కుమార్లు,స్రస్తకోణేన = జారిన తీవెకలవీణియగల, హస్తేన = చేతితో, ఆకాశవాదితం = శూన్యంలో వీణావాదన చేయబడినదో తన్యాః = ఆ వాసవదత్తను, స్మరామి = తలుచుకుంటూనే ఉన్నాను.

ఉదయనుడు వాసవదత్తకు వీణ నేర్పిస్తున్నాడు. ఇద్దరూ కలిసి వీణావాదనం చేస్తున్నారు. అతనివైపే తదేకంగా చూస్తూ తనను తాను మరచిన వాసవదత్త చేతి నుండి తీవె జారిపోయింది. అయినా ఆమె శూన్యంలో వేళ్ళను కదుపుతూంది. అయితే ఉదయనుడు కూడా వీణియను మ్రోగిస్తున్నాడు కాబట్టి అపశ్రుతి వినిపించలేదు. అలా తనను చూస్తూ ఒడలు మర్చిపోయిన తన శిష్యురాలిని, ప్రియురాలిని ఉదయనుడు స్మరిస్తున్నాడు.

ప్రేయసీప్రియుల హృదయనాదం ఒక్కటేనన్న ఒక అపూర్వమైన సౌందర్యభావయుక్తమైన ధ్వని ఈ శ్లోకంలో కాస్త సూక్ష్మంగా వివేచించే వారికి కనిపిస్తుంది. సాధారణ ప్రేక్షకునికి కూడా ఉదయనుని విరహం అపూర్వంగా కనబడుతుంది. ఇలా ఒకే శ్లోకంతో భిన్నసామాజికులను ఆకట్టుకోవడం భాసనాటకకళ.

ఇలా ఈ కవి గురించి ఇంకా ఎన్నో చెప్పుకోవచ్చు

**********************************

14, నవంబర్ 2013, గురువారం

సంస్కృతసౌరభాలు - 6

ఈ యేడాది మా పెరడు కళకళలాడిపోతోంది. అరచేతిలో పట్టేంత జామకాయలు, బంగారు రంగులో గుమ్మడిపాదు నుంచి వేలాడుతున్న గుమ్మడికాయ, మొదటిసారి కాస్తున్న నిమ్మచెట్టు, గన్నేరుపూలు, బంతిపూలు, మందారం, గుత్తులుగా వేలాడుతున్న బాదంకాయలూ, కొబ్బరి చెట్టుపై నుండి క్రిందికి చూస్తున్న కొబ్బరిబొండాలూ..

బాదం గట్టుపై కూర్చుని బాదంకాయ కండ నములుతూ కొబ్బరి నీరు (గొట్టం అవసరం లేకుండా) త్రాగడం ఒక స్వప్నంలాంటి అనుభూతి.

భాసుడు వ్రాసిన స్వప్నవాసవదత్తం అనే సంస్కృతనాటకం చదవడమూ అలాంటి చిక్కటి అనుభూతిని కలిగిస్తుంది. అయితే ఈ వారం టాపిక్ అది కాదు. కొబ్బరినీళ్ళు త్రాగడానికి ముందు కాస్త ఘాటైనదేదైనా రుచి చూడాలి.

అలాంటి ఘాటైన శృంగారతిలకమ్ గురించి ఈ వారం.  కాళిదాసు కృతిగా చెప్పబడుతున్న శృంగారతిలకమ్ ఒక మిరపకాయబజ్జీల పొట్లం లాంటి ముక్తక కావ్యం. అయితే ఈ కావ్యం రచించినది కాళిదాసు కాదన్న సంగతి సులభంగానే కనుక్కోవచ్చు. ఎందుకంటే - కాళిదాసు కవిత్వంలో కనిపించే అనుపమానమైన ఉపమానాలు ఇందులో లేవు.

అలాగే కాళిదాసు కవితావైదగ్ధ్యం శృంగారతిలకమ్ లో లేదు.

వైదగ్ధ్యం అంటే తనకు మాత్రమే సాధ్యమైన ఒక నేర్పు.  ఆ వైదగ్ధ్యాన్ని ఒక చిన్న శ్లోకం ద్వారా కొండను అద్దంలో చూసే ప్రయత్నం చేస్తున్నాను.

కుమారసంభవంలో హిమాలయవర్ణన తాలూకు శ్లోకం ఇది.

కపోలకణ్డూః కరిభిర్వినేతుమ్ విఘట్టితానాం సరళద్రుమాణామ్ |
యత్రశ్రుతక్షీరతయా ప్రసూతం సానూనిగన్ధస్సురభీకరోతి ||

మదపుటేనుగులు మదజలం స్రవించడంతో వచ్చిన దురదను బాపుకోవడం కోసం చెక్కిళ్ళను దేవదారు చెట్ల బెరళ్ళకేసి రుద్దుకుంటున్నాయి. దాంతో ఆ చెట్ల బెరళ్ళు విచ్చి పాలు కారుతున్నాయి. అలా కారిన పాలు, మదజలం తాలూకు ఘాటైన సువాసన కలిసి పర్వతసానువులను గుబాళింపజేస్తున్నాయి.

పదచిత్రాలంటారు వీటిని. ఈ శ్లోకం ద్వారా ’చెట్టుబెరడుకేసి రుద్దుకుంటున్న ఏనుగు’ అనే చిత్తరువు లాంటి దృశ్యం కళ్ళకు కడుతుంది. కాళిదాసు విశిష్టత కేవలం చిత్రాన్ని చూపడంలో మాత్రమే లేదు. "సానూనిగంధస్సురభీకరోతి" - పరిమళ భరితమైన పర్వతసానువులను సామాజికుడికి "బోనస్" గా అందివ్వడంలో ఉన్నది. అంతేనా? ఇంకా ఉంది.

సురభి అన్న శబ్దానికి పరిమళం అన్న అర్థంతో బాటు వసంతం, కామధేనువు అన్న అర్థాలూ ఉన్నాయి. పై శ్లోకం ద్వారా హిమాలయా పర్వత సానువులు పరిమళభరితం అవడమొక్కటే కాదు, అక్కడ "వసంతం" ఎల్ల కాలాల్లో వెల్లివిరుస్తుందన్న "ధ్వని" కూడా ఉన్నది. సురభి అన్న ప్రవృత్త్యసహాయ శబ్దం ద్వారా శబ్దశక్త్యుద్భవవస్తుధ్వనిని ఉద్యోతించడం కాళిదాసు తాలూకు అచ్చెరువు గొలిపే వైదగ్ధ్యం.ఒక అడవిజంతువు కండూయనాన్ని ఏ మాత్రం క్లుప్తత చెడనివ్వకుండా అదనపు హంగులు అద్ది సౌందర్యానుభూతి అంచులకు తీసుకెళ్ళే ప్రయత్నం చేయడం - ఆ పనిని సున్నితమైన, అందమైన శబ్దాలతో అలవోకగా నిర్వహించడం - విదగ్ధతాచిహ్నమని అని నా అనుకోలు. వస్తునిష్టమైన కవిత్వాన్ని (subjective poetry) ఈయన చాలా మామూలుగా శిఖరాగ్రానికి తీసుకెళతాడు.

*****************************

శృంగారతిలకమ్ అంతటి గొప్ప కావ్యం కాకపోవచ్చు, కానీ దేని దారి దానిదే.

ఇందులో అక్కడక్కడా ఘాటెక్కువైన సందర్భాలున్నాయి. శృంగారం పరిధిని దాటి అశ్లీలానికి దిగిన కొన్ని శ్లోకాలు ఇందులో ఉన్నాయి. కొన్ని శ్లోకాలు ఇక్కడ.

కిం మాం నిరీక్షసి ఘటేన కటిస్థితేన
వక్త్రేణ చారుపరిమీలితలోచనేన |
అన్యం నిరీక్ష్య పురుషం తవ భాగ్యయోగ్యం
నాऽహం ఘటాంకితకటిం ప్రమదాం భజామి ||

సత్యం బ్రవీషి మకరధ్వజబాణపీడ!
నాऽహం త్వదర్పితదృశా పరిచిన్తయామి |
దాసోऽద్య మే విఘటస్తవతుల్యరూపః
సోऽయం భవేన్న హి భవేదితి మే వితర్కః ||

31 శ్లోకాల ఈ ముక్తకంలో చివరి రెండు శ్లోకాలివి.

నీలాటిరేవు కాడ కోడెవయసులో ఉన్న ఒక కుర్రవాడు నుంచునున్నాడు. కడవను సంకనెత్తుకున్న ఒక అమ్మాయి. అమ్మాయి అతడినే చూస్తా ఉంది. ఆ అమ్మాయిని చూసి అతడు చెప్పిన శ్లోకం మొదటిది.

"ముఖాన చారెడేసి కళ్ళెట్టుకుని, చంకన కుండెట్టేసుకుని నాకోసం ఎందుకు ఎదురుచూస్తావు పిల్లా? నీ భాగ్యానికి తగిన వాణ్ణి ఎవణ్ణయినా చూసుకోరాదూ? నాకు కడవలు మోసే అమ్మాయిలు నచ్చరు."

దీనికి అమ్మాయి ఇచ్చిన కౌంటర్ రెండవది.

"ఓ మదనబాణపీడితుడా! సత్యం చెబుతున్నాను. నీపైన ఆశ పెట్టుకుని కళ్ళెట్టుకుని చూడలేదు. తప్పిపోయిన నా దాసుడు అచ్చం నీలానే ఉంటాడు. అతనే నీవా అని చూస్తున్నాను."

కాళిదాసుకు లఖిమ అనే విదుషీమణికి మధ్య ఈ సంభాషణ జరిగినట్టు ఒక కథ ఉన్నది. (బహుశా భోజరాజీయం కావచ్చును. ఆ పుస్తకం నేను చదవలేదు.)

ఈ శ్లోకార్థాన్ని జాగ్రత్తగా చూడండి. మొదటి శ్లోకంలో - అమ్మాయి పట్ల ఏ విధమైన ఆసక్తీ లేని ఆ యువకుడికి "వక్త్రేణ చారుపరిమీలితలోచనేన" అంటే "ముఖమంతా పరుచుకున్న కళ్ళతోటి" అని అమ్మాయిని వర్ణించే అవసరం ఎందుకు? ఏవో మాటలు పెట్టుకుని పరిచయం పెంచుకునేట్టుగా లేదూ అతని వాలకం? అలాగని ఆమెపై మోహం చూపించడమూ ఇష్టం లేదన్నట్టుగా మాట్లాడాడు. ఆ అమ్మాయి కూడా తక్కువ తినలేదు. "మకరధ్వజబాణపీడ" - అనే సంబోధనతో అతని వాలకాన్ని బయటపెట్టింది. రేవు దగ్గర జరిగిన సరసమైన సంభాషణకు ఈ శ్లోకాలు దృష్టాంతం.

శ్లాఘ్యం నీరసకాష్టతాడనశతం శ్లాఘ్యః ప్రచణ్డాతపః
క్లేశః శ్లాఘ్యతరః సుపఙ్కనిచయైః శ్లాఘ్యోऽతిదాహాऽనలైః |
యత్కాన్తాకుచపార్శ్వబాహులతికాహిన్దోలలీలాసుఖమ్
లబ్ధం కుమ్భవర త్వయా నహి సుఖం దుఃఖైర్వినా లభ్యతే ||

ఓ కుంభశ్రేష్టా! జవరాలి నడుముపై కూర్చుని తీవెలాంటి ఆమె చేతిలో ఉయ్యాలలూగే అదృష్టం కొరకై మునుపు నీవు ఎండుకట్టెల తన్నులు తినడం బాగు. మంచి ఎండలో ఎండడం బాగు బాగు. మంచిరంగుకోసం క్లేశపడడం మరింత బాగు. నిప్పులో కాలడం మహా బాగు. సుఖమెప్పుడూ దుఃఖం లేకుండా లభించదు కదా!

ఇది సంస్కృత భాష తెలిసిన ఒకానొక రోమియో వ్యవహారం.

పచ్చిమిరపకాయల బజ్జీలలో ఒకానొక రకం ఉంది. మిరపకాయను నిలువునా కోసి అందులో గింజలను తీసి, బదులుగా ఉల్లికారం నింపిన వరైటీ. అలాంటిదీ ఒక శ్లోకం చూద్దాం.

అవిదితసుఖదుఃఖం నిర్గుణం వస్తు కిఞ్చి
జ్జడమతిరిహ కశ్చిన్మోక్ష ఇత్యాచచక్షే |
మమ తు మతమనఞ్గస్మేరతారుణ్య ఘూర్ణ
న్మదకలమదిరాక్షీనీవీమోక్షో హి మోక్షః ||

ఇహ = ఈ లోకంలో, కశ్చిత్ = ఎవడో, జడమతిః = మందమతి, అవిదితసుఖదుఃఖం = తెలియబడని సుఖదుఃఖాలతో కూడిన, నిర్గుణం = గుణరహితమైనదానిని, కిఞ్చిత్ = ఒకదానిని, మోక్ష ఇత్యాచచక్షే = మోక్షమని చెప్పెను. మమ మతం తు = నాయొక్క నిర్ణయమైతే, అనఞ్గస్మేర = మన్మథుని చిరునవ్వురూపమైన, తారుణ్యఘూర్ణత్ = యవ్వనంతో మార్మోగుతున్న, మదకల = గుసగుసలతో, మదిరాక్షీ = మత్తుకన్నుల జవరాలి, నీవీమోక్షో = పోకముడికి (కలిగించే) మోక్షమే మోక్షః = మోక్షము.

ఒక కాముకుని (రసికుని) అభిప్రాయం ఇది.

సుఖదుఃఖాలకతీతమైన నిర్గుణమైన మోక్షం గురించి ఎవడో మందబుద్ధి చెప్పాడుట! నా మతమైతే మన్మథుని చిరునవ్వై, యవ్వనంతో మార్మోగుతూ, గుసగుసలాడే మదిరాక్షి పోకముడి మోక్షమే మోక్షము.

*****************************

శృంగారం సభ్యత హద్దుల్లోకి చెఋకున్న, కొండొకచో సభ్యత ఎల్లలు దాటిన ముక్తకకావ్యం ఇది. అయితేనేం, ఇందులోని శ్లోకాలను కొందరు తెలుగు కవులు ఉపయోగించుకున్నారు. తిరుపతి వేంకటకవులు దీనిని తెనుగు చేశారు.

*****************************

1, నవంబర్ 2013, శుక్రవారం

సంస్కృత సౌరభాలు - 5

బ్రహ్మాండచ్ఛత్రదణ్డః శతధృతిభవనాంభోరుహోనాళదణ్డః
క్షోణీనౌకూపదణ్డః క్షరదమరసరిత్పట్టికాకేతుదణ్డః |
జ్యోతిశ్చక్రాక్షదణ్డస్త్రిబువనవిజయస్థమ్భదణ్డోంఘ్రిదణ్డః
శ్రేయస్త్రైవిక్రమస్తే వితరతు విబుధద్వేషిణాం కాలదణ్డః ||

బ్రహ్మాండచ్ఛత్రదణ్డః = బ్రహ్మాండము అను గొడుగుకు మూలమైన కర్ర
శతధృతి భువన అంభోరుహో నాళదణ్డః = బ్రహ్మ పీఠమైన తామరపువ్వు యొక్క నాళము
క్షోణీనౌకూపదణ్డః = భూమి అను నావయొక్క తెరచాప కొయ్య
క్షరదమరసరిత్పట్టికాకేతుదణ్డః
క్షరత్ = జారుచున్న
అమరసరిత్ = అమరవాహిని అయిన గంగ (అనెడి)
పట్టికా = పట్టుచీరకు
కేతుదణ్డః = జెండాకర్ర
జ్యోతిశ్చక్రాక్షదణ్డ = జ్యోతిశ్చక్రమునకు ఇరుసు
విబుధద్వేషిణాం కాలదణ్డః = బుద్ధిమంతులశత్రువులకు (రక్కసులకు) కాలదండమూ ఐనట్టి
త్రైవిక్రమః = త్రివిక్రమావతారుడైన హరి యొక్క
త్రిభువనవిజయస్థమ్భదణ్డోంऽఘ్రిదణ్డః = త్రిభువన విజయసంకేతముగా ఒప్పారిన స్థంభముగా భాసించు పాదము అను ధ్వజము
తే = నీకు
శ్రేయః = అభివృద్ధి
వితరతు = పంచుగాక!

******************************************

ఎనిమిది దండాలతో హరికి దండాలు సమర్పించిన ఆ కవి-ప్రవరుడు దండి. దండినః పదలాలిత్యం అని సూక్తి. అపూర్వమైన శబ్దమాధుర్యం దండికవి ప్రాముఖ్యత.

పాం చా లీ పం చ భ ర్తృ కా
U U U U i U i U
బ్ర హ్మాం డ చ్ఛ త్ర ద ణ్డః

చూచారా, అర్థంతో అవసరం లేకపోయినా శబ్దమాధుర్యం తో పండితపామరులను సైతం కదిలించగల మాటలకు గణాలు ఎలా కుదిరాయో? ఈ వాక్యం ఎందుకంటే - శబ్దంతో పనిలేదని, శబ్దమాధుర్యం దిగువతరగతి కవులకు మాత్రమే పట్టినదని, అర్థమే కవికి ముఖ్యమైన విషయమని, నిగూఢార్థాలు కల్పించే కవులు శబ్దమాధుర్యాన్ని పట్టించుకోరని కొన్ని కృతక వాదాలు, శుష్క వాదనలు వినిపిస్తుంటారు కొందరు. ఇది వట్టి భేషజం. తెలుగులో ఇవి మరీని. శబ్దం అక్కరలేకపోయినా అర్థం కావాలి అనడం - అమ్మాయి కి బట్టల్లేకపోయినా పర్వాలేదు, ఆమె దేహం ఉంటే చాలు అనడం తో సమానమని పుట్తపర్తి నారాయణాచార్యుల వారి విసురు. పచ్చి నిజం కూడా.

మహాకవులు వశ్యవాక్కులు. వారి ధార దండి గారి మాటల్లో - క్షరదమరసరిత్ (ఉధృతంగా ప్రవహిస్తున్న అమరవాహిని). దండి కవి కవిత్వపు జీవలక్షణం శబ్దమాధుర్యం. ఇది కృతకంగా పాఠకుడిని మభ్యపెట్టడానికో, మెప్పించడానికో చేసిన ఇంద్రజాలం కాదు. సంస్కృతభాష ఎంత అందమైనదో తెలియాలంటే దండి కవి దశకుమారచరితమ్ చదివితే చాలు. ఈ దశకుమారచరితమ్ అమరవాణి గీర్వాణికి మహాకవి పట్టిన కర్పూరనీరాజనం.

******************************************

పద్యానికి వద్దాం. ఈ పద్యం దశకుమారచరితమ్ అన్న గద్యకావ్యానికి ఆది. ఇందులో ఇదివరకు చెప్పినట్టు ఎనిమిది దణ్డ శబ్దాలున్నాయి. ఈ ఎనిమిది దణ్డ శబ్దాలు అష్టసిద్ధులను, వాటికి మూలాధారమైన శ్రీహరిని సూచిస్తున్నాయా? (ఇది పూర్తిగా నా ఆలోచనే. ఇందులో తప్పొప్పులకు నేనే బాధ్యుణ్ణి :)) అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము అనేవి అష్టసిద్ధులు.

బ్రహ్మాండచ్ఛత్రదణ్డః = మహిమ
శతధృతిభవనాంభోరుహోనాళదణ్డః = లఘిమ (సన్నని తామరతూడు)
క్షోణీనౌకూపదణ్డః = అణిమ (మహాసముద్రంలో పిపీలికం వంటి నావ)
క్షరదమరసరిత్పట్టికాకేతుదణ్డః = గరిమ (పొడవైన ఆకాశగంగ అనే పట్టుచీర)
జ్యోతిశ్చక్రాక్షదణ్డః = ప్రాకామ్యము
త్రిబువనవిజయస్థమ్భదణ్డః = వశిత్వము
అంఘ్రిదణ్డః = ఈశత్వము
విబుధద్వేషిణాం కాలదణ్డః = ప్రాప్తి

మరొక ఊహ.

Universe is finite or infinite?

గోచరాగోచరమైన ప్రపంచం - అంటే భూమి, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, నక్శత్రాలు, పాలపుంతలు, ఇతరత్రా ఖగోళరాశి అంతా కలిపి బ్రహ్మాండమైతే దానికి పరిమితి ఉన్నదా లేదా? అంటే - కొన్ని వేల కాంతిసంవత్సరాల వేగంతో వెళ్ళే ఒక విమానం ఎక్కి ప్రయాణం చేస్తే ఏదో ఒక రోజున ఒక అడ్డుగోడ తగులుతుందా లేదా?

అడ్డుగోడ ఉంది, పరిమితి ఉన్నది అనుకుంటే - ఆ గోడకవతల ఏమున్నదని ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నలో పరిమితి లేదు అన్న సూచనా దాగిఉంది.

పరిమితి లేదు అంటే - అది అండాకారవస్తువెలా అయ్యిందని ప్రశ్న.

నండూరి రామమోహనరావుగారి విశ్వరూపం అనే పుస్తకంలో ఈ విషయానికి సంబంధించిన ఐన్ స్టీన్ సిద్ధాంతాన్ని గురించి చెప్పారు. "Universe is ever expanding" అని. అలా పెరుగుతూ పోతూ ఉన్న అంతరిక్షపు ఆకారం ఎలా ఉందని ఊహించాలి?

లీలగా ఒక గొడుగు స్ఫురించదూ?  ఆ గొడుగుకు మూలధ్వజం శ్రీహరి అట! (ఇందాక అన్నట్టు ఇది నా ఊహ. దండి అలా ఊహించకపోయినా వచ్చిన నష్టం ఏవీ లేదు.)

ఈ "బ్రహ్మాండ"మైన పద్యం ఈ కథలో దశకుమారుల విజయానికి సంకేతం. నాటకాలలో మొదటగా వచ్చే నాంది శ్లోకం - ఆ కావ్యాన్ని (కావ్యస్ఫూర్తిని) స్థూలంగా వివరించాలని ఒక నియమం ఉన్నది. ఆ నియమాన్ని గద్యకావ్యానికి అన్వయింపజేసిన పద్యం ఇది.

******************************************

ఇంకా కొన్ని ముచ్చట్లు. దండి పదలాలిత్యానికి మారుపేరు కదా. ఆయన వర్ణన ఎంత మధురంగా ఉంటుందో చూద్దాం.

అనగనగా మగధదేశంలో పుష్పపురమన్న నగరం ఉంది. ఆ నగరానికి - "ఘనదర్ప కందర్ప సౌందర్య సోదర్య హృద్య నిరవద్య రూపుడైన భూపతి" రాజహంసుడు పరిపాలిస్తున్నాడు. (బాగా పొగరెక్కిన మన్మథునికి సౌందర్యానికి సోదర సమానుడై, నిర్మలమైన హృద్యమైన రూపం కలిగిన రాజు)

ఆతనికొక రాణి.

తస్య వసుమతీనామ సుమతిర్లీలావతీ కులశేఖరమణీ రమణీ బభూవ. రోషరూక్షేణ నిటలాక్షేణ భస్మీకృతచేతనే మకరకేతనే తదాభయేన అనవద్యా ఇతి మత్వా తస్యాః
- రోలమ్బావళీ కేశజాలం
- ప్రేమాకరో రజనీకరో విజితారవిందం వదనం
- జయధ్వజాయమానో మీనో జాయాయుతౌ అక్షియుగళమ్
- సకలసైనికాగ్రవీరః మలయసమీరః నిశ్వాసః
- పథికహృత్ దళన కరవాలః ప్రవాలః చ అధరబింబమ్
- విజయశంఖో లావణ్యధురాబంధురా కంధరా
...
...
- ఈషదుద్ఫుల్ల లీలావతంస కల్హారకోరక గంగావర్తన సనాభిర్నాభిః
- దూరీకృత యోగిమనోరథశ్చైత్ర రథః అతిఘనం జఘనమ్
- ఆతపత్ర సహస్రపత్రమ్ పాదద్వయమ్
...
...

అతనికి వసుమతి అన్న సుమతి, లీలావతి ఇత్యాది పతివ్రతల జాతికి సంబంధించిన మణి వంటి రమణి ఉన్నది. అదివరకు మన్మథుని ఆశ్రయించిన వివిధములైన చరాచరములు మన్మథుణ్ణి ఈశ్వరుడు దగ్ధం చేయడంతో ఈమె రూపం నిర్మలమని ఈమెను ఆశ్రయించాయి.

తుమ్మెదలబారు కేశపాశము
ప్రేమాకరుడైన చంద్రుని జయించిన (మన్మథుని ఒకానొక బాణం) అయిన అరవిందం ఆమె ముఖం. (అరవిందం చంద్రునికి శత్రువు, ఎందుకంటే పొద్దున సూర్యుని చూచి వికసిస్తుంది కాబట్టి. ఇక్కడ అది విజేత).
మన్మథుని జయధ్వజంపై ఉన్న మీనము తన ప్రియురాలితో కలిసి ఈమె నేత్రములు.
సకలసైనికాగ్రవీరుడైన మలయసమీరము ఈమె నిశ్వాసము
పథికుల హృదయాలను ఛిద్రం చేసే కరవాలం ఈమె కెమ్మోవి
విజయశంఖమై, లావణ్యధురమైన శంఖము ఆమె మెడ
...
...
ఇంచుక వికసించిన ఎర్రకలువ, నల్లకలువలను తలపిస్తూ గంగలో సుడిగండం వలె సుడులు తిరిగిన నాభి
యోగిజనుల మనోరథములను దూరం చేసే చైత్రరథం ఆమె ఘనమైన జఘనము
మన్మథుని గొడుగైన పద్మము ఆమె పాదద్వయము
...
...

తెలుగు అర్థం తెలుసుకోవడంకంటే సంస్కృతంలోని ఆ గద్యం చదివితే వచ్చే ఆనందమే వేరు.

దశకుమారచరితమ్ ఏడవ ఉచ్ఛ్వాసం ఒక అద్భుతం. దశకుమారులలో ఒకడైన మంత్రగుప్తుడు తన కథ చెబుతాడు. అందులో విశేషం ఏవిటంటే - ఆ ఉచ్ఛ్వాసం అంతా నిరోష్ట్యం - అంటే ఆ కథలో ప,ఫ, బ,భ, మ లు లేవు. ఆ కథను చెప్పే కుమారుడిపేరులోనే మంత్రగు"ప్తు"డని "ప"కారం ఉంది. అతని పేరు కూడా ప్రస్తావించకుండా అతని కథను కవి చెప్పడం నేర్పు. అలాగని ఆయాసపడినట్టుగా, శబ్దాలను వెతికి కూర్చినట్టుగా అనిపించక, సునాయాసమైన, లలితమైన శబ్దాలతో కథ నడపటం దండికవి మహాప్రతిభ.

నిజానికి దండి పూర్వులైన సుబంధుడు బాణభట్టు గద్యాన్ని సమాసభూయిష్టంగా, ఓజోగుణ ప్రవృద్ధకంగా తీర్చారు. బాణభట్టి ఒక్కొక్కసమాసాన్ని తెలుగులో "డీకోడ్" చేస్తే - చేంతాడంత అవుతుంది. ఆయన వర్ణనలకు విషయవివరణకూ ప్రాధాన్యతనిస్తే, దండి కథ చెప్పడానికి, నవ్యత్వానికి, శబ్ద సౌకుమార్యానికి, ప్రాధాన్యతనిస్తాడు. బాణభట్టు కాదంబరి కావ్యంలో కిరాతుని (శబరసేనాపతి) వర్ణన ఉంది. దశకుమారచరితమ్ లోనూ కిరాతుడున్నాడు. బాణభట్టు కిరాతుని వర్ణన మహా ప్రౌఢం. అలాగే చాలా తీవ్రమైన భావావేశాన్ని కలిగిస్తుంది. దండి కిరాతుడు కాస్త స్పెషల్. జందెం వేసుకుని ఉంటాడు. ఎందుకా జందెం అంటే దానికొక ఫ్లాష్ బాక్ కథ జొప్పించి అబ్బురపరుస్తాడు దండి. కిరాతుని వర్ణిస్తూ కూర్చోడీయన. వర్ణనను వాడుకుంటాడు. అలాగే మృచ్ఛకటికపు దొంగ శర్విలకుణ్ణి, దశకుమారపు దొంగనూ సరిచూడడం ఒక చక్కని అనుభూతి.

******************************************

ఓ చిన్న అభాణకం. సరస్వతి ఓ మారు అందిట -

"కవిర్దండీ కవిర్దండీ కవిర్దండీ భవభూతిస్తు పండితః" - (కవి అంటే దండి మాత్రమే అని ముమ్మారు. పండితుడంటే భవభూతి మాత్రమే అని ఒకమారు)
"కోహం మూఢే? త్వమేవాహం త్వమేవాహం న సంశయః" - (అయితే నేనెవరే మూఢురాలా? అని కాళిదాసు అడిగితే నీవే నేను అని అమ్మ సమాధానం)

కాళిదాసు అమ్మతో అడిగి చెప్పించుకున్నాడు. అడక్కపోయినా ముమ్మారు కవివి నీవే అని అనిపించుకున్న దండికవి మహాకవి. సరస్వతి మూడుసార్లు కాదు ముప్పైసార్లు అన్నా ఆశ్చర్యం లేదు.

******************************************

సంస్కృతసౌరభాలు - 4

శమాలినః కరతలద్వయేన సా సన్నిరుద్ధ్య నయనే హృతాంశుకా |
తస్య పశ్యతి లలాటలోచనే మోఘ యత్న విధురా రహస్యాభూత్ ||

శివపార్వతుల శృంగారదృశ్యాన్ని కాళిదాసు వర్ణిస్తున్నాడు. (కుమారసంభవం ఎనిమిదవ సర్గ, ఏడవ శ్లోకం) రహస్య కేళిలో శివుడు పార్వతి వస్త్రాలను అపహరించాడు. ఆమె సిగ్గుపడి శివుని రెండు కళ్ళను మూసివేసింది. కానీ ఈశ్వరుడు లలాటలోచనంతో ఆమెను చూడసాగినాడు. ఇంక ఆమె ఏమీ చేయలేక వివశురాలై ఉండిపోయింది.

ఈ శ్లోకం ఇక్కడ ఉదహరించడానికి కారణం - గాథాసప్తశతి లోని మరొక ప్రాకృత శ్లోకం.

రఇకేళిహిఅణిఅసణకరకిసలఅరుద్ధణఅణజుఅలస్స |
రుద్దస్స తఇఅణఅణం పబ్బఈ పరిచుంబిఅం జఅఇ ||

సంస్క్తతఛాయ:

రతికేళిహృతనివసనకరకిసలయరుద్ధనయనయుగళస్య|
రుద్రస్య తృతీయనయనం పార్వతీపరిచుంబితం జయతి||

రతికేళిలో అపహరించిన వస్త్రములు గలవాడు, చివురుటాకుల చేతులతో నేత్రద్వయం కప్పబడినవాడు అయిన రుద్రునియొక్క - పార్వతిచే చుంబించబడిన ఫాలనేత్రము సర్వోత్కృష్టముగా ఉన్నది

కాళిదాసు కుమారసంభవశ్లోకానికి ప్రేరణ గాథాసప్తశతిలోని పై శ్లోకం అని స్పష్టంగా తెలుస్తూంది కదా. ఇప్పుడు ఈ రెంటిని కాస్త పరిశీలించి మన ఉబలాటం తీర్చుకుందాం.

- కాళిదాసు ఉజ్జయినీ నగర నివాసి. రాజాశ్రితుడు. భాష, భావం సంస్కరింపబడినవి. అందుచేత నాయిక సిగ్గుపడడంతో ఊరుకుంది. పైగా కుమారసంభవంలో ఆ వర్ణనలో పార్వతి నవోఢ. ముగ్ధ. ఇదీ పరిస్థితి. అంతే కాదండి. కాస్త తరచి చూస్తే కాళిదాసు నాయికలకు సిగ్గెక్కువేమోనని అనిపిస్తుంది. (లేదా - అమ్మాయిల కౌతుకం కన్నా అమ్మాయిల తాలూకు సిగ్గు/అసూయ లాంటి ఫీలింగ్సు కాస్త కాళిదాసును కదిలిస్తాయనుకుంటాను)

ఏవం వాదిని రాజర్షౌ పార్శ్వే పితురధోముఖీ |
లీలాకమలపత్రాణి గణయామాస పార్వతీ ||

హిమవంతుడి దగ్గరకు శివుని సంబంధం తీసుకుని వచ్చారు సప్తర్షులు. ఆ పక్కనే కూతురు పార్వతి నిలబడి ఉంది. సప్తర్షులు మాట్లాడుతుండగా ఈవిడ పక్కన తలవంచుకుని కమలపత్రాలు లెక్కపెడుతూ ఉందట! (పార్వతి మేథమేటిక్స్ లో అందె వేసిన చేయి! :))

ఈ శ్లోకం లక్షణశాస్త్రదృష్ట్యా చాలా ఫేమస్. అర్థశక్త్యుద్భవ వస్తుధ్వనికి ఉదాహరణగా ఈ శ్లోకాన్ని పేర్కొంటారు.

రఘువంశంలో ఆరవసర్గలోనూ ఇందుమతీదేవి సిగ్గును కాళిదాసు రెండు మూడు శ్లోకాలకు గురిచేశాడు. నానారాజకుమారులను స్వయంవరంలో చూసి చివరకు చెలికత్తె సునంద (టెక్నికల్ గా చెలికత్తె కాదు కానీ ప్రస్తుతానికి అనుకుందాం) అజమహారాజు వద్దకు వస్తుంది. అతని గుణగణాలను వర్ణించి చివరికి - అమ్మాయీ నీవొక రత్నం. అబ్బాయి బంగారం. రత్నం బంగారంతో ముడివడనీ (రత్నం సమాగచ్ఛతు కాంచనేన) అంటుంది. అప్పుడు ఇందుమతి కుతూహలంతో కూడిన లజ్జతో ఏర్పడిన ఇష్టంతో అజుణ్ణి వరిస్తుంది. ఆ సమయంలో సునంద "అమ్మాయీ ముందుకెళదామా (మరో రాజు వద్దకు)" అని ఛలోక్తిగా అంటుంది. అలా అన్నప్పుడు ఇందుమతి - సునందను "అసూయాకుటిల"మైన దృక్కులతో చూచిందట.

అసూయ ఘాటైన ప్రేమకు థర్మామీటరు! ఇది కాళిదాసుకు తెలుసు.

*****************

ప్రాకృతకవి నాయికకు (వజ్జదేవుడు?) సిగ్గు లజ్జ లాటి శషభిషలేమీ లేవు. ఆ కవి జానపదనేత్రంలో కవిత్వపు వస్తువు జీవంతమైనది. శృంగారరసం అనే బంగారానికి అద్భుతరసపు తావి అలవోకగా అబ్బింది. మరొక్క విషయం - ప్రాకృతకవి మూడవకంటికి "జయము" చెబుతున్నాడు. (ఈ శ్లోకాన్ని తెనుగు చేసిన కవి నరాలరామారెడ్డి గారు మాత్రం "పార్వతి ప్రజ్ఞకు వందనం" అని అనువదించారు. ఎందుకో తెలియదు.) సాధారణంగా స్తోత్రసాహిత్యంలో భగవంతుని కీర్తించేప్పుడు "జయతు" అన్న "లోట్" లకారం ఉపయోగించడం కవుల రివాజు. "జయతు జయతు దేవో దేవకీ నందనోయం" - ముకుందమాల, "జయత్వదభ్రవిభ్రమ భ్రమద్బుజంగమశ్వసత్" - అన్న రావణాసురుని స్తోత్రం ఒకట్రెండు ఉదాహరణలు. జయతు = జయమగుగాక! అన్న ఆశంస అయితే జయతి అన్న వర్ధమాన (లట్) ధాతురూపం వస్తువు స్వరూపాన్ని చెప్పే క్రియావిశేషం.

ఇలా మూడవకంటికి మంగిడీలు చెప్పి ఆ పేరు లేని రచయిత తన పేరును శాశ్వతం చేసుకున్నాడు. ఆయనకు కూడా జయం.

ఏదేమైనా మన ప్రాకృతకవి కి "భక్తి" కన్నా "సౌందర్య" దృష్టి ఎక్కువ.పై రెండు ఒకే రకమైన శ్లోకాలకు సంబంధించి ప్రాకృతకవికే నా ఓటు! మరి మీరో?

*****************