26, మార్చి 2018, సోమవారం

ఆధునికుని ఒక రోజు కాశీయాత్ర - 2018

రెణ్ణెల్ల ముందు ఆఫీసులో ఓ రోజు...

తండ్రీ!
ఏ ఊళ్ళో న్యూ యియర్ ముందు రోజు రాత్రి అరుపులు కేకలు వినిపించవో;
ఏ చోట న్యూ యియర్ ముందు రోజు, తాగి తందనాలాడుతూ జనాలు ఊరేగరో;
ఏ ప్రదేశంలో తెచ్చిపెట్టుకున్న సంతోషం ఉండదో;
ఎక్కడ మెసేజులతో, ఫోన్ కాల్స్ తో పీక్కుతినడం ఉండదో;

ఆ ప్లేస్ పేరు చెప్పవా..ప్లీజ్

అనుకున్నాను. బహుశా ఏ దేవుడికో అది వినబడినట్టుంది. డిసెంబరు 30,31, జనవరి 1 మూడు రోజులు సెలవు కలిసి వచ్చింది. ఫలితంగా - వారణాశి ప్రయాణం. సోలో జర్నీ!


భారతదేశపు కాశీ గురించినంత సాహిత్యం బహుశా ప్రపంచంలో ఏ నగరం మీదా, మరే ప్రాంతం మీదా ఉండదు. వేదకాలంలో దివోదాసు, ప్రతర్దనుడి కాలం మొదలుకుని, పౌరాణిక కాలం, ఔరంగజేబు నుండి బ్రిటీషు పరిపాలన కాలాదుల వరకూ నేడూ కూడా కాశీ భారతదేశంలో ప్రతి తరంలో, కాలం తాలూకు మార్పులకు, ఒడిదుడుకులకు, తాత్విక చింతనలకు, కళలకు, సంస్కృతికి, భారతీయతకు సాక్షి.

కాశీ లో ఎలాంటి వ్యక్తి అడుగుపెట్టినా అతని ఇష్టానికి తగినట్టు ఏదో ఒక అద్భుతమైన విషయం కనిపించక మానదు. ఆఖరుకు తిండి మీద తప్ప వేరే దేని మీదా ఇంటరెష్టు లేనోడికి కూడా కాశీ చెరిగిపోని మధురమైన అనుభూతి మిగులుస్తుంది, నిస్సందేహంగా. కాశీ అంటేనే ’వెలుగు’ అని అర్థం. వెలుగు ను చూడాలనుకోని వాడెవ్వడు?

వారణాశి మీద ఇన్ని కాలాలుగా ఇంతమంది ఏదో చెప్పారు. ఎంత చెప్పినా ఏదో మిగిలిపోతూనే ఉంది. నా వంతుగా ఏదో చెప్పాలని మనసులో ఏదో పీడిస్తూంది. ఆ పీడ ఫలితమే ఇది....... కాశీ నగరంలో అడుగు పెట్టాలంటే ఆ నగరానికి అధిపతి, దళపతి అయిన ’కాల’ భైరవుని అనుమతి కావాలని అనేకుల విశ్వాసం. కాలభైరవుని గుడి రాజ్ ఘాట్ కు వెళ్ళే దారిలో ఉంటుంది.

డిసెంబరు 30 వతేదీ శనివారం. 

దేవుడి వరం దొరికినా పూజారి అనుగ్రహం దొరకదట. కాలభైరవుడు అనుమతించినా, విమానం నాలుగ్గంటలు లేటు. ఎలాగైతేనేం, సాయంత్రం ముగిసేప్పటికి కాశీనగరప్రవేశం లభించింది. రోడ్లన్నీ విపరీతమైన రద్దీ. అంతా దాటుకుని భేలూపూర్ లో ఉన్న "న్యూ బ్రాడ్వే" అనే ఓ బడ్జెట్ హోటలుకు వచ్చిపడ్డా.

"సార్! మా కాశీలో కనిపించిన ప్రతి రాయి, ప్రతి ప్రాంతం, ప్రతి మనిషి వెనుక ఏదో కథ ఉంటుంది. మీరు దిగిన బ్రాడ్వే హోటల్ ఓనరు ఒక రబాడీవాలా. (పాత సామాన్లు అమ్ముకునే వాడు). ఎక్కడో రాజస్తాను నుండి వచ్చి పాతసామాన్ల వ్యాపారం మొదలెట్టి చాలా ఎత్తుకు ఎదిగాడు. ఈ ప్రాంతాల అతణ్ణి గురించి తెలియని వాళ్ళు లేరు!" ఓలా టాక్సీ డ్రైవరు చెబుతున్నాడు.

నిజమే. కాశీలో ఎవరిని అడిగినా, ఏ చోటునడిగినా ఎన్నో కథలు వినిపిస్తాయి.

ఆ టాక్సీ డ్రైవరు వెనుకా ఓ కథ ఉంది. ఆ యువకుడు పూర్వాశ్రమంలో, బెంగుళూరులో సాఫ్ట్ వేరు ఇంజినీరు. మానేసి వాళ్ళ కాశీకెళ్ళిపోయి హాయిగా టాక్సీ నడుపుకుంటున్నాడు. ఏదో ట్రావెల్ ఏజెన్సీ కూడా ఉంది. అతని ఆంగ్ల ఉచ్ఛారణ, డ్రెస్సు, మాటతీరు తోనే కొంత అనుమానం వచ్చింది. ఆ అబ్బాయి కూడా తన కథ చెప్పనే చెప్పాడు!

న్యూ బ్రాడ్వే హోటలు భేలూపుర్ లో ఉంది. ఈ భేలూపురం బహుశా ’భైరవపురం’ కాబోలు. దాదాపుగా నూరేళ్ళ క్రిందటి వరకూ ఇక్కడ కాపాలికులు నివసించే వారని, ఈ ప్రాంతాలకు వంటరిగా ఎవరూ వెళ్ళేవాళ్ళు కారని ఓ హిందీ రచయిత వ్రాశాడు. భేలూపురంలో పాడుబడిన భైరవ దేవాలయం ఒకటి ఉంది. వెళుతుంటే ఈ భేలూపురంలోనే వర్ధమాన మహావీరుని జన్మస్థలం అన్నట్టు ఓ బోర్డు కనిపించింది.

రాత్రయ్యింది. హోటల్లో కాస్త ఫ్రెషప్ అయి పక్కన ఉన్న ఓ రోడ్డు గుండా అస్సీఘాట్ అనే గంగానది ఒడ్డుకు బయలుదేరా. ఆ రోడ్డు పేరు ’గౌఢాలియా’ రోడ్డు. ఈ రోడ్డుకు ఓ కథ ఉంది.

గౌఢాలియా

కాశీ అనే నగరానికి ప్రాచీనకాలంలో ఆనందవనం/ఆనందకాననం/మహాశ్మశానం/అవిముక్తక్షేత్రం ఇలాంటి పేర్లుండేవట. ఈ ప్రాంతం అంతా గొప్ప అడవి. నగరానికి ఉత్తర దిశన ’వారణ’ నది ప్రవహిస్తుంది. (ఇది ఇప్పుడు దాదాపు పూడిపొయ్యింది. ఆ పాపానికి కారకులు ఆంగ్లేయులు. ముఖ్యంగా వారన్ హేష్టింగ్ అనే నికృష్టుడు.)

ఆ వారణ నదికి సమాంతరంగా ప్రసిద్ధమైన ఆనందకాననం, ఎన్నో చిన్న చిన్న నదీ ప్రవాహాలు, అవీ ఉండేవట. ఆ వారణ నదికి సమాంతరంగా ప్రాచీన వారణాశి నగరం అభివృద్ధి సాగిందని ఊహిస్తున్నారు. "వారణాస్య" అంటే వారణ-నదిని ముఖముగా కలిగినది అని అర్థం. వారణాశిని వారణాస్య అని పిలిచి దానికి ఆ వ్యుత్పత్తిని ఊహించారు. మహాభారతంలో ధర్మరాజు దుర్యోధనునితో ఐదూళ్ళు ఇచ్చినా చాలని శ్రీకృష్ణునితో రాయబారం పంపుతాడు. ఆ ఊళ్ళలో ఒక్కటి ’వారణావతము’. ఇది కూడా కాశీ అని ఒక వాదం ఉంది.

నగరానికి దక్షిణభాగంలో అస్సీ అని రెండవ నది. వారణ నది నుంచి అసీ నదికి ఓ చిన్న బాట ఉండేదట. గౌఢులు అనే వంగ ప్రాంతపు రాజులు/లేదా స్థానిక జాతివారు ఈ దారిని అభివృద్ధి చేశారు. ఇదే గౌఢాలియా రోడ్డు. ఈ రోడ్డు విశ్వనాథ దేవాలయపు సింహద్వారానికి దారి తీస్తుంది.

ఆ రోడ్డులో వెళుతుంటే ఎడమపక్కన ఓ బోర్డు కనిపించింది. "రాణీ ఝాన్సీ లక్ష్మీ బాయి జన్మస్థలం". పక్కనే ఓ చిన్న బోర్డు. "లోలార్క కుండ్"

లోలార్క్ కుండ్



మహాభారతంలో కుంతి సూర్యుణ్ణి ప్రార్థించి కర్ణుని కన్నట్టు మనకు తెలుసు. ఈ కథకు ట్రేసెస్ "లోలార్క్ కుండ్" అనే ఓ దిగుడు బావి లో కనిపిస్తాయి. లోలార్క్ కుండ్ కాశీలోని చాలా ప్రాచీనమైన ప్రదేశాల్లో ఒకటి. ఇది ఒక దిగుడు బావి. ఆ బావికి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి. పైన నాలుగువైపులా ప్రాకారాలు. ఈ బావిలో స్నానం చేయడానికి స్త్రీలకు మాత్రమే ప్రవేశం ఉండేది. సంతానార్థం స్త్రీలు ఈ కుండంలో దిగి నగ్నంగా స్నానం చేస్తే, సూర్యుని కిరణాలు వారి దేహంపైన ప్రసరించి - తేజోవంతమైన బిడ్డ కలుగుతాడని నమ్మకమట.

లోల - అర్క. అర్క అంటే సూర్యుడు. సంస్కృతంలో "లల" అనేది అందమైన ధాతువు. లల - అంటే ఆహ్లాదం అని అర్థం. ఆహ్లాదము కలిగించేది ’లలన’. రామాయణంలో రావణుడు సీతతో అంటాడు "మయి లల లలనే!".....(ఓ లలనా! నా యందు ఆహ్లాదమును పొందుము.) "లోలత్వము’, ’లోలుపత’ - అంటే ఆహ్లాదము పొందాలన్న వెంపర్లాట. లోల - అర్క అంటే లోలుడైన సూర్యుడు.

(సంస్కృతం ఓ అందమైన భాష. దరిమిలా తెలుగు కూడాను. పలకడానికి సులువుగా ఉన్న ధాతువులకు ఆహ్లాదం/సంతోషం లాంటి అర్థాలు, "ట" ’ఠ" లాంటి అక్షరాలతోటి పరుషమైన భావాలకు చెందిన శబ్దాలు ఉన్నై. ఈ ట ఠ వంటివి రసవిరోధానికి ప్రతీకలని ఆనందవర్ధనుడు ఓ చోట అంటాడు. కొందరు కవులకు ఈ బేసిక్ సూత్రం తెలుసు. (తెలుసంటే, నాలెడ్జ్ కాదు. ఆ విషయం వాళ్ళ కవిత్వంలో ఇంకి పోయేంతగా తెలుసు). ఆహ్లాదకరమైన సన్నివేశాలలో అలవోకగా "ర", "ల" లతో భావాలను వింగడించటం, తద్విరుద్ధమైన చోట్ల "ట" కారాదులను ఉపయోగించటం వారు చేయగలరు. అందమైన భావాన్ని చక్కగా చెప్పటానికి శబ్దాల యొక్క ప్రవృత్తి ఎలా ఉండాలి అని జగన్నాథపండితరాయలు ’రసగంగాధరమ్’ లో చక్కగా చెప్పాడు. ప్రబంధ కవుల కవిత్వాలలో ఇది విస్పష్టంగా కనిపిస్తుంది.

సరే సోది ఆపి, దారికొస్తాను. ఎక్కడా...హా., లోలార్కకుండం కథ అది. బహుశా కుంతి కథ అక్కడే పుట్టుంటుందా? ఏమో!


***************

అహో మోహస్య మాహాత్య్మమహో భాగ్యవిపర్యయః |
నిర్వాణరాశీం యత్కాశీం ప్రాప్య యాన్త్యన్యతోऽబుధాః ||

ఆహా! మోహము యొక్క మహాత్మ్యము! భాగ్యము వక్రీకరించుట! నిర్వాణరాశి అయిన ఈ కాశీపట్టణాన్ని చేరుకుని కూడా ఇతరములైన వాటి కొరకు తెలివిలేని వారు ప్రాకులాడెదరు.

***************

డిసెంబరు 30 వ తేదీ రాత్రి. ధనుర్మాసం చలి. విపరీతమైన పొగమంచు. తోలుమందం కావడం చేత చలి వంటికి తాకట్లేదు. అక్కడ పట్టణ వాసులు మాత్రం మఫ్లర్లు చుట్టుకొని, ఒకే రకం కోట్లు తొడుక్కుని రోడ్డుపై పారాడుతున్నారు.

రోడ్డుపై పక్కగా పాలకోవా, పెరుగు, వేడి పాలు మట్టి ముంతల్లో అమ్ముతున్నారు. కాశీలో అక్కడక్కడా ఇలాంటి దుకాణాల్లో "భంగ్" అనే ఒక మత్తు పదార్థాన్ని పాలలో కలిపి అమ్ముతారట. సాధువులకు ఇది లైసెన్సుడ్. అంటే వాళ్ళు యథేచ్ఛగా ఆ అంగళ్ళలో వెళ్ళి పుచ్చుకోవచ్చు. వేరే వాళ్ళ సంగతి తెలీదు. ఈ భంగ్ మీదా, బెనారస్ పాన్ గురించి "డాన్" సినిమాలో పాట ఉంది., మనకు తెలుసు.

"అరె భంగ్ క రంగ్ జమాహొ చకాచక్, హిల్ తో పాన్ చబా.....దిల్ కా ఝట్కా ఐసే లగా...పునర్ జనమ్ తో హోయె జాన్....ఖాయ్ కే..." :)

"కాశీ కా అస్సీ" - ఓ ప్రముఖ హిందీ నవల. రాజ్ నాథ్ సింహ్ అనే ఆయన వ్రాశాడు. ఆధునిక కాశీ నగరంలో అస్సీ ఘాట్ అనేది ఓ happening place. యువకులు, వృద్ధులు, ప్రేమికులు, పిల్లవాళ్ళు అందరికీ అది ఆటవిడుపు స్థలం. విశాఖపట్టణానికి రామకృష్ణ బీచ్ లాగా, హైదరాబాదుకు టాంకు బండు లాగా....అస్సీ ఇంకాస్త ప్రత్యేకం. ఇక్కడ ఓ పెద్ద మర్రి చెట్టు క్రింద సాహిత్య సమావేశాలు, లోకాభిరామాయణాలు వగైరాల గురించినీ, నగరజీవితాన్ని గురించీ, రాజకీయాల గురించి యథా తథంగా నిర్మొహమాటంగా రచయిత నవల వ్రాశాడు. ఇక్కడ ఫిరంగీల (తెల్లవాళ్ళ) హవా కూడా ఎక్కువ. వీళ్ళు స్థానికుల సాయంతో ఇళ్ళు కొనుక్కుని స్థిరపడి నగరానికి వచ్చి తిష్ట వేసి, ఇక్కడ చేస్తున్న తప్పుడు పనులు వగైరాలన్నిటినీ ఈ పుస్తకంలో రచయిత వ్రాసి పెట్టాడు. ఈ అస్సీ ఘాట్ వద్ద హిందీ బూతులు కూడా చాలా ఎక్కువగా వినిపిస్తాయట!


***************

రాత్రి ఎనిమిది దాటింది. అస్సి ఘాట్ దగ్గర జనం పల్చగా ఉన్నారు. పడవలన్నీ నిలబడిపోయి ఉన్నాయి. పొగమంచు ఎక్కువగా ఉండడంతో, గంగానది అవతల ఒడ్డు కనిపించట్లేదు. కాసేపు అక్కడ కూర్చుని వెనక్కు బయలుదేరాను. ఏదో ఆలోచిస్తూ నడుస్తూ దారి తప్పింది. చేత్ సింగ్ ఫోర్ట్ దగ్గరకు వచ్చి పడ్డాను.

రాజా చేత్ సింగ్ వారణాసి సంస్థానపు రాజు. ఈ స్థానికుడు ఈస్ట్ ఇండియా అధికారి వారన్ హేస్టింగ్స్ ను యుద్ధంలో ఓడించాడట. ఓ స్థానిక సంస్థానాధీశుడు తనను ఓడించడాన్ని జీర్ణించుకులేక ఆ బ్రిటీషు అధికారి మరింత బలగాన్ని తెచ్చి చేత్ సింగ్ ను, అతని కోటను చేజిక్కించుకున్నాడట. రెండవ సారి యుద్ధంలో చేత్ సింగ్ పారిపోయాడని కొందరంటారు. ఈ పారిపోవడం అనే విషయాన్ని ఆంగ్లేయులు కల్పించారని, నిజానికి అతడు వీరోచితంగా యుద్ధం చేశాడని ఇంకొందరంటారు. ఏదీ ఏమైనా, వారన్ హేస్టింగ్స్ వారణాశి ని ఆక్రమించుకోవడం చరిత్రలో ఓ దురదృష్టకరమైన ఘటన.

ఆపైన ఆ హేస్టింగ్స్ అనేవాడు నగరీకరణ పేరు మీద చిన్న చిన్న నదీప్రవాహాలను మూసివేయడం, అందమైన ఉద్యానవనాలను ధ్వంసం చేయించటం, చారిత్రక కట్టడాలను మూసివేయటం, ఇలా కాశీ నగరపు సాంస్కృతిక వారసత్వాలను నాశనం చేయించడం వంటివి చేస్తూ వచ్చాడు. ఈ వ్యవహారాన్ని "The great rape" అంటూ వివరిస్తాడొక రచయిత.

తిరిగి హోటలు రూముకు వచ్చిపడ్డాను.


***************

The Surrealistic city - Rajarao (The serpent and the rope).

Surrealism - అంటే వాస్తవాభాస (?). పాశ్చాత్యదేశాల్లో పద్దెనిమిది, పంతొమ్మిది శతాబ్దాల మధ్య వచ్చిన సాంస్కృతిక ఉద్యమం. అంటే తర్కవిరుద్ధంగా పైకి కనిపిస్తూ, జీవిత వాస్తవాలను ప్రతిబింప్బించే సాంస్కృతిక విప్లవం అట. ఇందులో భాగంగా అబ్సర్డ్ ఆర్ట్, అబ్సర్డ్ నాటకాలు వగైరాలు వచ్చాయి.

సరిగ్గా ఇలాంటిదేమో తెలియదు కానీ, కాశీ అనే నగరం తరతరాలుగా చూస్తే ఒక వాస్తవాభాస నగరంగా కనిపిస్తుంది.

మరణం మంగళం యత్ర విభూతిర్యత్ర భూషణమ్ |
కౌపీనం యత్ర కౌశేయం కాశీ కుత్రోపమీయతే ? || - స్కాందపురాణం 4.2.53.87

ఎక్కడ "చావు" మంగళకరమైనదిగా భావించబడుతుందో, ఎక్కడ బూడిద ఆభరణంగా అలంకరింపబడుతుందో, ఎక్కడ మహరాజుకన్నా సాధువు గౌరవింపబడతాడో, అలాంటి కాశీ ని ఎలాంటి ప్రదేశంతో పోల్చగలం?

ఒక పక్కన పట్టుచీరలు (కాశీ పట్టు పరిశ్రమకు, జరీ నేతలకు ప్రసిద్ధి), పక్కనే విభూతి పూసుకుని తిరిగే సాధువులు.... ఎదురెదురుగా వస్తూ ఉండే పెళ్ళి గుంపూ, "రామనామ సత్య్ హై" అన్న నినాదాలతో మణికర్ణిక ద్వారం వద్ద శవయాత్రలు...గంగలో మునిగి, మడితో ఉన్న భక్తులు, ఏదీ కాబట్టని సాధువులు, .....భంగు ఒక పక్క, గంగ మర్క పక్క.....ఆగమ శాస్త్ర నియమావళి, అన్నిటికి అతీతమైన ధోరణి,

వైదికమతం,
జైనమతం,
బౌద్ధం,
సూఫీయిజమ్,
భక్తి ఉద్యమం,
కబీరు,
తులసీదాసు,
దేశభక్తి,

ఒకదానికొకటి పొంతన లేని తాత్త్వికధోరణులకు కాశీ ఆలవాలం కావడం విశేషం. వారణాశి/వారణాస్య/కాశీ అన్న ఈ భౌగోళికప్రాంతం - భారతదేశపు హృదయం వంటిది. పంచక్రోశి అని వారణాసికి సంబంధించిన ఓ పదం ఉంది. కాశీ పట్టణాన్ని ఓ వృత్తంగా చూపించే ఓ మ్యాప్ ఇదివరకటి కాలంలో ఉండేదంట. ఈ మ్యాప్ తాలూకు వ్యాసార్ధమే పంచక్రోషి అని ఒకచోట చదివాను. (ఎంతవరకు నిజమో తెలియదు).

ఈ సర్రియలిజాన్ని ఛాయలు భారతదేశంలో మరో విధంగా ఉన్నాయి. అదేదో తెలియాలంటే సబ్జెక్టివిటీ (ప్రత్యక్ష), ఆబ్జెక్టివిటీ (పరోక్ష) గురించి ఆలోచించాలి.

సబ్జెక్టివిటీ - ఆబ్జెక్టివిటీ
ప్రత్యక్ష - పరోక్ష
వస్తువు - భావం
Fact - Truth
Real - Surreal
ఏకాగ్రత - ధ్యానం
Concentration - Meditation
"నేను" - "ఆత్మ"/బ్రహ్మ
దేవుడు - తెలుసుకోదగినది
చీకటి - వెలుగు

ప్రస్తుతం ప్రపంచమంతానూ సబ్జెక్టివిటీ తోటి నడుస్తున్నది. మన చదువులతో ఇది మొదలవుతోంది. దీనికి ఉదాహరణ - నేటి వైద్య విద్య. మనకు వైద్యం కావాలాంటే, శరీరంలో ఏ భాగానికి ఆ భాగానికి ట్రీట్మెంట్ దొరుకుతోంది. హృదయాలయ, నేత్రాలయ, వృషణాలయ, కాలేయాలయ, నాసికాలయ, పురీషాలయ వగైరా వగైరా...ఎడమ మోకాలుకు కుడి మోకాలుకు సెపెరేట్ స్పెషలిస్టులు లభ్యం. చదువు హెచ్చే కొద్దీ సబ్జెక్టివిటీ ఎక్కువవుతూంది. దరిమిలా ’వస్తువు’ కుంచించుకుపోతోంది. మాస్టర్స్ అంటే ఏదో ఒక్క సబ్జెక్ట్ లో ఏదో ఒక్క ’విషయం" లో నిష్ణాతుడు! Subjectivity matters.

మనదేశంలో పూర్వకాలపు చదువు ఇలానే ఉండేదా? దరిమిలా వ్యక్తుల దృక్పథం/సాంస్కృతిక నమూనాలు ఇలానేనా? - ఆలోచిస్తే కాదేమో అనిపిస్తుంది.

శ్రీకృష్ణునికి గర్భాష్టమం తర్వాత సాందీపని అనే గురువు దగ్గరకు ’చదువు’ కోసం పంపించారు. శ్రీకృష్ణుడూ, వాళ్ళన్నయ్య బలరాముడూ చదువు పూర్తి చేశారు. అంతా అయిన తర్వాత వాళ్ళేం చదివారో ఎక్కడా వ్రాయలేదు. ఇలాంటి ’చదువు’ మొన్న పదునారవ వ శతాబ్దం వరకూ సాగింది. ఏం చదువు? (Which "subject") - అనే ప్రశ్న అప్పట్లో లేదు!

అంటే - ఎవరైనా ’ఏరా బాబూ! పెద్దయిన తర్వాత ఏమవుతావు?’ అని ఈ రోజు మనం ఈ రోజు అడిగే ప్రశ్న - అప్పట్లో irrelevant. ఇనాడు ఉన్న సీరియస్ ప్రశ్న నాటి రోజుల్లో జోక్!. అలాగని నాడు సమాజంలో డాక్టర్లు, ఇంజినీర్లు లేరా? అంటే అదీ నిజం కాదు. డాక్టర్లూ, ఇంజినీర్లూ, శాస్త్రజ్ఞులు, వగైరాలు అప్పుడూ ఉన్నారు. రామాయణంలో సేతువు నిర్మించే అవసరం పడినప్పుడు - నీలుడు/నలుడు (?) అనే ఓ వానర ముఖ్యుణ్ణి పిలిపించారు. సేతువును ’నీలసేతువు’ /నలసేతువు అని కొన్ని రామాయణాల్లో పేర్కొన్నారు. అంటే నీలుడు ఒక ఇంజినీయరు అనమాట. బౌద్ధంలో సన్యాసులలో చాలామందికి వైద్యవిద్య తెలుసని, అది వారి దేశాటనలో ఉపయోగపడేదని కథలున్నై.

భాగవతంలో ప్రహ్లాదుణ్ణి వాళ్ళ నాన్న అడుగుతాడు. "రే బాబు! నీ చదువులోంచి ఓ ముక్క చెప్పరా! అసలేం చదివావురా?" - అంటే ఆ బాలుడు "చదువులలో సారమెల్ల చదివితి తండ్రీ!" అనడం మనకు తెలుసు.

సారం ఏమంటే - చదువు అప్పట్లో - పరోక్ష విద్య. (Objective). అది విద్యార్థి యొక్క ప్రతిభ, ఆసక్తులను బట్టి గురువు నిర్ణయించే వ్యవహారంగా ఉండేది. ఇదంతా సరిగ్గా సాగాలంటే, ఒక్కో విద్యార్థిని చక్కగా పరీక్షించాలంటే - ఒక శాంతి, సామరస్యపూర్వకమైన హడావుడి లేని వాతావరణం అవసరం. అందుకే అరణ్యాల్లో గురుకులాలు! ఉత్తమ విద్యార్థి అంటే బహుళ విద్యల్లో ఆరితేరిన వాడు.

నాడు పండితుడంటే - ఖగోళ, వైద్య, ఇత్యాది అనేక విషయాలలో ఆరితేరినవాడు. బహుముఖీనుడు. Objective
నేడు మాస్టర్ అంటే - ఒక్క సబ్జెక్ట్ లో, అందులో ఒక్క అంశంలో ఆరితేరినవాడు! Subjective

ఆధ్యాత్మిక విద్య, మత విద్య కూడా ఇలాంటివే. "నేను అన్న శబ్దానికి భౌతికమైన "నేను" అనబడే పుద్గలుడు - వ్యక్తి, వాడి భౌతికమైన అవసరాలు, తిండి, గుడ్డ, ఇల్లు, సెక్స్ వగైరా వగైరా కాక "నేను" అనే భౌతికమైన/కళ్ళకు కనిపించే ఒక స్థూల వ్యవహారం కాకుండా మరొకటుందా? అంటే "నేను" అనేదానికి super-set ఏదైనా ఉందా? ఆ super set - ఈ "నేను" అన్న దాని యొక్క, దరిమిలా కనబడే ప్రపంచం తాలూకు కార్యకలాపాలను నిర్దేశిస్తోందా?

తైత్తిరీయోపనిషత్తులో భృగువల్లీ సూక్తం అని ఒకటుంటుంది. "సహనా భవతు..సహనౌ భునక్తు" అనే సూక్తంతో ఆరంభమయ్యే ఆ కథ యిది.

భృగుర్వై వారుణిః । వరుణం పితరముపససార ।
అధీహి భగవో బ్రహ్మేతి । తస్మా ఏతత్ప్రోవాచ ।
అన్నం ప్రాణం చక్షుః శ్రోత్రం మనో వాచమితి ।
తహోవాచ । యతో వా ఇమాని భూతాని జాయన్తే ।
యేన జాతాని జీవన్తి ।
యత్ప్రయన్త్యభిసంవిశన్తి । తద్విజిజ్ఞాసస్వ । తద్బ్రహ్మేతి ।
స తపోఽతప్యత । స తపస్తప్త్వా ॥ ౧॥ ఇతి ప్రథమోఽనువాకః ॥


భృగువు అనేవాడు వారుణి (వరుణుని కొడుకు). వాడు ఓ రోజు వరుణిని దగ్గరకెళ్ళాడు. "నాన్నా! బ్రహ్మ అనే Super set గురించి చెప్పు." - అప్పుడు వరుణుడు బాగా ఆలోచించి, ఇలా నొక్కి చెప్పేడు. "అన్నము, ప్రాణము, కనిపించే వస్తువు, వినబడేది, ఆలోచించేది, మాట్లాడేది......చూస్తే ఇవే, వీటివల్లే కనిపించే ప్రాణులన్నీ మనగలుగుతున్నై. వీటి గురించి ధ్యానం చేయి.

ఆ పిల్లవాడు కాస్తా తపస్సు చేశాడు. మొదట అన్నం మీద. తిరిగి వచ్చి నాన్నతో చెప్పాడు. "నాన్నా, అన్నమే బ్రహ్మ. అన్నం వల్లే ప్రాణులు పుడుతున్నై, గిడుతున్నై. అంతా అన్నమే". ఆ తర్వాత నాన్న మళ్ళీ తపస్సు చేయమన్నాడు. బాబు మళ్ళీ తపస్సు చేసి ప్రాణమే బ్రహ్మ అంటాడు...ఇలా కొన్ని మార్లు జరిగిన తర్వాత భృగువు ఆనందస్వరూపుడవుతాడు. ఆనందమే బ్రహ్మమని తెలుసుకుంటాడు. (ఆ తర్వాత ఆ సూక్తంలో వరుణుడు కొడుకుతో మళ్ళీ తపస్సు చేయమని చెప్పడు). దీన్ని వారుణి విద్య అన్నారు.

ఇంతా అయిన తర్వాత తండ్రీకొడుకులు తపస్సు ద్వారా చదివిన చదువులో, నేర్చుకున్న విద్యలో అన్నం స్థానాన్ని నిర్ణయిస్తారు. "అన్నాన్ని విసర్జించరాదు. విడిచిపెట్టరాదు" ఇలా భౌతికజగత్తుకు కావలసిన లౌకిక విద్యను నిర్ణయిస్తారు!

దరిమిలా తెలిసేదేమంటే - objectivity అనేది ముఖ్యమైన Tool ఏ విద్యకైనా. ఆ పరోక్షం నుంచే ప్రత్యక్షం అన్నది పుట్టుకొస్తున్నది లేదా నిర్దేశింపబడుతోంది. పరోక్షత అన్నదే వెలుగుకు దారి తీస్తుంది.

కాశీ అంటే వెలుగు. "వెలుగు" అంటే ఏమిటి? అంటే - subjective గా నిర్వచనం లేదు. "అంధకారం లేనిచోటు - వెలుగు". "అంధకారం ఉంటే అది తమస్సు".

వెలుగు నిర్వచనం చెప్పాలంటే "అంధకారం" తో ముడిపెట్టి పరోక్షంగా చెప్పగలం తప్ప ప్రత్యక్షంగా చెప్పలేం. చూడదగ్గది మాత్రమే.

కాశీ అనాదిగా ఆ ’వెలుగు’ నే ప్రసరింపజేస్తోంది. అందుకే ఇక్కడ పరస్పర విరుద్ధమైన అనేక చింతనలు, తాత్త్వికధోరణులు ఉదయించినవి. ఇది ఒక surrealistic process. కాశీ - భారతదేశానికి కాక, ప్రపంచానికి కూడా ’వెలుగు’.

ఆలోచనలతో ఆ రోజు కాస్తా గడిచింది.


***************

డిసెంబరు 31 - వఱువాత ఐదు ఘంటలకు. (వఱువాత = తెల్లవారు ఝాము. ఇది పరవస్తు చిన్నయసూరి కథల్లో నేర్చుకున్న తెలుగు. :))

కాశీ లో దైవదర్శనం చేసుకోదల్చిన వారు చూడవలసిన దేవాయలయాల గురించి ఓ శ్లోకం ప్రచారంలో ఉంది.

విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవమ్ |
వన్దే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికామ్ ||


ఈ వరుస ఎవరు ఆచరిస్తారో తెలీదు. కొన్నిటి ఆనవాలూ తెలీదు. అయితే అక్కడ లోకోక్తి ప్రకారం - మొదట కాశీ విశ్వనాథ దర్శనం చేసుకో, ఆ తర్వాత నీ యిష్టం. గంగలో మునుగడం కూడా విశ్వనాథుని తర్వాతే.......

మరి కొందరి ప్రకారం - మొదట ఐదు ఘట్టాల్లో స్నానం చేయాలి. దానికేదో అస్సీ, పంచగంగా....ఇలా ఓ వరుస ఉంది. ఆ తర్వాత కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవాలి. నిజమో అబద్ధమో తెలీదు కానీ, నేను చూసిన ప్రకారం బ్రాహ్మలలో - నియోగుల ఇళ్ళలో ఆచారాలు, అనవసర నియమాలు ఎక్కువ. ఇదివరకెలా ఉండేదో ఏమో కానీ ఈ కాలంలో వైదికుల ఇళ్ళలో నియమాల కన్నా మూలభావం తెలుసుకోవడానికే ప్రాధాన్యత. (ఇది నేను చూసిన వ్యవహారం. తేడాలుండొచ్చు). ఏదేమైనా "శరీరమాద్యం ఖలు ధర్మసాధనమ్". (ధర్మమాచరించాలంటే శరీరమంటూ మొదట ఓ మోస్తరుగా అయినా ఉండాలిగా!)

విశ్వనాథుడంటే - విశ్వానికి పతి. ఆయన శ్మశానవాసి. కాశీకి మహాశ్మశానం అని పేరు. శ్మశానంలో నియమాలేమిటి? "భస్మకంకాలములఁ బితృవనములందు వీఁగు వెఱ్ఱి..." అని ఒకాయన శివుణ్ణి గురించి రాస్తాడు.

పొద్దున ఐదున్నర - చలి. నగరం అంతటా పొగమంచు. కొంతమంది రోడ్డుపక్కన మంటవేసుకుని చలికాగుతున్నారు. ఆ చలిలో ఓ సైకిల్ రిక్షా అబ్బాయి "భోలేనాథ్" మందిరం సింఘద్వారం వద్ద దింపాడు.

ఓ చిన్న గల్లీలో కొంతదూరం వెళితే విశ్వనాథుని మందిరం వస్తుంది. దారి పొడుగూతా - చిన్న చిన్న దుకాణాలు. అప్పుడే విచ్చిన పెద్ద పెద్ద తామరపూలు, పాలు, గంగకలశాలు ఇతరత్రా పూజాసామాగ్రిని అమ్ముతున్నారు.

ఈ మందిరాన్ని - ఔరంగజేబు పడగొట్టిన తర్వాత - అహల్యాబాయి హోల్కర్ అనే ఇందోర్ రాణి మళ్ళీ ఇప్పుడున్న చోట నిర్మించిందట. ఆవిడ పేరు మీద ఒక ఘట్టం (ఘాట్) దశాశ్వమేధ ఘాట్ పక్కన ఉన్నది. పూరీలో లాగా ఇక్కడ కూడా "పాండా" ల వ్యవహారం ఎక్కువ అని వినికిడి. అయితే పొద్దునపూటే వెళ్ళడంతో ఆ ఇబ్బందులు లేవు.

ఓ చిన్న మందిరంలో నేల వద్ద లింగం, ఆ లింగానికి పూలు, పాలతో అభిషేకాలు జరుగుతున్నాయి. పక్కనకు వచ్చి ఎంత సేపయినా దర్శనం చేసుకోవచ్చు.

పక్కనే విశాలాక్షి, ఆపై అన్నపూర్ణాదేవి మందిరాలు ఉన్నై. అన్నపూర్ణాదేవి విగ్రహానికి కాబోలు బంగారు తొడుగు వేశారు. చేతిలో గరిటె, తలపైని పగిడీతో ఈ విగ్రహం అత్యద్భుతంగా ఉంటుంది. ఈ మూర్తి తాలూకు చిని చిన్ని విగ్రహాలు - కంచుతో చేసినవి బయట అమ్ముతారు. కాశేకి వెళ్ళినవాళ్ళు ఈ విగరాహాలు తెచ్చుకోవడం ఓ ఆనవాయితీ. ఆదిశంకరచార్యులు ఈ దేవాలయాన్ని దర్శించి అన్నపూర్ణాష్టకం రచించాడని ఐతిహ్యం. ఈ గుడిలో అన్నదానం - జాతిమత భేదాలు లేకుండా చేస్తారని విన్నాను. అయితే ఆ ప్రసాదం తెచ్చుకునే అవకాశం తప్పిపోయింది.

ఓ ముప్పై నిముషాలలో మొత్తం అయిపోయింది! బయటకు వచ్చి దశాశ్వమేధ ఘట్టం దారి పట్టాను. దారిలో ఏదో గుంపు జెండాలు పట్టుకుని వెళ్తున్నారు. కాయగూరలు అమ్ముతున్నారు. దారి పొడుగూతా ఆవులు.

పూర్వం దివోదాసు అనేకాశీ రాజు ఉండేవాడట. ఆయన రిపుంజయుడనే పేరుతో కాశీని పాలించి, స్వచ్ఛభారత్ స్కీము అమలు జరిపి, కాశీని చాలా నియమబద్ధంగా శుభ్రంగా చేశాడట. అందుకు గాను బ్రహ్మతో వరాన్ని పొంది దేవతలను ఆ నగరం నుంచి తరిమేశాడట. ఆపై ప్రజలు - కాశీ ఎలా ఉన్నా పర్లేదు కానీ దేవతలు కొలువుండాలి అని అంటే తిరిగి దేవతలను నగరానిచ్చాడని ఓ కథ.

దివోదాసు అనే ఆయన - ధన్వంతరి అన్న పేరుతో ఆయుర్వేదానికి ఆద్యుడని, ఆయనది కాశీ నగరమని మరొక కథ.

దివోదాసు అనే రాజు హైహయ వంశానికి శత్రువు అని, హైహయులు నాస్తికులై, కాశీ నగరాన్ని నాస్తిక నగరం చేయబోతే దివోదాసు, ఆతని కొడుకు ప్రతర్దనుడు అడ్డుకున్నారని ఇంకో కథ. (హైహయులు అంటే కార్తవీర్యార్జునుని తాలూకు. వీళ్ళ గురువు దత్తాత్రేయుడు)

ఈ దివోదాసు (లు) ప్రస్తావన ఋగ్వేదంలో ఉంది. ఆయన పది అశ్వమేధాలు చేశాడని, అదే దశాశ్వమేధ ఘట్టమని ఇంకో కథ. ఇది ప్రధానమైన ఘాట్. ప్రతి రోజూ ఈ ఘాట్ వద్ద - రాత్రి పూట గంగకు షోడశోపచార పూజ చేసి హారతి ఇస్తారు. ఈ వ్యవహారం చాలా హడావుడిగా, ఆడంబరంగా ఉంటుంది.

.................మెట్లు దిగగానే దశాశ్వమేధ ఘాట్.

సుర నది!

తెల్లవారు ఝామున, మంచు ముసుగులో, మందంగా పారుతున్న గంగ! కను చూపు మేరా పరుచుకున్న ముదురు నీలపు రంగు! దూరంగా అవతల ఒడ్డున మసక మసకగా ఇసుక తిన్నెలు. పడవలు ఇంకా బయలు దేరలేదు. స్నానాలు మొదలయ్యాయి కానీ రద్దీ లేదు. స్నానానికి వచ్చిన ప్రతి ఒక్కరూ చిన్న ముంతలో నూనె దీపాలు వెలిగించి, ఓ తామరపువ్వును, పసుపు కుంకుమలతో పెట్టి పెట్టి గంగలో వదులుతున్నారు. నెలవంక ఆకారంలోని గంగ వడ్డు పొడుగూతా, ముదురునీలపు రంగు తెరపట్టుపైన బంగరు రంగు చుక్కల్లాగా కనుచూపు మేరా ఆ దీపాలు! అప్పుడే హిమాలయల్లోంచి ఫ్రెష్ గా కరగి వచ్చినట్టు - గంగ నీళ్ళు. (అయితే ఆ మూడ్ లో అంత చలీ చలిలా అనిపించలేదు.)

ఓ ఉత్తరప్రదేశ్ వాళ్ళ కుటుంబం! అందరూ కలిసి నీళ్ళలో కేరింతలు కొడుతున్నారు. ఓ ఆవిడ, దీపాలు పూలమ్ముకుంటోంది. సాధువులు ఒకరిద్దరు. గాజు కళ్ళతో...ఓ బ్రాహ్మడు వచ్చి "పిండప్రదానం?" తెలుగులో అడిగేడు.

ఇటువైపు ఒడ్డున పెద్ద పెద్ద కట్టడాలు! చాలా ఎత్తుకు ఉన్న మెట్ల వరుస. ఆవులు మామూలే.

.....
.....

మునగటం పూర్తయ్యింది.

గంగలో ఏదో ఒకటి వదలాలట!

ఆ వదిలేది
- ప్రియమైనది,
- వదిలిన తర్వాత "అయ్యో వదిలేశానే" అని బాధపడనిది
- వదలడం వల్ల జీవితంలో బాగు పడ్డానికి పనికి వచ్చేది
- ప్రత్యామ్నాయం లేనిది

అయి ఉండాలట. అలాంటివి "వస్తువులు" అయితే ప్రయోజనం లేదు. ఏ కోపమో, ద్వేషమో, విడిచిపెట్టలేని వెంపర్లాటకు సంబంధించిండేదో అయుండాల. అలాంటిది ఏది? ఏమో! అలాంటిది ఏదైనా ఉంటే గంగే లాక్కుంటుంది గాక!

బలీయమైన అనుభూతి ఎదురైతే ఆ అనుభూతి నుంచి బయటపడిన వెంటనే ముందుకు సాగిపోవటం మంచిదట. దశాశ్వమేధఘట్టం నుంచి వెనక్కి తిరిగి చూడకుండా బయటకు వచ్చి గౌఢాలియా రోడ్డు కూడలికి వచ్చి పడ్డాను. మెలమెల్లగా జనసంచారం మొదలవుతూంది. 

***************

ఎదురుగా బోర్డుపైన "కాలభైరవ్ మందిర్" అని హిందీలో వ్రాసి, దారి గుర్తు వేశారు.

రాజ్ ఘాట్ వెళ్ళే దారిలో కాలభైరవ మందిరం ఉంది. ఈ కాలభైరవుడు అన్న ఆయన పరమశివుని అంశ. కాశీ పట్టణానికి ఈయన దండనాథుడు అట. శని గ్రహచారం తో కష్టాలు అనుభవించేవారు ఈ కాలభైరవాలయంలో ఓ చిన్న గిన్నెలో/ప్లాస్టిక్ పొట్లంలో నూనెను తమ తలచుట్టూ త్రిప్పుకొని కాలభైరవుని ముందున్న దీపంలో ఆ నూనెను జారవిడుస్తారు.

నవగ్రహాలలో "శని" అన్నది విశిష్టమైన గ్రహం. మన పురాణాలలో శని - సూర్యునికి పుత్రుడు. యమునికి అన్న. ఈయన పాపం, పుట్టినప్పటి నుంచి, ఆత్మశోధనలో పడి తపస్సు చేస్తుండేవాడట. ఇలా ఉంటే ఏమవుతాడో అని పెద్దవాళ్ళు "మామూలుగా" ఆలోచించి, అతనికి కాస్తా పెళ్ళి చేసేశారు. ఇతడు తన పాతమార్గం వదులుకోనూ లేడు, అలాగని పాపం కొత్తగా జీవితంలోనికి వచ్చిన అమ్మాయితో సంసారంలో పడి కొత్తమార్గం పట్టనూ లేడు. మధ్యలో ఆ అమ్మాయి ఇతనితో విసిగి, "నీ దృష్టి పడిన వారికి భయంకరంగా కష్టాలెదురవుతై" అని శపించేసింది.

ఇలా "శని" దృష్టి పడిన వాడు కష్టాలపాలవుతాడు అని పురాణ కథ. ఇందులో కొన్ని Buying points, కొంత ఆసక్తికరమైన వ్యవహారమూ ఉంది. సాధారణంగా జాతకాన్ని బట్టి శని కొందరికి లాభకారకుడు, అనుగ్రహదాయకుడు కూడా. శని దశలో జీవితంలో ఉచ్ఛస్థితిలోని వెళ్ళిన వారున్నారని అంటారు. (ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ ది కూడా ఈ కేటగిరీ అట)

అయితే కొంతమందిని శని కష్టాలు కల్పించి "అంతర్ముఖులను" చేస్తాడని అంటారు. కవులు, ఆలోచనాపరులు, లేదా చాలా సింపుల్ గా బ్రతికే వారూ - ఇలాంటి వాళ్ళు ఆ కొంతమంది. పైకి కష్టాలలాగా కనిపిస్తూ సంఘర్షణకు గురి చేసి ఔన్నత్యాన్ని కల్పించటం శని ఉద్దేశ్యం అన్నమాట.

ఏదేమైనా కష్టాలకు ప్రధానమైన మూలదినుసు - సమయం. (Time). Time is mind - అని జిడ్డు కృష్ణమూర్తి. మనిషికి సమయం అన్నది తలలో వచ్చి కూర్చున్నప్పుడు సమస్యలు పీక్కుతింటాయి. పది రోజుల్లో చేయగలిగే పనిని ఓ రోజులో పూర్తిచేయాలి అనే పరిస్థితి - ఉద్విగ్నత. (Anxiety). శని దశలో కష్టాలు వచ్చిన వారు - కాస్త సూక్ష్మంగా పరిశీలిస్తే ఇలాంటి చిక్కులే ఎదురవుతున్నాయని తెలుస్తుంది. అనుకోకుండా అవసర అవసరంగా తప్పించుకోలేని పనులు వచ్చిపడటం సమస్యలకు ఒకానొక మూలకారణం. శని "Time" అనే variable ద్వారా ఉద్విగ్నతకు, సమస్యలకు కారణమవుతాడు.

ఈ "కాలం" అనే సెన్సు ను దూరం చేసి, శని గ్రహం ద్వారా వచ్చిన కష్టాలను దూరం చేస్తాడు కాబట్టి "కాల"భైరవుడు అయ్యాడు.

లింగపురాణంలో ఓ కథ ఉంది. సృష్ట్యాదిలో లింగం ఆవిర్భవించింది. ఆ లింగపు పైకొన (అంతం) ఎక్కడో తెలుసుకోవాలని బ్రహ్మ, మూలం (ఆది) తెలుసుకోవాలని విష్ణువు బయలుదేరారు. విష్ణువు చేతులెత్తేశాడు. కానీ బ్రహ్మ మాత్రం తిరిగివచ్చి పై కొన చూశానన్నాడు. ఇది అబద్ధం. ఎందుకంటే బ్రహ్మాండానికి అంతం అన్నది లేదు. (Universe is ever expanding - Einstein)

అలా అబద్దం చెప్పిన బ్రహ్మ తలల్లో - పైకి ఆకాశం వైపుకు తిరిగిన తలను - "కాల" భైరవుడు కొనగోటితో త్రెంపాడు. (Since there is no end to universe, it is not possible to reach it in "Time". Time is irrelevant in this context). అలా "కాలము" అన్నదానికి అతీతుడు అనే కాన్సెప్టు "కాల"భైరవుని మూర్తి కథ. కాలానికి అతీతుడు కనక శని "కాలం" ద్వారా పెట్టే ఇబ్బందులను తొలగిస్తాడని - inference. ("భీరుం అవతరతి ఇతి భైరవః ?")

కాల్ - అంటే సమయము. దీనికి మరొక అర్థం నలుపురంగు. కాలము అన్నది subjective. మామూలుగా సృష్టిలో ఉన్నది తమస్సు, అంధకారం. ఈ నలుపుకు వ్యతిరేకమైనది వెలుగు. (objective)

మెదడు లో జరిగే వ్యాపారాలను నిమిత్తమాత్రంగా గమనిస్తూ, ధ్యానిస్తూ ఉంటే "ఆలోచన"లకు అతీతంగా, నిర్వ్యాపారంగా ఉన్న స్థితి కలుగుతుందని, అదే enlightenment అని బుద్ధబోధ, జిడ్డుకృష్ణమూర్తి వంటి తాత్వికుల ఉవాచ. అంటే ఆ స్థితి "సమయానికి" అతీతమైనది. Time is mind కాబట్టి..

***************

కాలభైరవ మందిరం కూడా ఓ చిన్న గల్లీలొ వెళితే వస్తుంది. అక్కడ గుడి ముందు కుక్కలు చాలా ఉన్నాయి. పాలకోవాను ప్రసాదంగా అమ్ముతున్నారు.

ఈ భైరవ సాంప్రదాయం తాంత్రిక సాంప్రదాయంలా కనిపిస్తుంది. వారణాశి నగరానికి బయట సారనాథ్ అన్న బౌద్ధుల ప్రదేశం ఒకటి ఉంది. ఇక్కడ జరిపిన త్రవ్వకాలలో తాంత్రిక శిల్పాలు బయటపడ్డాయి. వాటిని మ్యూజియమ్ లో పెట్టారు. అందులో "వారాహి", "భైరవ" వంటి విగ్రహాలున్నై. భైరవ సాంప్రదాయం బౌద్ధంతో మొదలయ్యిందో లేక, బౌద్ధంతో బాటు సమాంతరంగా హిందూ మతంలో అభివృద్ధి చెందిందో తెలీదు. కానీ ఇది బలులు, వామాచారాలు కేటగిరీకి సంబంధించినది.

మన ఆంధ్రలో చాలా దేవాలయాలలో ఓ మూల కుక్కతో బాటు నుంచున్న ఓ విగ్రహం ఉంటాయి. శ్రీకాళహస్తిలో ఇలాంటిది ఓ అద్భుతమైన విగ్రహం చూసినట్టు గుర్తు. గుడి నుంచి బయటకు పోయేప్పుడు ఈ విగ్రహం ముంగట ఆగి చప్పట్లు కొట్టి వెళ్ళాలని మా అవ్వ చెప్పేది చిన్నప్పుడు. అలా ఎందుకో తెలీదు.

***************

0 <--------1---------> ∞

మనిషి జీవితం = 1 అనుకుంటే విక్టోరియన్ ఆలోచన/ కన్ఫ్యూషియస్ సిద్ధాంతం ఆ 1 ని అదే దృక్పథంతో, అంటే ఆ 1 నే పరమావధిగా జీవించమని బోధిస్తాయి. అంటే Human = Sum total of his successes/Achievements.

వైదికమతం/ లేదా ఆర్యావర్తం అనే భారతదేశం, దానిచుట్టూ ఉన్న పరిసరప్రాంతాల యొక్క తాత్త్విక దృక్పథం లేదా ఆధ్యాత్మిక వైఖరి - అనంతాన్ని అంటే ∞ ని అందుకోవాలని ఆరాటపడింది. మనిషి - అనంతంలో లీనమవడమే జీవితసాఫల్యం. కాశీ విశ్వనాథుడు లింగరూపుడు. ఆ లింగం ఉద్భవించగానే ఆద్యనంతాలు లేని గొప్ప వెలుగుగా అవతరించింది. ఆ ఆద్యనంతాలను బ్రహ్మ, విష్ణువులిద్దరూ తెలుసుకోలేకపోయారు. చివరికి ఆ తేజం లింగరూపంలో కాశీలో వెలిసింది.

అంటే పరమేశ్వరుడు - అనేది అనంతమైన తేజోరాశికి మూర్తిమంతమైన రూపం అన్నమాట. అదే విధంగా విష్ణువును బ్రహ్మాండాలు ఆక్రమించే త్రివిక్రమునిగా, శ్రీ కృష్ణుని విశ్వరూపునిగా ఇలా అనంతానికి ప్రతీకలుగా వైదిక/సనాతన ధర్మం పేర్కొంది. మనిషి జన్మతః 1 గా పుట్టినా, అతని ప్రస్థానం అనంతానికి. ఈ అభిప్రాయాన్ని ఉపనిషత్ మహావాక్యాలలో నిమంత్రించడం కనిపిస్తుంది.

"తత్ త్వమ్ అసి". - "అదేదైతే ఉందో అదే నీవు".

ఆ నీవు -1 అనుకుంటే, "అది" = బ్రహ్మం. "అది" పట్టరానంత, ఊహించలేనంత పెద్దది. అదే సత్యం. ఆ సత్యాన్ని అందుకోవటమే "జీవుని" లక్ష్యం. అంటే "అదే" - "జీవుడు". (బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాऽపరః|)

ఈ వ్యవహారమేదో చాదస్తపు మత వ్యవహారం అనుకోవడానికి వీల్లేదు. ఎంచేతనంటే నిత్యజీవితంలో ఏ పని చేయడానికైనా, ఏ దృక్పథానికైనా - దేశపు సాంస్కృతిక/ఆధ్యాత్మిక మూలభావాలే ఆకరాలవుతాయి. సమాజిక/రాజకీయ/భౌతికమైన అనేక విషయాలకు ఆధ్యాత్మిక దృక్పథం మూలమవుతుంది.

మనిషి అనంతాన్ని అందుకోవాలి. ఈ సిద్ధాంతం నుంచి "పునర్జన్మ" అనే ఆలోచన పుట్టింది. పునర్జన్మ నుంచీ కర్మ సిద్ధాంతం, అందునుంచి పాపపుణ్యాలు, తద్వారా పౌరోహిత వ్యవస్థ, చాతుర్వర్ణ్యాలు, ఇలా సమస్తం... (ఇక్కడ నా ఉద్దేశ్యం ఆధ్యాత్మిక దృక్పథం నుంచీ భౌతిక/సామాజిక వ్యవస్థ ఎలా ఏర్పడవచ్చు అని చెప్పడం మాత్రమే.)


***************

వేల యేళ్ళక్రితం ఆర్యావర్తంలో నెలకొన్న ఈ ఆధ్యాత్మిక భావానికి - మూలమట్టంగా వ్యతిరేకమైన దిశలో ఓ అనూహ్యమైన, అద్భుతమైన ఆధ్యాత్మికతను తెరపైకి తీసుకు వచ్చిన మహానుభావుడు గౌతమబుద్ధుడు. గౌతమబుద్ధుడు సామాన్యమైన ఆధ్యాత్మిక వేత్త కాడు. అప్పటికి దేశమంతా పరుచుకుని ఉన్న ∞ అన్న భావానికి వ్యతిరేకమైన శూన్యం (0) అన్న భావాన్ని ఆధ్యాత్మికతలో చూపించిన ద్రష్ట.

గౌతమ బుద్ధుడు "ఆత్మ", పుద్గలుడు, శాశ్వతత్వం, దరిమిలా ∞, అన్నిటినీ నిరసించాడు. "సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు. " - అంటే "∞" అన్నది కూడా ఏదీ లేదు. ఒక వేళ ఉన్నా, దాన్ని తెలుసుకోవడానికి మార్గం శూన్యం ద్వారా మాత్రమే.

ఒక సముద్రం ముందు ఏకాంతంగా నిలబడి, అనంతమైన జలరాశిని చూస్తో, అందులో లీనమయ్యే భవనను ఊహించడం సాధ్యమే. కానీ ఒక శూన్యాన్ని "ఊహించడం" అన్నది దుస్సాధ్యం. కళ్ళు మూసుకుని ప్రపంచంలో "ఏమీ లేకపోతే?" అని ఊహించడానికి ప్రయత్నిస్తే - ఆ ఊహ దాదాపు దుస్సాధ్యం. మహా అయితే శూన్యం - అందులోంచి ఊహించే వ్యక్తి పడిపోతున్నట్టుగా ఒక భావన వస్తుంది.

బుద్ధుడు నిర్వాణం ద్వారా "దేన్నీ" పొందలేదు. తన "సర్వాన్నీ" కోల్పోయాడు. శూన్యుడైపోయాడు. (భౌతిక శూన్యం కాదు, బౌద్ధికశూన్యం అది) సరిగ్గా అలాంటి వ్యక్తీకరణనే ఆధునిక బుద్ధుడు జిడ్డు కృష్ణమూర్తి చెబుతాడు.


**************

గౌతమ బుద్ధుడి బోధ అసామాన్యమైనది. వైదికమతం కొంత వరకూ "స్త్రీ" తత్వంలా ఉంటుంది. స్త్రీ అంటే - స్త్రాతుం అర్హతీతి స్త్రీ - జన్మనివ్వగలిగినది స్త్రీ. ఆ జన్మనివ్వటంలోనే అమృతత్వమూ, పరంపరను కొనసాగించటమూ, తద్వారా ∞ అనంతాన్ని అందుకునే ప్రయత్నమూ అన్న భావాలు ఇమిడిఉన్నై.

గౌతముని మతం - పురుషుని మెదడుకు దగ్గరగా ఉంటుంది. ఇందుకు దేవదాసు మొదలుకుని అర్జున్ రెడ్డి వరకూ కంటెదురుగా దృష్టాంతాలు (చవకబారువైనా) సరే కనిపిస్తూ ఉన్నై. దేవదాసు కు ఉన్న ఒకే ఒక ఆలోచన - తను నశించాలి. తనూ, తన దేహం, తన బుర్ర, ఆ బుర్రలో తొలిచి వేసే ప్రియురాలు, ఆమె విరహం...అన్నీ అన్నీ మూలమట్టంగా నాశనమవ్వాలి. తను "శూన్యుడు" కావాలి. అదే పరమార్థం. ఎటొచ్చీ అలా కావడానికి "మందు" ను ఆశ్రయిస్తే, బుద్ధుడు "ధ్యానాన్ని" ఆశ్రయించాడు. ఆ ధ్యానాన్ని ఆయన "విపశ్యన" అన్నాడు. Passive awareness.

బుద్ధుని శూన్యత్వం భారతదేశానికి అర్థం కాలేదు. ఎందుకంటే ∞ అన్న భావానికి అది వ్యతిరేకం కనుక. బుద్ధుణ్ణి చాలామంది నాస్తికుడిగా పేర్కొన్నారు. ఎందుకంటే ∞ దేవుడు కనుక, ఈయన వాదం అందుకు వ్యతిరేకం కనుక. జాగ్రత్తగా చూస్తే గౌతమ బుద్ధుడు ఆస్తికుడు/నాస్తికుడు రెండూ కాదు. అతనిది process. దేవుడు అనంతుడే అయితే, "నేను" అన్నదాన్ని కోల్పోవడం ద్వారా "మనిషి" ఆ అనంతంలోనే లీనమవుతాడు. అలా కాక దేవుడు అనే వాడు లేనట్టయితే శూన్యం ద్వారా ఆ విషయం ఎలానూ తెలుస్తుంది. దరిమిలా బుద్ధబోధ అన్నది ఒక దర్శనం.Method/ Process/Objectivity. అది "సిద్ధాంతం", "subjectivity", "noun" కాదు. ఆచరణలో వ్యతిరేక ఛాయలు కనబడినా బుద్ధుని బోధ నిజానికి మౌలికమైన వైదిక చింతనకు వ్యతిరేకమైనది కాదు. వైదిక మతభావనను ఆచరణకు తెచ్చే ప్రయత్నంలో నూతనమైన మార్గం అన్వేషించింది బౌద్ధం.

బౌద్ధమతం - అలా అని విక్టోరియన్/ కన్ఫ్యూషియస్ సిద్ధాంతాలను సమర్థించేది కాదు. ఇది అందుకు వ్యతిరేకం కూడా.


****************

సర్వమూ శూన్యం అన్న గౌతమ బుద్ధుడు తన మొట్టమొదటి ఉపదేశాన్ని వారణాశి నగరానికి ముఖాన, అంటే నాటి "వారణ" నదికి ఆవల, మృగదావం అనే జింకలవనంలో తనతో బాటు ఒకనాడు కలిసి తపస్సు చేసిన ఐదుగురికి చేశాడు. ఆ ప్రదేశం - రిషిపతన మృగదావం అయింది. అదే నేటి సారనాథ్.

ఏ శూన్యత్వాన్ని బుద్ధుడు బోధించాడో, తన మహాపరినిర్వాణం తర్వాత "తనకు సంబంధించిన" ఏ విషయమూ భూమి మీద మిగులరాదని అన్నాడో, సరిగ్గా అందుకు వ్యతిరేకమైంగా - అక్కడ ఓ పెద్ద స్థూపం వెలిసింది. మూలగంధకుటి కుటీరం పేరుతో ఓ ఆరామం వెలిసింది. దరిమిలా మరో "సాధారణ" మైన మతవ్యవస్థ నెలకొంది. బుద్ధుడే "దేవుడు" అయ్యాడు. "ధ్యానం" - "అర్చన" గా మారింది. Meditation has become Worship.

ఆ సారనాథ్ దగ్గర ఓ చిన్న స్థంభం ఉంది. ఆ స్థంభంపైన నాలుగు సింహాల గుర్తును, ఓ శాసనాన్ని ఆంగ్లేయులు కనుగొన్నారు. అదే మన నాణాల మీద కనిపించే గుర్తు. ఈ స్థూపం, ఆ శాసనం - అశోకుడు అనే రాజుదని ఆంగ్లేయులు నిర్ణయించారు. అశోకుడనే రాజు చాలా గొప్ప రాజు అని, కళింగ యుద్ధం చేసి దీనంగా తయారయ్యాడని, ధర్మరాజికలని, ధర్మాశోకుడనీ అదని ఇదనీ చాలా కథలు పుట్టాయి, పుట్టించారు.

నిజానికి అశోకుడు చేసిన "అంత గొప్ప" కళింగ యుద్ధం గురించి ప్రపంచ భాషల్లో ఏ భాషలోనూ, ఏ గ్రంథంలోనూ ఆనవాళ్ళు లేవు. ఈ కథకు ఆధారం - శాసనాలు. అందులో ఉన్న అరకొర అంశాలూనూ. పైగా సింహళ గ్రంథాల ప్రకారం మౌర్య అశోకుడు - పరమ మూర్ఖూదు, క్రూరుడూనూ.

స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో కాంగ్రెసు ప్రభుత్వానికి - హిందూమతానికి అతీతుడైన ఓ రాజు, ఆతని తాలూకు ఆనవాళ్ళు అవసరమయ్యేయి. దరిమిలా "అశోకుడు" ముఖ్యుడయ్యాడు. అతని తాలూకు వ్యవహారాలు పాఠాలలో జొరబడినై. చరిత్ర కకావికలమయ్యింది.

ఓ గొప్ప బోధ - సామాన్యమైన మతంగా మారటానికి, ఓ చరిత్ర పూర్తిగా వక్రీకరణ చెందటానికి - సారనాథ్ మౌన సాక్షి.


****************

డిసెంబరు 31, ఉదయం 8:00
కాలభైరవుని దర్శనం అయిపోయింది. నగరం పొగమంచు దుప్పటిని కప్పుకునే ఉంది. పౌరులు ఉన్ని దుప్పట్లతో, తలపాగాలతో తిరుగుతున్నారు. కాలభైరవ మందిర్ దగ్గర అదేదో కాయగూరల మార్కెట్ ఉంది. అక్కడ రద్దీ లేదు.

ఆ రోజు తర్వాత ప్రోగ్రామ్ సారనాథ్, అట్నించీ బాటీ చోఖా లేదా అన్నపూర్ణ మందిరం తిరిగి నాకు ఇష్టమైన చౌఖాంబా పుస్తకాలయం.... ఇలా అనుకున్నాను.

సారనాథ్ కు వెళ్ళడానికి సిటీ బస్సులూ, గట్రా లేవు. బెంగళూరు, చెన్నై నగరాలలో ఆటోల వ్యవహారం తెలిసి ఉండడంతో ఆ రిస్క్ తీసుకోదల్చలేదు. ఇక ఓలా కేబ్ గతి.

కాశీకి ఉత్తరదిశలో ఉంది సారనాథ్ అన్న ప్రాంతం. సారనాథ్ లో ఓ మ్యూజియమ్, పురాతన స్థూపం, థాయిలాండ్ వారి బుద్ధుని గుడి (దాదాపు 60 అడుగుల బుద్ధుని శిల్పం), టిబెట్ వారి దేవాలయం వంటివి ఉన్నాయి. దలైలామా అదే రోజు కాశీకి వచ్చి ఉండడంతో - ముదురు ఎరుపు రంగు బట్టలు కట్టుకున్న బౌద్ధుల హవా ఎక్కువగా ఉందక్కడ. ఆదివారం కావడంతో మ్యూజియమ్ చాలా రద్దీగా ఉంది.

మ్యూజియమ్

ముట్టిన ప్రతి వస్తువును వ్యాపార పదార్థంగా మార్చి డబ్బు సంపాదించి సుఖాలతో కులకాలనే తెల్లవాడి ఆలోచన నుందీ వచ్చింది ఈ వస్తుసంగ్రహాలయం అనే దరిద్రపు సంస్కృతి. మనం చూసే మ్యూజియమ్ లో ఉన్న వస్తువులలో సింహభాగం - దేవాలయాలలో, ఇతర పబ్లిక్ ప్లేసెస్ లో ఉండేవి. అలా పబ్లిక్ గా ఉన్న ఆ వస్తుసముదాయంతో, వాటికి సంబంధించిన శిల్పకళ, చిత్రకళ వంటివి అందరికీ అందుబాటులో ఉన్న విద్యగా తెలిసేవి. వాటిని "అమ్యూజ్ మెంట్" ఉపకరణాలుగా మార్చి ఏవో చీకటి కొట్లలో పెట్టటాన్ని అలవాటు చేశాడు తెల్లవాడు. మ్యూజియమ్ కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత - ఏదో "అమ్యూజ్ మెంట్" అన్న ఫీలింగు తప్ప, జ్ఞానం అన్న వ్యవహారం మామూలుగా రాదు.

సారనాథ్ మ్యూజియమ్ పెద్దదే, అయితే దీనికన్నా భువనేశ్వర్ స్టేట్ మ్యూజియమ్ చాలా బావుంటుంది. సారనాథ్ లో బౌద్ధం బలిసి, హీనయానం, మహాయానాల నుంచి వజ్రయానానికి దారి తీసింది. వజ్రయానం అంటే తాంత్రిక సాంప్రదాయాలు, బలులు, పంచ "మ" కారాలు వగైరాలు అన్నమాట. అంటే మద్యం, మాంసం, మగువ, వగైరాలు...ఆ సాంప్రదాయల నుంచి వచ్చిన వారాహి, తార, అవలోకితేశ్వర వంటి ప్రతిమలు ఆ మ్యూజియమ్ లో ఉన్నాయి.

బౌద్ధ స్థూపం - ఇషిపతన మృగదావం అన్న ఓ చిన్న తోట లో ఉంది. అక్కడే అశోకుని (?) విరిగిన స్థంభం, దానిపై పాళీ శాసనం ఉంది. ఆ స్థంభం చివర నాలుగు సింహాలు ఉండేవి. దాన్నే నేషనల్ ఎంబ్లెం గా తీసుకున్నారు. ఆ స్థంభం చివరి భాగం ఇప్పుడక్కడ లేదు. బహుశా ఢిల్లీ మ్యూజియమ్ లో ఉందనుకుంటాను.

(అశోకుని పెద్ద శాసనాలలో ఒక్క దానిలో కూడా "అశోకుడు" అన్న పేరు లేదు. ఆ పై బయటపడిన చిన్న శాసనాలలో మొట్టమొదటిగా కర్ణాటకలోని రాయచూరు జిల్లా మస్కి శాసనంలో ఈ పేరు కనిపిస్తుంది. ఈ పేరు ఉన్నందువల్ల ఆ శాసనం "మౌర్య అశోకునిదే" అని చెప్పడానికి ఖచ్చితమైన ఋజువులు సరిపడవు.)

ఇక్కడే "మూలగంధకుటి" అనే ఆరామం తర్వాతి కాలంలో ఏర్పడింది. ఆ ఆరామం తాలూకు శిథిలాలు అవీ అక్కడ ఉన్నై.

స్థూపం దగ్గర బౌద్ధ భిక్షువులు సూత్రాలు వల్లిస్తున్నారు. కొందరు సెల్ఫీలు దిగుతున్నారు. కొందరు నమస్కారాలు, ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఓ భిక్షువు ఎవరో ఫారిన్ వాళ్ళకు బౌద్ధం గురించి వివరిస్తున్నాడు. పిల్లలు ఆడుకుంటున్నారు.

వినయపిటకంలో భిక్షువులు పాటించవలసిన నియమాలు చెప్పాడట బుద్ధుడు. అందులో భిక్షువులు - కేవలం ఏడు వస్తువులను మాత్రమే "తమది" గా చేసుకుని ఉండాలి. అవి - చీవరం (బట్ట), కర్ర, భిక్షాపాత్ర, చెప్పులు వగైరా వగైరా. ఇప్పట్లో అయితే "సెల్ ఫోన్" ను తప్పక చెప్పి ఉండేవాడేమో ఆయన.


****************

ఒకానొక బౌద్ధ కథ.

ఓ మహారాజు ఆస్థానానికి ఓ సన్యాసి వచ్చాడు. రాజు ఎదురేగి ఆ సన్యాసికి పంచప్రతిష్టిత నమస్కారం చేశాడు. ఆ తర్వాత రాజు, మంత్రి ఏకాంతంగా ఉన్నప్పుడు మంత్రి అడిగేడు - " ఆ సన్యాసికి పోయి నమస్కారం చేస్తారెందుకు?"

అందుకు రాజు నవ్వాడు. ఓ భటుని పిలిపించి, ఏవైనా ఐదు జంతువుల తలలు తెమ్మన్నాడు. భటుడు హుటాహుటిని వెళ్ళి ఏవో ఐదు జంతువుల తలలు తీసుకు వచ్చేడు. ఆ తలలకు ఓ చచ్చిన మనిషి తలను కూడా కలిపి -

"వాటిని ఎలాగైనా సరే వినియోగం చెయ్యమ"న్నాడు రాజు.

భటుడు ఆలోచించి వాటిని బజార్లో అమ్మకానికి పెట్టాడు. ఆహారం కోసం ఒక జంతువును, కొమ్ములను ఆయుధంగా వాడటానికి మరొక దాన్ని, తోలు కోసం ఒక దాన్ని, కళ్ళకోసం ఒకదాన్ని, ఆఖరుకు ఎందుకూ పనికి రాని జంతువును కూడా మాంసం తీసి, గడ్డితో పూడ్చి "కళారూపం" లా ఉపయోగించుకుందుకూ ఎవరో ఒకరు కొన్నారు. ఒక్క మనిషి తల మాత్రం అమ్ముడు పోలేదు.

రాజు ఆ ఉదంతం అంతా మంత్రి సమక్షంలో జరిపి - చివరికి అన్నాడు - "ఎందుకూ పనికి రానిది మనిషి తల మాత్రమే. ఆ తలను సన్యాసి పాదాలకు తాకిస్తే పోయేదేముంది?"


****************

ప్రపంచంలో అత్యంత పనికిమాలిన జంతువు మనిషేనని అలా తీర్మానించేడు ఆ రాజు. బహుశా నిజమేనేమో. ఓ మనిషి జీవితకాలంలో తినే తిండి ఐదారు టన్నులు. వినియోగించేది టన్నుల కొద్దీ నీళ్ళు, టన్నుల కొద్దీ ఆక్సిజన్. తనకోసం, తన సుఖాల కోసం చేసే పర్యావరణ వినాశనం ఊహించలేనంత. ఒక మనిషిని జీవితకాలం పోషించటానికి ఎన్ని వందల, వేల చెట్లు కొట్టివేయాలో! అసలు ప్రకృతి ఇంత వినాశనాన్ని తట్టుకొని ఒక్కో మనిషిని ఎందుకు పెంచి పోషిస్తోందో ఏమో!

ఇంత చేసి, తిరిగి ప్రకృతికి మనం మనుషులం ఇచ్చేది అంటూ ఏదీ ఉండదు. కనీసం రైతులు ఏమైనా ఇస్తారేమో, ఇతరులమైన మనం ఒక్క గింజ కూడా పండించే యోగ్య్తత లేని జీవాలు. కానీ మనకు కార్లూ, ఏసీలు, ఫ్రిజ్జులు, ఫోన్లు, కంప్యూటర్లు, బొంగు, భోషాణం....ఇన్ని హంగులు కావాలిక్కడ.

మనకున్న అవసరాల్లో కనీసం 10 శాతం తగ్గించుకుంటే ఇంకో నలుగురిని బ్రతికించవచ్చు. పది బట్టల జతలు బదులు ఓ నాలుగు పెట్టుకోవచ్చు. ఇంట్లో ఏసీ ఉంటే దాన్ని నాలుగ్గంటల బదులు ఓ గంట సేపు వాడవచ్చు. కనీసం ఆఫీసులో మన కంప్యూటర్ ను ఆఫ్ చేసి ఇంటికి వెళ్ళవచ్చు. ఏదీ చెయ్యం. Human race is the most callous and irresponsible race may be!

దీనికంతా మూలకారణం "నేను" అన్న వ్యవహారం, image formation అని జిడ్డు కృష్ణమూర్తి అనే తాత్వికుడు అంటాడు. "నేను" అన్న వ్యవహారం, ప్రతి విషయానికి ఈ "నేను" అన్న దాన్ని ప్రియారిటీగా పెట్టడం సమస్య అని తీర్మానిస్తాడాయన.

ఓ రెండు గంటల పాటు ఏ జలపాతం క్రిందనో హాయిగా అడుకోవచ్చు. ప్రకృతి ఒడిలో గంటల సేపు హాయిగా కూర్చోవచ్చు. సముద్రం ఒడ్డున ఆ అనంతమైన జలరాశిని చూస్తూ, ఎంతో ఆహ్లాదాన్ని పొందవచ్చు. బాగా రద్దీగా ఉన్న జనం మధ్య ఓ పావుగంట పాటు గడిపితే - భరించలేనంత నీరసం వస్తుంది.

Human beings are black holes అంటాడు ఓషో అనే ఆయన. జార్గ్ గుర్జీఫ్ అనే రష్యన్ తాత్వికుడు "Buffers" అనే ఓ పదం వాడతాడు. ప్రతి మనిషి తనచుట్టూ కనిపించని ఓ వలయాన్ని పెట్టుకుని ఉంటాడట. ఆవలయంలోనికి ఇతరులు జొరబడితే ఆ జొరబడిన వారి శక్తి హరించుకుపోతుంది!

ఇది టోకున ఓ నగరానికి జరిగితే?

కాశీ/వారణాశి కి పూర్వకాలపు పేరు - ఆనందవనం అట. క్రిక్కిరిసిన అడవులు, అపూర్వమైన ప్రకృతి సంపద, చిన్న చిన్న నీటి చెలమలూ, ఓ వైపున గంగ, వారణ, అసి నదులు, అక్కడక్కడా నీటి కోనేరులు, కుండాలు, ఇలా అపూర్వంగా భాసిల్లే ఈ ప్రాంతం క్రమక్రమంగా జనావాసంగా మారసాగింది. ఈ ఆనందవనం స్వరూపం మారడానికి తీవ్రమైన కారణాలు ఔరంగజేబు కాలంలో, వారన్ హేస్టింగ్స్ కాలంలో జరిగేయంటారు. ఆంగ్లేయులు సుఖంగా చరించడానికి, వారి ట్రూప్స్ వ్యాహ్యాళిగా గంగ ఒడ్డున విహారం చెయ్యటానికి వారన్ హేస్టింగ్స్ - ఇప్పుడు ఉన్న ఘట్టాలను కట్టించాడని, వారణ నది స్వరూపాన్ని మార్చాడని, రాజ్ ఘాట్ వద్ద పురాతన శిథిలాలను, ప్రాచీన నగర ఆనవాళ్లను ధ్వంసం చేయించాడని అంటారు.

ఏదేమైనా, ప్రస్తుతం వారణాశి నగరం - క్రిక్కిరిసిపోయిన జనాభాతో ఉన్న నగరం. ఇప్పటి వారణాశి - భారతీయత తాలూకు ప్రాచీన అవశేషాలు మాత్రమే నిలుపుకున్న నగరం. ఇదే ఇంత గొప్పగా ఉంది!


****************

ఆ రోజు - మధ్యాహ్నమవుతోంది. సారనాథ్ దగ్గర నుంచి కాశీకి వెనక్కి బయలుదేరి, పొరబాటున ఎక్కడో దిగాను నేను. చేతిలో గూగుల్ మాప్ ఉంది. అందులో "బాటీ చోఖా" అనే భోజన శాలను వెతుక్కుని, అక్కడకు బయలు దేరాలని ప్లాను. అయితే మాప్స్ లో ఆ ప్రదేశం సరిగ్గా అప్ డేటు కాలేదు. ఆ బాటీ చోఖా ఉన్న చోట ఓ మైదానం ఉంది! మరేదీ లేదు.

కంటోన్మెంటు ప్రాంతం విపరీతమైన రద్దీ. అట్నించి బయటపడి నగరం వైపు వస్తున్నాను. అదేదో వీథి. రోడ్డు పక్క పాతకాలపు మిఠాయి దుకాణాలు. గులాబీ జాములు, జిలేబీలు - ఆవురావురుమంటూ లాగిస్తున్నారు జనాలు. దక్షిణభారతవాసులకు స్వీట్లు పట్టవు కానీ కాశీ జనాభాకు స్వీట్లు అంటే తెగ మోజు కాబోలు.

దాల్ మండీ వద్ద రిక్షా దాదాపుగా నత్తనడక సాగిస్తూ ఉంది. ఆదివారం, డిసెంబరు ముప్పై ఒకటి కావడంతో గృహిణులు మండీ (మార్కెట్) వద్ద చేరుకున్నారు. రోడ్డు లో ఓ నూరడుగులు నడవాలంటే పదిమందిని తప్పించుకుని రాసుకొని నడవాలి. జనం జనం జనం.

క్రిక్కిరిసిపోయిన వీథులు, చిన్న చిన్న సందులూ, ఆవులు, అక్కడే స్వీటు/పాన్ దుకాణాలు...ఒక్క సారి దారి తప్పితే తిరిగి చేరుకోవలసిన చోటుకు చేరుకుందుకు బోలెడు గల్లీలు తిరిగే పని.

ఈ గోలలో భోజనం, దారిలో కనిపించే ప్రముఖమైన కొన్ని స్థలాలు (భారతమాత దేవాలయం, పితృ కుండం, వగైరా వగైరా) చూస్తూనే తప్పిపోయాయి. బాటీ చోఖా కూడా గొడవలో మరిచిపోయాను. బాటీ చోఖాలో పిడకలతో వండిన ఉత్తరప్రదేశ్ సాంప్రదాయ పల్లె భోజనం దొరుకుతుందట.

ఏదో తిండి అయిందనిపించి, టీ కాఫీలతో ఎలాగో చివరికి మణికర్ణిక కు వచ్చాను. అక్కడ మణికర్ణిక ద్వారం దగ్గర రెండు మూడు శవయాత్రలు జరుగుతున్నాయి. "రామనామ సత్య హైన్" అని నినాదాలు చేసుకుంటూ వెళుతున్నారు. కాశీలో మరణించిన వారి చెవులు పైకి తిరిగి ఉంటాయట. సాక్షాత్తూ పరమేశ్వరుడు వారి చెవిలో మంత్రోపదేశం చేస్తాడట!

మరో ప్రముఖ ప్రదేశం చూశాను. లోపలికి వెళ్ళలేదు కానీ. అది "ముక్తి భవన్/మోక్ష భవన్." - మరణం దగ్గర పడిన ముసలివాళ్ళు, కాశీలో మరణించాలనుకునే వాళ్ళు ఆ ముక్తిభవన్ లో చేరవచ్చు. గోయంకా వారు కట్టించినదట అది. నామమాత్రంగా ఫీజు. పదిహేను ఇరవై రోజులలో మరణం రాకపోతే, వారి ఆరోగ్యం బావుంటే, తిరిగి ఇంటికి పంపిస్తారట. కొంతమందికి సమయం పొడిగించటమూ ఉంటుంది........

ఇట్లా రద్దీలో కాశీ రోడ్లు సర్వే చేసి, దాదాపు పది కిమీ నడక/రిక్షా లతో - ఆ రోజు మధ్యాహ్నం ముగిసింది. నీరసంతో శోష వచ్చే పరిస్థితి!

అయితే ఆ తర్వాత చేరుకున్న చోటుతో ఆ నీరసం అంతా చేత్తో తీసేసినట్టు మాయమయింది. అది కాశీలోని ప్రముఖ ప్రచురణ సంస్థ - చౌఖాంబా ప్రకాశన్ వారి ఇల్లు.


పుస్తకం.

’కవిత్వం’ ఓ అలౌకికమైన, వ్యక్తీకరింపలేని ఓ విఫల ప్రయత్నం (Poetry is a failure) అయితే ’పుస్తకం’ ఓ వినిమయ వస్తువు. (Commodity). అందుచేత కవిత్వానికి ఉన్న ఉదాత్తమైన విలువ పుస్తకానికి ఉండదు.
భారతదేశంలో కవులు/కళాకారులు - వారి పేర్లను చెప్పుకోవడానికి హెచ్చు భాగం ఇష్టపడలేదని మనకు తెలుస్తోంది. ’గుర్తింపు’ కోసం ఆరాటపడి ఉండవచ్చుగాక. ఆ మాత్రం ’గుర్తింపు’ కూడా ఆశించని మనస్తత్వం యోగులు, మహాత్ములు వంటివారికే సాధ్యం. అయితే మరీ ’యావ’ గా కీర్తికోసం, ధనం కోసం కక్కుర్తి పడిన కవుల కళాకారుల సంఖ్య దాదాపుగా ఈ దేశంలో మృగ్యం. రాజాశ్రితులై, తమ కవిత్వానికి గుర్తింపు తెచ్చుకున్న ఆ కొద్దిమందినీ కూడా మనం శుభ్రంగా అప్పుడప్పుడూ తిట్టుకుంటున్నాం.

దరిమిలా ఇక్కడ తెలియవచ్చేదేమంటే -

"కవిత్వం/రచన ప్రాచుర్యం పొందటానికి పుస్తకం - ఒక అవసరం/ఉపకరణం. పుస్తకం తాలూకు జ్ఞానం పదిమందికి చేరటమే ఆ పుస్తకం యొక్క పరమార్థం. అలాగే అది శిల్పం/చిత్రలేఖనం ఏదైనా కానివ్వండి. దాని యొక్క అంతిమ ఉద్దేశ్యం సమాజ వికాసం. అందుకనే అందరికీ అందుబాటులో ఉన్న దేవాలయాలలో శిల్ప/చిత్రకళ ప్రాభవంగా రూపుదాల్చింది. సమాజవికాసం ప్రధానోద్దేశ్యంగానే "సాహిత్యం" అన్న శబ్దం ఏర్పడింది".

దీనికి విరుద్ధమైన ప్రాతిపదిక మనకు ఆంగ్లేయుల ద్వారా సంక్రమించింది.

"పుస్తకం ఉన్నదే లౌకిక జీవితంలో బాగుపడటానికి, సుఖాలను పడయటానికిన్నీ. పుస్తకం కోసమే కవిత. "ఎలాగోలా" పుస్తకం అమ్ముకోగలిగితే అదే గొప్ప. ఓ పుస్తకం హెచ్చుగా అమ్ముడు అయితే గొప్ప విలువ గలది. లేదా ఓ కవికి/రచయిత(త్రి)కి గొప్ప బిరుదో పీఠమో లభిస్తే అతను గొప్ప. కవి/రచయిత విలువ - ఆతని పుస్తకాలు ఎంతగా వ్యాప్తికి వచ్చాయో అన్న దాని ద్వారా నిర్ధారింపబడుతుంది. (ఈ భావనను రాళ్ళపల్లి వారు నిశితంగా ఖండిస్తారు ఓ వ్యాసంలో.) "

పుస్తకం అనేది మనుషులు ప్రాపంచికంగా లాభపడటానికి పనికి వచ్చే ఉపకరణం అయినప్పుడు ఆ పుస్తకానికి హంగులు, అలంకారాలు తప్పనిసరి. అందమైన, అలంకారాలు దాల్చిన వస్తువుకు వినిమయవిలువ హెచ్చు. (నా ఊహకు వచ్చిన ఉపమానం ఇక్కడ చెప్పటం బావోదు). అందుచేతనే విదేశంలో పుస్తకానికి అన్ని హంగులూ ఆర్భాటాలు. భారతదేశానికి సంబంధించి "కళ" - వినిమయవస్తువు కాదు, అది వ్యక్తి ఔన్నత్యానికి ఉపకరించే ఉదాత్తమైన ప్రయోజనకారి.

ఏదేమైనా - పుస్తకాన్ని తక్కువ ధరలో ఎక్కువ మందికి అందుబాటులో ఉండేలా ముద్రించే ప్రకాశకులంటే వ్యక్తిగతంగా నాకు గొప్ప గౌరవం. ఎక్కువ ప్రచురణ సంస్థల గురించి తెలియదు. కానీ తెలిసిన వారిలో గీతాప్రెస్ గోరఖ్ పూర్ వారు, నేబుట్ర, వీరికంటే ప్రధానంగా "చౌఖాంబా ప్రకాశన్ - వారణాశి’ వారు. చౌఖాంబా ప్రకాశన్ వారు ఈ పద్ధతిని సాంప్రదాయంగా పాటిస్తూ వస్తున్నారు.

"కర్పూరమంజరి" అనేది ఒక ప్రాకృతనాటకం. (దీనిని సట్టకం అంటారు). ఈ పుస్తకాన్ని రాజశేఖరుడనే 11 వ శతాబ్దపు కవి రచించాడు. ఈ పుస్తకాన్ని చౌఖాంబా వారు సంస్కృత, ప్రాకృత పాఠాలతో, హిందీ, సంస్కృత టీక, తాత్పర్య, వ్యాఖ్యాన సహితంగా ప్రచురించారు. ఖరీదు 60/.

అదే పుస్తకాన్ని ఆంగ్ల కంటెంటుతో, చౌఖాంబా పుస్తకపు ధరకు తొమ్మిది రెట్లు ఖరీదుతో, (450/-) నాణ్యతలేని వ్యాఖ్యానంతో మరెవరో ప్రచురించారు. పుస్తకం బయట నుంచి చూడటానికి గొప్పగా కనిపిస్తుంది.


చౌఖాంబా వారి ప్రచురణల్లో హెచ్చుభాగం ’పేపర్ బ్యాక్’ ముద్రణలే. అవి కూడానూ నాసిరకం పేపర్లే. అయితే వీటి వినిమయం ఎక్కువ. ఖరీదు అందుబాటులో ఉంటుంది. భాష తేలిక. హిందీ వ్యాఖ్యలు కావడంతో ఉత్తరభారతదేశంలో బాగా చెలామణీ కాగలవి.

"పుస్తకం యొక్క ఉపయోగం - లోపలి ’కంటెంటు’ ను సమాజంలో హెచ్చు భాగం పాఠకులకు అందుబాటులో తేవడానికే" అన్న సూత్రంతో చౌఖాంబా వారి ప్రచురణ సాగుతోంది. చౌఖాంబా వారి ప్రభావం తో- చక్కని వ్యాఖ్యలను సంస్కృత నాటకాలకు, ఇతర గ్రంథాలకు, రచింపజేసి అందుబాటు ధరలలో విక్రయించే పుస్తకసంస్థలు కొన్ని ఉన్నై. "పాలక్కాడు వారి అయ్యర్ అండ్ సన్స్" అందులో ఒకటి. వీరి సంస్కృత భాసనాటకాలు చౌఖాంబా వారి తరహాలోనే ఉంటవి.

చౌఖాంబా వారి "కాదంబరి" కూడా అద్భుతమైనది. వీరు కొన్ని పుస్తకాలను ప్రశ్న-సమాధానం రూపంలోనూ ప్రచురించారు. అలాంటి చౌఖాంబా ప్రకాశన్ వారి పుస్తకాలయాన్ని వారణాశీలో దర్శించాలని, నా వద్ద లేని కొన్ని పుస్తకాలను విచారించాలని నా ఆశ. కాశీ ప్రయాణానికి ప్రధానమైన కారణం కూడా.

అయితే ఈ తొందరలో తెలియలేనిది ఏమంటే - నేను వారణాశికి చేరుకున్న రోజు ఆదివారం. ఆ రోజు దుకాణాలన్నీ మూసివున్నై.


****************

సారనాథ్ నుంచి పడుతూ లేస్తూ, తిండితిప్పలు సరిగ్గా లేక డస్సి పోయి మణికర్ణిక వద్ద చేరుకున్నాను. చేతిలో గూగుల్ మాప్ లో చౌఖాంబా ప్రకాశన్ అని ఓ చోటు చూపిస్తోంది. కాస్త దూరంలో గంగ కూడా ఉంది. ఆ దారిలో వెళుతుంటే - కాశీ స్వరూపం కనిపించింది. కారు కూడా పట్టలేనంత చిన్న చిన్న గల్లీలు. అటూ ఇటూ కనీసం వందేళ్ళకు పైబడిన బంగళాలు. ఆ దారిలో అటూ ఇటూ నీడ పడుతుంటే, చల్లని గాలి. ఆవులు మామూలే. .....గాలిపటాలు..సైకిళ్ళు...యువకులు...పాన్....ఏదో ఆత్మీయమైన వాతావరణం.

గూగులమ్మ ఓ చోట - ఇదే చౌఖాంబా వారి ముద్రణాలయం అని చూపిస్తోంది. అక్కడ ఓ ఇల్లు. పైకి వెళ్ళతానికి మెట్లు. పక్కగా ఓ సైకిల్ పార్క్ చేసి ఉంది. చీకటిగా ఉంది. ఏ బోర్డూ లేదు.

"జీ, కోయీ హై?" - అదేదో గృహస్తుల ఇల్లు అని కాస్త అనుమానంగానే పిలిచాను.

జవాబు లేదు.

"కాస్త పైకెక్కి మళ్ళీ పిలిచాను.

ఓ బీహారి పల్లెకారు వ్యక్తి బయటకు వచ్చి "ఆయియే ఆయియే" అన్నాడు.

అసలు ఏమీ వినిపించుకోకుండా లోనికి రమ్మంటాడేమిటి?

తటపటాయిస్తుంటే అతను మళ్ళీ పిలిచాడు. ఈసారి మరింత ఆత్మీయంగా.

అక్కడ లోన - అద్భుతమైన పాతపుస్తకాల సుగంధం. దాదాపుగా ఒక్కో పుస్తకం పైన ఓ మి.మీ మందంతో దుమ్ముపేరుకున్న వందలాది పుస్తకాలు. ఆ బీహారీ యువకుడు పుస్తకాలను పేరుస్తూ ఏదో పని చేసుకుంటున్నాడు. చాలా క్యాజువల్ గా "ఆయియే బైఠియే" అని చాపపై కూర్చోమన్నాడు. దిండు కాస్తా తెచ్చిపెట్టేడు. "ఏమి, ఎందుకు, వీడెవడు? " అని అతనికి అనుమానం ఏమాత్రం రాలేదు!

నోటిమాట పెగలని అవస్థ నాది. అనుభవైకవేద్యం!

అతను పాపం! నా అవస్థ గ్రహించాడు. మెల్లగా మాటల్లో దింపాడు. "మీది ముంబయా" అడిగాడు. (నా హిందీ కాస్త మరాఠీ వాసన కొడుతుంది.) కాదని, హైదరాబాదు అని చెబితే, పుస్తకాలు వెతికి నచ్చినవి చూసుకొమ్మన్నాడు. ఇంకా పైన మరిన్ని ఉన్నయ్, సేఠ్ కు చెప్పి చూపిస్తానన్నాడు.

అంత భాండాగారంలో ఆ కొంత టైములో అనుకున్నవి దొరకలేదు కానీ బాణభట్టు కాదంబరి మొదటి భాగం పాత ఎడిషనొకటి దొరికింది.

ఇంతలో పైనుంచి "రాధాగుప్తే" గారు వచ్చారు. ఆయన చౌఖాంబా ప్రచురణ సంస్థకు ప్రస్తుత అధికారి. మాట్లాడించి వివరాలు అడిగేడు. కొన్ని పుస్తకాలు చూపించేడు. మేడపైకి తీసుకెళ్ళి దుమ్ము కొట్టుకుని పోయిన రెండు గదులు చూపించాడు. నిండా అపూర్వమైన పుస్తకాలు!

చౌఖాంబా వారి పరిచయం అలా ఆరోజు జరిగింది. అనుకున్న పుస్తకాలు దొరకలేదు, వెతకటమూ అవలేదు కానీ గొప్ప అనుభూతి! మళ్ళీ వెళితే ఓ రెండు రోజులు వారింటికి వెళ్ళాలి.

పుస్తకం ఉన్నది జ్ఞానసముపార్జనకోసం. "శివేతర క్షతయే". పుస్తకం ఒక జ్ఞానభాండారం. పుస్తకం ద్వారా గుర్తింపును ఆశింపవచ్చు గాక. కాస్తో కూస్తో కీర్తిని పొందాలనుకోవచ్చు కాక.

పుస్తకాన్ని విపరీతమైన లాభాలకు అమ్ముకుని - తన భౌతిక సుఖాలకు ఉపయోగింపని వాడు కవి/ద్రష్ట.


"సత్కవుల్ హాలికులైన నేమి?"
"మదంబ! నిన్ను కూళలకమ్మ! త్రిశుద్ధిగ నను నమ్ము"

పోతన మాత్రమే మహాకవి. ఎందుకంటే ఆయన కవిత్వమే ఆయన జీవనవిధానం కనుక. కవిత్వపు అంతిమ లక్ష్యం అదే కనుక.

****************

చౌఖాంబా లో బీహారీ అతను మరొక్కమాట చెప్పాడు. వారణాశిలో BHU కేంపస్ చాలా బావుంటుందని, తప్పకుండా చూడమని, అలాగే ’సంకట మోచన్’ అనే దేవాలయం తులసీదాసుకు సంబంధించినదనీ అదీనూ చూడదగ్గదనీ చెప్పాడు.

రెండూ భేలూపుర్ కు దగ్గరే. అయినా చూడ్డం కుదరలేదు.

చౌఖాంబా వారి నుంచి బయటకు వచ్చి రూము చేరుకున్నాను. రూములో మేను వాల్చగానే ఒళ్ళు తెలియలేదు. అయితే ఎందుకనో ఏమో, ఓ గంట తర్వాత ఘంట కొట్టునట్టు మెలకువ వచ్చేసింది. నాలుగు పదిహేనూ, నాలుగున్నర అవుతోంది. మళ్ళీ రోడ్డుపై.....చక్కని తేనీరు....

వారణాశీలో కచౌరీ వీథిలో పూరీకుర్మా, చేతితో చిలికే లస్సీ చాలా బావుంటాయట! అవీ మిస్స్....ప్చ్. గౌఢాలియా రోడ్డులో హరిశ్చంద్రఘాట్ వెళ్ళే ముందు క్షీరసాగర్ అనే మిఠాయి దుకాణం ఉంది. అక్కడ స్వీట్లు బావుంటాయట. చూస్తూ చూస్తూ అదీ మిస్సయ్యాను.

హరిశ్చంద్రఘాట్ అంటే గంగ ఒడ్డున రెండవ శ్మశానం. (మణికర్ణిక మొదటిది) ఇది నాకు అక్కడికి చేరుకునే వరకూ తెలీదు. కొన్ని మానవ కళేబరాలను కట్టెలపై బిగించి పెట్టి ఉన్నారు. విద్యుత్ దహన యంత్రం కూడా ఉందక్కడ. అయితే కట్టెలపై దహనసంస్కారాలకే గిరాకీ కాబోలు. ఆవులూ..... చితాభస్మం....కుక్కలు కూడా....విషాదకరమైన, నిర్వేదకరమైన వాతావరణం. ఆ నిర్వేదంలోనే ఏదో మూల కూర్చుని గంగను చూస్తూ ఉండిపోవాలనిపిస్తూంది. నిజంగా అలా చూస్తూ కొందరు సాధువులు గంగ ఒడ్డున కనిపిస్తున్నారు.

ఓ పడవతను స్నేహపూర్వకంగా పలుకరించాడు. నేను సకుటుంబంగా వచ్చానేమో అనుకున్నాడట. లేదని చెప్పాను. కాస్త దూరంగా ఫారిన్ వాళ్ళు దహన క్రియను HD వీడియోలు తీయడానికి వీడియోలు బిగిస్తున్నారు. ఒక్క గదుం గదిమాడా పడవతను.

"పొండి పొండి వెధవల్లారా, ఇక్కడ ఫోటోలు తీయడం నేరం."

ఆ ఫారిన్ వాళ్ళు ఉలిక్కిపడి కెమెరాలు హడావుడిగా మూసేశారు.

"నేనూ ఓ ఫోటో తీశాను. డిలీట్ చేయమంటావా?"

"వద్దులే." మెల్లగా నవ్వి చెప్పాడా పడవతను.

ప్రాచీన కాశీలో గంగా నది ఒడ్డు మొత్తం అంతా శ్మశానమేనట. అందుకనే ఈ నగరానికి మహాశ్మశానం అని పేరు. భస్మం అంటే కళేబరాలు అన్నీ మండిపోయిన తర్వాత మిగిలే బూడిద. ఆ బూడిద ను ఒడలంతా పూసుకుంటాడు విశ్వనాథుడు.

కాశీ - ఏదో అశుభ్రమని, అశుచి అనీ చాలామంది చెబుతుంటారు. ఇక్కడ వెలసిన "విశ్వనాథుడు" (విశ్వానికే పతి) అన్న దేవుడికే అశుచి అన్న పట్టింపు లేదు. ఆ మహానుభావుడు మానవుల చితి నుంచి వచ్చిన చితాభస్మాన్ని పూసుకుని నిర్విచారంగా ఉంటాడు. ఆయన ధర్మపత్ని - అన్నపూర్ణాదేవికి మంచి, చెడు, అన్న తలంపే లేదు. వచ్చిన వారికి వచ్చినట్టు అన్నదానం చేసే మహాతల్లి ఆమె. (నిజానికి అన్నపూర్ణా దేవి గుడిలో దొంగలకు, ఇతర సాంఘిక వ్యతిరేకులకే భోజనాలలో మొదటి పీఠం అట. అన్నపూర్ణమ్మ ప్రసాదాన్ని దొంగలు వెళ్ళే దారిలో గుండిగల్లో పెట్టి వచ్చే వారట కూడాను)

మూల తత్వానికి లేని శుచి, శుభ్రతల బాధ ప్రపంచానికెందుకో! నిజమైన శుభ్రత, మానవజీవనానికి అడ్దంకి, ప్రకృతివినాశకాలు అయినవి పాశ్చాత్యులు కనిపెట్టిన ప్లాస్టిక్కు, పాలిథీన్ వంటి వాటితో వస్తున్నాయి. దాదాపు రెండు వందల యేళ్ళు ఒక దేశంలో ఉన్నా, అక్కడి గాలిని తిండిని బలవంతంగా అనుభవించినా, ఆ దేశపు ఔన్నత్యాన్ని గ్రహించలేని ఆంగ్లేయులు ఉంటే వారిని, వారి తరాలను చూసి ఆశ్చర్యపడాలి!

వారణాశికి కావలసింది ప్లాస్టిక్, పాలిథిన్ నుండి విముక్తి. దారిలో ఆవులను, సాధువులను తీసేసి, కాశీని స్వచ్ఛంగా చేయదల్చుకుంటే - కాశీ శోభయే పోతుంది.


****************

హరిశ్చంద్ర ఘాట్ నుంచి ఎదరకు (ఉత్తరం వైపు) నడవటం మొదలెట్టాను. కాశీలో గంగ తీరాన నడవటం జీవితపు అత్యంత గొప్ప అనుభవాలలో ఒకటి. ఎవ్వరికైనా కూడాను.

పడవలు మొదలయ్యాయి.





పక్కన కొందరు పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు.
గంగలో మునగాలనిపిస్తోంది, కానీ బట్టలు తీసుకురాలేదు. సరేనని ఆ తీరంలో కాస్త దూరానికి నదిలో నడుచుకుంటూ వెళ్ళి నీళ్ళు జల్లుకుని కడుపు నిండా నీరు త్రాగి వచ్చేను. బట్టలు తడిచాయి. పర్వాలేదు.

గంగ ఒడ్డునే పెద్దపెద్ద రాతి కట్టడాలు. 

ఒకానొక రాతికట్టడం ఎత్తైన భాగాన కొడుకుతో బాటు గాలిపటం ఎగిరేస్తున్న నాన్న!
గంగ ఒడ్డున కొత్తగా పెళ్ళైన పల్లెటూరి దంపతులు. అమ్మాయి ఉత్తర భారతదేశపు రీతిలో - అందమైన కనుదోయిని, చెక్కిలి సగభాగాన్ని కనబడేట్టు రంగురంగుల చీరెచెంగును తలపైనుంచి చుట్టి కప్పుకుంది. అచ్చం గంగమ్మ అమ్మాయి రూపం ఎత్తి భూమి మీదకు వచ్చినట్టుగా.

గంగ పారుతోంది, ఆనందంగా. ఓ గొప్ప చీరెచెంగును భూమ్మీద పరిచినట్టుగా... దూరంగా ఇసుకతిన్నెలు.

రాతికట్టడాలు - ఎంతో చరిత్రను చెప్పడానికి పూనుకున్న మూగవాని చూపుల్లా బలీయంగా, నిస్సహాయంగా ఉన్నాయి.
కాశీలో దానం చేస్తేనో, ఏదేని పుణ్యకార్యం చేస్తేనో అది ఎన్నో రెట్లుగా మారుతుందట! ఏమి దానం ఇవ్వాలి? అసలు "ఇవ్వటం" ఏంటి? మనిషికి అంతా వచ్చినదే కదా!

ఓ సాధువు గంగ వైపే చూస్తూ కూర్చున్నాడు. అతని పక్కన వెళ్ళి కూర్చున్నాను. అతను ఏమీ ఉలకలేదు, పలుకలేదు. లేచి బయలుదేరేను.

తులసీ ఘాట్
విజయనగర ఘాట్
శంకరాచార్య ఘాట్
చతుష్షష్టి యోగినీ ఘాట్....

చాలా పెద్ద కుటుంబం ఒకటి సంతోషంగా ఒక పడవ మాట్లాడుకుని అందులో విహరించటానికి వెళుతోంది. పిల్లలందరూ వాళ్ళ నానమ్మల, తాతయ్యల ఒళ్ళలో కూర్చుంటున్నారు. జర - అంటే ముసలితనం. దీనికి తర్వాత గాఢమైన అంధకారం.
బాల్యానికి ఉన్నది కేవలం ముందు చూపు. అందుచేతనే ఏమో ఇంట్లో పెద్దవయసు వాళ్ళు, చిన్న పిల్లలూ బెస్టు ఫ్రేంద్స్ అవడం! ఈ రెంటికీ మధ్య సమన్వయంగా యవ్వనం.

గంగ నిత్యజవ్వని.

ఎవరో ఇద్దరు ఫ్రెండ్స్. వీకెండ్ కు వారణాశికి వచ్చారు. ప్రపంచమంతా వారిదే.

ఓ పడవతను ఏభై రూపాయలకు పడవ సవారీ, పిలుస్తున్నాడు. పడవ మెలమెల్లగా క్రమంగా నిండి, గంగలో బయలుదేరింది.
వెలుగులో బయలుదేరిన పడవ పంచగంగ ఘాట్ వరకూ వెళ్ళి, తిరిగి వెనక్కి బయలు దేరింది. వచ్చేప్పుడు - చీకటి పడుతూ ఉంది. ఒడ్డున దీపాలు పెట్టారు. హారతి మొదలవబోతోంది.

చిక్కని జలరాశి. స్నిగ్ధమైన ఆ జలరాశిలో (కాశీ అనబడే) వెలుగు ప్రతిఫలిస్తోందా? లేక వెలుగును చీకటి మింగేస్తోందా?
ఒకే సమయంలో వెలితిగానూ సంతృప్తిగానూ ఉండటమంటే అదేనేమో. ఒడ్డుపైకి వచ్చేసరికి మాత్రం కన్నీళ్ళు మిగిలేయి. ఆ అవస్థలో హారతి చూడాలనిపించలేదు. వెనుతిరిగి నడుస్తూ వచ్చేశాను.

అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ

(సమాప్తం.)