7, జూన్ 2019, శుక్రవారం

మాణి - టిబెటన్ ప్రార్థనా చక్రము

"టిబెటన్ బౌద్ధులు మహాయాన సాంప్రదాయాన్ని పాటిస్తారు. తాము ఆర్జించిన సమస్త పుణ్యాన్ని ప్రాణికోటికి సమర్పించడమే మహాయాన బౌద్ధమత లక్ష్యం. ఎవరు చెప్పొచ్చారు? ఘోరమైన పాపాలలో మునిగి ఉన్న భూమండలంలోని మనుష్యులను సముద్రగర్భంలో ముంచి వేయకుండా భూగర్భంలో కూరుకుపోకుండా టిబెట్ లోని ఈ వేల మాణీలే పని చేస్తున్నాయేమో!" - రాహుల్ సాంకృత్యాయన్. ( తిబ్బెత్ మే సవ్వా బరస్)

*******

థిక్సే బౌద్ధారామం లోని మాణి
మాణీ అన్నది బౌద్ధ సాంప్రదాయంలో కనిపించే ఒకానొక చక్రం. దీనికి ఖోర్లో (འཁོར་ལོ། ) అని  పేరు. లడక్ లో చాలాచోట్ల, ముఖ్యంగా దేవాలయాలలో వరుసగా అమర్చిన చక్రాలు కానీ, లేదా చాలా పెద్దదైన ఒకే చక్రం కానీ కనిపిస్తుంది. ఈ తరహా చక్రాలు లడఖ్ లో మిలటరీ కార్యాలయాల ముందు కూడా అక్కడక్కడా కనిపిస్తాయి. ఆ చక్రంపైన "ఓమ్ మణిపద్మే హుమ్" అన్న మంత్రం వ్రాయబడి ఉంటుంది. ఈ చక్రం కొయ్యతో కానీ, లోహంతో కానీ చెయ్యబడి ఉంటుంది. మధ్యలో ఇరుసు మాత్రం కొయ్యది అయి ఉంటుంది. ఈ పెద్దచక్రం పై భాగాన ఒక కర్ర బయటకు వచ్చి ఉంటుంది. ప్రతి ప్రదక్షిణంలోనూ ఈ కొయ్య కర్ర - ఆ చక్రానికి పక్కనున్న ఘంటకు తగిలి దానిని మోగిస్తుంది.

అల్చి బౌద్ధమందిరంలో ప్రార్థనా చక్రాలు.

ఆ కొయ్య ఇరుసుపై లక్షల సంఖ్యలో వజ్రయాన బౌద్ధమతం యొక్క మంత్రాలు చెక్కి ఉంటాయట. ఈ చక్రాన్ని ఒక్కసారి ప్రదక్షిణమార్గంలో (Clockwise direction) లో త్రిప్పితే ఆ కొయ్య ఇరుసుపై ఉన్న వందలాది మంత్రాలు పఠించిన పుణ్యం లభిస్తుందని టిబెటన్ (లడాఖి) బౌద్ధుల విశ్వాసం. ఆ చక్రాన్ని ఎన్ని మార్లు త్రిప్పితే అంత పుణ్యం.

ఇదే చక్రాన్ని చేతిలో పట్టేంత చిన్నగా కూడా తయారు చేస్తారు. వీటిని బజార్లలో అక్కడక్కడా అమ్ముతారు. బౌద్ధ భిక్కులు, భిక్షుణిలు ఈ మాణి - చేతి చక్రాన్ని త్రిప్పుతూ ధ్యానానికి ఉపయోగించడం ఉంది. ఈ మంత్రాలు త్రిప్పడం వలన అనేక లక్షలు/కోట్ల ద్వారా మంత్రాలు చదివినట్లవుతుంది.



*****

ఇది "చాదస్తపు సంత" కాదా? చక్రం తిప్పితే పుణ్యం ఏమిటి? అలా సంపాదిస్తే వచ్చిన పుణ్యం - మానవకోటికి ఉపయోగపడటం ఏమిటి? - విశ్వాసానికి చెందిన కొన్ని విషయాలను సుహృద్భావ వాతావరణంలో పరిశీలిద్దాం.

పాపం - అంటే బౌద్ధం ప్రకారం భవిష్యత్తులో దుఃఖం అనే వేదనను కలిగించే అవాంఛనీయమైన శక్తి.
పుణ్యం - అంటే కుశలాన్ని కలిగించే అభిలషణీయమైన శక్తి (A positive force/intent).

మరొక విషయం. ఓ చిన్ని కథ ద్వారా ఓ విషయం చెబుతాడు ఓ కథకుడు.

 ఓ యువకుడు - బిచ్చగాడికి ఒక రూపాయ దానం చెయ్యాలనుకొన్నాడు. తన జేబులో వెతికి ఒక రూక చేతికి తగిలింది. ఆ రూకను అతడు సరిగా గమనించకుండా బిచ్చగాడికి ఇచ్చినాడు. అది నిజానికి రెండు రూపాయల రూక.

ఆ యువకుడు వేయాలనుకొన్నది ఒక్క రూపాయ. అయితే వేసింది రెండు రూపాయలు.

కానీ యువకుడికి ఒక్కరూపాయ వేసిన పుణ్యమే వస్తుంది. ఎందుకంటే - ఆధ్యాత్మిక లోకంలో బాహ్య కర్మలకన్నా, ఆ కర్మకు గల ఉద్దేశ్యమే ప్రాధాన్యత వహిస్తుంది. దీనిని ’చేతన’ అన్నారు. చేతననే కర్మ అన్నారు. ఈ కర్మఫలమే పాపపుణ్యాలుగా పరిణమిస్తుంది. (అందుకనే అంతశ్చేతనను ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంచుకోవాలి.మంచి ఆలోచనలే చెయ్యాలి.)

మాణిని అనేక సార్లు త్రిప్పడం ద్వారా, ’ఓమ్ మణి పద్మే హుమ్" మంత్రాన్ని అనేక మార్లు జపించటం ద్వారా ప్రాణి కోటికి మేలు కలగాలని, కలుగుతుందని విశ్వసించటం - స్వచ్ఛమైన అంతశ్చేతనకు నిదర్శనం. ఆ కారణం వల్లనే కమ్యూనిష్టు అయిన రాహుల్ సాంకృత్యాయన్ పండితుడు కూడా ఈ వ్యాసం మొదట పేర్కొన్న మాటలను పలికినాడు.

*****

మాణి - చక్రాన్ని నీటిప్రవాహం ద్వారా తనంతట తానే తిరిగే విధంగా చేయటం స్పితి వేలీ (హిమాచల్ ప్రదేశ్) లోనూ, టిబెట్ లోనూ అక్కడక్కడా ఉంది.

మాణీ చక్రం తిప్పితే శాకినీ ఢాకినీ పిశాచాలు పారిపోతాయని ఒక నమ్మిక. ఇది హిందూ సాప్రదాయంలో ఘంటానాదానికి సమాంతరమే.

ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసామ్ |
కురు ఘంటారావం తత్ర దేవతాऽహ్వాన లాంఛనమ్ ||

మాణీ సాంప్రదాయం హిందువుల ఘంటా సాంప్రదాయంలో నుండి బౌద్ధంలోనికి వచ్చి ఉండవచ్చు. క్రీ.శ నాలుగవ శతాబ్దం నుండీ ఇది బౌద్ధంలో ఉందట.

ఈ మాణీ అనే చక్రం తిప్పే సాంప్రదాయానికి ఆద్యుడు - ఒకప్పటి తెలుగాయన అట. ఆయన - ఆర్య నాగార్జునుడు.