23, జనవరి 2019, బుధవారం

బాదామి - పట్టదకల్లు

1.

యేళ్ల క్రితం, కాలేజీ రోజుల్లో  బళ్ళారిలో మా మామయ్య, రాయచూరు జిల్లా మస్కి అనే గ్రామంలో లో మా పిన్నమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు. మస్కి - ఇక్కడ ప్రాచీన కాలానికి చెందిన ఓ బ్రాహ్మీలిపి శాసనం ఉంది.ఇది ఊరుబయట ఓ చెట్టుక్రింద బండపై చెక్కి ఉంది. సమ్మర్ వెకేషన్స్ కు బళ్ళారికి కానీ,మస్కికి కానీ వెళ్ళినప్పుడు రేడియో (హుబ్లి స్టేషన్)లో ఒక పాట తరచుగా వినిపించేది.

ಹುಟ್ಟಿದರೆ ಕನ್ನಡ ನಾಡಲ್ ಹುಟ್ಟಬೇಕು
ಮೆಟ್ಟಿದರೆ ಕನ್ನಡ ಮಣ್ಣ ಮೆಟ್ಟಬೇಕು
ಬದುಕಿದು ಜಟಕ ಬಂಡಿ,
ಇದು ವಿಧಿ ಓಡಿಸುವ ಬಂಡಿ....

ఈ పాటలో మొదటి చరణంలో ఓ రెండు పాదాలు ఇవి.

అజంతా, యెల్లోరాన బాళల్లి ఒమ్మె నోడు
బాదామి ఐహోళెయ చందాన తూక మాడు....

అంటే - "అజంతా కుడ్యశిల్పాలను చూడు, బాదామి, ఐహోళె అందాలతో తూచి చూడు" అని అర్థం. నేను అజంతా యెల్లోరాలు చూడలేదు. చూచినా ఆ అందాలను తూచలేను. కానీ ఒకరకంగా ఆ సినిమాకవి చెప్పింది నిజమని బాదామి పట్టదకల్లు చూసిన తర్వాత అనిపించింది. అవును. కర్ణాటకలో బాగల్ కోట్ జిల్లాలో ఉన్న బాదామి, పట్టదకల్లు, ఐహోళె ప్రాంతాలు చూడటం నిస్సందేహంగా ఒక మరపురాని అనుభూతి. (నేను ఐహోళె చూడలేదు).

హైదరాబాదు నుండి బాదామికి నేరుగా ట్రయిన్ ఉంది. ఆ ఊళ్ళో దిగడానికి చక్కని వసతులు కూడా ఉన్నై. అయితే ట్రయిన్ ఊరికి కాస్త దూరం. ట్రయిన్ సరిగ్గా రాత్రి సమయంలో ఆ ఊళ్ళో ఆగుతుంది. స్టేషన్ నుండి ఊళ్ళోకి వెళ్ళటానికి మధ్యరాత్రి సదుపాయం సరిగ్గా లేదు. ముందే రిసార్టు/లాడ్జి వాడితో మాట్లాడుకొని రవాణా మాట్లాడుకోవాలి.

బాదామి ఒక చిన్న పల్లెటూరు. ఊళ్ళో ఎక్కువగా బ్రాహ్మణ భోజనశాలలు. బాదామి - ఈ చిన్ని గ్రామం ఒకప్పుడు చాళుక్యుల రాజధాని. ఈ ఊరికే వాతాపి అని ఒకప్పటి పేరు. "వాతాపి గణపతిం భజే" అన్న వాతాపి గణపతి ఇక్కడి దేవుడే. అయితే పల్లవులు వీరిని జయించి ఆ గణపతి విగ్రహాన్ని పట్టుకుపోయారట.

అలాగే వాతాపి, ఇల్వలుల కథ కొంతమందికి తెలిసి ఉంటుంది. ఒకప్పుడు వాతాపి, ఇల్వలుడు అనే రాక్షసులు దారిన పోయే ఋషులను ఆతిథ్యానికి పిలిచేవారు. వాతాపి మేక రూపం ధరించేవాడు. ఆ మేకను చంపి ఇల్వలుడు మాంసం, ఆహూతులకు వడ్డించేవాడు. అందరూ తిన్న తర్వాత "వాతాపీ, వాతాపీ" అని పిలవగానే వాతాపి అతిథుల కడుపు చీల్చుకుని వచ్చేవాడు. ఆపై అన్నదమ్ములిద్దరూ ఆ ఋషులను తినేవారు. ఇలా ఉండగా ఓ మారు అగస్త్య మహర్షిపై ఇదే ప్రయోగాన్ని చేశారట. అగస్త్యమహర్షి కడుపు నిమురుకుంటూ "వాతాపి జీర్ణం, వాతాపి జీర్ణం" అన్నాడు. అలా వాతాపి జీర్ణమవడంతో, ఇల్వలుడు భయపడి అక్కడినుండి బిచాణా ఎత్తేసి పారిపోయాడు.

ఆ వాతాపి ఇల్వలులను ద్వారపాలకులుగా పెట్టిన దేవాలయం బాదామికి ఐదారు కి.మీ దగ్గరలో "మహాకూట" అన్న దేవాలయంలో ఉంది. బాదామి ఊరి మధ్యలో అందమైన ఒక చిన్నసరస్సు ఉంటుంది. ఆ సరస్సు "అగస్త్య తీర్థం". ఈ సరస్సుకు నీళ్ళు వర్షాకాలంలో పక్కన ఉన్న కొండలపై నుండి జలపాతంలా క్రిందకు దిగి వచ్చిచేరతాయి.


తొమ్మిదవ శతాబ్దంలో బాదామి - చాళుక్యుల నుంచి రాష్ట్రకూటుల పరమయ్యింది. వారు అక్కడ భూతనాథుని దేవాలయం కట్టించారు. ఆ తర్వాత కాలాన టిప్పు సుల్తాను కూడా ఆ కొండలపై ఒక కోట కట్టించాడు. ఆ కోట ఎంతో యెత్తున మనకు కనబడుతుంది కానీ అక్కడికి చేరుకోవటానికి సదుపాయం లేదు.

బాదామి - ఈ ఊరికి ఈ పేరు రావడానికి కారణం - చుట్టుపక్కల ఉన్న కొండలు అన్నీ "బాదామి" రంగులో ఉండటమని అంటారు. బాదామి - ఈ ఊళ్ళో ఒక్కొక్క రాయి ఒక్కొక్క కథ చెబుతుంది. ఒక్కొక్క శిల్పం ఒక్కొక్క కావ్యాన్ని, లేదా శాస్త్రాన్ని వినిపిస్తుంది. అగస్త్యతీర్థం వెంబడి గాలి ఆర్ద్రంగా ఆహ్వానిస్తుంది. గొల్లపిల్లవాళ్ళు గొర్రెలు కాసుకునే ఆ కొండల మధ్య నిలిచిన రాళ్ళపై నిలిచిన "కప్పె ఆరభటె శాసనం" - చాళుక్యుల ఆత్మస్థైర్యాన్ని, ధీరత్వాన్ని, హర్షవర్ధనుడంత మహారాజును జయించిన చాళుక్యరాజు రెండవపులకేశి వీరత్వాన్ని శిలాక్షరాలతో చెబుతుంది. తలలు లేని స్త్రీ శిల్పాల వెనుక మార్మికత విస్తుపోయేలా చేస్తుంది. శిరస్సు స్థానంలో తామరపువ్వు కలిగిన నగ్నస్త్రీమూర్తి - లజ్జాగౌరి విగ్రహం ఏ వేదకాలానికో చెందిన అదితి దేవినో సూచిస్తుంది.

అన్నీ కలగలిపి బాదామి - ఒక మరపురాని అనుభవం. బాదామి - ఒక భారతీయత. ఒకప్పటి భారతవర్షంలో ప్రముఖమైన నగరాలు ఏడు.

అయోధ్యామధురా మాయా కాశీ కాంచీ అవంతికా| 
పురీద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయికాః||

కాలం కలిసిరాలేదు కానీ, బాదామి బహుశా ఆ నగరాల సరసన చేరవలసింది. 

2.

బాదామి చుట్టుపక్కల అనేక చారిత్రక శకలాలు ఉన్నాయి ముఖ్యంగా చాళుక్యుల కాలం నాటి దేవాలయాలు. చరిత్ర మీద, దేవాలయాల నిర్మాణాల మీద, పాతకాలపు గ్రామ దేవతల మీద, శిల్పాల మీద, శాసనాల మీద ఆసక్తి ఉన్నవారికి ఈ ప్రదేశం చాలా నచ్చుతుంది. ఈ ఆసక్తులు లేకపోయినా కూడా ఇక్కడ ప్రశాంత వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది.

బదామి చుట్టుపక్క దేవాలయాలు కొన్ని.

౧. బాదామి గుహాలయాలు: ఇవి మొత్తం నాలుగు. మొదటి గుహలో ఈశ్వరుడు, రెండవగుహలో విష్ణువు, మూడవగుహ హనుమంతుడు, నాలుగవ గుహలో మహావీర జినుడు (బాహుబలి) విగ్రహాలను చెక్కారు. గర్భగుడిలో విగ్రహాలు లేవు. రెండవగుహలో ఒక ప్రముఖమైన శాసనం ఉంది.



బాదామిలో కొండపైన మూలవిగ్రహం లేని దేవాలయాలున్నాయి. ఇంకా చెరువు పక్కన రాష్ట్రకూటులు నిర్మించిన భూతనాథ దేవాలయాలు అద్భుతమైన నిర్మాణానికి తార్కాణంగా ఉన్నాయి. క్రిందన ఒక మసీదు, కాస్త దూరంగా యల్లమ్మ గుడి ఉన్నాయి. గుహాలయాలు దర్శించడానికి ఐదు రూపాయలు రుసుము. ఈ ఊళ్ళో కోతులు కొండముచ్చులు ఎక్కువ. కాబట్టి తినుబండారాలు తీసుకెళ్ళటం కాస్త ప్రమాదం.

చుట్టుపక్కల ఇంకా కొన్ని దేవాలయాలు.

౧. శాకంబరి (బనశంకరి) గుడి.ఇది బాదామి ఊరికి నాలుగు కి.మీ. దూరం.
౨. హొస, హళే మహాకూట. ఇక్కడకు ప్రత్యేకంగా ఆటోలో లేదా కారులో వెళ్ళాలి.
౩. పట్టదకల్లు (World heritage site). బాదామికి 20 కి.మీ దూరం. ఇక్కడ పది దేవాలయాలు ఒక కూటమిగా ఉనాయి. ఈ కూటమికి దూరంగా మరో రెండు దేవాలయాలు ఉన్నాయ
౪. పట్టదకల్లు చుట్టుపక్క పల్లెలలో చెదురుమదురు దేవాలయాలు. వీటికి మనమే వెళ్ళాలి. బస్సులు ఉండవు.
౫. ఐహోళె. (కాళిదాసు, భారవిల గురించి భారతదేశంలో మొదటి శాసనం ఇక్కడ ఉంది). ఇది పట్టదకల్లు నుండి పది పదిహేను కి.మీ దూరం.
౬. ఇంకా సిద్దనకొల్లె, సంగమేశ, ఇలాంటి దేవాలయాలు ఆ చుట్టుపక్కన ఉన్నవి.

పట్టదకల్లులో, బాదామిలో గైడు దొరకగలడు. (మేము గైడును మాట్లాడుకోలేదు)

దేవాలయం/దేవాయతనం.

ఈ రోజుల్లో దేవాలయం అంటే భక్తి, దేవుని వేడుకోవటం, షోడశోపచారాలు, పూజలు, పునస్కారాలు, కర్మ ఇటువంటి వాటికి దేవాలయాన్ని మూలంగా మనం భావిస్తున్నాము కానీ, భక్తి ఉద్యమానికి (10 వ శతాబ్దం) ముందు దేవాలయాలు, భావుకతకు, విద్యాలయాలకు, ధ్యానానికి నెలవులు.

కొన్ని ప్రాచీన దేవాలయాలలో ప్రాకారం, దేవాలయపు బయట శిల్పాలు, ముఖమంటపం, రంగ/సభా మంటపం, అంతరాళం దాటి గర్భగుడి, అక్కడ వెలుతురు తక్కువగా ఉన్న మూర్తి, ఆ మూర్తి ముందు వెలుగుతున్న దివ్వెను చూస్తే మనసులో అలజడి, బుర్రలో మెదిలే అనేక ఆలోచనలు చేత్తో తీసివేసినట్టు కలిగే ఓ అనుభూతిని మనం సూక్ష్మంగా గమనిస్తే తెలుసుకోవచ్చు. ఈ అనుభూతిని కల్పించటానికి దేవాలయాలలో కొన్ని భౌతిక కారణాలు ఉన్నవని నా అనుకోలు. ఈ కారణాలు (ఇవి నా ఊహలే తప్ప ప్రామాణికమైన రుజువులు కావు).

౧. దేవాలయ నిర్మాణ సౌష్టవం (Symmetry)
౨. Spaciousness (space కాదు, ఉన్న జాగాను ఎలా విశాలంగా తీర్చడం అన్నది spaceousness).
౩. వెలుతురు నియంత్రణ
౪. గాలి నియంత్రణ.
౫. విగ్రహం/మూర్తి యొక్క అవ్యక్త సౌందర్యం.

మొదటి రెండూ నిలువుకక్ష్య (Z axis) లో కూడా వర్తిస్తాయి. శృంగేరి చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయం అద్భుతమైన సౌష్టవానికి ఒక ఉదాహరణ. ఈ నిర్మాణం యొక్క Plan, Elevation (Top view, Front view) చూడగలిగితే ఇది తెలుస్తుంది.

ఉన్నంతలో జాగాను (Spaciousness ను) ఎక్కువచేయటానికి పిరమిడ్ వంటి స్థూపాకార నిర్మాణం అనువైనదని నాటినుండి నేటివరకు శాస్త్రవేత్తలు చెబుతున్నదే. బహుశా అందుకనే యేమో పాతకాలపు దేవాలయాలు మొదలుకుని ఇళ్ళు, గుడిసెలు కూడా  త్రిభుజాకార స్థూపం రూపంలో కట్టుకున్నారు కాబోలు.

గాలి నియంత్రణ కు అద్భుతమైన ఉదాహరణ శ్రీకాళహస్తి. ప్రధాన మూర్తి గర్భగుడిలో శివలింగానికి ఒక వైపు దీపం నిశ్చలంగా, మరొక వైపున దీపం తీవ్రంగా చలించటం ఉన్నది. ఇది వాయులింగమనే పేరు అందుకే వచ్చిందట.

ప్రాచీన భారతదేశంలో దేవాలయ నిర్మాణాలు స్థూలంగా రెండు విధాలు. మొదటిది ౧. ద్రవిడ విమాన పద్ధతి, ౨. రేఖానగర నిర్మాణం (North Indian).

పట్టదకల్లును దేవాలయాల నిర్మాణానికి ప్రయోగశాలగా వర్ణిస్తారు. బొమ్మలో కుడివైపున రేఖానగరనిర్మాణం. ఎడమన ద్రవిడ విమాన పద్ధతి.


గర్భగుడి, పైన హారం, పైన తలం, ఆపైన శిఖరం, శిఖరంపై కలశం. ఇది ద్రవిడవిమానం. శిఖరం గోళాకారంలో కానీ, చతురస్ర ఘనాకారంలో కానీ ఉండవచ్చునట. రేఖానగర నిర్మాణంలో శిఖరం పై నిర్మాణం మొత్తం ఒక సూచి వద్దకు తీసుకు వచ్చి, ఆ సూచిపై ఆమలకం (ఉసిరికాయ) రూపంలో ఒక ఆకారాన్ని నిక్షేపించటం గమనించదగినది. (పూరీ, భువనేశ్వర్ లలో ఉన్న దేవాలయాలన్నీ రేఖానగర నిర్మాణాలే)

సభామంటపంలో స్థంభాలు కూడా Equidistant లో సౌష్టవంగా అమర్చడం, వాటిపై అందమైన శిల్పనిర్మాణం కూడా గమనించవచ్చు. బయట కుడ్యాలను చూసి, అటుపై, నెమ్మదిగా సభామంటపం దాటి గర్భగుడి వైపుకు వెళుతున్న మార్గంలో Activity తక్కువగా అవుతూ, మనసును శూన్యం, శాంతివైపికు ప్రసరింపజేస్తున్నట్టుగా దేవాలయనిర్మాణాలు చేశారేమోనని అనిపిస్తుంది.

బాదామిలో ప్రధానమైనవి గుహాలయాలు.అదివరకే ఏర్పడిన గుహలలో స్థంభాలు ఏర్పరిచి, లేదా గుహలను ఒలిచి, వాటికి స్థంభాలు నిలిపిన కట్టడాలు యివి. ఇక్కడ దేవాలయనిర్మాణ క్రమ పద్ధతికి అవకాశం లేదు. దేవాలయానికి వచ్చిన ప్రేక్షకులను క్రమంగా శూన్యం వైపుకు తీసుకు వెళ్ళగలిగే plan కు ఆస్కారం లేదు. బహుశా అందుకేనేమో ఈ గుహాలయాల్లో గుహలకు ఇరుపక్కలా మూర్తులను చాలా విశాలంగా మిరుమిట్లు గొలిపేటట్లు చెక్కారు. ఆ అద్భుతం నుండి తేరుకుని ముందుకు సాగితే గర్భగుడి, గర్భగుడి మధ్యలో మూర్తి.

ఈ బాదామి గుహాలయ శిల్పాలలో అద్భుతమైన మార్మికత ప్రత్యేకం. ఈశ్వరుని ఈ శిల్పంలో శివతాండవంలోని 92 భంగిమలు/ముద్రలు నిక్షిప్తమై ఉన్నాయట. నాట్యశాస్త్రమూ, నృత్యం గురించి బాగా తెలిసిన ఆచార్యులు ఈ శిల్పం దగ్గర కూర్చుని వారి శిష్యులకు నృత్యనాట్యాలు నేర్పేవారేమో! రెండవ గుహలో దాదాపు ఎనిమిది అడుగుల ఎత్తు శ్రీహరి విగ్రహం కళ్ళను కాసేపు చూస్తే, ఆ విగ్రహం తిరిగి మనకళ్ళలో చూస్తున్నట్టు అనిపిస్తుంది. నాలుగవ గుహలో జిన విగ్రహం యొక్క చిరునవ్వు కూడా మతిపోగొట్టే అందంతో ఉంటుంది.

















3.

బనశంకరి (శాకంబరీదేవి)

బాదామి - ఊరికి కాస్త దూరంగా బనశంకరి దేవాలయం ఉంది. కాశీలో అన్నపూర్ణేశ్వరిలాగా, దక్షిణభారతంలో పంటలు, ఆహారప్రదాతగా శాకంబరీదేవిని గ్రామీణులు పూజించేవారు. ఈ తల్లి భూదేవి అవతారం. తన శరీరాన్నే భూమిగా మార్చి పంటలు పండించి, మనుషులకు, దేవతలకూ కూడా కడుపు నింపుతుందని గ్రామీణుల విశ్వాసం. క్షామం వచ్చినప్పుడు కూడా ఈ అమ్మవారికి పూజలు చేస్తారు. రేణుకాదేవి, యల్లమ్మ (ఎల్లరకూ అమ్మ - భూదేవి), శాకంబరి - ఇవన్నీ అమ్మవారి వివిధ రూపాలు.

ఈ దేవాలయంలో నిత్యసేవలు, పూజలు ఇప్పుటికీ కొనసాగుతున్నాయి.

ఆలయం ఎదురుగా చాలా పెద్ద కోనేరు ఒకటి ఉంది. ఇది చాళుక్యుల కాలం నాటిది. కోనేరు నాలుగువైపులా స్థంభాలతో విశాలమైన మంటపాలు నిర్మించారు. కోనేటికి ముఖద్వారం ప్రాచీననిర్మాణపద్ధతిలో ఉంది. ఈ దేవాలయానికి దగ్గరలో ఒక కోటముఖద్వారం ఉన్నది. బహుశా ఇది బాదామి నగరద్వారమేమో. దేవాలయం పక్కన కూడా ఒక పాతకాలపు రంగమంటపం ఉన్నది.



కోనేరు దగ్గర ముచ్చటైన రైతుదంపతులు పళ్ళెంలో మల్లెపూలమాల, మందారపూలు, అరటిపళ్ళు తీసుకొచ్చి నీళ్ళలో వదలడం సామాన్యంగా కనిపించే దృశ్యం.

శాకంబరీదేవి దేవాలయం ముఖద్వారానికి ఇరువైపులా ముచ్చటగా, విచిత్రాకృతిలో రాతి దీపస్థంభాలు ఉన్నాయి. ఈ దీపస్థంభాల ఆకారం మొక్కజొన్న/ధాన్యపు గింజ ఆకారంలో ఉండటం గమనించవచ్చు. ఈ విధమైన దీపస్థంభాలు దక్షిణభారతీయ శిల్పకళలో కనిపించవు. ఇటువంటి రాతి దీపస్థంభాలను మహారాష్ట్ర ప్రాచీన దేవాలయాల్లో మనం కనుగొనవచ్చు.

శాకంబరీదేవి దేవాలయం బయట చిన్న చిన్న ముంతల్లో ఏవో తిండిపదార్థాలు అమ్ముతున్నారు. అమోఘమైన రుచి!

4.

ముందు రోజు మధ్యరాత్రి హోటల్లో దిగిన మిత్రబృందం అలసి నిద్రపోతున్నారు. అయితే ఊరు మేల్కొంది. అది ఆదివారం. ఉదయం ఐదున్నరగంటలు. నేను కాలకృత్యాలు తీర్చుకొని బయటకు వచ్చి, ఓ చక్కటి టీ సేవించాను. పల్లె నిదురలేచింది.  చిన్న చిన్న వీథులు. చిన్న చిన్న ఇళ్ళు, ఒక చోట గృహిణులు వీథికొళాయిలో నీళ్ళు పట్టుకుంటున్నారు. ఒక బుడతడు నిక్కరు వేసుకోకుండా అమ్మ వెనుక తప్పటడుగులు వేస్తూ, తనూ ఓ చెంబులో నీళ్ళు మోస్తూ నడుస్తున్నాడు. ఓ ముసలాయన గొంతుక్కూర్చుని "కన్నడప్రభ" పేపరు చదువుకుంటున్నాడు. ఒక తల్లి ఎవరో ఇంటి ముందు కళ్ళాపి జల్లి ముగ్గు వేస్తూంది. అలా వెళుతుంటే దూరంగా ఒక చిన్న గేటు  గేటు ముందు కళ్ళాపి చల్లి ఉంది. అందమైన ముగ్గు కూడా. ఆ ద్వారం లోంచి వెళితే కొండపైకి మెట్లు.  ఆ కొండపైన ఓ చిన్న దేవాలయం. అందమైన శిల్పాలు. బహుశా జైన దేవాలయమేమో. తెలిమంచులో పవిత్రంగా.....




ధ్యానం - అంటే పనిగట్టుకుని కళ్ళుమూసుకోవడం కాదు. తనంతట తానే ఆహ్వానం లేకుండా మనస్సును కమ్ముకునే ఒక నిశ్శబ్దపరిమళం. దీనిని అనుభూతించగలం కానీ, నిర్వచించలేం. ఆ ధ్యానం అనేదేమిటో బాదామిలో ఉన్న అనేక ప్రాచీన దేవాలయ ప్రాంగణాలలో ఏ ఒక్కచోటైనా ఓ అరగంట గడిపితే ఎవరికైనా తెలుస్తుందని నా బలమైన విశ్వాసం.

5.

బాదామి గురించి వెతకగానే జాలంలో కనిపించే ప్రధాన దేవాలయాలు భూతనాథ దేవాలయాలు. బాదామిని చాళుక్యుల తర్వాత రాష్ట్రకూటులు పరిపాలించారు. వారు కట్టించిన అందమైన దేవాలయాలివి. అగస్త్య తీర్థం గట్టుపైన ఉన్నాయివి.



ఆ దేవాలయం వెనుక వైపు దారి ఉంది. అక్కడ చిన్న చిన్న గుహలలోపల విగ్రహాలు చెక్కారు. ఆ గుడి ప్రాంగణంలో, ప్రధానమందిరానికి వెనుక ఉన్న మందిరం గర్భగుడిలో, నగ్న స్త్రీమూర్తి తాలూకు మార్మిక విగ్రహం కనిపిస్తుంది.



భూతనాథుని రెండవ దేవాలయం బాదామి మ్యూజియమ్ కు దగ్గరగా ఉంది. ఆ దేవాలయం శిల్పప్రాభవానికి, అందమైన పైకప్పుకూ నిదర్శనం. ఈ గుడిలో కొన్ని శిల్పాలు విరగగొట్టి పడవేశారు.చూస్తే, కాస్త కలుక్కుమంటుంది.





బాదామిలో తప్పక చూడదగించి మ్యూజియమ్. చిన్నదే అయినా చాలా చక్కగా ఉంది. ప్రవేశరుసుము ఐదు రూపాయలు. మ్యూజియమ్ పక్కగా కొండపైకి మెట్లదారి ఉంది. అది ఎక్కడం కూడా మర్చిపోరాదు.

బాదామి గుహాలయాలకు బయట ఒక మసీదు ఉంది. మా మిత్రబృందం గుహాలయాలు అన్నిటిని చూసి దిగిన తర్వాత, దూరంగా కనిపించే భూతనాథుని గుడికి వెళ్ళాలనుకున్నాము. కనిపిస్తున్న సరస్సు చుట్టూ నడుచుకుంటూ వెళదామని తీర్మానించుకుని కిందకు దిగాము. క్రింద ఒక పురాతన మసీదు ఉంది. ఆ మసీదు ఎదురుగా కోటగోడ వారన ఒక రాతిమార్గం ఉంటే అందులోకి వెళ్ళాము. ఆ దారి చెరువు దగ్గరికి దారి తీసింది. ఒక కన్నడ స్థానికుడు పలుకరించేడు. ముందు దారి ఉందా? అని అడిగితే అతను "ఆది మానవ" అన్నాడు. అతడన్నది మాకు అర్థం కాలేదు. ఆ ముందు దారి లేదని మేమే నిర్ధారించుకున్నాము.


చాలా సేపు తర్వాత అంటే నడిచి నడిచి భూతనాథ దేవాలయం చేరిన తర్వాత ఎదురుగా చెరువుకావల చూస్తే కొన్ని శిల్పాలు కనిపించినాయి. అక్కడ తుప్పలు, ముళ్ళపొదల మధ్య ఒక చిన్న Folk village లాంటిది ఉన్నది. అక్కడ ఆదిమమానవుల జీవనవిధానాలను బొమ్మలుగా కూర్చి పెట్టారు. అయితే వెళ్ళటానికి మార్గం మాత్రం లేదు. అంటే ఆ రూట్ లో అంతా ముళ్ళపొదలు పెరిగి దారి మూసుకుపోయింది. ఆ పల్లెయువకుడు ’ఆదిమానవ’ అని చెప్పింది దానిగురించేనని అర్థమయింది.బహుశా అక్కడ నుండి గుహాలయాలపైకి అంటే టిప్పు సుల్తాను కోటకు కూడా దారి ఉండవచ్చు.

బాదామి లో అగస్త్యతీర్థానికి ఒడ్డున ఓ ముచ్చటైన మ్యూజియం ఉంది.మ్యూజియం దాటిన తర్వాత ఎడమకు ఓ తొవ కొండపైకి దారితీస్తోంది. ఆ మార్గంలో ఓ కొండరాయిపైన "కప్పె ఆరభట్టీయ" శాసనాన్ని  చాళుక్యరాజులు  కన్నడ, సంస్కృతాలలో, నాటి కన్నడలిపిలో చెక్కించారు. ఈ లంకెలో ఆ శాసనం గురించి చదువుకోవచ్చు.

ఆ శాసనం చూసిన తర్వాత అదే దారిన ముందుకు వెళితే కొండపైకి దారితీసింది. అక్కడ అనే ఒక కుర్రాడు మేకలను కాసుకుంటున్నాడు. వాడి పేరు "రవి". ఎనిమిదవ తరగతి అట. వాడు మాకు కొండపైకి ఒక ఇరుకు దారి చూపించి తనూ దారితీశాడు. మేము ఆపసోపాలు పడుతూ ఎక్కేం. వాడు మాత్రం చలాకీగా పైకెక్కేశాడు. అదో అద్భుతం. కనుచూపు మేరా ఆకాశం,అందమైన పైరుపచ్చ. అక్కడక్కడా వర్షపు నీటి చెలమలు. అద్భుతమైన నిశ్శబ్దపరిమళం. నేలంతటా పరుచుకున్న గడ్డి, చిన్న చిన్న పూలు.

అక్కడ ఆ అబ్బాయి ఒక మధ్వుల ఆంజనేయస్వామి దేవాలయాన్ని (ఇది ఈ కాలం నాటిది) చూపించాడు.

ఆ చిన్న దారిలో అలాగే పైకెక్కితే, మూలవిగ్రహం లేని ఓ పాతకాలపు దేవాలయం (ఇది లజ్జాగౌరి గుడి అని తర్వాత తెలిసింది), రెండు బురుజులూ, మరో చిన్న దేవళం కనిపించింది. అది ఆ కొండలకన్నింటా ఎత్తైన point. ఆ దారి మళ్ళీ వచ్చి కొండ క్రింద ఒక మ్యూజియం వద్దకు దారితీసింది. తలవని తలంపుగా కనిపించిన ఆ గైడు మాకు ఆ రోజు అద్భుతమైన అనుభూతిని మిగిల్చేడు.









6.

పట్టదకల్లు.

"ಎಲ್ಲಿಗೆ ರೀ? ದೇವಸ್ಥಾನಗಳು ನೋಡಕ್ಕೇ ಬಂದಿದ್ದಿರಾ?"
"ಹವುದು ರೀ".

ఓ పెద్దావిడ బస్సులో మాటలు కలిపింది. చాలా ఆకర్షణీయమైన ముఖం. పావలా కాసంత నుదుటి బొట్టు. బాగల్ కోట అందమైన కన్నడయాస. అక్కడ పల్లెల్లో పేదరికం తాండవిస్తూంది. అయినా జీవితం తీరుబడిగా సాగిపోతుందని చెప్పుకొచ్చింది ఆవిడ. అదే పదివేలు!

ఇలా ఎక్కడో బస్సులో తారసపడే సామాన్యులు, నిర్మానుష్యంగా ఉన్న చోట పొలాల్లో కలిసి చల్ది/ముద్ద పంచుకుంటున్న రైతులను చూస్తే, పిడికిలి లోంచి ఇసుకలా జారిపోయే నగరజీవితం తాలూకు వికృతి కనిపిస్తుంది. సెల్ఫోన్లు, టీవీలూ, 4G లు, ఆధునికమైన అన్ని సదుపాయాలు అన్నీ ఉన్నాయి. లేనిది జీవితం ఒక్కటే. పిజ్జాలున్నా ఆకలి లేని జీవితాలివి! 

బస్సు గతుకు దారుల్లో పల్లెపట్టుల్లో ప్రయాణిస్తూ ఓ చిన్ని పల్లెటూరికి వచ్చింది. దిగి, కాస్త ముందుకు వెళ్ళి ఓ దేవాలయప్రాంగణం లోకి అడుగుపెట్టాము. అంతే! ఇదేనా పట్టదకల్లు? సరిగ్గా యే యేడవశతాబ్దం తాలూకు చాళుక్యుల కాలానికో అడుగుపెట్టినట్టుంది. ఈ మాట అక్షరాలా పొల్లు కానే కాదు. బెట్!


బాదామికి 20 కి. మీ దూరంలో మలప్రభ నది ఒడ్డున ఉన్న ఒక దేవాలయ సముదాయం, World heritage site పట్టదకల్లు. ఈ ప్రాంగణంలో పది దేవాలయాలు ఉన్నాయి. ఇవి విభిన్నకాలాలలో కట్టించినవి. విభిన్న శైలులలో నిర్మించినవి. దాదాపు అన్నీ ఈశ్వరుని దేవాలయాలే. చాళుక్యుల కాలం క్రీ.శ ఆరవశతాబ్దం మొదలుకుని తొమ్మిదవ శతాబ్దం వరకూ సాగింది. మధ్యలో కొంతకాలం పల్లవులు బాదామిని జయించి రాజ్యం చేశారు. ఆపై చాళుక్యరాజు రెండవ విక్రమాదిత్యవర్మ పల్లవులను ఓడించి తిరిగి బాదామిలో చాళుక్యుల రాజ్యాన్ని నెలకొల్పాడు. ఆ విజయస్థంభం, ఆనాటి విజయానికి చిహ్నం విరూపాక్షదేవాలయం దగ్గర ఉంది. అంతే కాదు, విక్రమాదిత్యవర్మ భార్యలయిన లోకమహాదేవి, త్రైలోక్యమహాదేవి పేరిట విరూపాక్ష, మల్లికార్జున దేవాలయాలు నిర్మించినట్టు ఆ విజయ స్థంభంపై శాసనం చెబుతుంది.



ఆ ప్రాంగణంలో సంగమేశ్వరుడు, గలగనాథుడు, కాడసిద్దేశ్వరుడు, మల్లికార్జునుడు, విరూపాక్షుడు, పాపనాథుడు ఇలా రకరకాల దేవాలయాలు. ఒక్క జిన దేవాలయం కూడా ఉంది. (జినదేవాలయాల్లో స్థంభాలపై శిల్పాలు ఉండవు. అంతే కాక బయట కూడా శిల్పప్రాభవం ఉండదు. అది కాక ముఖమంటపం, గర్భగుడి వగైరాలు దాదాపు హిందూ దేవాలయాల లానే ఉంటాయి.)

ఈ పట్టదకల్లు చాళుక్యుల కాలానికి ఎంతో ముందే ప్రసిద్ధిపొందిన పట్టణం. క్రీ.శ. రెండవ శతాబ్దంలో ప్టాలెమీ అనే గ్రీకు వాఁడు భౌగోళిక శాస్త్రం వ్రాశాడట. వాడి పుస్తకంలో పట్టదకల్లు గురించిన ప్రస్తావన ఉందట. ఈ మధ్య అంటే 2005 లో పాత రాతియుగం నాటి పనిముట్లు, క్రీ.పూ 300 నాటి వస్తువులూ అక్కడ బయటపడ్డాయి. దగ్గరలో ఉన్న బి. ఎన్. జాలిహాల్ అన్న కుగ్రామంలో నాటి ఇల్లొకటి, రెండవ విక్రమాదిత్యుని మరణానికి సంబంధించిన చిహ్నమూ, తాంత్రిక దేవత ఆలయమూ కూడా కనిపించాయట. ప్రాచీన కాలంలో ఏ రాజ్యంలో అయినా మహారాజుకు పట్టాభిషేకం చేయబోయే తరుణంలో ఈ స్థలానికి వచ్చి అర్చనలు చేసి తర్వాత తమ రాజ్యానికి వెళ్ళి వేడుకలు చేసుకొనే వారట. అందుకనే పట్టద-కల్లు అన్న పేరు.

ఇక్కడి దేవాలయప్రాంగణంలో ఒక్క విరూపాక్షస్వామి ఆలయంలో మాత్రం నిత్యపూజలు ఈ నాటికీ జరుగుతున్నాయి. మిగిలినవన్నీ చారిత్రక అవశేషాలుగా ఉన్నాయి. ఓ విచిత్రమైన విషయం ఏమంటే - హంపిలోనూ, పట్టదకల్లు లోనూ కేవలం విరూపాక్షుని దేవాలయాలు మాత్రమే ముష్కరుల దాడికి గురి కాలేదు. మిగిలిన దేవాలయాలు దాడికి గురికావడమో, కాలప్రభావానికి లోనై శిథిలం కావడమో జరిగాయి. 

ఈ విరూపాక్షస్వామి ఆలయం ముందు నందిమంటపం, జీవం తొణికిసలాడే నందివిగ్రహం, ముఖమంటపం, (Portico) పైకప్పులో అద్భుతమైన సూర్యవిగ్రహం, ద్వారానికి రెండువైపులా దంపతి విగ్రహాలు, లోపల సభామంటపంలో స్థంభాలపై దంపతి విగ్రహాలు, అంతరాళం, ప్రదక్షిణమార్గం, గర్భగుడి విరూపాక్షస్వామి లింగం, పక్కన మహిషాసురమర్దని ఆలయం ఉన్నాయి.

దేవాలయం ద్రవిడవిమాన శైలి. దేవాలయం బయట అనేక శిల్పాలు చెక్కారు. కన్నడ రాజ్యరస్తసారిగె (KSRTC) చిహ్నమైన గండభేరుండం ఈ గుడి పైని శిల్పం నుండే స్వీకరించారు. దానిపక్కన మయూరాల జంట కూడా ఆసక్తికరమైనది. గైడు చెప్పిన కథ ఇది. (మేము గైడును మాట్లాడుకోలేదు కానీ ఇంకొకరి గైడు చెప్పిన దాన్ని విన్నాము)

మగనెమలి వర్షాకాలంలో పురివిప్పి నాట్యం చేసి, ఆడునెమలిని ఆకర్షిస్తుందట. ఆపై మగనెమలి గ్లానితో, అలసటతో ఒక కన్నీటి చుక్కను విడిస్తే, ఆ చుక్కను ఆడునెమలి మింగి, గుడ్డు పెడుతుందట. ఇదంతా ఓ శిల్పంలో పొదిగి, symmetrical గా మలచాడు నాటి శిల్పి. బొమ్మలో ఎడమవైపున ఉన్నది మగనెమలి. దాని శిఖి చాలా హొయలొలుకుతూ ఉంది కాబట్టి.



భారతదేశంలో శిల్పకళకు పరాకాష్ట అనదగినవి - హొయసళుల బేలూరు, హళేబీడు దేవాలయాలు. శిల్పాలలో జీవచైతన్యం, space management, సౌందర్యం, సౌష్టవం, perfection, శిల్పాలపైని అలంకరణా, దుస్తులూ, నాటి కాలపు సామాజిక పరిస్థితుల చిత్రణా ఇలాంటి అనేక విషయాలలో హొయసళ శిల్పం pinnacle అనవచ్చునేమో.

పట్టదకల్లు శిల్పాలు హొయసళుల కాలానికంటే చాలా పూర్వపు కాలానివి. ఇక్కడ శిల్పాలలో perfection, అలంకరణా, హొయసళుల శిల్పం స్థాయికి లేకపోవచ్చు. బహుశా ఈ శిల్పాలు Sandstone లో చెక్కడం కూడా ఒక కారణం కావచ్చు. గ్రానైటు రాయి - పదునైన రాయి కావడం మూలాన ఎక్కువ కాలం మన్నగలదు. ఇసుకరాయికి వర్షానికి, వాతావరణ మార్పులకూ త్వరగా లోనవడం మూలాన అరుగుదల యెక్కువ. బహుశా అందుకనే కాబోలు ప్రాచీన దేవాలయాలలో మూలవిగ్రహాలు తప్పనిసరిగా నల్ల గ్రానైట్ రాయితో చెక్కడం మనం గమనించవచ్చు.

పట్టదకల్లు దేవాలయాలను శిల్పశాస్త్రప్రయోగాలుగా పేర్కొంటారు. ఒక్కొక్క గుడి ఒక్కొక్క విధంగా కనిపిస్తూ ఆ విషయం నిజమేననిపిస్తుంది. నందివిగ్రహం మాత్రం నల్లని రాయిలో అత్యద్భుతంగా చెక్కారు. నందిమంటపమూ అపూర్వంగా ఉంది. ఆ మంటపంలో పాతకాలపు కన్నడలో ఏదో రాసుంది.

పైన ఓ చోట చెప్పుకున్నట్టు - మందిరంలోపల వెలుతురు కూడా ఆధ్యాత్మికతకు ఒక కారణం. దీనికి ఋజువు  విరూపాక్షస్వామి దేవాలయంలోని మహిషాసురమర్దిని మందిరంలో స్పష్టంగా కనిపిస్తుంది.     

ముఖమంటపై ఎడమవైపు రాచదంపతులు, కుడివైపు గ్రామీణ దంపతులు ఆసక్తికరమైన అంశం. పక్కన కన్నడ శాసనం ఒకటి కనిపిస్తుంది. ద్వారబంధానికి ఇరువైపులా దంపతులు, అప్సరలు, పూలతీవెలూ లేదా ద్వారపాలకులూ చెక్కడం అనవాయితీ అట. అనంతపురం లేపాక్షిలో అప్సరలూ వారి తలపై వలయంగా తీవెలూ చెక్కారు. ఇది విజయనగరశైలి. ఇదే శైలి విజయనగర కాలం నాటి ఇతర దేవాలయాలలో (తాడిపత్రి, హంపి, యాగంటి వగైరా) కనిపిస్తుంది.



9 వ శతాబ్దపు నోలంబ రాజుల శిల్ప శైలి విభిన్నమైనది. వీరి రాజధాని హైమావతి. (అనంతపురం జిల్లా, అమరాపురం తాలూకా). ఈ నోలంబుల శిల్పకళలో ముఖద్వారాన దంపతులు కనిపిస్తారు కానీ, పరిమాణం దృష్ట్యా చాళుక్యుల శిల్పాల కంటే వీరి శిల్పాలు చిన్నవి.

విరూపాక్షస్వామి ద్వారపు పైకప్పు మీద సూర్యవిగ్రహం అద్భుతమైన space management కు నిదర్శనం. సూర్యభగవానుడు, ఆయన భార్యలయిన ఉష, సంధ్యలు బాణాలెక్కుపెట్టి తిమిరాలను పోగొడుతున్నట్టు, సారథి అరుణుడు, గుర్రాలు, సూర్యభగవానునికి స్వాగతం చెబుతున్న ప్రజలూ, స్వర్గలోకవాసులూ....ఇదంతా ఒక్క చోట స్వారస్యం చెడకుండా, సౌష్టవంగా, అందంగా చెక్కాడు శిల్పి.



ఈ ప్రాంగణం పక్కన ఘటప్రభ నది ప్రవహిస్తుంది.మేము వెళ్ళిన సమయాన నది ఎండిపోయి ఉంది. ఆ నది గర్భంలో ఆదిమమానవుల పనిముట్లు దొరికాయట.ప్రాంగణానికి దూరంగా, నదీతీరానికి ఆవల మరొక శిథిల దేవాలయం ఉంది. అక్కడికి చేరుకోవటం కాస్త కష్టం.

పట్టదకల్లు దేవాలయాల ప్రాంగణం నుంచి బయటపడ్డం ఓ పట్టాన సాధ్యపడదు. కష్టం పైన వదిలి రావాలి.

******

5 కామెంట్‌లు:

  1. చాలా బాగుంది కంటి ముందు దృశ్యం అవిష్కరించారు

    రిప్లయితొలగించండి
  2. అద్భుతంగా వివరించారు! సేవ్ చేసి పెట్టుకున్నాను!

    రిప్లయితొలగించండి
  3. Beautiful. ఎన్నో విశేషాలను చారిత్రక రిఫరెన్సులతో, సాహిత్యంలో రిఫరెన్సులతో సహా చాలా సాధికారంగా వ్రాసిన వ్యాసం 👏.
    నేను హంపీని చూసింది 30 ఏళ్ళ క్రితం. విశేషాలు అంత వివరంగా గుర్తు లేవు. ఆఫీసు పని మీద గంగావతి వెళ్ళాల్సివస్తే, మధ్యలో ఆదివారం నాడు బస్సులో గంగావతి నుండి ఆనెగొంది వెళ్ళి, అక్కడ (కన్నడిగులకే స్వంతమైన 🙂) పుట్టిలో తుంగభద్రా నదిని దాటి, విజయవిట్టల ప్రాంతాల వైపు దిగి, అక్కడ నుండి నడుచుకుంటూ విశేషాలను చూస్తూ విరూపాక్ష దేవాలయం వైపుకు వచ్చి, ఆ చుట్టు ప్రక్కల చూడగలిగిన్నన్ని చూసి, ఇంక చీకటి పడేట్లుందని హొసపేటకు జేరుకుని గంగావతి బస్సెక్కాను. మీ వర్ణన ప్రకారం చూస్తే ఇప్పుడు హంపీలో కొన్ని సౌకర్యాలు ఏర్పడినట్లు అనిపిస్తోంది.

    తుంగభద్రలో స్నానం చేశానని వ్రాశారు మీరు. చాలా సాహసం చేశారనే అనాలి. అక్కడి తుంగభద్రలో మొసళ్ళు ఎక్కువనీ, నీళ్ళల్లోకి దిగవద్దనీ హెచ్చరిక బోర్డు లు చూసినట్లు 30 ఏళ్ళనాటి నా జ్ఞాపకం మరి 🤔?

    మొత్తం మీద చాలా ఉపయోగకరమైన వ్యాసం ఇది 👌.

    రిప్లయితొలగించండి

  4. బ్లాగాడిస్తా అంటే ఇదే కదా !


    అరుదైన ఆణిముత్యం!

    అత్యద్భుతః


    జిలేబి

    రిప్లయితొలగించండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.