25, జులై 2014, శుక్రవారం

వీచిక - 3



సంచారిణీ దీపశిఖేవ రాత్రౌ యం యం వ్యతీయాయ పతింవరా సా |
నరేన్ద్ర మార్గాట్ట ఇవ ప్రపేదే వివర్ణభావం స స భూమిపాలః ||

కాళిదాసు రఘువంశం ఆరవసర్గలో ప్రసిద్ధికెక్కిన శ్లోకం ఇది. స్వయంవరంలో దీపశిఖ లాంటి అమ్మాయి - క్రింది బొమ్మలో కేవలం వెలుగు ఉన్న దీపం తాలూకు ఆకారం - ఎదరకు వస్తుంటే రాకుమారుల ముఖాలు ఆ వెలుగులో కాంతివంతమవడం, అమ్మాయి రాకుమారుని వరించకుండా దాటిపోగానే రాకుమారుని ముఖం చీకటిలో కలిసిపోవడమూ (చిన్నబుచ్చుకోవడం) ఎలా ఉందో అలా ఉంది రాకుమారి ఇందుమతి నడక అక్కడ.

ఈ శ్లోకం నుండీ కాళిదాసుకు దీపశిఖాకాళిదాసు అన్న పేరు వచ్చిందని ఐతిహ్యం. చక్కని శ్లోకం చెబితే ఆ శ్లోకాన్ని కవికి బిరుదుగా తగిలించడం సంస్కృతంలో సకృత్తుగా కనబడుతుంది. దీపశిఖాకాళిదాసు, ఘంటామాఘుడు, ఆతపత్రభారవి, రత్నఖేటదీక్షితులు, వక్షఃస్థలాచార్యులు....ఇలా.  తెలుగులో మాత్రం - ఆలోచిస్తే - ఒక్క ముక్కుతిమ్మన మాత్రం కనబడుతున్నాడు, ముక్కు గురించిన పద్యం ఆయనది కాకపోయినా.నిజానికి ఆ ముక్కు పద్యం కూడా సంస్కృతం నుండీ దిగుమతి అయినది.

ఇందుమతి - చంద్రుని వంటి దీపశిఖ - సూర్యవంశజుడైన అజుడిని వరించింది. అజుడు - న జాయతే ఇతి అజః - జన్మ లేని వాడు అని వ్యుత్పత్తి. బ్రహ్మదేవునికి గల పేరు అది. అలాగే సంస్కృతంలో మేకకు కూడా అజః అని పేరు. (ఎందుకో తెలియదు).

************************

సంస్కృతాధ్యయనంలో ఒక పద్ధతి ఉంది. ముందుగా బాలరామాయణం, అమరం, శబ్దాలు, ఇలా ఆరంభించి రఘువంశం మొదటి సర్గ, కుమారసంభవం ఆపై కిరాతార్జునీయం ఇంకా కాస్త ముందుకు వెళితే నైషధం ...ఈ వరసలో వెళుతుంది. అయితే ఈ అధ్యయనంలో రఘువంశంలో అన్ని సర్గలూ చదవరు విద్యార్థులు. మూడు లేదా నాలుగు సర్గలను, అన్వయసహితంగా సాధిస్తూ వెళ్ళడం పద్ధతి.

సంస్కృతంలో అభినివేశం వచ్చిన తర్వాత ఎవరి రుచి మేరకు వారు మాఘమో, రఘువంశంలో మిగిలిన సర్గలో, ఇతర కావ్యాలో వ్యాఖ్యానసహితంగా చదువుకుంటారు.

ఈ పద్ధతిని శ్రీపాద వారు తమ జీవిత చరిత్ర - అనుభవాలు జ్ఞాపకాలులో చక్కగా వివరిస్తారు. అలా వివరిస్తూ రఘువంశంలో అష్టమసర్గ అజవిలాపం గురించి ప్రస్తావించారొకచోట.

************************

ఆ అష్టమ సర్గలోని ఉదంతం ఇదీ -

అజుడు, ఇందుమతీ దేవి దంపతులకు దశరథుడు అనే కొడుకు పుట్టాడు. (దశపూర్వరథుడని కాళిదాసు ప్రయోగం). ఆ తర్వాత ఒకనాడు అజుడు, ఇందుమతీదేవీ కలిసి ఉద్యానవనంలో విహరిస్తున్నారు. అదే సమయంలో నారదుడు గోకర్ణక్షేత్రంలో ఈశ్వరునికై వీణోపాసన చేయడానికి ఆకాశమార్గాన వెళుతున్నాడు. నారదుని వీణ చివరన అలంకరించి ఉన్న దేవలోకానికి చెందిన కుసుమాలతో అల్లిన మాలిక - గాలి ఉద్ధృతం వల్ల ఎగిరి నేలపై వచ్చి సరిగ్గా ఇందుమతీ దేవి స్తనములపై పడింది.

ఆ అదటుకు ఉలిక్కిపడి ఆమె కనులు నిమీలించి గతప్రాణయై నేలపై పడింది! రాహువు చంద్రుని యొక్క వెన్నెలను అపహరించినట్టు (గ్రహణ సమయంలో మెలమెల్లగా వెన్నెల తగ్గిపోయినట్టు) ఆమె కనులు అలా నిమీలితం గావించింది.

ఆమె శరీరం క్రిందకు పడుతున్న విధాన్ని కాళిదాసు వర్ణిస్తాడు -

వపుషా కరణోజ్ఝితేన సాి నిపతంతీ పతిమప్యపాతయత్ |
నను తైలనిషేకబిందునా సహ తైలార్చిరుపైతి మేదినీమ్ ||

ఇంద్రియవివర్జితమైన శరీరముతో ఆమె నేలపై పడుతూ అజుని కూడా పడవేసింది. దీపజ్వాల నేలపై జారేప్పుడు తైలబిందువుతో సహా జారుతుంది కదా!

మొదట స్వయంవరంలో ఇందుమతిని దీపశిఖగా వర్ణించిన కాళిదాసు విగతజీవి అయిన ఇందుమతీదేవినీ దీపార్చిగా వర్ణిస్తున్నాడు. అజుని తైలబిందువుగా ఉద్యోతించాడు. అంటే ఏ తైలబిందువు చేత అయితే దీపజ్వాల వెలుగులీనిందో, అదే తైలబిందువులో చివరికి ఆమె లీనం అయిపోయిందన్న మాట! కాళిదాసుకు మాత్రమే సాధ్యమైన ఒక అద్భుతమైన భావం ఇది.

దీపం అలా వెళ్ళిపోయింది. తైలం మాత్రం మిగిలిపోయింది శుష్కంగా. అజుని విలాపం కరుణరసార్ద్రంగా ఉంటుంది ఈ ఘట్టంలో. కరుణ, విప్రలంభశృంగారం పరస్పరం పోషకరసాలయినా, ఆ రెండు రసాలనూ పరస్పరం దోహదకారులుగా ఎంత చక్కగా మలచవచ్చుననడానికి ఈ ఘట్టం చక్కని చిక్కని ఉదాహరణ.

అజుని దుఃఖం నుండీ మరల్చడానికి కులగురువు వశిష్టుడు ఇందుమతి వృత్తాంతం తెలుపుతాడు.

పూర్వం తృణబిందువు అనే మహర్షి తపస్సు చేస్తుంటే ఇంద్రునికి యథావిధిగా భయంపుట్టి హరిణి అనే అప్సరను పంపుతాడు. ఆమె తన విలాసాలతో మహర్షి మనసును మరల్చడానికి ప్రయత్నించింది. మహర్షి కోపంతో భూమిపై జన్మించమని ఆమెను శపించాడు. అటుపై ఆ అప్సర - తను కేవలం ఇంద్రుని ఆజ్ఞను నెరవేర్చడానికి అలా చేశానని చెప్పుకుంటే కరుణించి ఆ మహర్షి శాపవిమోచనం అనుగ్రహించాడు. ఏ రోజైతే దేవలోకానికి చెందిన పుష్పమాల ఆమెపై పడుతుందో ఆ రోజు ఆమె భూమిని వీడి అచ్చరగా దేవలోకానికి మరలిపోతుంది.

అలా శాపగ్రస్త అయిన హరిణి భూమిపై విదర్భరాకుమారిగా పుట్టి అజునికి భార్య అయింది. శాపం తొలగి స్వర్గానికి వెళ్ళింది.

అజుడు కూడా తనయుడు దశరథుడు యుక్తవయస్కుడు అవగానే ఆతనికి పట్టాభిషేకం చేసి ప్రాయోపవేశం ద్వారా తనువును చాలించి స్వర్గాన్ని, స్వర్గవాసి అయిన హరిణినీ చేరుకున్నాడు.

************************

అజవిలాపం అన్న ఈ ఘట్టం విక్రమోర్వశీయంలోని నాల్గవ అంకాన్ని పోలి ఉంటుంది. అయితే ఇక్కడ, కరుణ విప్రలంభమూ కలిసి ఉండడం ప్రత్యేకం. విప్రలంభం ఎందుకంటే - చివర్న అజుడూ స్వర్గ వాసి గా హరిణిని తిరిగి చేరుకున్నాడు కాబట్టి. ఈ ఘట్టం - వ్యాఖ్యాన సహితంగా, శాస్త్రార్థ విశేషాలతో, ఆలంకారిక విశేషాల వివరణతో, కావ్యానుశీలన ద్వారా సంపాదించుకున్న చిక్కటి సహృదయత తోనూ తెలుసుకోవలసిన ఘట్టం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.