8, జనవరి 2014, బుధవారం

సంస్కృతసౌరభాలు - 12


అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజః |
పూర్వాపరౌ వారినిధీ విగాహ్య స్థిత పృథివ్యా ఇవ మానదండః ||

ఉత్తరదిశలో హిమాలయం అనే కొండలఱేడు దేవతలకు ఆత్మ వలే ఉన్నాడు. ఇటు తూరుపు సముద్రం మొదలుకుని అటు పడమటి సముద్రం వరకున్నూ ఆ హిమాలయం చొచ్చుకుని నేలకు కొలమానం (స్కేలు) లా ఉన్నాడు.

- ఆగండాగండి. ఈ వారం ప్రస్తుతాంశం కుమారసంభవం కాదు. శ్రవణసుభగత్వం అనే అంశం పై కాసిన్ని సరదా కబుర్లు ఈ వారం.

మనలో ఒక చిన్న బలహీనత ఉంది. మనకు నచ్చిన కవి ఎవరైనా ఉంటే ఆయన ద్వారానే మనం ప్రపంచాన్ని చూడాలనుకుంటాం. ఆ కవికి తెలిసిన ప్రపంచాన్నే మనం మనదిగా చేసుకోవాలని తపన పడతాం. అతనికి తెలియని లేదా, ఆ కవి దృక్కోణానికి బాహ్యంగా ఉన్న అంశం ఎంత ఉదాత్తమైనా, ఆ అంశంలో లవలేశమైన అధ్యయనాంశం తొంగిచూసినా మనం గ్రహించటానికి విముఖులవుతాం.

సంస్కృతంలో అలా ’మనవాడు’ అని అనేకులు భావించిన కవి కాళిదాసు. సంస్కృతమంటేనే కాళిదాసని రూఢి అభిప్రాయాలు అనేకులకు. అటువంటి కాళిదాసు తాలూకు పై శ్లోకాన్ని క్షేమేంద్రుడు శ్రవణకటుత్వానికి ఉదాహరణగా చూపాడు. క్షేమేంద్రుడి ఉక్తి ఇది.

సూత్రస్యేవాత్ర తీక్ష్ణాగ్రం శ్లోకస్య లఘునా ముఖమ్ |
కర్ణం విశతి నిర్విఘ్నం సరళత్వం చ నోజ్ఝతి ||
గుర్వక్షరేణ సంరుద్ధం గ్రన్థి యుక్తమివాగ్రతః |
కరోతి ప్రథమం స్థూలం కించిత్ కర్ణ కదర్థనామ్ ||

శ్లోకారంభం లఘువుచేత సన్నని (చూపైన) అగ్రము కలదై,దారపు కొసలాగా కర్ణాన్ని (సూది బెజ్జమని మరొక అర్థం) అనాయాసంగా ప్రవేశిస్తుంది. సరళత్వాన్ని వీడదు. గురువుతో మొదలైన శ్లోకముఖం కొసన ముడివడిన దారంలా కర్ణానికి కించిత్ బాధ కలిగిస్తుంది.

పై సూక్తికి ఉదాహరణగా ఆయన "అస్త్యుత్తరస్యాం" అనే ఉపజాతి వృత్తానికి చెందిన పై శ్లోకం లో శ్లోకముఖశబ్దం తాలూకు మొదటి వర్ణం గురువవటం వినసొంపుగా లేదన్నాడు. ఇది ఆయన కాలానికి గొప్ప సాహసమే.

ఏది శ్రవణ కటువు? ఏది శ్రవణమనోహరం అని తేల్చి చెప్పడానికి నిర్దుష్టమైన ప్రమాణాలు సర్వత్రా ఉండకపోవచ్చును కానీ సూక్ష్మంగా వివేచించగలిగిన వారికి, భాష తాలూకు మూల స్వభావాన్ని సూక్ష్మస్థాయిలో వివేచించగలిగే వారికి శబ్దంలో, సమాసంలో, పద్యంలో ఈ విషయం అలవోకగా తట్టకపోదు. అయితే లక్షణమంటూ చెప్పాలి కాబట్టి రస విషయంలో ముఖ్యంగా శృంగారరసప్రధానమైన ఘట్టాలలో ఏ విధమైన శబ్దాలు వర్జనీయాలు అని కొందరు లాక్షణికులు చెప్పారు. అందులో ఆనందవర్ధనుని అభిప్రాయం గురించి ఇదివరకటి సంస్కృతసౌరభాలలో ఒక చోట ప్రస్తావించాం.

**************************************
సరే, ఈ శ్రవణ కటుత్వం గురించి ఒక పిట్టకథ.
తాలకుడు అని ఒకానొక బ్రహ్మర్షి, బ్రహ్మలోకంలో ఉండేవాడు. ఓ నాడు బ్రహ్మ కొలువు తీరాడు. ఆ సభలో తాలకుడు బ్రహ్మను నుతిస్తూ ఈ క్రింది శ్లోకం చెప్పాడు.
బ్రహ్మాస్త్వం స్తౌమి తం యస్య పుష్పలిఙ్భిః ప్రలక్షితమ్ |
పాణ్డ్వాభాం వల్గు సుష్ట్వబ్జం జన్మధిష్ణ్యం చ విష్టరమ్ ||
ఓ బ్రహ్మదేవా! తుమ్మెదలు చుట్టుముట్టి వెలికాంతులు చిమ్మే అందమైన పుండరీకాన్ని ధరించిన నిన్ను స్తుతిస్తున్నాను. నీ పీఠమైన పుండరీకమే నీ జన్మస్థానం కూడా కదా!
ఈ శ్లోకాన్ని బ్రహ్మసభలో అందరూ మెచ్చుకున్నారు. ఆ సభనుండి తాలకుడు అంబ సరస్వతి తల్లి నిర్వహించే సదస్సుకు వెళ్ళాడు. ఈ సభలో భట్టబాణుడు, కాళిదాసు వంటి కవులూ, విక్రమాదిత్యుడు, ముంజభోజుడు, శ్రీ హర్షుడు వంటి రాజకవులూ,సామంతులైన వాక్పతిరాజు, మాయురాజు, విశాఖదేవుడు కొలువుతీరి కవితారీతుల గురించి చర్చించుకుంటున్నారు. ఆ సభలో తాలకుడు పై శ్లోకాన్ని సదస్యులకు వినిపించాడు. సదస్యులందరూ విని మెచ్చుకున్నారు. ఒక్క భట్టబాణుడు తప్ప.
భట్టబాణుడు ఆ శ్లోకంలోని అశ్రావ్యపదాలైన పుష్పలిఙ్భిః, పాణ్డ్వాభాం, సుష్ట్వబ్జమ్ శబ్దాలను ఎత్తిచూపి శ్లోకానికి మెరుగుపెట్టవలసి ఉందన్నాడు. అందుకు ఆగ్రహోదగ్రుడైన బ్రహ్మర్షి తాలకుడు భట్టబాణుని ఈ విధంగా శపించాడు. " నా శ్లోకం పట్ల మూకీభావం వహించిన నీవు సరస్వతీ అమ్మవారి దేవాలయంలో నిశ్చలుడై ఒక స్థంభంగా మారిపోదువు గాక!". తన భక్తుడైన భట్టబాణుని శపించిన తాలకమహర్షికి అమ్మవారు అదే శాపాన్నిచ్చింది. "నీవూ అదే దేవాలయంలో భట్టబాణునికి శాపవిమోచనం జరిగే వరకూ నిశ్చలంగా పడి ఉందువుగాక!"

తాలకమహర్షి అటుపిమ్మట పశ్చాత్తాపం చెంది భట్టబాణునికి శాపవిమోచనం చెప్పాడు. ఒకానొక కవి తన అందమైన చంపూ కావ్యాన్ని సరస్వతి మందిరంలో చదువుతాడు. ఆ కావ్యమాధుర్యానికి శిలలు ద్రవించి భట్టబాణునికి నిజరూపం కలుగుతుంది. భట్టబాణునికి నిజరూపం రావడం తరువాయి, తాలక మహర్షికీ నిజరూపం ఎలానూ కలుగుతుంది.

ఆ కవి వచ్చాడు. కావ్యపఠనం చేశాడు. కవికీ, మహర్షికీ శాపవిమోచనం కలిగించాడు. ఇద్దరూ నిజరూపంతో ప్రత్యక్షమై, ఆ కావ్యంలో రస, రీతి, గుణ, శయ్యాది కావ్యపోషకవిషయాలు చక్కగా అమరాయని, తనకు రాజాశ్రయం లభిస్తుందని, తన కవిత్వాన్ని కేవలం సహృదయులకు మాత్రమే వినిపించమని చెప్పి ఆశీర్వదించి బ్రహ్మలోకాన్ని తిరిగి చేరుకున్నారు.

చూశారుగా. అశ్రావ్యశబ్దచయం ఎంతపని చేసిందో.

ఆ కవి పేరు శోడ్ఢలుడు. ఆ కావ్యం పేరు ఉదయసుందరి కథ. భట్టబాణుని కాదంబరి కావ్యాన్ని అనుసరించినప్పటికీ చాలా అందమైన, అమోఘమైన చంపూకావ్యం.
**************************************
ఒక చిన్న వర్ణనతో ముగింపు.
చలువరాలతో నిర్మింపబడి, ధవళకాంతులతో మెరిసిపోయే ఒకానొక బౌద్ధచైత్రం. ఉన్నట్టుంది ఆ చైత్రం రంగు ఆకుపచ్చరంగు సంతరించుకుంది. అలవోకగా ఆ చైత్రం ముఖం నుండి ఓ శ్లోకం వినిపించింది.
అహో వైచిత్ర్యమేతస్య సంసారస్య కిముచ్యతే |
గుణోऽపి క్లేశహేతుఃస్యాద్విశ్రాన్తః క్వాపి దేహిని ||
అహో, ఈ ప్రపంచం ఎంత విచిత్రమైనది? విశిష్టమైన గుణం కూడా ఆ గుణం ఉన్న ప్రాణికి దుఃఖహేతువవుతున్నది కదా!

ఆ శ్లోకంతో బాటు ఒక రామచిలుక ఆ చైత్యం నుండి బయటకు ఎగురుతూ వచ్చింది. ఆ చిలుక తలపైన అందమైన పొడుగాటి వంకీల జుత్తు ఉన్నది. ఆ గుణం గురించే అది శ్లోకంలో చెప్పింది. ఇది ఉదయసుందరి కథాముఖానికి ఆరంభం.
**************************************

1 కామెంట్‌:

  1. కృతజ్జతాబద్ధోऽస్మి భోః| నాऽహం సంస్కృతపణ్డితః పరన్తు గీర్వాణభాషాభిమానమస్తి మే| సంస్కృతకావ్యానుశీలనప్రయత్నం తు అవశ్యం కరోమి సర్వదా| ప్రణామాః|

    రిప్లయితొలగించండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.