సేతుబంధం

సేతుబంధం - ఇది ఒక మహారాష్ట్రీ ప్రాకృత కావ్యం. సంస్కృతేతర భాషల్లో వాల్మీకి రామాయణం మీద ఆధారితమైన మొట్టమొదటి రచన. ఈ కావ్యాన్ని రచించిన కవి వాకాటక రాజైన రెండవ ప్రవరసేనుడు. దీనికే దశముఖవధమ్ (దహముహవధో) అని పేరు. రామాయణంలో యుద్ధకాండలో రాముడు వానరసేనతో సముద్రతీరానికి చేరి, వారధి నిర్మించడం మొదలు, రావణుని నిర్జించటం వరకూ సాగిన కావ్యం యిది. పదిహేను సర్గల కావ్యం. వాల్మీకి రామాయణం మీద ఆధారపడినప్పటికీ, అద్భుతమైన ప్రాకృతిక వర్ణనలకు, నాయకత్వపు లక్షణాల వివరణకూ, భయాందోళనలు నెలకొన్నప్పుడు జీవుల స్వభావం గురించిన వివరణకూ, అద్భుత పాత్రచిత్రణలకూ, ఇంకా అనేకానేక విషయాలకూ ఈ కావ్యం ప్రసిద్ధి. ఈ కావ్యం గురించిన సమగ్ర అనుశీలనమే ఈ వ్యాసం. ఉపోద్ఘాతం: పొద్దు పొడుస్తోంది. మనోహరమైన నీలాకాశం. దిక్చక్రము వెలుగులతో ప్రకాశిస్తోంది. భావుకుడైన ఒక ప్రాకృతకవి ఉదయాన శుభకరుడూ, సర్వభూతక్షేమంకరుడునూ అయిన శివుని దర్శించి ప్రార్థిస్తూన్నాడు. 1) ణమహ అ జస్స ఫుడరవం కణ్ఠచ్ఛాఆ ఘడన్త ణఅణగ్గిసిహమ్ | ఫురఇ ఫురిఅట్టహాసం ఉద్ధపడిత్తతిమిరం విఅ దిసాఅక్కమ్ || సంస్కృతఛాయ: నమత చ యస్య స్ఫుటరవం కణ్ఠచ్ఛాయాఘటమాన...